హైదరాబాద్ : చెరువులో ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పొన్నారం శివారులో జరిగింది. గల్లంతైన ఇద్దరు యువకుల కోసం గాలిస్తున్నారు. వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన పవన్, అరుణ్, సత్యనారాయణ, జమ్మికుంటకు చెందిన అఖిల్ స్నేహితులు. వీరందరూ పదో తరగతి వరకు బెల్లంపల్లిలోనే చదువుకున్నారు. అనంతరం అఖిల్ మినహా మిగతా వారంతా బెల్లంపల్లిలో ఉంటూ చదువు కొనసాగిస్తున్నారు. వేములవాడకు వెళ్లేందుకు నిర్ణయించుకున్న వారు జమ్మికుంటలో ఉండే అఖిల్కు సమాచారం ఇవ్వటంతో ఆయన బెల్లంపల్లికి వచ్చాడు. అందరూ కలిసి మందమర్రి మండలం పొన్నారం శివారులోని లేమూర్ చెరువు వద్దకు వెళ్లారు. మొదట పవన్, అఖిల్ నీళ్లలోకి దిగారు. బయటకు రాలేక.. మునిగిపోతున్నారని మరో ఇద్దరు స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. పోలీసులకు సమాచారం అందించటంతో అక్కడికి చేరుకున్న సీఐ ఎడ్ల మహేశ్, ఎస్సై రవి ప్రసాద్ గజ ఈతగాళ్లు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm