హైదరాబాద్ : రేపు, ఎల్లుండి హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, నివర్ తుఫాను తీరాన్ని దాటిన తరువాత ఇప్పటికే కొనసాగుతున్న ద్రోణితో కలిసి తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నేడు నివర్ తుపాను తమిళనాడు తీరాన్ని దాటుతూ, ఆపై రాయలసీమ, కర్ణాటకల మీదుగా తెలంగాణలోకి ప్రవేశిస్తుందని పేర్కొన్న భారత వాతావరణ శాఖ, తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరంజ్ ఎలర్ట్ ను ప్రకటించింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లాల్లో 26వ తేదీన భారీ వర్షాలు కురుస్తాయని, 27న మిగతా చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ దక్షిణ, వాయవ్య తెలంగాణలో వర్షాలు కురుస్తాయని, ఈ విషయంలో పూర్తి అంచనాకు రావాలంటే, గురువారం నాడు తుఫాను గమనాన్ని పరిశీలించాల్సి వుంటుందని హైదరాబాద్ ఐఎండీ డైరెక్టర్ నాగరత్న వెల్లడించారు. నివర్ తుఫానుతో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఒకటి నుంచి మూడు డిగ్రీలకు పడిపోతాయని, ఈ ప్రభావం 29 వరకూ కొనసాగుతుందని పేర్కొన్న ఐఎండీ, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
Mon Jan 19, 2015 06:51 pm