హైదరాబాద్ : పట్టుకున్న పామే అతనిని కాటేసింది. విశాఖలోని హెచ్పీసీఎల్ రిఫైనరీ ప్రహరీకి ఆనుకొని ఉన్న రాంనగర్లోని ఓ ఇంట్లో మంగళవారం పాము రావడంతో కుటుంబ సభ్యులు పాములుపట్టే నాగరాజుకు సమాచారం ఇచ్చారు. దీంతో నాగరాజు వచ్చి పామును బంధించాడు. ఆ పామును గోనె సంచిలో వేస్తుండగా.. పాము తల చీకట్లో బయటకు రావడం వల్ల నాగరాజు గమనించలేదు. సంచికి తాడు కడుతుండగా చేతిపై కాటు వేసింది. వెంటనే కేజీహెచ్కు వెళ్లగా వైద్యులు పరిశీలించారు. నాగరాజు చేతిపై పాము పన్ను దిగి విరిగిపోయినట్లు గుర్తించి దానిని తొలగించారు. విషం శరీరంలోకి ఎక్కిందా లేదా అనేది తెలియాలంటే రక్త పరీక్ష చేయాల్సి ఉంటుందని అయితే నాగరాజుకు ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm