హైదరాబాద్ : అనంతపురం జిల్లా హిందూపురంలో దారుణం జరిగింది. ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మడకశిరకు చెందిన అజ్మతుల్లా , అక్తర్ జాన్ కుమార్తె అర్షియ ( 26 ) ను హిందూపురం పట్టణంలోని ఆర్టీసీ కాలనీలోని నూరుల్లాకు ఇచ్చి గత యేడాది నవంబరులో ఘనంగా వివాహం జరిపించారు పెళ్లి అయిన నెలరోజుల తరువాత భర్త యుఎస్ఎ వెళ్లాడు . అర్షియ ఎంబిబిఎస్ ఆఖరి సంవత్సరం కర్నాటకలోని తుమకూరులో చదువుతోంది. కాని పెళైన మరుసటి రోజు నుంచే భర్త నూరుల్లా వేదింపులకు గురిచేస్తుండేవాడు. అంతేకాక యుఎస్ఎకు వెళ్లినా ఫోన్ లో నిత్యం నరకం చూపించేవాడు . ఇదిలా ఉంటే అర్షియ మూడు నెలల క్రితమే ప్రసవించింది . దీంతో ఈ నెల 5 న అర్షియను అత్తగారింటికి పంపించారు. ఈ నెల 10 న యుఎస్ఎ నుండి తన అల్లుడు నూరుల్లా హిందూపురానికి వచ్చాడు . అప్పటి నుండి అర్షియను మరింత వేధింపులకు గురిచేశాడు . ఇచ్చిన కట్నం చాలదని ఇంకా ఎక్కువ తీసుకురావాలంటూ వేధించడంతోపాటు అనుమానించేవాడు. బుధవారం అర్షియ పుట్టిన రోజు కావటంతో మంగళవారం ఆమె తల్లిదండ్రులు ఫోన్ చేశారు. ఆసమయంలో అర్షియ తమ తల్లిదండ్రులతో సరిగా మాట్లాడలేదు. అయితే బుధవారం ఉదయం ఫోన్ చేసి అర్షియాకు బాగాలేదని చెప్పారు. దీంతో వారు ఇక్కడికి వచ్చి చూసేసరికి అర్షియ శవమై కనిపించింది. అత్తింటివారే హత్యచేసి ఇంటిలో ఫ్యాన్కు ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm