హైదరాబాద్: కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇప్పటి వరకు వచ్చిన నిధులపై తాము లెక్కలు చెప్పేందుకు సిద్దంగా వున్నామని టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం ఎంపి నామా నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో నామా మాట్లాడుతూ తెలంగాణ నుంచి వెళ్లే పన్నులను ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం నుంచి వెళ్తున్న డబ్బుపైనే కేంద్రం బతుకుతుందని, కేంద్ర నిధులతో తెలంగాణ బతకడం లేదని నామా స్పష్టం చేశారు. వరదల సమయంలో సాయం చేసేందుకు హైదరాబాద్ రాని కేంద్ర మంత్రులంతా జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం హైదరాబాద్కు క్యూ కట్టారని అన్నారు. ఆరేళ్లలో రాష్ట్రానికి, నగరానికి ఏం చేశారో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఎన్నిసార్లు లేఖలు రాసినా.. కనీసం ఒక్క ప్రాజెక్టు కేటాయించలేదని మండిపడ్డారు. ఐఐటీ, నవోదయ పాఠశాలలను కూడా ఇవ్వలేదని, పార్లమెంట్లో ఎన్నిసార్లు మాట్లాడినా కేంద్రం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి నామా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm