హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల వేళ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు గట్టిగానే పేలుతున్నాయి. అయితే మందు నుండి టీఆర్ఎస్ నేతలు, సీఎం కేసీఆర్ మీద కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా కేసీఆర్ పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేసారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాల దూకుడును తట్టుకోలేక బెంబేలెత్తిపోతున్న కేసీఆర్.. ఎంఐఎంతో కలసి కుట్రలు చేస్తున్నారని విజయశాంతి ఆరోపించారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను చివరిక్షణంలో పోటీ నుంచి తప్పించేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఎంఐఎం నేతలు మతవిద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే కేసీఆర్ వాటిని కట్టడి చేయలేకపోయారని విమర్శించారు. అలా కట్టడి చెయ్యకపోగా ఎంఐఎం దౌర్జన్యాన్ని నిలదీసిన పార్టీలను నియంత్రించే విధంగా పోలీసు బలగాలను ప్రయోగించడానికి సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేశారని మండిపడ్డారు. ఇంతకాలం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను హైజాక్ చెయ్యడం లేదా ఎన్నికలు పూర్తయిన తర్వాత గెలిచిన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను ప్రలోభపెట్టి ఫిరాయింపులను ప్రోత్సహించడం కేసీఆర్కు అలవాటుగా మారిపోయిందని విజయశాంతి విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలాంటి రాజకీయాలు ఫలించవని నిర్ణయానికి రావడంతో ఏకంగా అభ్యర్థులను శాంతి భద్రతల పేరుతో బరిలో నుంచి తప్పించడానికి గులాబీ బాస్ కొత్త ఎత్తుగడ వేస్తున్నారనే ప్రచారం జరుగుతోందని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm