హైదరాబాద్ : ఒక బక్కాయన (కేసీఆర్)ను ఎదుర్కొనేందుకు ఇంతమంది కాషాయ బాహుబలులు రావడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ . గ్రేటర్ ఎన్నికల కోసం బీజేపీ జాతీయ నాయకులు హైదరాబాద్ కు వస్తుండడం చూస్తుంటే జరుగుతున్నది రాష్ట్ర ఎన్నికలేమో అనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఓవైపు కోట్లమంది రైతులు ప్రాణాలకు తెగించి, కరోనాను కూడా లెక్కచేయకుండా, బారికేడ్లను కూడా లక్ష్యపెట్టకుండా ఢిల్లీకి పోటెత్తారని... వారికి బదులు చెప్పలేని కేంద్రం పెద్దలు హైదరాబాద్ రాజకీయ వలస బాట పట్టారని నారాయణ విమర్శించారు. ఢిల్లీలో పారేసుకున్న సూదిని హైదరాబాదులో వెతుక్కుంటున్నట్టుగా బీజేపీ నేతల వైఖరి ఉందని ఎద్దేవా చేశారు. లౌకికవాద శక్తులు ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని, బీజేపీకి హైదరాబాద్ ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పాలని అన్నారు. నిన్న కరోనా సెంటిమెంట్, నేడు మతపరమైన సెంటిమెంట్లతో మోదీ, అమిత్ షా అనైతిక రాజకీయ విన్యాసాలతో బరితెగించారని, ఇది కచ్చితంగా లౌకిక నీతిసూత్రాలను అవహేళన చేయడమేనని నారాయణ విమర్శించారు.
Mon Jan 19, 2015 06:51 pm