హైదరాబాద్ : దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి, నియంత్రణ విషయంలో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మాస్కు ధరించని వారు విధిగా కరోనా కేర్ సెంటర్స్లో పని చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని గుజరాత్ హైకోర్టు ఆదేశించింది. మాస్కు ధరించని వ్యక్తులు తమ ఆరోగ్యంతోపాటు, ఇతరుల ఆరోగ్యానికీ హాని చేస్తున్నారని వ్యాఖ్యానించింది. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వారితో 5 నుంచి 15 రోజుల పాటు రోజుకు 4-5 గంటలు కరోనా కేర్ సెంటర్స్లో పని చేయించాలని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. వీరికి వైద్య సేవలు కాకుండా ఇతర పనులు కేటాయించాలని సూచించింది. హైకోర్టు నిర్ణయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దేశించింది. రాష్ట్రంలో కొవిడ్ నిబంధనలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాది విశాల్ అత్వానీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm