హైదరాబాద్ : కేంద్రం ప్రభుత్వం రైతులతో చర్చలు జరుపుతున్న సందర్భంగా ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. రైతుల ఆత్మాభిమానాన్ని తెలిపే ఘటన ఇది. రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో జరిగిన నేటి సమావేశానికి ముగ్గురు కేంద్రమంత్రులు కూడా హాజరయ్యారు. దాంతో విజ్ఞాన్ భవన్ లో ఆహార ఏర్పాట్లు భారీగానే చేశారు. కాగా, మధ్యాహ్న భోజనం చేసేందుకు చర్చలకు స్వల్ప విరామం ప్రకటించగా, భోజనం చేసేందుకు రావాలంటూ ప్రభుత్వ వర్గాలు రైతులను కోరాయి. కానీ, రైతులు ప్రభుత్వ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. మా తిండి మేం తెచ్చుకున్నాం అంటూ తమతో తెచ్చుకున్న పొట్లాలు విప్పి అక్కడే అధికారుల ముందే భోజనం చేశారు. కొందరు రైతులు నేలపైనే కూర్చుని భుజించారు. దీనిపై రైతులు మాట్లాడుతూ, ప్రభుత్వం తమకు ఆహార ఏర్పాట్లు చేశామని చెప్పిందని, అయితే మా భోజనం మేం తెచ్చుకున్నాం అని చెప్పామని, తాము ఆహారం కాదు కదా, కనీసం ప్రభుత్వం నుంచి టీ కూడా తీసుకోలేదలుచుకోలేదని స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm