హైదరాబాద్ : ఈరోజు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో తొలి వ్యాక్సిన్ తానే వేయించుకుంటానంటూ తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్రంలో తొలి వ్యాక్సిన్ ను పారిశుద్ధ్య కార్మికురాలు కర్మచారి కృష్ణమ్మకు ఇచ్చారు. హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఈటల రాజేందర్ ప్రారంభించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, తాను తొలి వ్యాక్సిన్ ఎందుకు తీసుకోలేదో ఈటల తెలిపారు. డాక్టర్లు, నర్సులు, శానిటేషన్ సిబ్బంది ప్రాణాలకు తెగించి కరోనాపై యుద్ధం చేస్తున్నారని... ప్రాణ త్యాగాలు కూడా చేశారని చెప్పారు. అందుకే, వారికే ముందు వ్యాక్సిన్ వేయాలని ప్రధాని మోడీ కూడా సూచించారని... అందుకు కర్మచారి కృష్ణమ్మకే తొలి వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపారు. అందుకే తాను ఈరోజు వ్యాక్సిన్ తీసుకోలేదని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో 140 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమైనట్లు తెలిపారు. ప్రతి కేంద్రంలో 30 మందికి మాత్రమే టీకా ఇస్తారని మంత్రి వెల్లడించారు. వ్యాక్సిన్ కోసం ఎవరూ తొందరపడొద్దని, ప్రాధాన్య క్రమంలో అందరికీ అందిస్తామని స్పష్టం చేశారు. కొవిడ్పై పోరాటంలో వైద్యారోగ్య, పారిశుద్ధ్య కార్మికుల కృషి గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm