అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలంలో వింతవ్యాధి కలకలం రేపుతోంది. మండలంలోని పూళ్ల గ్రామంలో జనం ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయారు. మొత్తం 16 మంది ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులు కొందరిలో మూర్ఛ లక్షణాలు కూడా కనిపించడంతో ఏలూరు ఘనటనను ఇది గుర్తుకు తెచ్చింది. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆహారం విషతుల్యం కావడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలోనూ ఇలానే జరిగింది స్థానికులు కొందరు ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. సమీపంలోని రసాయన పరిశ్రమ అర్ధ రాత్రి విడిచిపెట్టే వ్యర్థాల వల్లే ఇలా జరిగిందని తేలింది. అలాగే, తెలంగాణలోని మహబూబాబాద్ మండలం అయోధ్య శివారు భజనతండాలోనూ ఇలాంటి వింత వ్యాధి కొన్ని రోజులపాటు స్థానికులను వణికించింది. వాంతులు, విరేచనాలతో 130 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm