చెన్నై: వారిద్దరిది ఒకే కులం అయినా ఉపకులం వేరంటూ ప్రేమజంటకు కుల పెద్దలు రూ. 2.5 లక్షలు జరిమానా విధించారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుపాథూరులోని పుల్లూరు గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..పుల్లూరు గ్రామానికి చెందిన కంగరాజ్(26) ఎస్సీలోని మురచా పారయార్ కులానికి చెందిన వ్యక్తి కాగా, జయప్రియ(23) థమనా పారయ కులానికి చెందిన యువతి. వీరిద్దరూ కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత పెండ్లి చేసుకుంటామని పెద్దలకు చెప్పారు. ఒకే కులమైనప్పటికీ ఉప కులం వేరుగా కావడంతో పెండ్లి ప్రతిపాదనను ఇరు కుటుంబాల పెద్దలు తిరస్కరించారు. దీంతో తమ ప్రేమను చంపుకోలేక ఈ జంట 2018 జనవరిలో పెండ్లి చేసుకున్నారు. అనంతరం చెన్నైలో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
లాక్డౌన్తో కంగరాజు డ్రైవర్ ఉద్యోగం పోయింది. దీంతో ఆ దంపతులిద్దరూ ఇటీవలే పుల్లూరుకు తిరిగొచ్చారు. అయితే ప్రేమ వివాహం చేసుకున్నందుకు వారిద్దరికి రూ. 2.5 లక్షల జరిమానా విధించారు కుల పెద్దలు. ఆ కుల సంప్రదాయం ప్రకారం ప్రేమ పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరూ జరిమానా చెల్లించాల్సిందే. కానీ కంగరాజు ఆ డబ్బు కుల పెద్దలకు చెల్లించలేకపోయాడు. ఇటీవలే కంగరాజు, జయప్రియ కలిసి గ్రామంలో ఉన్న ఆలయానికి వెళ్లారు. డబ్బులు చెల్లించనందుకు ఆలయంలోకి కూడా వారిని అనుమతించలేదు. దీంతో కంగరాజు దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అంతేకాదు వారిద్దరిని ఆలయంలోకి రాకుండా అడ్డుకున్నారు కుల పెద్దలు. ఈ అమానవీయ ఘటన తమిళనాడులోని తిరుపాథూరులోని పుల్లూరు గ్రామంలో వెలుగు చూసింది. ఈ సందర్భంగా కంగరాజు మాట్లాడుతూ.. ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న ప్రతి ఒక్కరికి జరిమానా విధించడం మా గ్రామంలో సంప్రదాయంగా మారిందన్నారు. సాధారణంగా రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు జరిమానా విధిస్తారు. కానీ తనకు రూ. 2.5 లక్షలు జరిమానా విధించారు. తాను రూ. 25 వేలు మాత్రమే చెల్లిస్తానని చెప్పాను. కానీ వారు అందుకు అంగీకరించలేదు. ఇటీవల తాను గుడికి వెళ్తే లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని కంగరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 19 Jan,2021 12:31PM