న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మంగళవారం చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ సింగు సరిహద్దుల నుంచి ప్రారంభమైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు ట్రాక్టర్లపై త్రివర్ణ పతాకాలను రెపరెపలాడిస్తూ కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రాక్టర్లతో ర్యాలీకి తరలివచ్చారు. రైతులు ట్రాక్టర్లపై చిల్లా సరిహద్దుల మీదుగా ఢిల్లీ -నోయిడా లింకు రోడ్డులోకి ప్రవేశించారు. రైతుల ట్రాక్టర్ల ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు కర్నాల్ బైపాస్ వద్ద రోడ్డును మూసివేస్తూ తాత్కాలికంగా గోడ నిర్మించారు. రైతుల ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని ఐటీవో, యమునా బ్రిడ్జి పలు ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ట్రాక్టర్ల ర్యాలీ టిక్రీ, సింగూ, ఘాజీపూర్ సరిహద్దుల మీదుగా వచ్చి కంజావాలా, బవానా, ఆచుండీ, కేఎంపీ వేల మీదుగా సింగూ సరిహద్దుకు తిరిగి వెళతాయని ఢిల్లీ స్పెషల్ పోలీసు కమిషనర్ దీపేంద్ర పాఠక్ చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm