హైదరాబాద్ : చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో దారుణ ఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే. పూజల పేరుతో కన్న బిడ్డలను బలితీసుకున్నారు తల్లిదంద్రులు. ఈ నేపథ్యంలో జంట హత్యల కేసులో తల్లీదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. ఏ-1గా తండ్రి పురుషోత్తంను, ఏ-2గా తల్లి పద్మజను పోలీసులు చేర్చారు. చిన్న కూతురు దివ్యను తల్లి కొట్టిచంపగా, పెద్ద కూతురు అలేఖ్యను పూజగదిలో తండ్రి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివరాల ప్రకారం.. శివభక్తులైన పురుషోత్తమనాయుడు, పద్మజ దంపతులు ఆదివారం రాత్రి పూజలు చేస్తూ తమ కుమార్తెలను చంపేశారు. మొదట చిన్నకుమార్తె సాయిదివ్యను శూలంతో పొడిచి చంపేశారు. తర్వాత పెద్దకుమార్తె అలేఖ్య నోటిలో రాగి చెంబు పెట్టి డంబెల్తో కొట్టి హతమార్చారు. అనంతరం దంపతులిద్దరూ పెద్దగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారికి విషయం తెలిసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ ఘటనపై మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి మాట్లాడుతూ.. నిందితులు పురుషోత్తమనాయుడు, పద్మజ ప్రవర్తన విచిత్రంగా ఉన్నదని చెప్పారు. ‘తమ కూతుళ్లు అలేఖ్య, సాయిదివ్య చనిపోలేదని, వారు తిరిగి బతుకుతారని నిందితులు పేర్కొంటున్నారు. ఇప్పటితో కలియుగం ముగిసిపోయిందని, సత్యయుగం ప్రారంభమైందని చెప్తున్నారు. రక్తాభిషేకం చేస్తే కలి పురుషుడు శాంతిస్తాడని, అందుకే తమ కూతుళ్లను బలి ఇచ్చామని అంటున్నారు’ అని డీఎస్పీ చెప్పారు. హత్యకు గురైనవారు, హంతకులు పూర్తిగా దైవభక్తిలో లీనమైపోయారని ప్రాథమికంగా తేలిందని డీఎస్పీ చెప్పారు. యువతుల తల్లి పద్మజ బిడ్డలను కొట్టి చంపిందని, ఆ సమయంలో తండ్రి పురుషోత్తమనాయుడు అక్కడే ఉన్నాడని తెలిపారు. తల్లిదండ్రులు మానసికంగా సతమతమవుతున్నట్లు గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm