హైదరాబాద్ : ఇటీవలి కాలంలో పెళ్లిపేరుతో జరిగే మోసాలు ఎక్కువవుతున్నాయి. సోషల్ మీడియాలో పరిచయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నా.. ఎక్కడో ఒక చోటు మోసాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నగరంలోని పద్మారావు నగర్ కు చెందిన అర్జున్ అనే యువకుడికి సోషల్ మీడియాలో వర్ణన మల్లిఖార్జున్ అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. పెళ్ళికి సిద్దమవ్వగానే ఆ యువతి తన అసలు రంగు బయటపెట్టింది. యువకుడి వద్ద నుంచి డబ్బులు గుంజడం మొదలుపెట్టింది. అనేక కారణాలు చూపించి దాదాపుగా 14 లక్షల వరకు వసూలు చేసింది. పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని చెప్పి యువకుడు అడిగిన డబ్బులు పంపించాడు. అయితే, పెళ్ళికి రెండు రోజుల సమయం ఉందనగా, యువతి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. దీంతో ఆ యువకుడు షాక్ అయ్యాడు. మోసపోయానని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Mon Jan 19, 2015 06:51 pm