హైదరాబాద్ : జూనియర్ కాలేజీల్లో అగ్నిమాపక నిబంధనలపై హైకోర్టులో విచారణ జరిగింది. నిబంధనలు పాటించని కాలేజీలు మూసివేశామని ఇంటర్ బోర్డు తెలిపింది. 20 నారాయణ, 10 శ్రీచైతన్య సహా 40 కాలేజీలు మూసివేశామని ఇంటర్ బోర్డు పేర్కొంది. దీంతో కాలేజీలపై చర్యలపై 3 వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అగ్నిమాపక శాఖ నిబంధనలపై శ్రీచైతన్య, నారాయణ, గాయత్రి కాలేజీల పిటిషన్లపై కూడా విచారణ జరిపింది హైకోర్టు. చట్టం రాకముందు నిర్మించిన భవనాలకు కూడా అనుమతివ్వడం లేదని కాలేజీల యాజమాన్యాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం అకస్మాత్తుగా నిబంధనలు అమలు చేయాలని చెబుతోందని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. ప్రత్యామ్నాయ నిబంధనలు పరిశీలించాలని యాజమాన్యాలు కోరగా హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఇప్పుడే నిద్ర లేచిందన్న ధర్మాసనం కాలేజీలు అగ్నిమాపక నిబంధనలు పాటించాలసిందేనని తేల్చి చెప్పింది. విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టవద్దని హైకోర్టు వ్యాఖ్యానించింది. నిబంధనలకు అనుగుణంగా లేని భవనాల్లో కాలేజీలు ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించిన హైకోర్టు కొన్ని కాలేజీలు కేవలం లాభాల కోసం నడుపుతున్నాయని వ్యాఖ్యానించింది. కాలేజీల వాదన ఏ మాత్రం సహేతుకంగా లేదని హైకోర్ట్ తేల్చిచెప్పింది. కాలేజీల పిటిషన్లపై తీర్పు హైకోర్టు రిజర్వ్ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm