హైదరాబాద్: వనదేవతలు కొలువై ఉన్న మేడారం ఆలయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. నాలుగు రోజుపాటు జరిగిన చిన్న జాతర సమయంలో ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని 21 రోజులపాటు మూసిఉంచాలని అధికారులు నిర్ణయించారు. దీంతో నేటి నుంచి ఈ నెల 21 వరకు ఆలయం తెరచుకోదని వెల్లడించారు. గిరిజనులు ఆరాధ్య దైవంగా కొలిచే సమ్మక్క-సారలమ్మ మేడారం చిన్న జాతర గత నెల 24 నుంచి 27 వరకు నాలుగు రోజులపాటు జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. బెల్లం, చీరసారె, పూలుపండ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రధాన జాతర ముగిసిన ఏడాది తర్వాత చిన్న జాతర జరపడం ఆనవాయితీగా వస్తున్నది.
Mon Jan 19, 2015 06:51 pm