హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ అమ్మాయి నలుగురిని ప్రేమించడమే కాదు, వారితో ఊరు విడిచి వెళ్లిపోయింది. అయితే గ్రామ పెద్దలు వారిని ఊరికి తీసుకువచ్చి, వారిలో ఒకరితో ఆ అమ్మాయికి పెళ్లి జరిపించేందుకు నిశ్చయించారు. అందుకోసం ఓ లక్కీ డ్రా కూడా తీశారు. వివరాల్లోకి వెళితే... యూపీలోని అజీమ్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఏకంగా నలుగురిని ఇష్టపడింది. వారు కూడా ఆ అమ్మాయిని గాఢంగా ప్రేమించారు. ఇటీవల ఆ అమ్మాయి నలుగురు యువకులతో కలిసి తన బంధువుల ఇంటికి చేరింది. అయితే ఇది గ్రామ పరువుకు సంబంధించిన విషయం కావడంతో పెద్దలు ఆ అమ్మాయిని, నలుగురు యువకులను ఊరికి తీసుకువచ్చారు. ఆ నలుగురు యువకుల్లో ఒకరిని పెళ్లాడాలని ఆ యువతికి సూచించారు. దాంతో ఆ అమ్మాయి ఎటూ తేల్చుకోలేకపోవడంతో లాటరీయే శరణ్యమని భావించారు. ఆ నలుగురు యువకుల పేర్లు చీటీలపై రాసి ఓ చిన్నారితో లక్కీ డ్రా తీయించారు. ఓ యువకుడి పేరు రావడంతో, ఆ యువతికి సదరు యువకుడితో పెళ్లి ఖాయం చేశారు. త్వరలోనే వీరి పెళ్లి జరగనుందట.
Mon Jan 19, 2015 06:51 pm