Apr 16,2018 10:04AM-6
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)కి చెందిన గరుడ బస్సులో కొత్త సినిమాల పైరసీలను ప్రదర్శిస్తుండటంపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తాను బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న వేళ, గరుడ సర్వీసులో ఈ సినిమాను ప్రదర్శించారని సునీల్ అనే యువకుడు కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ, సినిమా స్క్రీన్ షాట్ ను జోడించి ట్వీట్ చేశాడు. సినిమా విడుదలైన రెండో రోజే ఈ ఘటన జరిగిందని చెప్పాడు. ప్రభుత్వ సంస్థలోనే పైరసీలను ప్రోత్సహిస్తుంటే, సామాన్యులను పైరసీ నియంత్రించాలని ఎలా అడుగుతారని ప్రశ్నించాడు. ఇక దీనిపై స్పందించిన కేటీఆర్, టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు చేసిన పని బాధ్యతారాహిత్యమని అన్నారు. సంస్థలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ను కోరుతున్నట్టు తెలిపారు.