Nov 13,2019 09:36PM
హైదరాబాద్: రాష్ట్రంలో 39 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఎం కేసీఆర్ను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. ఈ మేరకు సీఎంకు ఆయన లేఖ రాశారు. సమ్మెతో బస్సులు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని చెప్పారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే దానిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆర్టీసీకి చెందిన ఆస్తులను ధారాదత్తం చేయొద్దని.. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు భట్టి స్పష్టం చేశారు. రూట్లను ప్రైవేటుపరం చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకుని ఆర్టీసీని యథాతథంగా కొనసాగించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.