ఢిల్లీ: ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ హోదా పొందేందుకు భారత్కు అన్ని రకాల అర్హతలు ఉన్నాయని ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోని అబోట్ తెలిపారు. సైనిక, ఆర్థిక సామర్థ్యం సహా పరిమాణం, జనాభాపరంగా చూసి ఏదైనా దేశానికి శాశ్వత సభ్యత్వ హోదా ఇవ్వాల్సి ఉంటే అది ఇండియానే అని ఆయన అభిప్రాయపడ్డారు. మండలిలో రెండు బలమైన ప్రజాస్వామ్య దేశాలు ఉండాలని.. ఒక్కటి ఉంటే సరిపోదని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన ఇండో-పసిఫిక్ అంశంపై జరిగిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య(ఆర్సెప్) ఒప్పందం నుంచి భారత్ దూరంగా ఉండడాన్ని అబోట్ సమర్థించారు. ఇలాంటి ఒప్పందం వల్ల సులభతర వాణిజ్యానికి మెరుగైన అవకాశాలు ఉన్నప్పటికీ.. దేశ ప్రయోజనాలు కూడా ముఖ్యమేనన్నారు. ఆర్థిక సామర్థ్యంలో భారత్ మరో చైనాగా మారబోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అమెరికా తర్వాత సూపర్పవర్గా ఎదగడానికి ప్రపంచదేశాలు భారత్కు సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన అమృత్సర్లోని స్వర్ణదేవాలయాన్ని సందర్శించారు.
Nov 19,2019 09:59AM