Sun 11 Oct 16:25:25.408067 2020
Authorization
ఇషాన్ఆర్య భారతీయ నవ్య సినిమా రంగంలో ప్రత్యేకంగా పేర్కొనే సాంకేతిక నిపుణుడు. 1973లో ఎం.ఎస్.సత్యు తీసిన సినిమా 'గరమ్ హవా'తో తొలిసారిగా వెలుగులోకి వచ్చాడు ఇషాన్. అయితే అతన్ని చాలా మటుకు ఉత్తర భారతీయుడో అని అనుకుంటారు. కానీ మన హైదరాబాదీ. ఈ సంగతి అందరికీ తెలియదు.
ఇషాన్ ఆర్య 1942 అక్టోబరు 14న హైదరాబాదులో జన్మించారు. ప్రఖ్యాత రంగస్థల నవ్య సినిమా నటి షౌకత్ ఆజ్మీకి సమీప బంధువు. ఇషాన్ఆర్య అసలు పేరు 'ఇర్షాద్ అహసాన్'. ముద్దుగా 'ఇషాన్' గా పిలుచుకునేవారు. అదే అసలు పేరుగా చెలామణిలోకి వచ్చింది. తండ్రి అలీఘర్ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ప్రఖ్యాత హిందీ చిత్ర నిర్మాత, స్టూడియో అధినేత శశిధర్ ముఖర్జీ (1909-1990)కి సహధ్యాయి. 1964లో ముఖర్జీ 'లీడర్' సినిమా (దిలీప్- వైజయంతీ) తీస్తున్నపుడు ఏదో పని మీద హైదరాబాదుకు వచ్చి తనను కలుసుకునేందుకు వచ్చినపుడు చదువు ఆపేసి ఇంట్లో ఉన్న కొడుకు ఇషాన్ను సినిమాల్లో ఏదోక పనిలో పెట్టమని కోరగా వెంట తీసుకెళ్లి కెమెరా విభాగంలో చేర్చారు.
శశిధర్ ముఖర్జీ తొలితరం బాలీవుడ్ నిర్మాతల్లో ఒకరు. బాంబే టాకీసులో పని చేసి ఫిల్మిస్థాన్, ఫిల్మాలయా స్టూడియో లను నెలకొల్పారు. హీరో అశోక్కుమార్కి దగ్గరి బంధువైన ముఖర్జీ ఇషాన్ని బొంబాయికి తీసుకు వెళ్లే నాటికి తన కొడుకు జారు ముఖర్జీ (1939- 2012)తో 'లవ్ ఇన్ సిమ్లా' (1960), 'ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా' (1962), 'ఫిర్ వహీ దిల్ లాయా హూ' (1963), 'జిద్దీ' (1964) చిత్రాలు తీసి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. అప్పటికే వారి వద్ద కెమెరామెన్గా జాల్ మిస్త్రీ పని చేస్తున్నారు. ఆయన దగ్గర అసిస్టెంట్గా ఇషాన్ని చేర్చారు. ఒక్కడ అసిస్టెంటుగా పని చేస్తూనే ఇషాన్ 'ఇప్టా'లో చేరి పలు నాటకాలకు పని చేశారు. 1966లో చేతన్ ఆనంద్ తీసిన 'ఆఖ్రీ ఖత్' సినిమాకు కెమెరామెన్ జాల్మిస్త్రీనే అయినా పూర్తిగా పని చేసింది ఇషాన్ ఆర్యనే. ఇదే కాలంలో షర్మిలా టాగూర్ సంజీవ్కుమార్ నాయికా, నాయకులుగా నటించిన 'నయా జనమ్'కు తొలిసారిగా కెమెరామెన్గా పని చేశారు ఇషాన్. అయితే ఏదో కారణాల వల్ల ఈ సినిమా విడుదల కాలేదు. అయినప్పటికీ ఇషాన్ గురించి పరిశ్రమలో అందరికీ తెలిసింది. సినిమా ప్రయత్నాలు చేస్తూనే ఇషాన్ కోకా కోలా వంటి వాణిజ్య చిత్రాలకు సినిమాటోగ్రఫీ చేయడం వల్ల అతని పనితనం పరిశ్రమలో అందరికీ తెలిసివచ్చింది.
'ఇప్టా'లో పని చేస్తూండటం వల్ల చలన చిత్రాలు, వాటి ప్రయోజనాల పట్ల ఇషాన్ ఒక నిర్దిష్టమైన అభిప్రాయాన్ని ఏర్పరుచుకుని ఉన్నాడు. డాక్యుమెంటరీలు తీస్తున్న కాలంలోనే ఎం.ఎస్.సత్యు, ఏ.ఏ.శివానీలతో కలిగిన పరిచమయం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. వారి అభిరుచులూ ఒకటే కావడంతో 'యూనిట్ 3ఎమ్.ఎమ్.' అనే బానర్ను నెలకొల్పారు. అంతా కలిసి రోటీన్కి భిన్నంగా సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. మార్కిస్ట్ ఆక్టివిస్ట్గా ఉన్న ఇస్మత్ చుగ్తారు ప్రచురితం కాని కథ 'గరమ్హవా'ను సినిమా తీసేందుకు నిర్ణయించుకున్నారు ఇషాన్. మరో నిర్మాత ఎం.ఎస్. సత్యు. 'గరమ్ హవా'కి నిర్మాతల్లో ఒకరుగానే గాక సినిమాటోగ్రఫీ కూడా నెరుపుతూ ఇండిస్టీకి పరిచయమైయ్యాడు. ఎం.ఎస్.సత్యు దర్శకుడు.
'గరమ్ హవా' చిత్రం 70ల నాటి నవ్య సినిమా పరంపరలో ఒక సంచలనం. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశ విభజన సమయంలో మైనారిటీలు ఎదుర్కొన్న సామాజిక పరిస్థితులు, మానసిక ప్రవృత్తులకు దర్పణం పట్టే సినిమా ఇది. అప్పటిదాకా తమది అనుకున్న చోటును వదిలి వెళ్లడంలో వారు పొందిన మానసిక వేదన, అప్పటి రాజకీయ పరిణా మాలతో వారి జీవితా లెంతగా ప్రభావితమైనవో పట్టి చూపుతుందీ చిత్రం. ముస్లింల జీవన స్థితిగతులకు, సంస్కృతులకు, 1947 నాటి చారిత్రక సంఘటనలకు హృద్యంగా దర్పణం పట్టిన 'గరమ్ హవా' (1973) చిత్రం ఆధునిక సినిమా ప్రపంచంలో ఒక మైలురాయి వంటిది. దీంతో ఇషాన్ బృందం భారతీయ చలన చిత్ర యవనికపైకి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. 1974లో ప్రకటించిన జాతీయ సినిమా అవార్డులలో ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం పురస్కారం అందుకోవడం ఇషాన్ బృందానికి కొత్త ఉత్తేజాన్నిచ్చింది. వీరు ఆ తరువాత విడిగా పనిచేసినా తమ దృక్పథాలను వీడకుండా సినిమాలో పని చేశారు. బాల్రాజ్ సహానీ ప్రధాన పాత్రలో నటించిన చివరి చిత్రం 'గరమ్ హవా'నే.
'గరమ్ హవా'లో ఇషాన్ కెమెరా పనితనం చూసిన బాపు-రమణలు తాము తీస్తున్న 'ముత్యాల ముగ్గు' (1975) చిత్రానికి కెమెరామెన్గా తీసుకున్నారు. అట్లా తెలుగు చిత్ర రంగ ప్రవేశం చేసిన ఇషాన్ తను పని చేసే సినిమాల్లో నటీనటులకు మేకప్ వేసుకోనివ్వరు. ఇదే విషయం ఆయనే ఒక సందర్భంలో- ''సాధారణంగా మన భారతీయ కళాకారులకు ఇక్కడున్న శీతోష్ణస్థితి, వాళ్ళకుండే సహజమైన వర్చస్సు దృష్ట్యా మేకప్ అనవసరమని నా అభిప్రాయం. పైగా మేకప్ ఆర్టిస్టులకు, 'సైకలాజికల్'గా కొన్ని నిబంధనలను సృష్టించి- వాళ్లు ఫ్రీగా తమ పాత్రలను నిర్వహించడానికి అవరోధాలను కలిగిస్తుంది. అంచేతే మంచి ఫలితాలను ఆశించే ధోరణిలో ఎవరికీ మేకప్ ఉండకూడదన్న నా అభిప్రాయంతో బాపు-రమణగార్లు ఏకీభవించారు. (హనుమంతుడి విషయంలో వేరే మార్గం లేదనుకోండి) అలా చిత్రం తీయడం ద్వారా ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయని నేను నిరూపించాను'' (విజయచిత్ర మాసపత్రిక ఇంటర్వ్యూలో) అని అంటారు.
ఇషాన్ ఒక సినిమాకు ఛాయాగ్రహణం వహించే ముందు కథా చర్చల్లో పాల్గొని తన కెమెరాకు ఏ మేరకు పని దొరుకుతుందో చూసి కథ విషయంలో తన అభిప్రాయాలు చెప్పేవారు. అలా వ్యవహరించినపుడే ప్రతి దృశ్యం సజీవంగా ఉండే అవకాశం ఉందనేది ఆయన అభిప్రాయం. అంతగా సీరియస్ సినిమాటోగ్రఫర్ కనుకనే 'ముత్యాలముగ్గు'లో తొలిసారిగా బౌన్స్ లైటింగ్ కాన్సెప్ట్ను సినిమాలకు పరిచయం చేశాడు. ఇందుకుగాను ఇషాన్ ఆర్య జాతీయ స్థాయిలో ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా అవార్డు అందుకున్నారు. 'సినీ హెరాల్డ్' కూడా ఉత్తమ కెమెరామెన్ అవార్డునిచ్చింది. ఈ సినిమా బాపు-రమణకు ఎంత పేరు తెచ్చిందో ఇషాన్కీ అంతే పేరు తెచ్చిపెట్టింది. ఆ మరుసటి యేడు తెలుగులోనే సి.ఎస్.రావు దర్శకత్వంలో వచ్చిన 'మంచికి మరో పేరు' (1976) సినిమాకు కెమెరామెన్గా పనిచేశారాయన. అయితే నవ్యవాస్తవిక సినిమాలు తీయాలన్నది ఇషాన్ ప్రబలమైన జీవితాశయం. అందుకే కమర్షియల్ చిత్రాలకు పని చేసి సొంతంగా సినిమాలు డైరెక్ట్ చేయాలనే ప్రయత్నాలు చేశాడు. కానీ ఎందుచేతనో అవి కార్యరూపం దాల్చలేదు. అయితే అభిరుచికి సరిపోయిన ఎంపిక చేసుకున్న సినిమాలకే పని చేయడం ఆయన ప్రత్యేకతగా అనుకోవచ్చు.
'ముత్యాల ముగ్గు' తరువాత బాపు తీసిన 'స్నేహం'(1977), 'గోరంత దీపం' (1978) చిత్రాలలో కారుమబ్బులు, వానాకాలపు ఆకాశపు అందాలను ప్రతికూల వాతావరణాన్ని లెక్కచేయక అవుట్డోర్లో చిత్రీకరించి ప్రతిభాశాలి ఇషాన్ ఆర్య. నీరెండలోని ప్రకృతి రమణీయతను, సూర్యాస్తమయంలో ప్రతినాయక పాత్రలోని క్రౌర్యాన్ని తన కెమెరాతో ముత్యాల ముగ్గులో చూపారు. ప్రత్యేక శైలిలో సందర్భోచితమైన ఛాయగ్రహణం అనేది ఇషాన్లోని విశిష్టత. బాపు 1979లో తీసిన తూర్పు వెళ్లే రైలు చిత్రానికి కూడా ఇషానే కెమెరామెన్. ఇషాన్ ఆ తరువాత ఛాయాగ్రహణం నెరిపిన చిత్రాలు : 'ఖూన్ పసీనా' (1977) హిందీ చిత్రం. 'కంకఱ కోటె' (కన్నడ-1977), 'బాజార్' (హిందీ- 1982), 'అంజుమన్' (హిందీ-1986), 'ఆజ్ ఝలే ముక్త్మి' (మరాఠి 1986), 'కహ కహాసే గుజర్ గయా' (హిందీ 1986), నసీహత్ (హిందీ 1986), 'మొహరే' (హిందీ 1987).
నిర్మాతగా రెండో ప్రయత్నంగా 'రుస్తుం జోడి' చిత్రాన్ని 1980లో కన్నడంలో నిర్మించారు. సినిమాటోగ్రఫీ కూడా ఆయనదే. 25 సంవత్సరాల కెరీర్లో ఆయన పనిచేసిన సినిమాలు 20కి మించవు. కానీ రాశిలో కన్నా వాసిలో అవి మైలు రాళ్ళ వంటి చిత్రాలు. వీటిలో సాగర్ సర్హది, ముజఫర్ అలీ, బాపు వంటి ప్రసిద్ధుల చిత్రాలున్నవి.
తొలినాళ్ళలో అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన డాక్యుమెంటరీలు తీసిన సుఖ్దేవ్, సత్యల డాక్యుమెంటరీలకు పనిచేసిన ఇషాన్ వద్ద కైఫీ అజ్మీ కొడుకు బాబా అజ్మీ కెమెరామెన్గా శిష్యరికం చేసాడు. ఆయన బాలీవుడ్లో ఆ తర్వాత చాలా కమర్షియల్ చిత్రాలకు పని చేశారు. చేస్తూనే ఉన్నారు కూడా. ఇది ఉండగా ఇషాన్ ఆర్య స్టేజీ నటి శుభను వివాహమాడారు. వారికి ఇరువురు కుమారులు. పెద్ద వాడు సమీర్ ఆర్య కూడా సినిమాటోగ్రఫరే. కోయిలా, కొయిమిల్గయా, షూట్ అవుట్ వడాలా వంటి కమర్షియల్ చిత్రాలకు పని చేశారు. రెండవ వాడు సాగర్ ఆర్య నటుడు. అయితే ఇషాన్ ఆర్య తన 48వ ఏట 1990 అక్టోబర్లో అకాలమరణం పొందాడు.
హిందీ చిత్ర రంగంలో మూడో తరం సినిమాటోగ్రఫర్గా తనదైన శైలిలో సందర్భోచితమైన ఛాయాగ్రహణం అనేది ఇషాన్ ఆర్య ద్వారా ప్రాచుర్యం పొందింది. అశోక్ గుంజాల్, రంగా, ఆర్.కె.తివారి, లోక్సింగ్, బాబా ఆజ్మీ వంటి శిష్యుల రూపంలో తన శైలిని భవిష్యత్తు తరాలకు అందించిన ప్రతిభాశాలి ఇషాన్ ఆర్య. భారతీయ చిత్రాలలో బింబ ప్రతిబింబాల ద్వారా తన ప్రజ్ఞా పాటవాలకు గీటురాయి అన్న చందాన కెమెరా కన్నుతో పని చేసిన హైదరాబాదీగా ఇషాన్ ఆర్య సినీ చరిత్రలో నిలిచిపోయారు.
- హెచ్.రమేష్బాబు
7780736386