వందల కోట్ల రూపాయల ఖర్చుతో తెరకెక్కిస్తున్న 'బాహుబలి' సినిమా జనం ముందుకు రాబోతుంది. సినిమా ప్రమోషనల్ ప్రకటనల పుణ్యమా అని బాహుబలి పేరు జనసామాన్యంలోకి దూసుకు వెళ్ళింది. ఇదే సమయంలో ఎవరీ బాహుబలి? అతడి గొప్పదనం ఏమిటి? వంటి ప్రశ్నలు జనంలో రేకెత్తాయి. నిజంగా సినిమాలో ఏం చూపించబోతున్నారో తెలియదు కానీ 'సోపతి' మాత్రం బాహుబలి గురించి విశేషమైన పరిశోధన చేసి జనసామాన్యానికి తెలియని ఎన్నో విశేషాలను పాఠకుల ముందు పెడుతోంది. తెలంగాణకు బాహుబలికి ఉన్న సంబంధాన్ని తెలియజేయటం ఈ కవర్ స్టోరీ ముఖ్య ఉద్దేశం. బాహుబలి అవశేషాలను వెతికి పట్టుకుని మన సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టాల్సిన బాధ్యతను గుర్తుచేస్తుంది ఈ కథనం.
విష్ణుపురాణం, జైన గ్రంథాలు, ప్రచారంలో ఉన్న కొన్ని కథలను బట్టి బాహుబలి చరిత్రను తెలుసుకోవచ్చు. జైనమతానికి సంబంధించిన మొదటి తీర్థంకరుడుగా పేరుగడించిన రిషభదేవుడు అయోధ్య రాజధానిగా రాజ్యపాలన చేశాడు. ఆయనే ఇక్ష్వాకు వంశాన్ని ప్రారంభించాడని జైన మతస్తులు విశ్వసిస్తున్నారు. సుమంగళి, సునంద అనే ఇద్దరు రాకుమార్తెలను రిషభదేవుడు వివాహమాడాడు. సుమంగళకు 99 మంది కుమారులు, బ్రహ్మి అనే కుమార్తె జన్మించారు. కుమారుల్లో పెద్దవాడి పేరు భరతుడు. సునందకు బాహుబలి అనే కుమారుడు, సుందరి అనే కుమార్తె జన్మించారు. (విష్ణుపురాణం భరతుడు, బాహుబలి ఇద్దరే రిషభదేవుని కుమారులని చెబుతోంది). భరతుడు గొప్ప వీరునిగాను, రాజనీతి కోవిదుడుగానూ తయారయ్యాడు. బాహుబలి చాలా పొడగరి. మంచి దేహదారుఢ్యంతో అత్యంత బలశాలిగా తయారయ్యాడు. అతడి భుజబలం అమోఘమయింది. బ్రహ్మి సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించింది. ఆమె పేరు మీదే అప్పట్లో 'బ్రాహ్మీ' లిపిని రిషభదేవుడు కనిపెట్టాడంటారు. అశోకుని కాలంలో దొరికిన తొలి శాసనాలు అత్యధికం బ్రాహ్మి లిపిలోనే ఉండటం ఈ సందర్భంగా గమనార్హం. సుందరి గణితంలో దిట్టయింది. వృషభదేవుడు చాలా కాలం రాజ్యపాలన చేశాడు. కాలం గడిచే కొద్దీ ఆయనకు ఐహిక జీవితంపై విరక్తి పుట్టుకొచ్చింది. తన రాజ్యాన్ని నూరుగురు కుమారులకు పంచిపెట్టాడు. తరువాత సన్యాస దీక్ష తీసుకుని వస్త్రభూషణాదులను త్యజించి అడవులకు వెళ్ళి తపస్సు ప్రారంభించాడు. అనేక ఏళ్ళ తపస్సు అనంతరం ఆయనకు జ్ఞానోదయం అయింది. దీన్నే 'జినత్వం' పొందడం అంటారు. తాను తెలుసుకున్న సత్యాలను దేశాటన చేస్తూ ప్రజలకు తెలియ చేశాడు రిషభుడు. ప్రజల్లో ఆయనకు మంచి ఆదరణ లభించింది. అనేకమంది రాజులు, వ్యాపారులు, సాధార ప్రజలు రిషభుని మతాన్ని స్వీకరించారు.
తండ్రి రిషభుడు అడవులకు వెళ్ళిన తరువాత భరతుడు ఓ గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించాలని కలలు కన్నాడు. తన కలల్ని సాకారం చేసుకోవడం కోసం బలమైన సైన్యాన్ని నిర్మించడంతో పాటు కొత్త కొత్త ఆయుధాలను తయారుచెయ్యడం ప్రారంభించాడు. అతడి సైన్యం 'చక్రరత్న' అనే ఆయుధాన్ని తయారు చేసింది. దీన్ని భరతుడే ప్రయోగిస్తాడు. ఇది గురితప్పదు. సమకాలీన ప్రపంచంలో భరతుని చేతుల్లో ఉన్న ఆయుధాలు మరెవరి దగ్గరాలేవు. అందుకే అతడు పాలిస్తున్న అయోధ్య చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ లొంగిపోయాయి. చివరికి తన 98 మంది సోదరుల రాజ్యాలను కూడా ఆక్రమించుకున్నాడు. తమ్ముళ్ళందరూ తమ రాజ్య భాగాలను అన్నగారికి అప్పగించి తమ తండ్రి ఉంటున్న అడవులకు వెళ్ళి ఆయన శిష్యులుగా మారారు. అయితే భరతుని జైత్ర యాత్రను అడ్డుకుంటూ ఓ వీరుడు ముందుకొచ్చాడు. అతడే బాహుబలి.
అన్నదమ్ముల మధ్య యుద్ధం
భరతుని పేరుమీదే మన దేశానికి భారత దేశం (భరత వర్షం) అనే పేరు వచ్చింది (శకుంతల దుష్యంతుల కుమారుడు భరతుడు కాదని గమనించాలి). వందలు వేలుగా ఉన్న చిన్న చిన్న రాజ్యాలను జయించి ఒక మహాసామ్రాజ్యంగా రూపు దిద్దాడు కాబట్టే ఆయన పేరు మీద ఈ దేశాన్ని భారత దేశం అన్నారని జైనులంటారు. అటువంటి భరతుడు బాహుబలితో తలపడుతున్నాడు. తన సార్వభౌమత్వాన్ని అంగీకరించమని భరతుడు తన సవతి తమ్ముడు బాహుబలికి రాయబారం పంపాడు. కానీ అందుకు బాహుబలి అంగీకరించలేదు. దీంతో యుద్ధం అనివార్యమయింది.
అన్నదమ్ముల సైన్యాలు ఎదురెదురుగా మొహరించాయి. భరత భాహుబలురు ఇరువురూ బలశాలురే. యుద్ధమంటూ జరిగితే రెండువైపుల అపార ప్రాణ నష్టం సంభవించడం ఖాయం. ఈ ప్రాణ నష్టాన్ని నివారించడానికి ఇరు రాజ్యాలకు సంబంధించిన మంత్రులు ఒక అవగాహనకు వచ్చారు. యుద్ధరంగంలో పోరుకు సిద్ధమైన అన్నదమ్ముల దగ్గరకు వచ్చి తమ ఒక ప్రతిపాదన వారి ముందు ఉంచారు. ఇరు సైన్యాలు తలపడితే అపార ప్రాణ నష్టం జరుగుతుందని కాబట్టి, సైన్యాలను యుద్ధంలో దించకుండా అన్నదమ్ములిద్దరే యుద్ధం చెయ్యాలని, ఆ యుద్ధంలో ఎవరు ఓడిపోతే వారి రాజ్యం గెలిచినవారికి ఇచ్చివెయ్యాలనేది మంత్రుల ప్రతిపాదన సారాంశం. ఈ ప్రతిపాదనకు ఇద్దరూ సమ్మతించారు. వీరిద్దరి మధ్య దృష్టి యుద్ధం, జలయుద్ధం, మల్ల యుద్ధం (ద్వంద్వ యుద్ధం) అనే మూడు రకాల యుద్ధాలు జరగాలని మంత్రులు నిర్ణయించారు. అయితే ఎవ్వరూ ఆయుధం ప్రయోగించరాదనే షరతు విధించారు. ముందుగా దృష్టి యుద్ధం ప్రారంభమయింది. ఈ యుద్ధ నియమం ప్రకారం ఒకరి కళ్ళలోకి ఒకరు తీక్షణంగా చూస్తూ ఉండాలి. కళ్ళార్పకూడదు. ఎవరు ముందు కళ్ళు ఆర్పుతారో వారు ఓడిపోయినట్లు లెక్క. బాహుబలి తన అన్న భరతుని కళ్ళలోకి తీక్షణంగా చూస్తున్నాడు. అతడిలో ఏవేవో ఆలోచనలు చెలరేగుతున్నాయి. చిన్నప్పటి నుంచి తాను చూస్తున్న ఈ కళ్ళలోకి క్రోధాగ్నుల్ని ఎలా విరజిమ్మడం... అనుకుంటూ ప్రసన్నవదనంతో అన్నగారి కళ్ళలోకి చూస్తున్నాడు బాహుబలి. భరతుని పరిస్థితీ అలాగే ఉంది. తమ్ముడి ముఖంలో కనిపిస్తున్న ప్రేమ మమకార వాత్సల్యాలకు తనలో ఉన్న కోపాన్ని మరిచిపోయి ప్రశాంత చిత్తుడై కళ్ళు మూసుకున్నాడు. అంతే భరతుడు దృష్టి యుద్ధంలో ఓడిపోయినట్లు మధ్యవర్తులు ప్రకటించారు. కళ్ళుమూసి తెరిచేలోపల ఓటమి పాలవ్వడంతో భరతుడు నివ్వెరపోయాడు. రెండవదైన జలయుద్ధం ప్రారంభమయింది. నదిలో దిగి ఒకరిపై ఒకరు నీటిని చిమ్ముకోవడం ఈ యుద్ధం ప్రత్యేకత. యుద్ధం ప్రారంభమైన కొంతసేపటికి భరతుడు అలిసిపోయాడు. ఈసారి కూడా అమేయ భుజబల సంపన్నుడైన బాహుబలినే విజయం వరించింది.
రెండు యుద్ధాల్లో ఓడిపోయిన భరతుడు మల్ల యుద్ధంలోనైనా గెలవాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. ఆ యుద్ధమూ ప్రారంభమయింది. ముందుగా భరతుడు బాహుబలునిపై పిడిగుద్దులు కురిపించాడు. రెండో గుద్దుకే బాహుబలి కిందపడిపోయాడు. తమ్ముడు కిందపడిపోవడంతో కంగారు పడ్డాడు భరతుడు. తమ్ముడు మరణిస్తున్నాడేమోనని బాధపడ్డాడు. ఇంతలో తెప్పరిల్లి పైకి లేచాడు బాహుబలి. ఇప్పుడు గుద్దే వంతు అతడిదే. అన్నను రెండు చేతుల్తో పైకి లేపి గిరగిరా తిప్పి జాగ్రత్తగా కిందకు దించాడు. గట్టిగా గుద్దటానికి చెయ్యి పైకి లేపాడు. ఈ దెబ్బతో భరతుడు చనిపోవడం ఖాయమని అక్కడ చేరిన వారందరూ హాహాకారాలు చేశారు. భరతుడు కూడా ప్రాణ భయంతో ఒణికిపోయాడు. ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఆయుధాన్ని వాడరాదనే నియమాన్ని పక్కనబెట్టి తన చక్రరత్న ఆయుధాన్ని ప్రయోగించడానికి ప్రయత్నించాడు. కానీ అది పనిచెయ్యలేదని జైన గ్రంథాలు చెబుతున్నాయి. నియమ విరుద్ధంగా ఆయుధాన్ని ప్రయోగించాడనే కోపంతో బాహుబలి అన్నను గుద్దటానికి పిడికిలి ఎత్తాడు. చెయ్యి ఎత్తిన వెంటనే అతడి మనసులో రకరకాల ఆలోచనలు చెలరేగాయి. ''నేనేం చేస్తున్నాను. నా తండ్రి తృణప్రాయంగా భావించి త్యజించిన రాజ్యాధికారం కోసమా తోబుట్టువును చంపబోతున్నాను...తుచ్ఛమైన ఈ రాజ్య భోగభాగ్యాలు వద్దు. తండ్రిగారు, తమ్ముళ్ళ లాగే నేనూ సన్యాసం స్వీకరించి శాశ్వితానందాన్ని విశ్వప్రేమను పొందుతాను''... ఇలా సాగింది బాహుబలి ఆలోచన. అంతే తనను క్షమించమని అన్న భరతుని కోరాడు. తన రాజ్య భాగాన్ని కూడా అన్నగారికి ఇస్తున్నట్లు ప్రకటించాడు. అప్పటికప్పుడు సన్యాస దీక్ష తీసుకుంటున్నట్లు చెప్పి ఆభరణాలు, దుస్తులను తొలగించుకుని వెంట్రుకలను చేత్తో పీక్కున్నాడు. (జైన మతంలో దీక్ష తీసున్నవారు వెంట్రుకలను పీకడం ద్వారా తొలగించడం ఇప్పటికీ చూడవచ్చు). భరతుడు ఎంత వారిస్తున్నా వినకుండా బాహుబలి దీక్ష తీసుకున్నాడు.
తపస్సు
ఘోరమైన తపస్సు చేస్తున్నా బాహుబలికి జ్ఞానోదయం కాలేదు. అలా జ్ఞానోదయం కాకపోవడానికి కారణం అతడిలో ఇంకా మిగిలి ఉన్న గర్వమే. ఈ విషయాన్ని గ్రహించిన రిషభనాథుడు తన కుమార్తెలను బాహుబలి దగ్గరకు పంపించి గర్వాన్ని వదిలితేనే జ్ఞానోదయం అవుతుందని చెప్పమంటాడు. బ్రహ్మి, సుందరి అన్న బాహుబలి దగ్గరకు వెళ్ళి తండ్రి చెప్పిన విషయాన్ని చెబుతారు. దీంతో తప్పు తెలుసుకున్న బాహుబలి ఏక దీక్షతో తపస్సు చేసి జ్ఞానోదయాన్ని పొందుతాడు. ఆ
బాహుబలునికి తెలంగాణకు సంబంధం ఏమిటి?
బాహుబలునితో తెలంగాణకు విడదీయలేని సంబంధం ఉంది. బాహుబలుడు రాజ్యం చేసింది తెలంగాణలోనే. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఉన్న బోధన్ను పూర్వం పౌదన్యపురం అనీ, పోదన పురం అనీ పిలిచేవారు. ఇదే బాహుబలుని రాజధాని. ఈ విషయాన్ని చెప్పే కొన్ని ఆధారాలు అందుబాటులో ఉన్నాయి. పోదనపురం గురించి మహాభారతంలో కూడా ఉందంటే అది ఎంత ప్రాచీనమైనదో అర్థం చేసుకోవచ్చు. అక్కడ జైన, బౌద్ధ, వైదిక మతాలు సమానంగా విలసిల్లాయి. అటువంటి పట్టణాన్ని బాహుబలుడు తన రాజధానిగా చేసుకున్నట్లు జైన గ్రంథాలు, విష్ణుపురాణం చెబుతున్నాయి. బోధన్లో అనేక జైన విగ్రహాలు, ఆలయాలు కనిపించడంతో బాహుబలుని రాజధానిగా నిజంగానే ఈ పట్టణం విలసిల్లిందేమో అని కొందరు చరిత్రకారులు అంటున్నారు.
శ్రావణ బెళగోళ- బాహుబలి
భారతదేశంలో అత్యంత పొడవైన విగ్రహాల్లో ఒకటిగా నేటికీ గుర్తింపు పొందిన విగ్రహం కర్నాటకలోని శ్రావణ బెళగోళలో ఉంది. ఈ విగ్రహం గోమఠేశ్వరునిది. సమకాలీన ప్రపంచంలోనే కాక ఇప్పటికీ ఒక అద్భుత శిల్పంగా పరిగణించబడుతున్న విగ్రహం ఇది. దీన్ని చూడటానికి మనదేశంనుంచే కాక ప్రపంచం నలుమూలల నుంచి జైన భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి పన్నెండేళ్ళకు జరిగే 'మహామస్తకాభిషేక' ఉత్సవానికి లక్షలాదిమంది భక్తులు వస్తారు. ఇంతటి ప్రాముఖ్యం గల ఈ విగ్రహానికి స్ఫూర్తినిచ్చిన విగ్రహం బోధన్లో ఉండేది. బోధన్లో ఉన్న విగ్రహం బాహుబలునిది. ఇది శ్రావణ బెళగోళలో ఉన్న గోమఠేశ్వర విగ్రహం కంటే పొడవుగానూ, భారీగానూ ఉండేది. దీన్ని చూడటానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వచ్చేవారు. అయితే కాలక్రమంలో ఆ విగ్రహం ఉన్న ప్రాంతం అంతా అడవిగా మారిపోయింది. ఒకసారి కర్నాటక ప్రాంతాన్ని ఏలుతున్న పశ్చిమగాంగ రాజు రాచమల్లుని మంత్రి చాముండరాయడు తమ ఆస్థానాన్ని సందర్శించిన ఓ కవి ద్వారా బోధన్లోని బాహుబలి విగ్రహం గురించి తెలుసుకున్నాడు. పౌదన్యపురంలో ఉన్న బాహుబలి విగ్రహం 500 ధనస్సుల పొడవు ఉందని ఆ కవి చెబుతాడు. అంతేకాదు అది మనుషులు చేరడానికి వీలు లేని కీకారణ్యంలో ఉందనీ చెబుతాడు. దీంతో చాముండరాయడు బోధన్ వెళ్ళి బాహుబలుని అద్భుతమైన విగ్రహాన్ని దర్శించుకుంటాడు. దాదాపు విగ్రహం అడవుల్లో అదృశ్యమయ్యే స్థితిలో ఉండటంతో ఇదే పరిమాణం, రూపం ఉన్న విగ్రహాన్ని శ్రావణ బెళగోళలో ప్రతిష్టించాలని నిర్ణయించుకున్నాడు. తాను అనుకున్న విధంగా బాహుబలుని భారీ ఏకశిలా విగ్రహాన్ని శ్రావణ బెళగోళలో ఉన్న వింధ్యగిరిపై చెక్కించి ప్రతిష్టించాడు. ఆ సమయంలో వేయించిన శాసనం బోధన్ బాహుబలి విగ్రహం చుట్టూ భయంకరమైన కుక్కుట సర్పాలు తిరుగాడుతున్నాయని, అక్కడికి వెళ్ళడం కష్టంగా మారిందని, అందువల్ల చాముండరాయడు బోధన్లో ఉన్న విగ్రహానికి సమానమైన మరో విగ్రహాన్ని ఇంద్రగిరి కొండపై ప్రతిష్టించడానికి ప్రయత్నించాడని కానీ అంత ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్టించలేకపోయాడని చెబుతోంది. దీన్ని బట్టి బోధన్లో ఉన్న విగ్రహం ఎంతపెద్దదో అర్థంచేసుకోవచ్చు. చాముండరాయని గోమఠుడు అని కూడా అంటారు. అందుకే ఆయన ప్రతిష్టించిన బాహుబలుని విగ్రహానికి గోమఠేశ్వర విగ్రహం అని పేరువచ్చిందని అంటారు. మరికొందరు బాహుబలి విగ్రహాన్ని గోమఠేశ్వరునికి అంకితం ఇవ్వడం వల్లే ఆ పేరు వచ్చిందని అంటున్నారు.
ఉత్తరభారతదేశంలో ఎక్కడా గోమఠేశ్వర విగ్రహాలు లేవు. అతడు పూర్తిగా దక్షిణ భారతానికే పరిమితమైన సిద్ధుడు. అది కూడా దిగంబర జైన శాఖకు చెందినవాడు. మొదట్లో కేవలం బోధన్ ప్రాంతానికే బాహుబలి (గోమఠేశ్వర) విగ్రహం పరిమితమై ఉందని చెప్పవచ్చు. ఆ తరువాత కర్నాటకలో శ్రావణ బెళ్గోళాతో పాటు మరి కొన్ని చోట్ల గోమఠేశ్వరుని విగ్రహం ప్రతిష్టితమయింది. ఆంధ్రప్రాంతంలో విజయనగరరాజుల కాలంలో అమరాపురంలో గోమఠేశ్వరుని విగ్రహం ప్రతిష్టించేవరకు అక్కడ ఆయన విగ్రహమే కనిపించదు. పిఠాపురంలోని కుక్కుటేశ్వర ఆలయం నిజానికి గోమఠేశ్వరుని ఆలయం అని హిందువులు దాన్ని ఆక్రమించారని చరిత్ర కారులు అభిప్రాయ పడుతున్నారు.
బోధన్లో ప్రారంభమైన అతి పెద్ద విగ్రహాల ప్రతిష్టాపన ఆ చుట్టుపక్కల ప్రాంతానికీ విస్తరించింది. బోధన్ గోమఠేశ్వరుని స్ఫూర్తితో అనేక జైన తీర్థంకరుల నిలువెత్తు విగ్రహాలను జైన శిల్పులు చెక్కారు. ప్రస్తుతం అవి హైదరాబాదులో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రధాన మ్యూజియంలో ఉన్నాయి. ఈ పెద్ద విగ్రహాలను నిలిపే సంస్కృతి బోధన్ నుంచి క్రమంగా పశ్చిమ భారత దేశంలో ఉన్న ఎల్లోరాకు పాకింది. ఎల్లోరాలోని లైఫ్సైజ్ విగ్రహాలకు స్ఫూర్తి మన బోధన్ బాహుబలి విగ్రహమే అని గోపాల కృష్ణమూర్తి వంటి చరిత్రకారులు అంటున్నారు.
బోధన్లో బాహుబలి విగ్రహాన్ని ఎవరు నిలిపారనే సందేహం కలగడమూ సహజమే. దీన్ని బాహుబలి అన్న భరతుడే నిలిపాడని జైనులంటున్నారు. ఉత్తర భారతం నుంచి తమ్ముడి రాజ్యంపై దండెత్తి వచ్చిన భరతుణ్ణి బోధన్లో ఎదుర్కొని గెలిచిన బాహుబలుడు రాజ్యపరిత్యాగం చేసిన తరువాత కాయోత్సర్గ భంగిమలో (నిలువు కాళ్ళపై నిలబడి) తపస్సు చేస్తాడు. ఆ సమయంలో బాహుబలి కాళ్ళకు, చేతులకు తీగలు, పాములు చుట్టుకుంటాయి. అతడి చుట్టూ పుట్టలు పెరుగుతాయి. ఈ దృశ్యాన్ని చూసిన అన్న భరతుడు అప్పటి రూపాన్ని ప్రతిబింబించే 525 ధనుస్సుల పొడుగున్న బాహుబలి శిలా విగ్రహాన్ని తయారు చేయించాడని జైన మతస్తుల్లో ప్రచారంలో ఉన్న కథ. భరతుడు ప్రతిష్టించిన ఈ విగ్రహాన్ని కుక్కుటేశ్వరుడని పిలిచేవారు.
- డా||జి.శివరామకృష్ణయ్య, 7702508259
తెలుగు సంస్కృతిపై జైనం ప్రభావం
తెలుగువారిపై జైనమతం వదలిన ముద్రలు చాలానే ఉన్నాయి. ఒకప్పుడు తెలంగాణం అంతా జైన మతం వ్యాపించి ఉండేది. ఇక్కడి రాజులు, రాజోద్యోగులు, ప్రజలు కూడా జైనాభిమానులుగా ఉండేవారు. అందువల్ల జైన మతం దాదాపు తెలుగు ప్రాంతాల్లో అంతరించిపోయినా వందల ఏళ్ళపాటు ఇక్కడి ప్రజల జీవితాలు ఆ మత ఆచార సంప్రదాయాల ప్రకారం గడిచాయి కాబట్టి ఆ మత ఛాయలు ఇంకా తెలుగు వాళ్ళ సంస్కృతిలో కనిపిస్తాయి. హిందువులు పిల్లలకు అక్షరాభ్యాసం చేసే సమయంలో 'సిద్ధం నమ:' అని ఇప్పటికీ పలకలపై రాయడం జైన సంప్రదాయమే.ఎక్కాలు అనే మాటను నేర్పింది వారే. 'నిత్యకళ్యాణం పచ్చతోరణం' అనే తెలుగు సామెతను తీసుకుంటే అది జైనమతంతో తెలుగువారికున్న పరిచయం వల్లే వచ్చిందని చెప్పవచ్చు. జైన తీర్థంకరులకు కళ్యాణోత్సవాలు జరుపుతారు. కళ్యాణం అంటే పెళ్ళి కాదు. పుట్టుక మొదలు కైవళ్యం వరకు ఉన్న అంచలను స్మరించే జయంతులను కళ్యాణాలు అంటారు.. జైనబసదుల్లో (సత్రాలు లేక మఠాలు) రోజూ ఏదో ఒక తీర్థంకరుని కళ్యాణం జరగడాన్నిబట్టి ఈ సామెత పుట్టింది. అలాగే యాపనీయ జైన శాఖవారు వర్జ్యం చూసి కానీ ఏ పనీ ప్రారంభించేవారు కాదు. అదే ఆచారం ఇప్పుడు తెలుగు ప్రజల్లో కనిపిస్తుంది. తెలుగు దేశంలో హిందువుల్లో శాకాహారం తీసుకోవడం ఒక ఆచారంగా భావించేవారు ఉన్నారు. ఇలా శాకాహారాన్ని తీసుకునే ఆచారాన్ని ప్రవేశపెట్టింది మొదట జైనులే. వీరిని చూసే శాకాహారం తీసుకోవడం నియమంగా పెట్టుకున్నారు కొందరు హిందూ కులాలవారు.
గోమఠేశ్వర ప్రతిష్ట జరిగిందెప్పుడు?
శ్రావణ బెళగోళలో గోమఠేశ విగ్రహం పాదాల దగ్గర ఉన్న శాసనాలు ఆ విగ్రహాన్ని, చుట్టు ఉన్న కట్టడాలను ఎవరు నిర్మించారో తెలియచేస్తున్నాయి. ఒక శాసనంలో కల్కియుగం అంటే 600 చైత్రమాసం సూర్యపక్షం ఐదవ రోజు ఆదివారం కుంభలగంలో చాముండరాయడు గోమఠేశుని విగ్రహాన్ని బెళ్గుళ నగరంలో ప్రతిష్టించినట్లు ఉంది. అయితే శాసనంలో పేర్కొన్న తేదీ, సంవత్సర నిర్ణయంలో చరిత్రకారుల మధ్య ఏకాభిప్రాయం లేదు. అందుకే కొందరు 981 సంవత్సరంలో ప్రతిష్టించారంటే మరికొందరు 983లో అంటున్నారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ విగ్రహం క్రీస్తుశకం 980-984 మధ్య ప్రతిష్టించబడిందని చెప్పవచ్చు. మరో శాసనంలో విగ్రహం చుట్టు ఉన్న కట్టడాలను గంగరాజు నిర్మించినట్లు ఉంది.
సారస్వత ఆధారాలున్నాయి
బోధన్ (పోదనపురం) రాజధానిగా బాహుబలి రాజ్యపాలన చేశాడని కొన్ని సారస్వత ఆధారాలు చెబుతున్నాయి. ఆయన కాలంలో జైనమతం ఇప్పటి రూపాన్ని సంతరించుకోలేదు. నిజానికి అప్పట్లో జైన మతం అనే పేరే లేదు. మొదట్లో అంటే సింధునాగరికతా కాలం వరకు బాహుబలి జీవిత కాలంలో ఆయన తండ్రి స్థాపించిన మతాన్ని రిషభధర్మం అని వ్యవహరించారు. వేదకాలంలో వ్రత్యధర్మం అన్నారు. ఉపనిషత్తుల కాలం వచ్చే నాటికి అర్హంత్ ధర్మం అనీ, మౌర్యుల కాలంనాటికి నిగ్రంథి అనీ, ఆ తరువాత కాలంలో జైనం అని పిలిచారని అనేక సారస్వత ఆధారాల వల్ల తెలుస్తోంది. బాహుబలి ఒక చారిత్రక పురుషుడని కానీ, లేక పౌరాణిక పురుషుడని కానీ ఇదమిత్థంగా చెప్పటం సాధ్యం కాదు. బోధన్లో లభించిన అనేక జైన విగ్రహాల అవశేషాలను బట్టి అది అతి ప్రాచీన జైన క్షేత్రం అని గట్టిగా చెప్పవచ్చు.
- డా||జి.జవహర్లాల్, ఓఎమ్ఎల్ డైరెక్టర్ (రిటైర్డ్)
వేల ఏళ్ళ క్రితమే అది మహానగరం
బోధన్ తెలుగువారి అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం నాటికి భారత దేశంలో ఉన్న పదహారు జనపథాల్లో అస్మక ఒకటి. దీని రాజధాని పోతన (బోధన్).అంటే రెండువేల ఆరువందల ఏళ్ళ క్రితమే బోధన్ ఒక మహానగరంగా ఉందన్నమాట. ఆ కాలం నాటికే అది ప్రసిద్ధ నగరంగా ఉందంటే అంతకు ముందు నుండే అది ఉనికిలో ఉండి ఉండాలి. దాని నిర్మాణానికి, మహానగరంగా అభివృద్ధి చెందటానికి ఎంత దీర్ఘకాలం పట్టిందో ఊహించవచ్చు. అప్పటికి ఎంతో ముందు జీవించాడని భావిస్తున్న బాహుబలికీ అది రాజధానిగా ఉండి ఉండవచ్చు. బోధన్ ప్రాంతంలో దొరికిన అనేక జైన విగ్రహాలు అది ఓ జైన కేంద్రంగా విలసిల్లిన వాస్తవాన్ని చెబుతున్నాయి. మౌర్యుల కాలంలో వచ్చిన గ్రీకు దేశస్తుడు మెగస్తనీస్ ఆంధ్రులు చుట్టూ గోడలు ఉన్న 30 మహానగరాల్లో నివసించారని తన 'ఇండికా' గ్రంథంలో రాశాడు. మేం చేపట్టిన ఒక పరిశోధక ప్రాజెక్టులో ఆ 30 నగరాల్లో బోధన్ కూడా ఒకటని తేలింది. అంటే మౌర్యుల కాలం నాటికీ బోధన్ ఒక మహానగరంగా విలసిల్లుతూనే ఉందన్నమాట.
- శాయిభక్త కేశవ, డిప్యూటీ డైరెక్టర్ - ఏపీ పురావస్తు శాఖ
ప్రభుత్వం ఏం చెయ్యాలి?
జైన గ్రంథాలు, శ్రావణ బెళ్గోళాలో ఉన్న శాసనం బట్టి మన బోధన్లో ప్రపంచంలోని ఎత్తయిన బ్రహ్మాండమైన విగ్రహం ఒకటి ఉందని స్పష్టంగా తెలుస్తోంది. మరి ఆ విగ్రహం ఏమైపోయినట్లు? శాసనంలో పేర్కొన్నట్లు బాహుబలుని విగ్రహం అప్పట్లోనే అడవుల్లో కలిసిపోయిందా? కాల క్రమంలో విగ్రహం నేలపై ఒరిగి భూమిలో పూడుకుపోయి ఉండవచ్చు. మొత్తం దేశంలోనే భారీ విగ్రహాల ప్రతిష్టకు అంకురార్పణ చేసింది బోధన్ బాహుబలి విగ్రహం. అటువంటి విగ్రహం ఒకటుందనే విషయం చాలామందికి తెలియదు. తెలంగాణ చరిత్ర, సంస్కృతికి బాహుబలి తెచ్చిన పేరు సామాన్యమైనది కాదు. ఆయన్ని పూజించే కోట్లాది జైనుల ఆచార సంప్రదాయాలు మన తెలుగువారి జీవితంతో పెనవేసుకున్నాయి. ఆ విధంగా బాహుబలి మన సంస్కృతిలో ఒక భాగమయ్యాడు. అటువంటి బాహుబలి భారీ విగ్రహాన్ని విలువకట్టలేని సంపదగా గుర్తించి వెలికి తీసే పనిని చేపట్టాలని చరిత్రకారులు కోరుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ రెండువేల ఏళ్ళ క్రితం మెగస్తనీస్ ఇండికా గ్రంథంలో పేర్కొన్న 'ఆంధ్రుల 30 ప్రాకార నగరాల'ను గుర్తించడానికి ఒక ప్రాజెక్ట్ చేపట్టింది. ఆ పరిశోధక ప్రాజెక్టుద్వారా చరిత్ర గర్భంలో కలిసిన మౌర్యుల కాలంనాటి 30 నగరాల్లో కొన్నింటిని గుర్తించి గ్రంథస్థం కూడా చేశారు. (ఈ వ్యాస రచయిత ఆ ప్రాజెక్టులో పాల్గొని కొన్ని నగరాల అవశేషాలను వెలికితియ్యడంలో పాలుపంచుకున్నాడు). ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం బోధన్ బాహుబలి విగ్రహాన్ని కనిపెట్టేందుకు ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ను చేపట్టాలి. దీంట్లో ఆర్కియాలజిస్టులతో పాటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, ఎన్జీఆర్ఐ వంటి శాస్త్రీయ పరిశోధనాసంస్థల శాస్త్రవేత్తలకు భాగస్వామ్యం కల్పించాలి. ఆధునిక టెక్నాలజీ, పరికరాలను ఉపయోగించి భూమిలో ఎంత లోతులో ఉన్నా బాహుబలి విగ్రహాన్ని కనిపెట్టవచ్చు. నిజంగా బాహుబలి విగ్రహాన్ని బయటికి తీస్తే బోధన్ ప్రపంచ పర్యాటక క్షేత్రంగా మారిపోతుంది. అంతకన్నా మించి మన తెలంగాణ చరిత్ర దశ దిశలా తెలిసివస్తుంది.
Authorization