Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బానిసలు - భరించడం తప్ప
ఎదిరించడం నేర్వకూడదు
బానిసలు- పడి వుండటం తప్ప
ప్రశ్నించడం చేయకూడదు - హిందూ మతంలోని అణగారిన కులస్తులను బానిసలుగా పేర్కొన్నాడు దాని సిద్ధాంత కర్త మనువు. ఆ బానిసలను సర్వ విధాలుగా అణగదొక్కే హక్కు, అనుభవించే హక్కు ద్విజ కులాలకు ధారాదత్తం చేశాడు. ఇప్పుడు ఆ మనువు వారసులైన నేటి ఆధునిక మనువులు తమ ఆది గురువునే మించిపోయారు. అనుమానమా మీకు? అయితే, ఉన్నావ్ లైంగికదాడి బాధితురాలు, గురువారంనాడు లైంగిక దాడి నిందితుల చేత పెట్రోల్పోసి తగలబెట్టబడ్డ బిడ్డ తండ్రి ఆవేదన ఆలకించండి.. ''పెత్తందారీ కులానికి చెందిన వారు కాబట్టే నిందితులను బెయిల్ ఇచ్చి వదిలిపెట్టారు. కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. నిందితులకు బెయిల్ ఇవ్వకుంటే ఇలా జరిగేదే కాదు!'' - ఈ ఆధునిక మనువులు కులానికి ఆర్థికాన్ని కూడా జోడించి అణగారిన కులాలపై, ఆర్థిక బలహీనులపై విరుచుకు పడుతున్నారు.
నేరం ప్రధానంగా మానసిక వ్యవహారం. తాను చేయాలనుకున్న, చేస్తున్న నేరానికి దన్నుగా తన 'థర్మం' ఉన్నదని భావించిన వ్యక్తి, తన నేరానికి శిక్ష ఉండదనీ, ఉన్నా దానినుంచి తప్పించుకునే దారులు అనేకం తన కండ్ల ముందే పరచుకుని ఉన్నవనీ నమ్మిన వ్యక్తి ఎంతటి నేరానికైనా సిద్ధపడతాడు. అది లైంగికదాడి అయినా, హత్య అయినా సునాయాసంగా పని ముగించేస్తాడు. ఈ దేశంలో జరుగుతున్న హత్యలు, ముఖ్యంగా లైంగికదాడుల విషయంలో ఇదే జరిగింది, ఇప్పుడూ జరుగుతోంది. ఉన్నావ్ సంఘటనలో అది మరింత ప్రస్ఫుటమయింది.
మహిళలపై లైంగికదాడుల విషయంలో ఉన్నావ్కు ఇప్పటికే ఓ కిరాతక చరిత్ర ఉంది. సాక్షాత్తూ అక్కడి అధికార బీజేపీ ఎమ్మెల్యేనే కులదీప్ సింగ్ సింగార్ ఒక యువతిపై దారుణంగా లైంగికదాడి చేసి యావత్ దేశాన్నే దిగ్భ్రాంతికి గురిచేశాడు. అంతటితో ఆగకుండా ఆ బాధితురాలిని హత మార్చేందుకు ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీతో ఢకొీట్టించాడు. ఈ ఘటనలో బాధితురాలి సమీప బంధువుతో పాటు ఆమె లాయర్ కూడా మరణించారు. బాధితురాలు తీవ్ర గాయాలపాలై నెలల తరబడి ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రాణాల్ని దక్కించుకుంది. బాధితురాలి తండ్రిపై అక్రమ కేసు బనాయించి పోలీస్ లాకప్లోనే తన మనుషుల చేత చంపించాడు. ఇంత చేసినా ఇప్పటికీ శిక్షకు గురికాకుండా యథేచ్చగా తిరుగుతున్నాడు.
ఇప్పుడు ఈ దుర్మార్గులకు తమ ఎమ్మెల్యేనే ఆదర్శంగా నిలిచాడు. లైంగిక దాడి కేసులో అరెస్టయి బెయిల్పై బయటకు వచ్చిన నిందితులు ఎలాగైనా బాధితురాలిని అంతమొందించి తాము శిక్షనుంచి తప్పించు కోవాలనుకున్నారు. గురువారం ఉదయం లైంగిక దాడి కేసు విచారణ నిమిత్తం రారుబరేలీ కోర్టుకు తమ కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరిన బాధితురాలిని లైంగికదాడి నిందితులతో కలిసి ఐదుగురు దుర్మార్గులు బలవంతంగా పొలాలలోకి లాక్కెళ్ళి పెట్రోలు పోసి తగలబెట్టారు. నిలువెల్లా తగలబడుతూ దాదాపు కిలోమీటరు దూరం తనను కాపాడమంటూ పరుగెత్తి కుప్పకూలిపోయింది ఆ ఆడబిడ్డ. ఇప్పుడు 90శాతం కాలిన గాయాలతో కొన ఊపిరితో ఆసుపత్రిలో ఉంది. మహిళలపై లైంగికదాడుల విషయంలో 'యోగి' ఆదిత్యనాథ్ ఏలుబడిలోని ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. కాషాయం ధరించి, గోమాతను పూజించి, భారతమాతను భుజాలకెత్తుకుని ఊరేగించే యోగుల ఏలిక రాష్ట్రంలో ఇలా ఉంటే, ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చే మోడీ-షా సర్కారు కేంద్రంలో కొలువుదీరి ఉంది. ఇక కామాంధులకు, హంతకులకూ అడ్డేముంది? అదుపెక్కడుంటుందీ? చట్టం ఉన్నోడికి, బలమున్నోడికి, కులమున్నోడికీ చుట్టంగా మారిన వైనం మన చట్టసభలలోనే సాక్షాత్కరిస్తూ ఉంది. లైంగిక దాడుల నిందితులకు తమ పార్టీ టికెట్లు ఇచ్చి నానా అక్రమ మార్గాలలో వారిని చట్టసభల్లో కూర్చోబెడుతూ ఉన్న పార్టీలలో బీజేపీ అగ్రస్థానంలో ఉంది. గత ఎన్నికలలో లైంగికదాడి నిందితులు బీజేపీ తరపున పోటీ చేసినవారు 15మంది. వారిలో 10మంది గెలుపొంది ఇప్పుడు పార్లమెంటులో కొలువుదీరి ఉన్నారు. అలాగే, దేశంలోని గత అయిదేండ్లలో పోటీ చేసిన లైంగికదాడుల నిందితులు బీజేపీకి చెందినవారు 49మంది. వారిలో 13మంది గెలుపొంది శాసనసభల్లో తిష్ట వేసుకుని ఉన్నారు. లైంగిక దాడులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులు ప్రేరేపిస్తున్నాయి. కుల, లింగ, ఆర్థిక బేధాలకు అతీతంగా మనుషుల మధ్య ఒక మానవీయ సంబంధం ముడిపడకుండా అవి అనుక్షణం అడ్డుకుంటున్నాయి. వ్యక్తులు చేస్తున్న నేరాలకు వ్యవస్థ ప్రేరణగా నిలుస్తున్నప్పుడు ఆ వ్యవస్థను మార్చకుండా నేరాలను ఆపడం అసాధ్యం. కాబట్టి, ఇప్పుడు జరగాల్సింది నేరస్తులను కఠినంగా, సత్వరంగా శిక్షించడంతోపాటు వ్యవస్థను మార్చుకునేందుకు అడుగులు వేయడం. ఆ అడుగులు ఎంత బలంగా పడుతున్నాయన్న దానిమీదే మన ఆడబిడ్డల భద్రత ఆధారపడి ఉంటుంది.