Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గిరిజనుల రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు గురువారం ఇచ్చిన తీర్పు వారికి గోరు చుట్టుపై రోకటి పోటని చెప్పక తప్పదు. షెడ్యూల్డ్ ప్రాంతాలలోని ఉపాధ్యాయ ఉద్యోగాలలో గిరిజనులకు 100శాతం రిజర్వేన్లు కల్పిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 3ను ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం చట్టవిరుద్ధ మంటూ కొట్టి వేయడం గిరిజనులకు తీరని వేదన కలిగిస్తోంది.
జీఓ 3 ప్రాథమిక పాఠశాలల ఉపాథ్యాయులకు సంబంధించినది. ప్రాథమిక పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు స్థానిక గిరిజన తెగలకు చెందినవారైతే స్థానిక భాషలో చిన్నారులకు బోధింగలుగు తారని, భాష, సంస్కృతి, నివాసప్రాంతం ఒక్కటే కావడంతో ఉపాధ్యాయులు విద్యార్థులతో, విద్యార్థులు ఉపాధ్యాయులతో ఒకరినొకరు అల్లుకుపోయేందుకువీలై పసితనంలోనే మంచి భవిషత్కు పునాది పడుతుందనీ ప్రభుత్వం భావించి జీఓ 3ని తీసుకొచ్చింది. పాఠశాలల విద్యా ప్రమాణాలు గణనీయంగా వృద్ధి చెందుతాయనీ, గిరిజన పిల్లలు చిరుప్రాయంలోనే గిరిజనేతర సమాజంతో కలిసి ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ఉపయోగపడుతుందనీ ప్రభుత్వం ఆకాంక్షించింది. జీఓ 3 ఫలితాలను గిరిజనులు చవిచూస్తున్న స్థితిలో దానిని రద్దు చేయడం ఆదివాసీ సమాజానికి ఎంతో నష్టదాయకం. సుప్రీం కోర్టు ధర్మాసనం మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించరాదంటూ గతంలో తానిచ్చిన తీర్పును ఉదహరిస్తూ జీఓ 3 కొట్టివేసింది. షెడ్యూల్డు ప్రాంతానికి చెందిన, దేశంలోనే అత్యంత వెనుకబడిన గిరిజనులకు ఎంతో ఆలంబనగా ఉన్న ప్రభుత్వ ఉత్తర్వును కొట్టి వేస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఆందోళనకరం.
షెడ్యూల్డ్ ప్రాంతాలలో గిరిజనుల జీవనం ప్రత్యేకమైనది. వారికున్న వనరులు, అవకాశాలు, సదుపాయాలు మిగిలిన సమాజంతో పోల్చుకుంటే అత్యల్పం. కావునే, షెడ్యూల్డ్ ప్రాంత గిరిజనులు విద్యారంగంతో పాటు మిగిలిన అన్ని రంగాలలోనూ వెనుకబడిపోయారు. గిరిజనేతర ప్రాంతాలలోని సాటి రిజర్వేషన్ వర్గీయులతో సైతం పోటీ పడలేని దుస్థితి వారిది. తరతరా నుంచి పట్టిపీడిస్తూ ఉన్న అవిద్య కారణంగా సమకాలీన సమాజంతో కలిసి సమానంగా ముందుకు నడవలేక పోతున్నారు. ఈనేపథ్యంలో, షెడ్యూల్డ్ ప్రాంతంలోని గిరిజనులకు ప్రత్యేక రక్షణ చట్టాలు, రిజర్వేషన్ సదుపాయాలు అవసరమన్న ఆందోళనలు ఊపందుకున్నాయి. ఈ విషయమై గిరిజన సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు, ముఖ్యంగా వామపక్ష పార్టీలు సాగించిన ఉద్యమాల ఫలితంగా 1/70 చట్టం, జీఓ 3 లాంటి ఆదివాసీ అనుకూల చట్టాలను, జీఓలను ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. 1/70 చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు భూములు, ఇతర ఆస్తులను సంపాదించడం నిషిద్దం. అయినా, అదివాసీల అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని అడ్డంపెట్టుకుని, మరి కొందరిని బెదిరించి లొంగదీసుకుని ఆ గిరిజనుల పేరుతోనే ఉన్న భూములను తాము అనుభవిస్తున్నారు. చట్టవ్యతిరేకంగా ఎజెన్సీ భూములలో పాతుకుపోయారు. కేవలం ఆదివాసీలకు చెందాల్సిన భూములు, ఆస్తులను కాజేయడం కోసమే ఆదివాసీ మహిళలను వివాహమాడి తమ అవసరం తీరిన అనంతరం వారిని దారుణంగా మోసగించారు. అక్రమంగా ఏజెన్సీలోకి జొరబడిన గిరిజనేతర భూస్వాములు, కాంట్రాక్టర్లు, షావుకార్లూ అక్కడి కాంట్రాక్టులు సొంతం చేసుకుని, వ్యాపారాలు చేజిక్కించుకుని, భూములను ఆక్రమించి, అక్రమ నిర్మాణాలను సాగించి గిరిజనులను అన్నివిదాలుగా దోచుకుతింటున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 3 గిరిజనులకు ఎంతో ఉపయోగపడింది. జీఓ 3 ద్వారా షెడ్యూల్డు ప్రాంతంలోని స్థానిక విద్యావంతులు ఉపాధ్యాయ ఉద్యోగాలను సొంతం చేసుకుని లక్షలాది తమ ఏజెన్సీ ప్రాంత చిన్నారులకు అనువైన రీతిలో విద్యాబుద్ధులు నేర్పగలుగుతున్నారు. జీఓ 3 కేవలం కొన్ని ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఇది లక్షలాది భావి పౌరుల బతుకు సమస్య. ఆత్మన్యూనతా భావం ముసురుకున్న గిరిజన చిన్నారులు ఆత్మవిశ్వాసంతో ఎదిగేందుకు అవకాశం కల్పించే ప్రక్రియ. తమకన్నా ఎన్నో రెట్లు పెద్దదైన మైదాన సమాజాన్ని ఎలాంటి జంకూబొంకూ లేకుండా హత్తుకుని, దానితో సమానంగా అడుగులు ముందుకు వేసేందుకు అందివచ్చిన అవకాశం. మొత్తం షెడ్యూల్డు ప్రాంతానికి చెందిన ఆదివాసీల ఎదుగుదలను సృష్టిలో పెట్టుకుని ఆలోచించినపుడు జీఓ 3 కొనసాగడం అనివార్యం. అయినా సర్వోన్నత న్యాయస్థానం అందుకు అంగీకరించకపోవడం విచారకరం.
అణగారిన కులాలకు రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లు ఇప్పటికీ సక్రమంగా అమలు కావడం లేదు. పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటికైనా పాలకులు మానవీయ కోణంలో స్పందించాలి. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం సుప్రీం కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి. ఈ తీర్పు అమలు జరగకుండా స్టే ఆర్డర్ పొందేలా రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి.