Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వలస కార్మికులది మళ్ళీ తమ పనులు తమకు దొరుకుతాయో లేదో తెలియక ఆందోళన. చేతికొచ్చే రబీ పంట నోటికందుతుందో లేదో తెలియక రైతుల ఆందోళన. ఇన్ని బాధల్లో జనముంటే ఈ రిలయెన్స్ లేమిటి? సెల్ఫ్ రిలయెన్స్ లేమిటి?
ధర ఖర్వాటుండొక్కడు
సూర్యకర సంతప్త ప్రధానాంగుడై..
బట్టతలకలవాడు ఎండకి సూర్య కిరణాలను తప్పించుకోడానికి తాటిచెట్టు కింద నిలబడితే సదరు వ్యక్తి నెత్తిన తాటికాయపడి నెత్తి పగలడమే ప్రారబ్ధమంటాడు భర్తృహరి సుభాషితాల్లో! ఆ వ్యక్తి పోగేసుకున్న (సంచిత) కర్మల ఫలితమని, ఫలమనేది ధర్మఘోష!
చిన్న పిల్లల్ని మినహాయిస్తే నూటికి తొంభైమందికి పైగా భారతీయులు కష్టజీవులు. వారిలో 11కోట్ల మంది వలస కార్మికులు. నేడు వీరందరి బతుకులు అస్తవ్యస్త మవుతున్నాయి. ముఖ్యంగా వలస కార్మికుల బతుకులు చిన్నా భిన్నమైనాయి. ఇదంతా తమ సంచిత కర్మల ఫలితమని వారంతా భావిస్తున్నంత కాలం పెట్టుబడిపాలన సుస్థిరంగా, సువ్యస్థితంగా కొనసాగుతూనే ఉంటుంది.
''నేడు కోట్లాది కష్టజీవుల జీవితాలు ఆకలి మంటల నడుమ నిలబడ్డ తీరును మున్నెన్నడూ ఎరుగం. ఈ దౌర్భాగ్యపు భూగోళానికి చెంది ఉండటం తప్ప వారి పొరపాటేమీలేదు'' అన్నారు జానకీ నాయర్. వైవిధ్యభరితమైన మరో వైరుధ్యాన్ని చూడండి. తాము కారణం కాకపోయినా, తమ కారణం లేకపోయినా కోట్లాది మందికి నేడు ఉపాధి పోయింది. వలస కార్మికుల నోటికాడి బువ్వ లాగేయబడింది. ప్రస్తుత కారణం కరోనా! మరి వీరందరికీ తిండిపెట్టే బాధ్యతెవరిది? ఆ బాధ్యతను యజమానుల నెత్తికి నెట్టేసింది మోడీ సర్కార్. స్ట్రాండెడ్ వర్కర్స్ యాక్షన్ నెట్వర్క్ (స్వాన్) అనే స్వచ్ఛంద సంస్థ 86శాతం మంది కార్మికులకు యజమానులు వేతనాలివ్వలేదని తేల్చింది. లాక్డౌన్ లేకుంటే వీరు ఎవరి బతుకు వాళ్ళు బతికుండేవారు. వీరంతా రోడ్లపైకొచ్చి ''ఆకలి మంటల మలమలలాడే అనాథులందరు లేవండోరు!'' అని అంతర్జాతీయ గీతాన్ని ఈ ఆకలితో అలమటించేశారు. పాడుకోగలరా? ఈ వైరుధ్యానికి పరిష్కారం వేదాంతంలో లేదు. ఆర్థిక వ్యవస్థలో ఉంది.
దేశవ్యాపిత లాక్డౌన్ ప్రకటించేముందు రాష్ట్రాలతో మోడీ చర్చించారా? కనీసం తన మంత్రివర్గంలోనైనా వివరాలు చర్చించారా? దేశంలో వలస కార్మికులెందరున్నారో, కనీసం దేశ రాజధానిలో ఎందరున్నారో లెక్కలు తీసుకున్నారా? వానాకాలం వచ్చేముందు తిండిని మూపున కట్టుకుని తమ పుట్టల్లోకి ప్రయాణించే చలిచీమల్లాగా బిడ్డల్ని, సరుకు, సరంజామాని బుజాల కెత్తుకుని బారులు తీరిన వలస కూలీలు వందల మైళ్ళు ప్రయాణించి గమ్యస్థానాలు చేరుకున్నారు. ఊళ్ళు చేరిన వీరందరిన్నీ పోషించే మహారాజ పోషకులెవరున్నారు? వీరికి పోషణ ఉపాధి హామీ చట్టమేనన్న విషయం మోడీ ప్రభుత్వం ఆలోచించిందా?
కీలకమైన ఉపాధి హామీ చట్టం (రేగా) అమలు పరిస్థితి చూస్తే అత్యంత ఘోరంగా అఘోరించింది. 2019 ఏప్రిల్లో దేశంలో 1.7కోట్ల ఇండ్లకి రేగా ద్వారా పని ఇస్తే 2020 ఏప్రిల్లో 34లక్షల ఇండ్లకు ఇచ్చారు. అంటే 86శాతం తగ్గుదల. ఇది 2013 నుంచి ఏ నెలకైనా అత్యంత తక్కువ. ఈ 34లక్షల్లో 20 లక్షలు కేవలం ఏపీ, చత్తీస్ఘడ్ రాష్ట్రాలే! దేశంలోని మొత్తం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 34కు గాను 19లో మాత్రమే పదివేల కంటే ఎక్కువ ఇండ్లకు ఉపాధి హామీ పనులిచ్చారు. మన ఘనత వహించిన కేసీఆర్ రాజ్యంలో ఎన్ని ఇండ్లకిచ్చామనే లెక్కే మెయింట్యిన్ చేయలేదు.
2014-15 నుంచి మోడీ సర్కార్ ఉపాధి హమీ చట్టానికి కోతలు పెడుతూనే ఉంది. తాజా బడ్జెట్లో అంతకుముందు బడ్జెట్ రివైజ్డ్ అంచనాలకంటే 13శాతం కోత విధించారు. దాని ఫలితమే పైలెక్కలు. మరి ఇన్ని కోట్ల మంది వారి వారి గ్రామాలకు తిరిగి వెళ్ళిన తర్వాత వారి పోషణ ఎలా? విపత్తుని కూడ పెట్టుబడిదారులు ఎలా వాడుకుంటున్నారో చూస్తే జుగుప్సాకరంగా ఉంటుంది. పెట్టుబడితో ప్రత్యక్షంగా సాగిన పోరులో మే నెలకున్న ప్రాధాన్యత మనకు తెలియంది కాదు. పని గంటల తగ్గింపుతో ప్రారంభమైన పోరాటం అనేక హక్కుల సాధన దిశగాసాగింది. మేనెల్లోనే 10/12 గంటల పని దినం చర్చ దేశంలో జరగడం యాధృచ్ఛికమే అయినా అది ఒక నిజం. హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టి వేదాల్ని పాతాళంలో పడేసే ప్రయత్నం చేస్తే వరాహావతారంలో విష్ణువు వచ్చి దాన్ని కాపాడుకున్నాడని పురాణ కథ. పురాణం ఎలా ఉన్నా, కార్మిక చట్టాల న్నింటిని 4 కోడ్లుగా మార్చివేసే అభినవ హిరణ్యాక్షుల్ని కార్మికో ద్యమం వరహాలుగా మారి కడతేర్చే సమయమాసన్నమైంది.
అమెరికా తన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి 2లక్షల కోట్ల డాలర్లు, జపాన్ 1.9లక్షల కోట్ల డాలర్లు ప్రకటిస్తే మనదేశం మన జీడీపీలో 0.81శాతం ప్రకటించింది. పనిలోపనిగా అస్మదీయులు బాబారాందేవ్, మోహుల్ చోక్సీ, అదానీ లాంటివారి బ్యాంకు బకాయిలు 63వేలకోట్లు రద్దు చేసింది మోడీ సర్కార్.
తమ జీవితాలేమవుతాయా అని కష్టజీవుల ఆవేదన, ఆందోళన! ముందు మోడీ, ఆ వెంటనే ఆరెస్సెస్ అధినేత మోహన్భగవత్ ఇద్దరి ఉపన్యాసాల్లోనూ సెల్ఫ్ రిలయెన్స్ (ఆర్థిక స్వావలంబన) గురించి మాట్లాడిన ఉద్దేశమేమిటో..! అంతా 'రిలయన్స్' మయం అవుతున్న నేపథ్యంలో ''సెల్ఫ్ రిలయెన్స్'' ఏమిటి? ఉద్యోగులు తమ జీతాల్లో పెట్టిన భారీకోతల గురించి ఆందోళన పడుతున్నారు. ఫ్యాక్టరీ కార్మికులు కార్మిక చట్టాల సవరణల గురించి ఆందోళన పడుతున్నారు. కొరియర్ బార్సు, జమాటో, స్విగ్గీలు తమ బతుకెలా వెళ్ళదీస్తుందో అర్థం కాక ఆందోళనలో ఉన్నారు. వలస కార్మికులది మళ్ళీ తమ పనులు తమకు దొరుకుతాయో లేదో తెలియక ఆందోళన. చేతికొచ్చే రబీ పంట నోటికందుతుందో లేదో తెలియక రైతుల ఆందోళన. ఇన్ని బాధల్లో జనముంటే ఈ రిలయెన్స్ లేమిటి? సెల్ఫ్ రిలయెన్స్ లేమిటి?