Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొద్దుట నుండీ కాలుకాలిన పిల్లిలా మీసాల రాఘవయ్య... ఇంట్లోకి వీధిలోకి తిరుగుతూ... గడియారం వంక లాండ్లైన్ ఫోన్ వంక చూస్తూనే పచార్లు కావిస్తూంటే గమనించిన ఇంటి మాలక్ష్మీ సీతమ్మ వడివడిగా వచ్చి.. ''టేబుల్ మీదపెట్టిన కాఫీ గమనించకుండా ఏమిటా పచార్లు'' అని కొంచెం హెచ్చు స్వరంతో ఎదుటపడగానే... తమాయించుకుని ''అది కాదే ఈ పూట అబ్బాయి హైదరాబాద్ నుండి సరళమ్మ పిల్లల్ని తీసుకొస్తాడు కదా అని చూస్తున్నా.. ఆ సరే ఆ కాఫీ యివ్వు తాగిపెడ్తా''...
''చాల్లేండి సంబడం బస్సుకు బయలుదేరి వస్తే ఇంటి ముందే దిగుతారాయె. అల్లుడు గారి కారైతే గుమ్మం దాక వస్తుందాయె... మీకా చాదస్తం ఎక్కువ... కాఫీ వెచ్చబెట్టి యిస్తా అలా అరుగు మీద వాలు కుర్చీలో కూర్చోండి. ఓహౌ ఇవాళ పేపరు చూడుకుండా ఇలా పచార్లు చేస్తున్నారన్నమాట చదవండి''.. అని చేతికిచ్చి వంటింట్లోకి వెళ్ళింది
వంటింట్లో గంటలు మోగాయంటేనే... చాలు భోజనాలు రెడీ అనే సంకేతం.
కాపురానికి వచ్చినప్పటి నుండి అలవాటే. ఈ తతంగం గత నలభై ఏళ్ల ఆనవాయితీగా అత్తగారి వద్ద వకాల్తా పుచ్చుకుంది. అందరు భోజనాల టేబుల్ వద్ద హాజరు. మెడిసిన్ చదివే మనువరాలు ఇంజనీరింగ్ చదివే మనవడు మామయ్య, తాతయ్యతో... వాళ్ళకిష్టమైన శనగ గుండ్లు బెండ వేపుడు ములక్కాయ సాంబారు అప్పడాలు... సిద్ధం.. పాడి పంటలున్న కుటుంబం కాబట్టి గడ్డపెరుగు వెన్నపూస లభ్యం...
తాతయ్య గదిలో చేరి ''ఏమైనా పాతకాలపు కబుర్లు చెప్ప'' మంటూ ఇద్దరు మనవళ్ళు శ్వేత, మనీష్ అడిగారు. కొడుకు రాజశేఖర్ వాళ్ళకి వంత పాడాడు.
''మీ తాతయ్య దగ్గర ఎన్నో కథలు కవితలు డ్రాయింగ్ చిత్రాలు వున్నాయర్రా''..అంటూ సీతమ్మ చేరింది మరింత వత్తాసు పలుకుతూ....
''చెప్పండి తాతయ్యా'' అంటున్న వాళ్ళ ముందు తను గీసిన డ్రాయింగ్ పుస్తకం అందించాడు ''జాగ్రత్త.''.. అంటూ...
ఆ బొమ్మల చిత్రీకరన నేపథ్యం ఏమిటో తెలియ పరచడానికి తానురాసిన ''జ్ఞాపకాలసోది'' కవితల పుస్తకాన్ని వాళ్ళ ముందు పెట్టాడు రాఘవయ్య. మొదటిసారి అరక పట్టినప్పటి అనుభవాన్ని చెబుతు అప్పటి పెద్దపాలేరు పుల్లయ్యతో వున్న బంధం గుర్తుచేసాడు. మొదటిసారి నాగేటి కోండ్ర వంకరొచ్చిందని, వెనుక అరక దున్నుతున్న పాలేరు పుల్లయ్య గుచ్చిన ముల్లు కర్ర వలన, పిర్రకు గడ్డై రెండు రోజులు ఇబ్బంది, మా పుల్లయ్యను చూసినప్పుడల్లా యాది కొస్తాంటది. ఇప్పుడా పుల్లయ్యకు 88 ఏళ్ళు. నాకు 61 నిండి 62లోకి ఆడుగేసా... అలాగే ఎడమ కాలికి తగిలిన దెబ్బ తాలూకు గుర్తు ఇదిగో అంటూ చూపాడు.
''మొదటి సారి దమ్ము చేలో పారతో దుగ్గాలు చెక్కుతూంటే, తడి పార జారి ఎడమకాలి మడమ శీలతో సరసమాడితే దమ్ములో రక్తపు బురద, కలబంద కట్టుతో, రెండు రోజులు పనికి నాగా. కాసేపు పారని, దుగాన్ని తిట్టుకుని పనిలో జాగ్రత చాల అవసరమని తెలుసుకున్నా. పరధ్యానంగా వుంటే అవాంతరాలే కాదు, ప్రమాదాలు తప్పవని తెలుసుకున్నా!'' అని చెప్పాడు.
''వ్యవసాయంలో ఇన్ని కష్టాలుంటాయా'' అని వాపోయారు పిల్లలు.
''కుర్రకారు వయస్సులో ఎచ్చులు పోయి, చేతకాని పని చేస్తే ఏమవుతుందో తెలుసా'' అంటూ
''ఇంకో అనుభవం ఇలావ యసుకు నెచ్చలి, ఉచ్చిలి, ఉచ్చిలి కాకపోతే యేమిటి.. వెంకటచారి యింట్లోకి వెళ్ళినపుడు పెద్ద పనివాడిలా నేను బాడిశ తీసుకొని మేడిని చెక్కడం మొదలేసా. చెక్కిలిపై ముద్దులా (నఖక్షతాల చందంగా) అరచేతి బొటన వేలుతో సరాగ మాడితే కళ్ళల్లో నీళ్ళు, కుయ్యోమంటూ కీచ గొంతు సంగీతం. 15-16 యేండ్ల యెచ్చిడి కదా! ఆ వయసులో దూకుడు తప్ప మెలుకవలు తెలీయవు కదా''. నా కంగాళీకి పరిగెత్తుకొచ్చి ''అబ్బాయిగారు మీకెందుకీ పని'' అని గద్దిస్తూనే, గబగబా కట్టిన ఆకు పసరు మంట నషాలానికెక్కింది. ''పనిలో మెలకువలు నేర్చుకోకుండ, తగుదునమ్మా అని తల దూరిస్తే, యిదుగో యిలాగే శాస్తి జరుగుతుంది. ప్రతిభ, ఉత్పత్తి, అభ్యాసము లేకపోతే, యే కళ అబ్బదు. వెంకటాచారి యెన్నేళ్ళుగా వాళ్ళయ్య దగ్గర నేర్చుకుంటే వచ్చిందో పనితనం. నేర్వకుండా తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరమన్నట్లు అయింది. అరక పనికి రెండు రోజులు కుంపు పెట్టా, నాన్నగారి చివాట్లు తిన్నా.''
''తాతయ్యా నీ అనుభవాలు మాకుచాల ఉపయోగపడతాయి సుమా. ఇంకాచెప్పు'' అనడమే తరువాయి రాఘవయ్య అగుతాడా, ఎరువుల బండి వేసవి తోలకం అంటూ, మరో అనుభవం వాళ్ళ ముందుపెట్టాడు.
''ఒక సారి యేమయ్యిందంటే రోహిణీ కార్తె వచ్చీ రాగానే పొలానికి ఎరువు తోలటం తప్పనిసరి. నాన్న బండి ముందు, నేను బండి మీద సరిగా నారుమడి దగ్గిరికి రాగానే బండి రోజా దుగం యెక్కింది కామోసు, ఒరిగి ఎరువు నేలపాలయినప్పుడు, నేను యేడుపు లంకించుకున్నాను. నాన్న అదలించినందుకు కాదు, కడిగట్టు మడిలో ఎరువు చిమ్ముతున్న నరసమ్మ నన్ను చూసి పక్కున నవ్వినందుకు!''
''దాని మొహం కుర్రాళ్ళని చూస్తే అది అంతేలే ఇంకా నయం రోడ్డు మీద బండి పడలేదుగా'' నాన్న మాటలు వింటూ, పొలంలోనేగా, చిమ్ముకుంటె సరిపోద్ది. చీమిడి చీదుకుని, నరసమ్మ కేసి కోపంగా చూస్తూ ''మా పొలం పనికొస్తావుగా అప్పుడు చెప్తా నీ పని'' అనిసైగ చేస్తూ పార అందుకున్నా.
''మొగుడు కొట్టినందుకు కాదు, తోటికోడలు నవ్వినందుకు అన్న నా బాధలాంటిదే అని అవగతమయ్యింది. తపన పడటం సహజమే, తప్పటడుగు నివారణే ముఖ్యం!''
''సరే తాతయ్యా నువ్వెంతవరకు చదువుకున్నావు. ఎక్కడ సాగింది విద్యాభ్యాసం'' అనే ప్రశ్నకు కాస్త తటపటాయించినా ''చెబుతానర్రా. నాదంతా ఒడుదుడుకుల చదువు. ఏఖండీగా సాగలేదు. ముక్కలుముక్కలుగా సాగింది. దానిని ఇలా రాసుకున్నాను'' అంటూ చదవడం మొదలెట్టాడు
''యెవరునమ్మినా, నమ్మకపోయినా గత స్మతుల యవనికలో దాగున్న చిన్న రహస్యం, నా అక్షరాల దూకుడుకు నేపథ్యం యెన్నో మలుపులు తిరిగింది. పదో తరగతి అర్థాంతరంగా మానేసి, అది ఎందుకు ఆగిందో తరువాత చెబుతా. ప్రైవేటు చదువుల ప్రస్థానం. మెట్రిక్ నుండి స్నాతకోత్తర విద్య వరకు కాలేజి తెలియదు, రాగింగ్ తెలియదు, మార్క్స్ని చదవాల్సి రావడం వల్ల అప్పట్లో ప్రైవేటుగా వెలగపెడ్తున్న ఎం.ఏ (తెలుగు) చదువు కుంటుపడింది. ప్రీవియస్ సీరియస్గా చదవలేదు. మార్కులు తక్కువే వచ్చాయి. ఎందుకంటే చందో వ్యాకరణాలు సందు యివ్వని కారణంగా వెనకబడినా, ఫైనల్ పరీక్ష నా వెనుక బడింది. చాల యిష్టంగా నాటకాలాడటం చేతనో, చిన్నప్పుడు తాతయ్యగారి వద్ద తెల్గు శతక పద్యాలు వల్లెవేయటం వల్లనో, పల్లెటుర్లో రాత్రుళ్ళు మన యింటివద్ద గ్రామీణులు చిరుతల రామాయణం ఆడటం వల్లనో, ఐచ్చిక ఆంశాలైన నాటకాలు, శతకాలు, జానపద గేయాల పత్రాలలో తొంభై సగటు మార్కులు వచ్చీ పాసయ్యా అనే కోపం యిప్పటికీ తగ్గలేదు. ఐనా తెలుగులో పట్టు నాకు వుంది అని అనుకుంటే కేవలం చిన్నప్పటి తాతగారి ఉద్బోధలే కారణం పునాది. చందస్సు వంటపట్టకపోయినా ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠపు సహచరుల్లో కొంపెల్ల రామకష్ణ ప్రయోగించిన మాత్రా చందస్సు ఆకర్షించింది. రేగడిమిల్లి సత్యమూర్తి వచన కవిత్వ ధోరణి మరో ప్రేరణనిచ్చింది. వచనంలోనూ మాత్రల పోకడలు అందుకే కనబడతాయి. కేవలం సరదాగా చదివిన చాత్ర స్నాతక విద్యకూడ దూరవిద్యే అయింది. అందుకు మాత్రం కాంటాక్ట్ క్లాసులు విజయవాడలో సెవెంత్ ఎడ్వెంచర్ స్కూల్ వేదికయ్యింది. 85 శాతం యువకుల మధ్య ఆ 15 శాతం పెద్దవాళ్ళలో నేనొకడ్ని.
ఇంతకీ యీ సోదెందుకంటే గత నెలలో (జనవరి31 న) నా చిన్నప్పటి అక్షరాభ్యాసపు చాయాచిత్రం (నలుపు-తెలుపు) కంటపడింది. కాని శిథిలావస్థలో యెవరెవరున్నరో గుర్త్రు పట్టలేనంతగా. అది మదరాసులో 1957 లో తీసినది. నాకు తెలిసిన వారి చిరునామా అంది పుచ్చుకుని ఫోను చేసి మరీ వివరం రాబట్టాను. చిక్కుముడి వీడింది. ఇద్దరు ఉద్దండులు నా చేత పలకను అక్షీకరింపచేసారట! ఒకరు రెండు శ్రీల కళ్ళజోడు (శ్రీశ్రీ) మరొకరు ఇది మల్లెలవేళయని ముందే కూసిన కోయిల (దేవులపల్లి) పట్టరాని ఆనందం ''లోకం బాధ తన బాధ చేసుకొన్న'' దొకరు ''తన బాధను లోకానికే బాధను'' చేసిన మరియొకరు! అందుకే నవ్య నవనీత సమానమైన పదాల కూర్పుతో పాటు దారుణాఖండల శస్త్రతుల్యమైన తీక్షణ విప్లవ భావాలు సమాంతర కవిత్వానికి ప్రేరణై నన్నిలా నిలబెట్టాయి ''తలచుకుంటేనే చెప్పలేని అనుభూతి నా కంట చెమ్మగా... కేవలమిప్పుడు ఒక జ్ఞాపకాల యాదిగా మిగిలింది!''
''ఈ బొమ్మ గురించి చెప్పలేనిపుడు'' అనగానే ''పర్వాలేదు పిల్లలు అర్థం చేసుకుంటారు కాని మిమ్మల్ని అనుమానిం చరులెండి'' అని సీతమ్మ భర్తకు ధైర్యం చెప్పడం, వలన తనపాత ప్రేమకథ తాలుకు గాయాలను చెప్పసాగాడు.
మది గదిలో పదిలపర్చుకున్న యాదుల్లో విషాదపు గుర్తులూ వున్నాయి. ఉరకలెత్తే వయసులో కొత్తగా సాగదీసిన కోడె గిత్తలతో కచ్చడం బండి సవారీ ఓ సాహసమే. మువ్వల పట్టెళ్ళు, తొట్టిగడలకు నగిషీలు, శిరలకు గజ్జెలు, ఎర్రనూలు పలుపులు రంజైన చెర్నకోల. శివరాత్రి తిరునాళ్ళకు ముస్తాబు చేసి నీలాద్రి గుట్టలకు బయలెల్లాం. దారంతా చిక్కని ఆడవి.
నా అమలిన శృంగార నాయికతో సరదాగా తిరునాళ్ళ పయనం కలిసొచ్చిన అదృష్టం. తిరుగు ప్రయాణంలో బండెక్కింది. ఖాళీగా వున్న నా గుండెలో దూరింది. ఇంటిదారి యావలో బండి వేగం పుంజుకోవటం సహజమే. అంతలో మేఘావతమైంది ఆకాశం, ఉరుములు - మెరుపులు. ఉలిక్కి పడటాలు, దగ్గరకు రావడాలు కనిపించని కాలనాగులా కారు చీకటి, బండి వాగులోకి దిగుతున్న అలికిడి స్పష్టం. అదాటుగా బండి రోజా బండరాయెక్కటం వాగులో బోర్ల పడటం, ఉధతంగా పారుతున్న వాగునీరు బండిలోకి ప్రవేశం ఓక్కసారే జరిగాయి.
బండిలోంచి జారుతున్న చెలియ, అందున్నా చెరగును చెలియ తప్పిపోయింది. నీటిలో కొట్టుకు పోయిందేమొ చీర కొంగే మిగిలింది. రెండు దినాలు వెతుకులాట. దినదిన గండంగా గడిచింది. ఆచూకి లేదు. ఆత్మన్యూనతతో కుదేలైన మనసుకు నచ్చచెప్పుకోలేక, కొద్దిపాటి ప్రేమానుభూతిగా మిగిలిన కొంగు పదిలంగా దాచుకోటం తప్ప. ప్రతి శివరాత్రి గుచ్చుకుంటుంది తీయని బాధగా.
''ఇక ఇంకో కథనం చూద్దాం'' అంటూ ''అది వూరికి కరెంటూ లేని రోజుల్లో బావి కింద వ్యవసాయం ఎలా చేసామో చెబుతా పదండి పొలం వద్దకు వెడదాం'' అంటూ పిల్లల్ని పొలం వద్దకు తీసుకెళ్ళాడు రాఘవయ్య. అరఫర్లాంగు దూరంలోనే వుంది. బావి వద్దకు చేరుకోగానే కథనం చెప్పసాగాడు రాఘవయ్య ఇలా....
''1969 సంవత్సరంలో మోట తొలే తొలి రోజులలో నేనే పోటుగాడిననుకునేవాణ్ణి. గట్టుమీది వ్యవసాయమనే అపప్రథ తొలగేలా, ముక్కున వేలువేసుకునేలా బాపన సేద్యం సత్తా చూపించగలిగాం, యెవరికీ తీసిపోమని నాన్న నేనూ. ఒకరోజు ఆయన, మరో రోజు నేను ఒకరు మోట తోలితే, ఇంకొకరం మడవలకు నీళ్ళు తిప్పేవాళ్ళం. మిరప మొక్కల్లో గొర్రు తోలటం, బోదెలు వేయటం చెరోసారి పంచుకునే వాళ్ళం, చుట్టు పక్కల ఊళ్ళకు సేద్యంలో మైలురాయి మా నాన్నే. ఓ ఐకాన్ ఆయన. ఆ రోజుల్లోనే కొత్త వంగడాలు, ఆధునిక పద్ధతులు ప్రవేశపెట్టిన ఘనత ఆయనదే!
నేను మోట తోలుతుండగా, బొక్కెన తొండం తాడు తెగింది, పైకి వచ్చిన బొక్కెన దిగ్గున కిందకు జారటం వెనక్కి నడిచే వేగానికి, నేను గాడిలో పడటం, తెలివైన కర్రెద్దు (నల్లఎద్దు) చటుక్కున ఆగి, యెల్లెద్దు (ఎర్రఎద్దు) కాడిని నేలకు వంచింది. రాబోయే విపత్తును పసికట్టి - నన్ను కాపాడినందుకే కర్రెద్దు కాలి విరిగింది. అది అరిచిన అరువు నా గుండె అదిరింది. బావిలో పడేవాణ్ణి ఆదుకుని తనకు ఆపద తెచ్చుకుంది. (దరిమిలా తన కాలు పోగొట్టుకుంది) ఎత్తుబడిన కర్రెద్దు నెల తిరక్కుండానే, బావొడ్డునే సమాధిగా చేసుకుంది. ముక్కోటి యేకాశొచ్చినప్పుడల్లా ముక్కు మూసుకున్న కర్రెద్దు అరుపే నా మనసును కెలుకుతూ వుంటుంది. దాని త్యాగం వల్లనేగా నేను బతికి బట్టకట్టింది. అది గతించిన తరువాత మోట మారి, కరెంటు మోటరు పెట్టుకున్నాం. మా వూరికి కరెంటు వచ్చిన 1972లో.
''వ్యవసాయపు రోజుల్లో మరో అనుభవం. చేతికి జెట్ట అవటం. అదో అనుభవం. అదెలా అంటే'' అంటూ మరో అంశం చెప్పసాగాడు రాఘవయ్య ఇలా ''తనకుమాలిన ధర్మం, మొదలు చెడ్డ బేరమని యెందుకన్నారో కాని నా పాలిట నిజమైంది! ''16 పళ్ళ దమ్ము నాగలితో వద్దండి అబ్బాయిగారూ'' అన్నా వినకుండా పక్క మడిలో సాలిరవాలు దున్నుతున్న అరకనాపి తగుదునమ్మా అని గొర్రు తోలాను. రెండు మూడు సాళ్ళు అయి నాలుగో సాలొచ్చినప్పుడు ఆదమరిచి వున్నానేమొ మేడి చివర నున్నపేడు కసుక్కున గుచ్చుకుంది గొర్రు వదిలేసాను. ఎడ్లు దూసుకూంటూ వెళ్ళీ నారుమడి నాశనం చేసాయి. తిట్లు చీవాట్లు. గుచ్చుకున్న పేడు ఊరికే లేదు పంగ జట్టయింది. యెత్తిన చేయి దింపే పని లేదు. నిదురపోతూ చేతులెత్తే అసెంబ్లీలో ఎం.ఎల్.ఏ. లా.. ఒకటే సలుపు - వాపునాటు వైద్యం పేరుతో శ్రావణంలో రుబ్బున గోరింటాకు మరీ దిట్టంగా పట్టించా తగ్గిపోతుందని చెబితే. రెండు రోజులయినా తగ్గలేదు, అరచేయి యెర్రగా పండింది గాని, బాధ తట్టుకోలేక ఆరు మైళ్ళ దూరములోనున్న ఎర్రగుంట ఆసుపత్రికి పరుగెత్తుకెళ్ళా నాన్నతో. డాక్టరు తిట్టిన తిట్టు తిట్టకుండా, మొట్టికాయలేసినంత పనిచేసాడు. పదహారేళ్ళ కుర్రాడినే కదా!'' మైదాకు వల్ల చర్మం మందమైంది. ముందు మాత్రలు వాడు. రెండో రోజుకు పాకానికొస్తుంది, కోసి బాధ తీసేస్తా''నన్నాడు!
కిలో తూగింది చీము రసి చూసేసరికి కళ్ళు తిగి బైర్లు కమ్మింది చూసినందుకు దానికి మళ్ళి ఉపశమనాలు అరగంటకి కాని తేరుకోలేదు! మచ్చ మాత్రం ఇప్పటికి మిగిలే వుంది. నా నిర్వాకానికి గుర్తుగా!
''ఇన్ని కష్టాలు పడ్డారన్నమాట'' అని మనవళ్ళిద్దరూ ఓకేసారి అన్నారు
బావితోట ఆనుకునే వాగుదాని పక్కనే చెరువు అలుగు చూపిస్తూ ''ఇక్కడో వ్యవహారముంది సుమా'' అన్నాడు రాఘవయ్య. ''చెరువు అలుగు పడ్డప్పడు వాగులోకి అలుగు పారుతుంది. అప్పుడు వాగులోని చేపలు చెరువులోకి ఎదురు ఈదుతాయి. ప్రకతి సహజం'' తరువాయి కథనం చెప్పసాగాడు రాఘవయ్య ''అది చేపల వేట. చెరువు అలుగు పారిందంటే ఆనందమే ఆనందం, పారే నీటిని చూచికాదు, జలపాతంలా వాగులోకి దూకే నీట నుండి చెరువులోకి ఎదురీదే చేపల్ని చూచి. ప్లాస్టిక్ సంచి ఓక చేత్తో ఎదురొచ్చే చేపను మరోచేత్తో పట్టుకోవటం సరదా, సంచి బరువెక్కగగానే మా మోటబావిలో వదిలెయ్యటం నాచును శుభ్రపరుస్తాయి కదా వాటికదే మేత కూడ. ఈదేటప్పుడు కాళ్ళకు చుట్టుకు పోతుంది. ఇప్పుడా బెడదా తీరుతుంది కదా. నా చేపల వేటకు కురమోళ్ళ ముత్తయ్య, చాకలి కిట్టప్ప సావాసగాళ్ళు. అప్పుడే బీడి, చుట్ట అలవాటయింది. అదే పనిలో వుండగా ఒకసారి చురుక్కుమని గుచ్చుకుంటే పట్టిన చేపని వదిలేసి ''యేందిరా అది'' అన్నాను ''ఓసోసి అది జల్ల చేప కదూ దానికి ముల్లుంటది భలే కుట్టుద్ది...'' నవ్వుతు చెప్పాడు కిట్టప్ప. 'ఇకిలించింది చాలు మంటకెత్తి నేనుంటే కసుర్కున్నాను'. ''కరణపోరి వళ్ళు బహు నాజూకు కదా ఊరుకో కిట్టిగా మనలా వోర్చుకోలేరు, కాసేపు ఆగితే నెప్పి తగ్గుద్ది'' పెద్ద ఆరిందాలా సముదాయించాడు ముత్తయ్య. బురద మట్టనుకుని దాక్కున్న దాన్ని దొరకపుచ్చుకుంటే జల్లయిచ్చింది. ''పట్టీనప్పుదు కుట్టిన ముల్లు యింత నెప్పి కదా మరి ముళ్ళున్న చేప ముక్క అంగిట్లో పడితే... సందేహం ముద్ద మింగలేక ముల్లు బయటకు రాక యెలారోరు'' యధాలాపంగా పైకే అనేసాను. విరగబడి నవ్వడం ముత్తయ్య వంతయింది! ''నన్నన్నావే నువ్వికలిస్తావేం, వారికి తెలీయదు కదా. చెప్పొద్దూ... చేపలు రుద్దేటప్పుడు కొంత ఇక తినేటప్పుడు మరీ చూసుకుని తింటామని చెప్పిచావు!'' అన్నాడు కిట్టిగాడు నోరెల్లబెట్టి వినడమే కదా నా పనయింది ''ఎంతసేపు సరదాగా వాటిని పట్టడం బావిలో వేయటం. నాచు తిని బాగా యెదిగిన వాటిని చూచి మురిసిపోవడం! నాచులేని బావిలో మిట్ట మధ్యాన్నం వేళ తోట పనైంతర్వాత గంటా రెండు గంటలు బాగా ఆకలయ్యే దాక యీదటం అదేగా నాకు వింత అనుభూతి, ఆనందం ఆటవిడుపు! కూలిపోయిన మా మోటబావిని చూసినప్పుడల్లా చేపలవేట, జల్లచేప ముల్లు గుర్తుకొస్తుంటాయి.'' అంటూ ముగించాడు. ఇక యింటికి వెడదామా. రేపు పొద్దున్నే హైదరాబాద్ ప్రయాణం వుంది కదా. భలే గడిచాయి ఈ వారం రోజులు అనగానే ''అదికాదు తాతయ్య నీ నాటకాల సినిమాల లలో ఏదో దాగుందిగా ఆ బొమ్మల్లో ఆఖరిదదేగా'' అని మనువడు ప్రశ్నించాడు.
''ఆ సినిమా పిచ్చి గురించి పోతపోతూ చెబుతా పదండి'' అంటూ సంభాషణం కొనసాగించాడిలా ''చిన్నప్పుడు సినిమా వేషాలంటే తెగ పిచ్చి. ప్రాథమిక స్కూల్లో వేసిన నాటికల మెచ్చుకోళ్ళు, హైస్కూల్ స్థాయికి ముదిరింది. దాని కోసం అప్పుడేం చేసానో యిప్పుడు గుర్తుకొచ్చినప్పుడు చచ్చేంత సిగ్గవుతోంది బాధ నలుపుతోంది. చేసిన పాపం చెప్పితే కొంత ఉపశమనం కదా. ఇంట్లోంచి వంద కాగితానికి రెక్కలు పెట్టాను యెవరికి చెప్పకుండా, స్కూలుకు డుమ్మా కొట్టి రైలెక్కేసాను. రాజమండ్రి నుండి రైలెక్కి బెజవాడలో దిగాను. ఇక్కడ చదువు సాగదని అప్పట్లో నన్ను అక్కడ వుంచారు చదువు బాగా వస్తుందని. బిక్కుమంటూనే రాగిణి పిక్చర్స్ కాళేశ్వరావు మార్కెట్లో ఎవరైనా చూస్తారేమోనని ఠక్కున దూరి, ఓ పది రూపాయలకు ఫారం కొని పూర్తిచేసి, స్టేషన్కు తిరిగొచ్చి, ప్లాట్ ఫారం మీద 'హమ్మయ్య' అని కూలబడ్డా.. అప్పుడే హీరో నైనంత సంబడంతో. ఆ సంబరం రెండు నిమిషాలే. గ్రహచారం బావుండకపోతే.... యేదో అన్నట్లు ఇంకోడెవడో యిల్లొదిలి పారిపోతే ఉరుమురుమి మంగళం మీద పడ్డట్టు అనుమానం నా మీదకొచ్చి పడ్డది. అప్పుడే వచ్చిన రైలు యెక్కుతున్నానో లేదో యెవరో బలంగా నా జబ్బ పట్టుకుని కిందకు లాగారు - తీరా చూద్దునుకదా రైల్వే పోలీసు - ఇక లాకప్పు ఓ కప్పు టీ - చిన్న లాఠీ మామూలేగా వేరే చెప్పాలా యెంతో ప్రేమతో యింటికి తీసుకెళ్ళాడు నా మట్టిబుర్రకి అందితే కదా పోలీసోడి యెత్తు, యింత తిండి పెట్టి - పడుకో పొద్దున్నే రైలెక్కిస్తా అన్నాడు కదా. యెంత మంచోడో అనుకున్నాను. అర్థంకాని బాల్యం కదా! పగలంతా నిలబడి సొక్కి పోయానేమో. కుక్కి మంచంలో కూలబడ్డాను. వల్లంతా దెబ్బలకి పులిసిందేమో నిద్రముంచింది. రాత్రివేళ యేదో పక్కన చేరుతున్నయేదో చేస్తున్న భావన కళ్ళు తెరిచే సరికి రాక్షసుడిలా నన్ను చెరిచిన సలపరింత. పెళ్ళాం లేని యెదవ ఆ (ప్ర)తాపమంతానా మీద చూపాడు. యెవరికి చెప్పలేను. యేం జరిగిందో అప్పుడు తెలియదు బహుశ: రాక్షస రతి అంటే అదే కామోసు. నరకం చూపించాడు. వారించలేని బాలుడ్ని - బలహీనుడ్ని నోరెత్త లేనివాడ్ని - తెల్లవారుతుండగా మళ్ళీ యెక్కడ మీద కొస్తాడేమోనని స్టేషను వైపు పరుగు లంకించుకున్నాను. ఆ సంఘటన నా చదువును నాశననం చేసింది. ఒక పీడకలగా, పెద్ద చేదు అనుభవంగా మిగిలింది. సినిమా వేషం తీరకపోయినా నాటకాల సరదా తీరింది !!!....
కాబట్టి అపరిచి తవ్యక్తులతో చాలా జాగ్రత్తగా వుండాలి'' కథనం ముగింపు యిల్లు చేరిక జరిగాయి.
రెండోసారి కోడికూయటం, ఊళ్ళో రామాలయంలో సుప్రభాతం చెవులకు సోకటం ఏకకాలంలో జరుగుతుంటాయి. ఒక్క నిముషం తేడా రాదు. సీతమ్మ లేచేదపుడే. ఇల్లు ఊడ్చి కళాపి చల్లడానికి. రాఘవయ్యగారు పశువుల పాకలో గేదెలకు, ఎడ్లకు మేత వేయడం, కాలకత్యాలు తీర్చుకోవడం, పాలు పితకడం రోజూ వారి దినచర్య. నెమ్మదిగా పిల్లలు లేచారు స్నానం ముగించుకుని సీతమ్మ చేసిన ఫలహారం చేసి, కార్లో సామాన్లు సర్దుకున్నరు పిల్లలు. చాలా సంవత్సరాల తరువత వచ్చారని వాళ్ళకి కొత్త బట్టలుపెట్టారు రాఘవయ్య దంపతులు. పెద్దవాళ్ళ ఆశీస్సులు పొందారు. సిటీ జీవితానికి భిన్నంగా ఈ పల్లెటూరి వాతరణం మనవళ్ళకు ఆనందం కలిగిందని వారి ముఖాలు చూస్తేనే తెలిసింది. ''మామయ్య చేత మీ ఇద్దరికి రెండు మంచి స్మార్ట్ఫోన్లు పంపుతాం. ఎంతో ఆనందంగా వుంది. ఈ అనుభవాలు మేము గుర్తుపెట్టుకుంటాము. పల్లెటూరు టూర్గా'' అన్నారిద్దరు.
''జాగ్రత్తగా వెళ్ళండి. చేరగానే ఫోను చేయండి'' అంటు సాగనంపారు సీతమ్మ రాఘవయ్యలు. కారు వెడుతున్న వైపే చేతులు ఊపుతూ మళ్ళీ ఎప్పుడొస్తారో అన్నట్టు.
- కపిల రాంకుమార్,
9849535033