Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''తాతయ్యా! గాంధీ బొమ్మలు కావాలి, రేపు గాంధీ మీద ప్రాజెక్టు తయారు చేయాలి. మీరు ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు తీసుకురండి!' చెప్పింది పదేళ్ళ సుస్మిత.
''అలాగేనమ్మా'' అన్నాడు కాంతారావు, ఇంట్లోంచి బైటకు నడుస్తూ.
''ఆయనకే చెప్పావ్, ఇంతే సంగతులు, డ్రైవర్కు చెప్పు గుర్తు చేస్తాడు...'' అంది జానకమ్మ.
సుస్మిత పరిగెత్తి లిఫ్ట్లోంచి కిందకు దిగింది. అప్పటికే గేటు దాటి రోడ్డెక్కింది కారు.
''అయ్యో...'' అనుకుంది సుస్మిత.
***
ఆ రోజు రాత్రి పొద్దుపోయి వచ్చాడు కాంతారావు. రాగానే అడిగింది జానకమ్మ, ''గాంధీ బొమ్మలు తెచ్చారా?!'' అంది.
''అయ్యొ...'' అని నాలిక్కరుచుకున్నాడు.
''సరే... పాపం మీ కోసం ఎదురు చూసి ఎదురు చూసి నిద్ర పోయింది'' అంది.
''రేపు తెచ్చానులే'' అన్నాడు.
తరువాతి రోజు ఉదయమే ఏదో కేంప్ ఉండడంతో తెల్లవారకముందే వెళ్ళిపోయాడు కాంతారావు. ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుంచి తొందరగా ఇంటికొచ్చేశాడు. ఇంఇకి రాగానే గుర్తుకొచ్చింది, మళ్ళీ తన మనవరాలు చెప్పిన గాంధీ బొమ్మలు తేవడం మర్చిపోయానని. ఆ విషయమే భార్యకు చెప్పాడు.
''మనింట్లోనే దొరికాయట. ఉదయమే లేచి ప్రాజెక్టు తయారు చేసుకుంది'' అంది జానకమ్మ.
''సరే కాఫీ పట్రా'' అన్నాడు. ఆమె వంటింట్లోకి వెళ్ళింది. తను బాత్రూములోకి ఫ్రెష్ అవడానికి వెళ్ళి వచ్చేసరికి బైట డోర్ బెల్ మోగింది. కిటికీలోంచి చూశాడు. బైట నలుగురు నిలబడ్డారు. తలుపు తీశాడు. ఎదురుగా ఇన్షర్ట్ చేసుకున్న ఇద్దరు వెనక ఇంకో ఇద్దరు.
''సార్... మేం అవినీతి నిరోధక శాఖ నుంచి వచ్చాం. మీరు యాభై వేలు లంచం తీసుకున్న విషయం మా దృష్టికి వచ్చింది. మీ ఇల్లు చెక్ చేయాలి'' అన్నారు. ఒక్కసారి వంట్లో విద్యుత్ ప్రవహించినట్లయింది కాంతారావుకి. పై ప్రాణాలు పైనే పోయాయి. సోషాలో కూలబడ్డాడు. భార్య వంటగదిలోంచి కంగారుగా వచ్చింది.
''భయపడకండి, ఎవరో కిట్టనివాళ్ళు చెప్పి వుంటారు. మీ సంగతి అందరికీ తెలుసు. మీరు మిస్టర్ క్లీన్. ఇన్నేళ్ళ సర్వీసులో ఎవరి దగ్గర నుంచైనా ఒక్క పైసా తీసుకుఆన్నరా!?'' అంది.
ఔను... తను మిస్టర్ క్లీన్... ఇన్నేళ్ల సర్వీసులో ఒక్క తప్పు చేయలేదు. ఇంకో ఆరు నెలల సర్వీసుంది, ఇంతకాలం తను సంపాదించలేదు, బేంకు లోను ద్వారా తీసుకున్న ఈ అపార్ట్మెంట్ తప్ప - తన ఒక్కగానొక్క కొడుకును ప్రయోజకుడిని చేశాడు. అతను వేరే రాష్ట్రంలో ఒక ఉన్నత స్థాయి అధికారి, ప్రేమించి తన కేడర్లోని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ చాలా నిజాయితీ పరులైన అధికారులుగా పేరు తెచ్చుకున్నారు. తమ కూతుర్ని తమ దగ్గర ఉంచారు. తనకు ఈ మధ్య ఒక దురాశ పుట్టింది. అది సహవాస దోషం.
''సార్... ఇంతకాలం మడికట్టుకు కూర్చున్నారు. ఏం సంపాదించారు. ఈ నగరంలో ఒక్క స్థలం సంపాదించారా... గాల్లో కట్టిన ఇల్లు తప్ప. భూమ్మీద ఇల్లు కట్టేందుకు సెంటు భూమి ఉందా?! ఈ ఆరు నెలలు కాస్త మీ పట్టు సడలించండి, మీరు రిటైరయ్యేలోగా ఒక స్వంత స్థలం ఏర్పాటు చేస్తా...'' అంటూ తన చేతిలో యాభై వేలు పెట్టాడు, పెడ్ గుమస్తా గోవిందరావు. ఆ డబ్బు తీసుకుంటే తన చేతులు వణికాయి. ఎందుకో మనసు వద్దంటున్నా లొంగిపోయాడు. ఇంటికి తెచ్చి భార్యకు తెలీకుండా తన ఆఫీసు గదిలోని డస్ట్బిన్లో ఆ డబ్బు పేపర్లో కట్టి దాచాడు. ఆ రూంలోకి ఎవరూ రారు కదా.. అని. రెండు రోజుల్లో ఏదో స్థలం బేరానికి అడ్వాన్స్ ఇవ్వాలి... అందాకా తను దాచాలి! ఇప్పుడు ఆ డబ్బు వాళ్ళకు ఎలాగూ దొరుకుతుంది!! తన పరిస్థితి ఏమిటి?
- కాంతారావుకు పైన ఫ్యాన్ తిరుగుతున్నా చెమటలు పట్టాయి. 'తనకు చావే శరణ్యం'. గుండె వేగం పెరిగింది. నిమిషాలు గడిచాయి. గంటలు దొర్లాయి. భార్య వంటగదిలో ప్రశాంతంగా పని చేసుకుంటోంది. తనకు ఈ విషయం తెలీదు కదా!
వచ్చిన వాళ్ళంతా బీరువాలు వెతికారు, తాళాలు అడిగి. అల్మరాలు చూశారు, సూట్కేసులు, బట్టల బీరువా అంతా జల్లెడ పట్టారు. తన ఆఫీసు గదిలోకి వచ్చారు. కళ్ళముందే... డస్ట్బిన్ తిరగేశారు. తను ఆ దృశ్యం చూడలేక, గబగబా బెడ్రూంలోకి వచ్చాడు. నిమిషాలు లెక్కపెడుతున్నాడు... ఒకటి రెండు మూడు... అయిపోయింది, తను దోషిగా నిలబడే దుర్ఘడియలు...
''సార్....!'' ఆ పిలుపు విని తలెత్తాడు.
''క్షమించండి... మీ గురించి తప్పుడు రిపోర్ట్ వచ్చింది. మీ గురించి మంచి రికార్డ్ వుంది. మీ బ్యాంక్ ఎకౌంట్లు కూడా చెక్ చేశాం. మీరు మిస్టర్ క్లీన్, కీపిటప్..'' అంటూ వారంతా వెనుతిరిగారు.
ఒక్కసారి వెనక్కి తిరిగాడు. ఆశ్చర్యం... ఆనందం. ఇది ఊహించని షాక్.
తను డస్ట్బిన్లో దాచిన యాభైవేలు ఏమయ్యాయి. మైగాడ్... వాళ్ళు సరిగ్గా చూడలేదా!! ఇంతలో భార్య కాఫీ కప్పుతో వచ్చింది.
''ఏంటి అలా చమటలు కక్కుతున్నారు...'' అంది.
కాఫీ తాగుతూ ఆలోచనలో పడ్డాడు. అరగంట వరకూ మామూలు మనిషి కాలేకపోయాడు.
ఆరు గంటలకు స్కూల్ బస్ వచ్చింది. బస్ దిగిన మనవరాలు పరిగెత్తుకుంటూ వచ్చింది. లిఫ్ట్ ఎక్కకుండా మెట్లెక్కి ఆయాసపడుతూ చెప్పింది.
''నాకు గాంధీ ప్రాజెక్టుకు మొదటి బహుమతి వచ్చిందోచ్..'' అంది ఆనందంగా. అలా అంటూ తన ప్రాజెక్టు పుస్తకం అతడికి అందించింది. ఆ పుస్తకం చూసిన కాంతారావుకు మతిపోయింది. మరో షాక్. దాని నిండా పచ్చనోట్ల నుంచి కత్తిరించిన గాంధీ బొమ్మలు. ప్రతీ బొమ్మ కింద గాంధీగారి గురించిన విశేషాలు. అతడి కళ్ళు వేగంగా మనవరాలు తయారు చేసిన ఆ పుస్తకంలోకి పరిగెత్తాయి - ఆరు చరఖాలు, నాలుగు చేనేత పంచలు, ఒక ఖద్దరు తువాలు, ఒక డబ్బా మేకపాలతో బతికిన గాంధీ గురించి రాసింది. ప్రకృతి మనిషి అవసరాలే తప్ప, అత్యాశ కాదు అంటూ గాంధీ ప్రవచనం ఆ పుస్తకంలో ఉంది. అలాగే మనిషి అసలయిన ఆభరణం శీలం.. అనే గాంధీ మాట ఆ పుస్తకంలో ఉంద. ఇలా ఎన్నో గాంధీ కొటేషన్లు, విలువల గురించి, వ్యక్తిత్వం గురించి, నైతికత గురించి - పుస్తకం చదవటం పూర్తి చేసి మనవరాలి కళ్ళల్లోకి చూశాడు. ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతోంది.
''ఇవి పచ్చనోట్లు, అంటే డబ్బు కదమ్మా... వీటిని కట్ చేద్దామని ఎందుకనుకున్నావ్!'' అన్నాడు ఆమె స్పందన తెలుసుకుందామని -
''తాతయ్యా... ఇవి డస్ట్బిన్లో వున్నాయి. పాత పేపర్లలో గాంధీ బొమ్మలు దొరుకుతాయని చూస్తే ఇవి దొరికాయి. పనికిరానివే కదా... డస్ట్బిన్లో పడేసేది...''
ఆమె సమాధానానికి అతడి దగ్గర జవాబు లేదు. తను ఇంకా చెప్పడం ముగించలేదు.
''ఆ మధ్య నిషేధించారు కదా తాతయ్యా... ఐదొందల నోట్లు... అవే కదా, పనికిరానివే కదా...'' అంది.
''ఔనమ్మా... అవి పనికిరానివే...'' మనవరాలి దగ్గర నిజం చెప్పలేకపోయాడు కాంతారావు.
'ఔను... తను గెలిచి నన్ను గెలిపించింది' అనుకున్నాడు.
ఇంతలో కొడుకు నుంచి ఫోన్.
''నాన్నా... బావున్నారా, సుస్మితకు బహుమతి వచ్చిందట కదా... అంతా మీ పెంపకమే. మా తాతయ్య నీతి కథలు చెప్పి మమ్మల్ని ప్రయోజకులను చేశారు, అలాగే నా కూతురునూ మీరు నైతికంగా తీర్చిదిద్దాలి, అందుకే మీ దగ్గరుంచాను...'' కొడుకు ఫోన్ పెట్టేశాడు.
ఔను... తను నీతి కథలు చెప్పాలి, అలా మనవరాలికి చెప్పాలంటే నీతిగానే బతకాలి... అప్పుడే ఈ గెలుపు మిగిల్చిన ఆనందం మిగులుతుంది... అంతే... దృఢంగా నిశ్చయించాడు కాంతారావు.
- ఎం.సుగుణరావు