Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమయం పదకొండున్నర దాటింది. పంకజ్, డాక్టర్ శ్రీమాలి, గుప్తాజీ, ఇంకా హరీష్ క్యాంటీన్ నుండి వచ్చేసరికి నేను స్టాఫ్ రూమ్లో డాక్టర్ తివారీతో పోస్ట్-మోడరనిజం గురించి తీవ్రంగా చర్చిస్తున్నాను.
''మీకీ వార్త తెలిసిందా? సాహ్ని గారు చనిపోయారు!''
ప్రతిస్పందించేందుకు కూడా వీలుకానంతగా విస్మయానికి లోనయ్యాను.
''దేవుడా! నేను నిన్న సాయంత్రం అతన్ని కలిశాను. అతను బాగానే ఉన్నాడు. ఏమైంది?'' డాక్టర్. తివారీ అడిగారు నమ్మలేనట్టు.
''అతను ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న రాత్రి నిద్ర మాత్రలు అధిక మోతాదులో తీసుకున్నాడు'' అంటూ వివరించారు గుప్తాజీ.
''ఆత్మహత్యా! భగవంతుడా!''
సాహ్ని గారు ఇంక లేరు. ఈ వార్త స్టాఫ్ రూమ్లో దావానలంలా వ్యాపించింది. ఏం జరిగింది? ఎలా? అందరి పెదవులపై ఆడే ప్రశ్నలు ఇవి. ఈ రోజుకి కాలేజీకి సెలవిచ్చారు. పివిఆర్లో హిందీ సినిమా ''టైగర్ జిందా హై'' మధ్యాహ్నం ఆటని చూడాలని చాలామంది విద్యార్థులు కోరుకున్నందున వాళ్ళు త్వరత్వరగా చెదిరిపోయారు.
ప్రిన్సిపాల్ పంపించిన సర్క్యులర్లో లెక్చరర్లందరి సంతకాలను అటెండర్ సోమనాథ్ తీసుకుంటున్నాడు:
''శోకతప్త హృదయంతో, మన ప్రియమైన సహోద్యోగి శ్రీ ఆర్,కె. సాహ్ని మరణించిన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మధ్యాహ్నం 12 గంటలకు పందో నెంబరు గదిలో సంతాప సమావేశం జరుగుతుంది. అతని ఆత్మకి శాంతి కలుగుగాక!
- దు:ఖంతో:
ప్రిన్సిపాల్ సచ్దేవా, మరియు సిబ్బంది.
ఈ సర్క్యులర్ ప్రతిని స్టాఫ్ రూమ్ నోటీసు బోర్డు వద్ద కూడా ఉంచారు.
లెక్చరర్లందరూ స్టాఫ్ రూమ్ వెలుపల పచ్చికలో గుమిగూడారు. బోధనేతర సిబ్బంది కూడా కొంత దూరంలో గుమిగూడారు.
గురీందర్ నన్ను ఒక మూలకు తీసుకెళ్ళి చిలిపిగా కన్ను గీటాడు, ''కాలేజీకి రెండు రోజులు సెలవులోరు!'' అన్నాడు
''అవునా?''
''అవును, మిత్రమా. సాహ్నిగారి తల్లిదండ్రులు డెహ్రాడూన్లో ఉంటారు. వారు ఇక్కడికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది.''
''ఇంతకీ ఇదంతా ఎలా జరిగింది?'' అని అడుగుతూ ఆలోచనల్లోకి వెళ్ళాను.
మొన్న స్టాఫ్ రూమ్లో చదరంగం ఆటలో సాహ్నిని ఓడించిన సంగతి గుర్తు చేసుకున్నాను. నేను ఆ రోజు పదిన్నర గంటల నుండి ఒకటిన్నర వరకు ఖాళీగా ఉన్నాను. అప్పటికే ఉదయం రెండు క్లాసులలో పాఠాలు చెప్పాను. నేను మధ్యాహ్నం ఒకటిన్నర నుండి మూడు గంటల వరకు మరో రెండు క్లాసులు చెప్పాల్సివచ్చింది. యాదృచ్చికంగా, సాహ్ని కూడా ఆ రోజు పదిన్నర నుండి ఒంటి గంటా నలభై ఐదు నిమిషాల వరకు ఖాళీగా ఉన్నాడు. నేను చెస్ ఆట ప్రారంభంలో 'కాజ్లింగ్' చేశాను. తర్వాత సాహ్ని సేన ఎడమ 'ఫ్లాంక్'పై దాడి చేసాను, అతని మంత్రిని చంపి అతనిని ఓడించాను. ఆట తరువాత, అతను నిరాశతో కూడిన స్వరంలో, ''నేను పుట్టుకతోనే పరాజితుడిని!'' అన్నాడు. బాగా ఖిన్నుడైనట్లు అనిపించాడు.
''బాధపడకండి, సాహ్ని. మీరు బాగా ఆడారు. మళ్ళీసారి అదృష్టం మీ వైపే'' అంటూ నేను అతనిని ఓదార్చాను.
''ఆ 'మళ్ళీసారి' ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు'' అతను విచారంగా నవ్వాడు.
వర్తమానంలోకి వచ్చిన నేను, ''అయితే గురీందర్, ఇది ఎందుకు జరిగింది?'' అడిగాను.
''షేర్లు, మిత్రమా. సాహ్ని చాలా మంది నుండి అప్పులు తీసుకున్నాడు, పైగా షేర్-మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెట్టాడు. అయితే ఈమధ్య షేర్-మార్కెట్లో బాగా నష్టపోయాడు. మరోవైపు, జనాలు తమ అప్పులను తీర్చమంటూ గొడవ ప్రారంభించారు. పాపం సాహ్ని, ఒత్తిడికి లోనయ్యాడు. అయితే అతడు ఇంత పిరికివాడని ఎవరూ అనుకోలేదు'' అని గురీందర్ అనాలోచితంగా అన్నాడు, బబుల్ గమ్ నములుతూ.
''అతనికి పిల్లలు ఉన్నారా? అతని భార్య ఉద్యోగస్తురాలేనా?'' నేను అడిగాను.
''లేదు. ఆమె గృహిణి, వాళ్ళకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు'' గురీందర్ చెప్పారు.
ఈ సంఘటన వల్ల నేను చాలా బాధపడ్డాను. ఎంతటి దురదృష్టం.
ననన
సమయం పన్నెండు దాటింది. పదో నెంబరు గదిలో సంతాప సమావేశం మొదలైంది. ఉపాధ్యాయులు మరియు బోధనేతర సిబ్బందితో గది పూర్తిగా నిండిపోయింది. జనాలు తమ సంతాపాన్ని వెలిబుచ్చుతున్నారు. విషాదాన్ని పులుముకుని, ప్రిన్సిపాల్ సచ్దేవా మృతుడికి తన నివాళులు అర్పించారు -
''... శ్రీ సాహ్ని ఒక గొప్ప అధ్యాపకుడు. అతని అకాల మరణం మనకి గొప్ప లోటు. అతని ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలి....''
''ధూర్తుడు, కపటి!'' నా పక్కన కూర్చున్న గురీందర్ గుసగుసలాడాడు.
''హుష్! ఇది గంభీరంగా ఉండాల్సిన సందర్భం'' చిరునవ్వును ఆపుకుంటూ నేను అన్నాను.
కిటికీ గుండా ఓ గాలితెర ఎగిరి దట్టమైన నిశ్శబ్దాన్ని ఇటు నుంచి అటు మోసుకెళ్ళింది.
సాహ్ని, ప్రిన్సిపాల్ సచ్దేవా బద్ధ విరోధులని కాలేజీలో అందరికీ తెలుసు. కొంతమంది మేనేజ్మెంట్ కమిటీ సభ్యుల బలమైన మద్దతు కారణంగా సాహ్ని ఉద్యోగం పొందాడు. అతనికి బదులుగా, ప్రిన్సిపాల్ తన మేనల్లుడిని నియమించాలనుకున్నాడు. తరువాత, ప్రిన్సిపాల్ సాహ్నిని నాలుగు సంవత్సరాలు 'కన్ఫర్మ్' చేయకుండా అడ్డుకున్నాడు. 'కన్ఫర్మ్' అయ్యాకా, సాహ్ని శక్తివంతమైన ఉపాధ్యాయ సంఘానికి కార్యదర్శిగా ఎంపికయ్యాడు. ప్రిన్సిపాల్కు ఇబ్బందులు సృష్టించాడు. లెక్చరర్లు ప్రతిరోజూ సమ్మెకు వెళ్లేవారు. ప్రిన్సిపాల్ను ఖండిస్తూ తీర్మానాలను ఆమోదించడంలో, అసంతృప్తి చెందిన లెక్చరర్ల చేత అతనిపై దాడిచేయిండంలో సాహ్ని ఎల్లప్పుడూ ముందుండేవాడు.
''సోదర ఉపాధ్యాయులంతా మన జీతం నుండి ఒక్కొక్కరు ఐదు వేల రూపాయలు విరాళంగా ఇస్తామని మనం ఏకగ్రీవంగా నిర్ణయిస్తున్నాం. సేకరించిన మొత్తాన్ని మన సంఘీభావం గుర్తుగా మరణించిన మన సహోద్యోగి భార్యకు అందజేస్తాము. ఈ సంక్షోభ సమయంలో ఆమెకి మన సహకారం అవసరం....'' ప్రిన్సిపాల్ తర్వాత మాట్లాడుతున్న స్టాఫ్-సెక్రటరీ శర్మ తీవ్రమైన స్వరంలో ప్రకటించారు.
''దారుణం...! ఐదువేల రూపాయలు మనమెందుకు వదులుకోవాలి? సాహ్ని చనిపోవడం మన తప్పా?'' అన్నాడు గురీందర్.
''ఇక ఆపవోరు. ఇలాంటి చర్చకు ఇది సందర్భం కాదు'' లోగొంతుకతో నేను గురీందర్ని హెచ్చరించాను.
''కాలేజీ అడ్మినిస్ట్రేషన్ కూడా, మృతుని కుటుంబానికి సహాయం అందించాలి'' వెనుక నుండి మేడమ్ స్నేహలత శర్మ గొంతు వినిపించింది.
''అవును! మేము ప్రిన్సిపాల్ సచ్దేవా అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాము'' చాలా మంది అసంతృప్త యూనియన్ సభ్యులు ఏకీభావంతో అన్నారు.
ప్రిన్సిపాల్ సచ్దేవా డేగ కళ్ళు నవ్వుతున్నట్లనినిపించింది. గదిలో ఉక్కగా ఉంది. ముఖంపై కారుతున్న చెమటను రుమాలుతో తుడుచుకుని, ''ఈ సంక్షోభ సమయంలో, కాలేజీ-అడ్మినిస్ట్రేషన్ మొత్తం మృతుడి కుటుంబం పట్ల సానుభూతితో ఉంది. మేము శ్రీమతి సాహ్నికి సాధ్యమైనంత మేరకు సహాయం చేస్తాము'' అన్నాడు.
అసంతృప్తుల గొణుగుడు గదంతా వ్యాపించింది. వెంటిలేటర్ మీద కూర్చున్న ఒక దుర్బల పావురం దాని రెక్కలనాడించి ఆకాశంలోకి ఎగిరిపోయింది. పచ్చికలో ఒక చెట్టు మీద కూర్చున్న ఒక కాకి హఠాత్తుగా కదలడం ప్రారంభించింది. గది గోడకి వేలాడదీసిన జాతిపిత మహాత్మా గాంధీ యొక్క పాత చిత్రపటం ఈ మొత్తం నాటకం విప్పడానికి నిశ్శబ్ద సాక్షి.
వెనుక వరుసలో కూర్చున్న వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు ''శ్రీమతి సాహ్నికి కాలేజీలో ఉద్యోగం ఇవ్వాలి'' అని బిగ్గరగా అన్నాడు. అనేక మంది బోధనేతర సిబ్బంది ఈ డిమాండ్కు తమ మద్దతు తెలిపారు. 'నో వర్క్, నో పే' విధానాన్ని కఠినంగా అమలు చేయడం ద్వారా గతంలో బోధనేతర సిబ్బంది జరిపిన రెండు నెలల సమ్మెను ప్రిన్సిపాల్ సచ్దేవా విఫలం చేశాడు.
''ఈ నిర్ణయాలన్నీ తగిన సమయంలో తీసుకోబడతాయి. శ్రీ సాహ్ని దహన సంస్కారాలు జరగనివ్వండి'' ప్రిన్సిపాల్ ఆచితూచి మాట్లాడాడు.
''రేపు ఏ సమయంలో శవయాత్ర ప్రారంభమవుతుంది?'' అని గుప్తాజీ అడిగారు.
''రేపు మధ్యాహ్నం మూడు గంటలకు'' శర్మ సమాచారం ఇచ్చాడు.
ననన
''రామ్ నామ్ సత్య్ హై ...''
(ఈ నశ్వర ప్రపంచంలో దేవుని నామమే సత్యం.)
కంటోన్మెంట్ రోడ్లోని సాహ్ని నివాసం నుంచి పాడె కదలడానికి సిద్ధంగా ఉంది. ఓదార్చలేని విధంగా విలపిస్తూ, శ్రీమతి సాహ్ని ఇంటి నుండి వీధిలోకి పరిగెత్తి, సాహ్ని మృతదేహంపై పడి రోదించసాగింది. ఆమె జుట్టు చెదిరి ఉంది, దుస్తులు మాసి ఉన్నాయి, ఎడతెగని ఏడుపు కారణంగా ఆమె కళ్ళు రక్తం రంగు పులుముకున్నాయి, ఆమె దయనీయంగా కనిపించింది. కొంతమంది బంధువులు ఆమెను మళ్ళీ లోపలికి తీసుకువెళ్లారు. కాలనీవాసులు తమ బాల్కనీలు, డాబాల పై నుండి మొత్తం దృశ్యాన్ని చూస్తున్నారు.
నా కళ్ళు చెమ్మగిల్లాయి. గొంతులోంచి మాట బయటకి రావడం లేదు.
కొంతమంది వృద్ధ సహోద్యోగులు రుమాలుతో కన్నీళ్లు తుడుచుకోవడం కనిపించింది. ప్రిన్సిపాల్ సచ్దేవా ముఖం అభావంగా, ఉదాసీనంగా ఉంది.
''రామ్ నామ్ సత్య్ హై ...''
నలుగురు బంధువులు లేచి, తమ భుజాలపై పాడెని ఉంచుకున్నారు.
''రామ్ నామ్ సత్య్ హై ...''
శవయాత్ర రోడ్డు చివరకి చేరుకోబోతోంది. గురీందర్ తన స్కూటర్ పై వచ్చి నా పక్కనే ఆగాడు.
''రా. శ్మశానం దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. వీళ్ళంతా అక్కడికి చేరుకోవడానికి ఓ గంట పడుతుంది. నా స్కూటర్లో ముందు వెళ్దాం. దారిలో ఎక్కడో టీ, స్నాక్స్ తీసుకుందాం'' అన్నాడు.
''రామ్ నామ్ సత్య్ హై ...''
శవయాత్ర ఊరేగింపు దూరమవుతోంది.
''నేను వీళ్ళతో పాటు నడుస్తాను'' అంటూ గురీందర్ని వదిలించుకోవటానికి ప్రయత్నించాను.
''రామ్ నామ్ సత్య్ హై ...''
''నువ్వు అనవసరంగా భావోద్వేగానికి లోనవుతున్నావు, మిత్రమా. పాడెతో పాటు ప్రిన్సిపాల్ని వెళ్లనీ. అది అతనికి అవసరమైన వ్యాయామం అవుతుంది. నేను చెప్తున్నాను, మనం ఇప్పుడు శ్మశానానికి కూడా వెళ్ళవలసిన అవసరం లేదు. మనం ఇప్పటికే ఇక్కడ 'హాజరు' వేయించుకున్నాం. అందరూ మమ్మల్ని చూశారు. పివిఆర్ సినిమా వద్ద ''ఓషన్స్ ఎయిట్'' అనే ఆంగ్ల చిత్రం సాయంత్రం 4 గంటల ఆటను చూద్దాం. ఇది మన మూడ్ని తేలికపరుస్తుంది. అంతేకాక, మనం శ్మశానవాటికతో పాటు దహన సంస్కారాలకు వెళ్ళినా సాహ్ని మళ్ళీ బతకరు కదా! ''
''గురీందర్. ఇది ఒక గంభీరమైన సందర్భం. మనం మన సహోద్యోగులలో ఒకరిని దహనం చేయబోతున్నాం. దయచేసి అంత కఠినంగా ఉండద్దు'' నా కోపాన్ని అణచుకోలేకపోయాను.
''రామ్ నామ్ సత్య్ హై ...''
శవయాత్ర మరి కొంత దూరం సాగింది.
''ఆల్రైట్ మిస్టర్ హరిశ్చంద్ర (సత్య స్వరూపా)! నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పాడెతో పాటు ఉండు. నేను శ్మశానంలో కలుస్తాను'' అని పలికి గురీందర్ వెళ్ళిపోయాడు.
నేను కొంత వేగంతో పరిగెత్తి, శవయాత్రలో తిరిగి చేరాను.
''రామ్ నామ్ సత్య్ హై ...''
శవయాత్ర ఇప్పుడు ప్రధాన రహదారికి చేరుకుంది. హాస్యాస్పదంగా, రహదారికి అడ్డంగా ఉన్న ఒక సంగీత దుకాణంలో ఒక స్టీరియో ఈ హిందీ సినిమా పాటను గట్టిగా వినిపించింది: ''... తేరీ నానీ మరీ తో మై క్యా కరూం...'' (నీ అమ్మమ్మ చనిపోతే నాకేం? నేనేం చేయాలి?)
ననన
చితికి నిప్పెట్టారు. సూర్యుడు దిగంతం కిందికి దిగుతున్నాడు. కాలుతున్న కర్రలను నిప్పు చీలుస్తూ శబ్దం చేస్తోంది. మాంసం కాల్తున్న వాసన గాలిలో నిండింది. శ్మశానం గోడకు మించి పెరిగిన ఎత్తైన చెట్టుపై రెండు రాబందులు ఉన్నాయి. ప్రిన్సిపాల్ సచ్దేవా, శర్మ గారు, ఇంకా ఇతరులు మృతుడి ముసలి తండ్రిని ఓదార్చారు. నా కళ్ళలో చెమ్మ! నా భావోద్వేగాలను కష్టంతో నియంత్రిస్తూ, నేను మా వాళ్ళు ఉన్న వైపుకు వెళ్ళాను.
ప్రవీష్, జగ్తార్, గురీందర్, దత్తా సాహిబ్, మెహ్రాజీ, ఉప్పల్ తదితరులు దగ్గరలో మాట్లాడుకుంటూ బిజీగా ఉన్నారు. తమతో కలవమని గురీందర్ నన్ను పిలిచాడు.
ఉప్పల్ మెహ్రాజీకి సలహా ఇస్తూ, ''మీరు మోడల్ టౌన్కి ఎందుకు మారకూడదు? విశాలమైన ఫ్లాట్ ఎనభై లక్షల రూపాయలకు వస్తుంది. మీకు ఆసక్తి ఉంటే, నేను మీకు ప్రాపర్టీ-డీలర్ నెంబర్ ఇస్తాను, మీరు వెళ్లి స్వయంగా ఫ్లాట్ చూసుకోవచ్చు'' చెప్పాడు.
మెహ్రా గారు ఈ ప్రతిపాదనపై పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ దత్తా సాహిబ్ వివరాలు అడగడం ప్రారంభించాడు.
జగ్తార్కి తన సొంత ఎజెండా ఉంది. ''మిత్రులారా, పంకజ్, సురేష్, అనూప్, అరవింద్ సంతాప సమావేశానికి హాజరు కాలేదు, సాహ్ని దహన సంస్కారాల సమయంలో వారు ఇక్కడ హాజరు కాలేదు. వారి సహోద్యోగి సజీవంగా ఉన్నారా లేదా చనిపోయారా అనే విషయంలో వారికి ఎలాంటి తేడా లేదు!''
మోడల్ టౌన్ ఫ్లాట్ కొనుగోలు చేయడానికి మెహ్రాజీని ప్రలోభపెట్టడంలో ఉప్పల్ విఫలమయ్యాడు. అతను సిగరెట్ వెలిగించి, ''నేను మీ అందరికీ ఒక జోక్ చెప్తాను... ఒకసారి, ఒక దోమ కుటుంబం నివసించడానికి స్థలం కోసం వెతుకుతూ, వచ్చి ఏనుగు చెవి లోపల స్థిరపడింది ...'' అంటూ ఆపాడు.
కొందరు సహోద్యోగులు ముసిముసిగా నవ్వారు. ప్రిన్సిపాల్, అతని పరిశోధనాత్మక భజనపరులు కొందరు మా వైపు చూశారు.
నేను చితి వైపు చూశాను. మంటలు దాన్ని పూర్తిగా ఆవరించాయి. దెయ్యం లాంటి మంటలు అకస్మాత్తుగా సాహ్ని మరణంపై నా స్పృహను పెంచాయి. నేను సాహ్ని యొక్క నవ్వుతున్న ముఖం, అతని విశాలమైన నుదురు, అతని నల్లటి ఉంగరాల జుట్టును జ్ఞాపకం చేసుకున్నాను. సాహ్నితో సంబంధం ఉన్న అనేక సంఘటనలు నా మనసులోకి వచ్చాయి. సాహ్ని జ్ఞాపకాల స్క్రీన్ షాట్లు నా మనసుని ముంచెత్తాయి: తరగతి గదిలో ఆకట్టుకునే ఉపన్యాసం ఇస్తున్న సాహ్ని, ఉపాధ్యాయ సంఘం సమావేశంలో వక్తృత్వ యుక్తితో ఒక విషయాన్ని నొక్కిచెప్పిన సాహ్ని, పోస్ట్ గ్రాడ్యుయేట్ అమ్మాయి-విద్యార్థులు చుట్టుముట్టిన సాహ్ని, విశ్రాంతిగా కాఫీ తాగే సాహ్ని, సిగరెట్ పొగని లోపలికి గట్టిగా పీల్చే సాహ్ని, క్యాంటీన్లో జోకులు వేసే సాహ్ని, చెస్ ఆటను కోల్పోయినందుకు నిరాశకు గురైన సాహ్ని, ఇంకా తన అభిమాన సంభాషణను నాటకీయ శైలిలో పునరావృతం చేస్తూ, ''జీవితం ఒక ఐస్ క్రీం, నేస్తమా. కరిగిపోయే లోపే దాన్ని ఆస్వాదించండి'' అనే సాహ్ని...!
ఉప్పల్ తన జోక్ని కొనసాగిస్తూ... ''అప్పుడు ఏనుగు 'ప్రియమైన దోమా, నేను మీ రాకను ఎప్పుడూ గమనించలేదు. మీ నిష్క్రమణను పట్టించుకోవడం లేదు. మీరు ఉన్నా లేకున్నా నాకు పెద్ద తేడా ఉండదు' అని అంది''.
ఉప్పల్ జోక్ పూర్తి చేసి అందరికేసి గర్వంగా చూశాడు.
గురీందర్ నవ్వుతూ, ''ఇంతకీ అది ఏనుగు చెవా లేదా పబ్లిక్ ప్రాపర్టీనా!'' అన్నాడు.
తాను వెనుకబడి ఉండకూడదు అనుకున్న మెహ్రాజీ కూడా సంభాషణలో చేరాడు, ''ఇది మీ సొంత జోక్లా అనిపించడం లేదు. మీరు తప్పకుండా ఓషో పుస్తకంలో చదివి ఉండాలి. ''
''ఓV్ా, లేదు, మెహ్రాజీ. మీకు ఉప్పల్ తెలివి తెలిసినట్లు అనిపించడం లేదు'' అని చెప్పి దత్తాజీ జగ్తర్ వైపు తిరిగి కన్ను గీటాడు, ''అంతే కదా జగ్తార్?'' అన్నాడు.
''ఎందుకు కాదు? అందుకే ఉప్పల్ క్లాస్ రూమ్లో జోకులు వివరించడానికి తగినంత సమయాన్ని వెచ్చిస్తాడు. తన ఇంటిలో ట్యూషన్-సెంటర్ను నడుపుతూ బిజీగా ఉంటాడు'' జగ్తార్ ఎక్కువగా బాధించే చోట కొట్టాలని నిర్ణయించుకున్నాడు.
''నేను ట్యూషన్ సెంటర్ను నడిపితే ఏంటట? అది చట్టవిరుద్ధం కాదు. నాలాగే ఎందరో'' అని ఉప్పల్ సమాధానం చెప్పాడు.
''ఈ రోజు, నేను నా భార్యను లాజ్పత్ నగర్ మార్కెట్లో షాపింగ్ కోసం తీసుకెళ్లాలని అనుకున్నాను. అయితే, ఈ దహన కార్యక్రమాల వల్ల మొత్తం ప్రోగ్రామ్ చెడిపోయింది. నా భార్య ఇంట్లో నిరాశకు గురవుతుంది'' దత్తా సాహిబ్ అన్నారు.
''జాగ్రత్త, దత్తాజీ. ఈ రోజు ఇంట్లో మీ పని అయిపోతుంది. దయచేసి మా ప్రగాఢ సానుభూతిని ముందుగానే అంగీకరించండి'' అని గురీందర్ చక్కిలిగింతలు పెట్టాడు.
రాబోయే ఉపాధ్యాయ సంఘం ఎన్నికలలో సాహ్ని లేకపోవడం ప్రిన్సిపాల్ మద్దతుదారులకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో మెహ్రాజీకి అర్థమయ్యేలా చెప్పేందుకు ఉప్పల్ ప్రయత్నిస్తున్నాడు.
''చూడండి, ప్రిన్సిపాల్ బయలుదేరుతున్నాడు. మనం కూడా వెళ్దాం. ఇప్పటికే ఆలస్యం అవుతోంది'' అన్నాడు ప్రవేష్.
భజన బృందం చుట్టూ మూగి ఉండగా, స్వచ్ఛమైన తెల్లని సఫారీ-సూట్ ధరించిన ప్రిన్సిపాల్ సాహిబ్ తిరిగి వస్తున్నాడు. అతను ఒకరితో మనోహరంగా నవ్వి, ఆపై వేరొకరికి స్నేహపూర్వకంగా చేయి ఊపాడు. అప్పుడు, అతను తన తెల్ల అంబాసిడర్ కారులో ఎక్కి శ్రీమాలితో ఏదో చాలా ఆప్యాయంగా చెప్పాడు. శ్రీమాలి తోకూపడం .... సారీ ఒకప్పుడు ఉన్న తోకలిప్పుడు లేవు కదా... తలూపడం ప్రారంభించాడు!
డ్రైవర్ హార్న్ నొక్కాడు. కారు పక్కన నిలబడి ఉన్న కొంతమంది ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ను పలకరించి పక్కకు కదిలారు. కారు దుమ్ము రేపుతూ కదిలిపోయింది.
కొంతమంది ఉపాధ్యాయులతో మాట్లాడటంలో ఉప్పల్ బిజీగా ఉన్నాడు. ''రేపు ఉదయం 11 గంటలకు కాలేజీ ప్రాంగణంలో ఉపాధ్యాయ సంఘం సమావేశం ఉంది. కాలేజీలో తగిన పోస్టులో శ్రీమతి సాహ్నిని నియమించాలని మనం ఒక తీర్మానాన్ని ఆమోదిద్దాం. ప్రిన్సిపాల్ పై కొంత ఒత్తిడి తీసుకురావడానికి ఇదే సరైన సమయం.''
తిరిగి వచ్చేటప్పుడు, నేను చితి వైపు చూశాను. మంటలు తగ్గుముఖం పట్టాయి. సాహ్ని ముసలి తండ్రి మరియు కొంతమంది బంధువులు అక్కడ విషణ్ణ వదనాలతో మౌనంగా నిలబడి ఉన్నారు.
''ఈ రాత్రి, ప్రిన్సిపాల్ మరియు అతని మిత్రులు సాహ్ని మరణాన్ని షాంపైన్ పార్టీతో వేడుక చేసుకుంటారు...'' అంటూ ఉప్పల్ ఒకరికి చెబుతున్నాడు.
సాహ్ని ముసలి తండ్రికి కాస్త ఓదార్పునిచ్చే మాటలు చెప్పాలనుకున్నాను. దూరం నుండి చూస్తుంటే, ఆయన తన మొత్తం జీవిత సంపాదనని కోల్పోయి, గుండె పగిలిన వ్యక్తిలా కనిపించారు.
''రామ్ నామ్ సత్య్ హై ...''
నేను వెనక్కి తిరిగాను, మరొక పాడెతో కొంతమంది శ్మశానవాటికలోకి ప్రవేశించడం చూశాను. శవయాత్ర కొంచెం ముందుకు సాగింది. శవయాత్ర యొక్క కొసలో, ఎవరో మరొకరితో ''ఈ మూర్ఖుడు ఈ రోజే ఎందుకు చనిపోయాడు? నా రోజంతా వృధా అయ్యింది...!'' అని అంటున్నారు.
అయ్యో, ఎలాంటి పరిస్థితి వచ్చింది అనుకున్నాను. నాకిది నచ్చలేదు. నేను అనుకున్నాను - ఈ రోజుల్లో ''రామ్ నామ్ సత్య్ హై'' వంటి నినాదాల మధ్య పాడెని మోయడం ఎంత అర్థరహితంగా మారింది? ప్రపంచంలోని ఏకైక సత్యం అయిన ప్రభువు పేరు గురించి మరణం ఒకరికి గుర్తుచేయడం ఇతర యుగానికి సంబంధించినదై ఉండాలి. ఈ రోజుల్లో, పాడెతో పాటు నడిచే ప్రతి వ్యక్తి తన సొంత ప్రత్యేక సత్యాన్ని కలిగి ఉంటాడు. ఈ రోజుల్లో, చితి ముందు శ్మశానంలో నిలబడిన ప్రతి వ్యక్తికి తనదైన ప్రత్యేక నిజం ఉంది. అటువంటి గంభీరమైన సందర్భంలో కూడా, కొంతమందికి 'డబ్బే' సత్యం, మరికొందరికి 'భూములు' సత్యం. అటువంటి గంభీరమైన సందర్భంలో కూడా, కొంతమందికి 'ముఖస్తుతి' సత్యం, మరికొందరికి అది జోక్! మరణం వంటి గంభీరమైన సందర్భంలో, ప్రజలు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు, ''రామ్ నామ్ సత్య్ హై'' అని జపించే వంచన ఎందుకు?
ఒక ఆదర్శ వివాహం-ఊరేగింపులో పాల్గొనేందుకు కొంతమందినే ఎంచుకున్నట్టుగా, శవయాత్రలో చాలా తక్కువ మంది మాత్రమే ఎందుకు ఉండకూడదు, ''రామ్ నామ్ సత్య్ హై'' యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకునే వారుంటే చాలు. వాస్తవానికి ప్రభువు పేరు మాత్రమే ఈ నశ్వర ప్రపంచంలో ఓదార్పు మరియు అంతిమ సత్యం అని మరణం ఎవరికైనా గుర్తు చేయగలదా?
నేనిలా ఆలోచనల్లో ఉండగానే, ''అయ్యా! ధర్మరాజా! రండి, రోజూ వందలాది మంది చనిపోతారు. హృదయం లేని యమధర్మరాజు ఈ రోజుల్లో ఓవర్-టైమ్ చేస్తున్నారు! మీ విచారకరమైన ముఖాన్ని చూడటానికి అతనికి సమయం లేదు. అంతేకాక, నేను చెప్పానుగా, సాహ్ని అదృష్టవంతుడు. అతని మరణం అతన్ని అన్ని ప్రాపంచిక చింతల నుండి విముక్తి చేసింది!'' అంటూ మళ్ళీ ఉపన్యాసం ఇచ్చాడు గురీందర్.
నా కళ్ళు చెమ్మగిల్లాయి. కన్నీటి వెచ్చని చుక్క నా చెంప మీదుగా కిందకు జారింది. నేను తుడుచుకోలేదు. దాన్ని అలానే జారనిచ్చాను. నిశ్శబ్దంగా, నేను గురీందర్ స్కూటర్ మీద వెనుక సీటు ఎక్కి కూర్చున్నాను. వెంటనే, స్కూటర్ సందుల్లోంచి కదిలి ప్రధాన రహదారికి చేరుకుంది.
''రామ్ నామ్ సత్య్ హై ...''
మరో శవయాత్ర ఒక పాడెతో శ్మశానం వైపు వెళుతోంది. ఊరేగింపు వెనుక ఉన్న ప్రజలలో, నేను చాలా విసుగ్గా ఉన్న, ఆసక్తిలేని ముఖాలను చూడగలిగాను.
ముందు వెళ్తున్న ఆటో రిక్షా పైన అమర్చిన లౌడ్-స్పీకర్ ఓ హిందీ సినిమా పాటను వినిపిస్తోంది: ''దునియా జాయే తేల్ లేనే, ఐష్ తు కర్'' (ప్రపంచాన్ని పట్టించుకోకు.... నీ ఆనందం నువ్వు చూసుకో!)
- హిందీ, ఆంగ్ల మూలం : సుశాంత్ సుప్రిరు
- తెలుగు : కొల్లూరి సోమ శంకర్