Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెల్లవారుతూనే - బాధతో ముడుచుకు పడుకున్న కోట్లాది గుండెల్ని ఓ వెలుతురు శబ్దం తట్టి లేపుతోంది.టీవీలు వెదజల్లుతున్న ఆ వార్తా సుగంధం దేశమంతా విస్తరిస్తోంది. 'నలుగురు అత్యాచార నిందితుల ఎన్కౌంటర్'
వెంటనే ఎన్కౌంటర్ ఘనత ప్రతి పోలీసు చొక్కాపై పతకంలా చేరిపోతుంది.
జనం పోలీసులపై పూలవర్షం కురిపిస్తున్నారు.
పోలీసుల్లో వారికి దుష్టశిక్షణ చేసిన పురాణ పురుషులు కనిపిస్తున్నారు.
కనబడ్డ పోలీసునాపి నోట్లో మిఠాయి ముక్క పెడుతున్నారు.
దసరా, దీపావళి పండుగల్లా మారిన వాతావరణం, వాగ్బాణా సంచా సందడి.
'అబ్బ... ఇన్నాళ్ళకు ఆడాళ్ళమీద... అమ్మాయిల మీద.. పిల్లల మీద పడి అత్యాచారాలు, హత్యలు చేస్తున్న మృగాళ్ళకు తగిన సమాధానం దొరికింది'
'ఇట్లయితేనే బుద్ధికస్తరు... ఇదే తగిన శాస్తి'
'ఇలాంటి శిక్ష ఆ నలుగురికే కాదు... అత్యాచారులందరికీ జరగాలి... ఢిల్లీ నుండి గల్లీ దాకా...'
'ఇక ఆడవాళ్ళ దిక్కు చూడాలంటే ఉచ్చబడాలె..' ఓ పాలకుడి ధ్రువీకరణ.
'కోర్టులు, కమిటీలు వృధాప్రయాస... ఈ యాక్షనే బాగుంది' అని పక్క పాలకుడి ప్రశంస.
'వాళ్ళను కాల్చిన బుల్లెట్ను అపురూప వస్తువులా దాచుకోవాలనుంది' అని యువహీరో సామాజిక బాధ్యతను ప్రకటించేశాడు.
'మన పోలీసులకు పాదాభివందనం చేయాలనుంది' అని ఓ మెగా హీరో వృద్ధ నరుడి నీతి సూక్తి.
మా బిడ్డకు ఇలాగైనా న్యాయం జరిగిందని బాధిత కుటుంబ నిట్టూర్పు.
ఇంత మందిని సంతృప్తి పరచిన ఘటన దేశంలో మరోటి లేదేమో...
దేశ వ్యాప్తంగా అత్యాచార బాధిత కుటుంబాల నుండి ఒకటే డిమాండ్... మాకు కోర్టులొద్దు... విచారణ పేరిట చెప్పులరుగుడూ వద్దు.. ఎన్కౌంటర్ కావాలి... గ్రామ సభల్లో తీర్మానాలు... పంచాయితీలు.. ధర్నాలు.
ననన
పటేల్ బాపు చిన్న కూతురు రోజూ కాలేజీకి వెళుతుంది. ఆ ఊరు నుంచి కాలేజీకి వెళ్ళాలంటే ఆటోలే శరణ్యం. ఊరంటాం గాని ఇప్పుడు ఊరు పల్లె నుంచి పతనమవుతూ పట్టణ విస్తరణ కౌగిలిలో చిక్కిన మడి చెక్క.
యువకులంతా గోచీ పంచెలు మానేసి జీన్ప్యాంట్ల మోజులో పడ్డారు. కడుపులో ఇంతేసుకుని దినమంతా పట్టణ షికారు చేయడమే మహదానంద జీవనం. ఇంటర్నెట్ మాయామబ్బు ఊరిని కమ్మేశాక యువత చేతల్లో స్మార్ట్ఫోన్ తిష్టవేసింది. తాగినోడి కన్నా తూలడం ఎక్కువైంది.
ఆటోలు నడుపుకుని బతికే పోరగాండ్లకు ఊర్లో బుద్దిమంతులనే ముద్రనే వుంది. స్మార్ట్ఫోన్లు చేతికి వచ్చినాక ప్రయాణికుల కోసం దిక్కులు చూడ్డం మానేసి సీటుపై కాళ్ళు జాపుకుని ఫోన్ తెరకు కళ్ళు కట్టేయడమే ఇష్టకార్యమైంది. పలకరిస్తే తపోభంగమే.
'పోరగాండ్లు పనీపాట చేయక, చెడిపోతుండ్రు' అని కన్నవారి కంప్లైంటు. 'ఊకోండ్రి... మీకేం తెలుసు' అని పెద్దలపై మర్లవడే మాట. తల్లి, తండ్రి, కొడుకు, బిడ్డ అనే బంధాలే పలుచబడుతున్నట్లు డోన్ట్కేర్లు, తిట్లు, గెంటివేతలు, బలవంతంగా డబ్బు లాక్కోవడాలు, నమ్మినోడిని ముంచడాలు, గలాటాలు... పల్లెల్లో లొల్లులు లేని రాత్రి లేదు. నగరాల వెనక పట్టణాలు, పట్టణాల దారిలో పల్లెలు... అంతా స్టైలు క్రాపులు, షోకులు, గ్లోబల్ విలేజీ సంస్కృతి వరద బీభత్సం.
ఎక్కడెక్కడో ఏవేవో వార్తలు వినబడుతూనే వున్నాయి. టీవీల్లో, పేపర్లలో నిత్యకృత్యమైన హత్యాచారాలు మన ఊర్లోనా... ఛ... ఛ.. అలాంటివి జరగనే జరగవని గట్టి నమ్మకం. తాతా... కాకా.. అక్కా... చెల్లె... అని మమకారంగా పిలుచుకునే ఆత్మబంధాలు అంత బలహీనపడవనే భరోసా.
ఆటోలో ఒక్కదాన్నే అనే వెరపు ఎన్నడూ ఏ ఆడబిడ్డకూ రాలేదు. తమ ఊరి ఆటో అంటే పుట్టింటి పల్లకి. మాటా, మర్యాదల పూలరథం.
అయితే ఊరి నమ్మకాన్ని పుచ్చి బుర్రలు చేసే సంఘటన జరగనే జరిగింది.
పటేలు బాపు కూతురు రోజుటి మాదిరి సాయంత్రం కాలేజీ నుండి ఇంటికి రాలేదు. రాత్రంతా వెతుకులాట. తెల్లవారుతుండగా ఊర్లోకి వచ్చిన ఆటోలు సాక్ష్యాలతో సహా నిజాన్ని కక్కాయి. ఎక్కడ... ఎలా... చేశారు అనే విచారణ క్రమంలో పోలీసు కాల్పుల్లో ఆ నలుగురు చనిపోయారు. ఆ ఎన్కౌంటర్ వార్తే జనాగ్రహావేశాలపై పన్నీటి జల్లు అయింది. దేశ వ్యాప్త సంబరమైంది.
ఆ నలుగురి తల్లుల కడుపుశోకం... నేర తీవ్రతకు, సమాజ ఈసడింపుకు బెదిరి బయటకు పొక్కలేదు.
పాపపు గాడ్ది కొడుకులకు మంచి శాస్తి జరిగింది అని అందరూ అంటుంటే... ఔను, పాపపు గాడిదలమేనని తలూపుతూ ఒప్పుకున్నారు. పటేలు బాపు దుక్కం ముందు తమది పిసరంత అని సర్దుకున్నారు.
ననన
వచ్చే కాలానికి పోయే కాలం లోకువైనట్లు ఎండలకు భయపడి చలి మడమ తిప్పింది. తీవ్రమవుతున్న ఎండలకు జడిసి బడులు సెలవుల నీడకు చేరుకున్నాయి.
నీరు ఇగిరిపోయిన పోచమ్మ చెరువులో ఊరుమ్మడిగా శనగ పంట వేశారు. ఎండిన శనగ చెట్లు పీకడానికి బడి పిల్లలే కూలీలు.
చిన్న చేతులకు చిన్న పని.
ఓ రోజు శనగ కూలీకి పోయిన పోశక్క బిడ్డ సులోచన ఇంటికి తిరిగి రాలేదు. ఊరూ... చెరువు.. చేనూ... చెలకా అంతాటా వెతికారు. బిడ్డ జాడ దొరకలేదు. పోలీసులకు చెప్పారు. వారు 'చూస్తాం పొండి' అన్నారు.
ఊరు బెదిరిపోయింది. శనగ ఏరడానికి ఆడపిల్లలు రావడం లేదు. అమ్మాయి కనబడడం లేదంటే అత్యాచారం, హత్య పర్యాయపదాలయినాయి.
రెండో రోజే సులోచన ఓ బావిలో శవమై తేలింది.
పోలీసులు వచ్చారు. డాక్టర్ వచ్చాడు.
హత్యాచార ధ్రువీకరణ జరిగింది.
బొందలో శవాన్ని కప్పి కన్నీటి పూలు చల్లిన ఊరు గుండె బరువు తగ్గలేదు.
శవం దొరికిన బావి పటేలు బాపు బావమరిది వీరబాబుది. వీరబాబును ఊర్లోంచి తరిమేస్తే అక్కబావల పంచన బడి బతుకుతున్నాడు. వీరబాబు తాత నిజం జమానాలో తమ ఊర్లో ఆడవాళ్ళతో బరిబాతల బతుకమ్మ ఆడించాడని. వాళ్ళ నాయన ఆడకూలీలు పసి పిల్లలకు పాలిస్తానంటే పాలున్నాయా అని రొమ్ములు పిండి చూసేవాడని ఊర్లో గుసగుసలున్నాయి.
వీరబాబుకు కూడా వారసత్వ చరిత్ర వుంది. గుడిలో ఓ పనావిడను బలాత్కారం చేస్తే నక్సలైట్లు ఊరు నడిబొడ్డున ఆవిడ మూత్రం తాగించారట. ఆ అవమానం భరించలేక, తలెత్తుకోలేక ఊరు వదిలిపెట్టాడని మరీ చిన్నగా చెప్పుకుంటారు.
ఈ పాపిష్టి పని వీరబాబుదేనని ఊరంతా నమ్ముతోంది. నలుగురు పెద్దలు పోషక్క కుటుంబాన్ని తీసుకుని పటేలు బాపు ఇంటికెళ్ళారు. వారి వెనుకాల చాలామందే వున్నారు. తమ అనుమానాన్ని ఆయన ముందుంచారు.
వీరబాబును పిలుచుకురమ్మని ఆయన మనిషిని పంపాడు.
పిల్లిలా అడుగులో అడుగేస్తూ అందరి కళ్ళలోని భావాన్ని చదువుతూ వీరబాబు వచ్చి పటేలు బాపు ముందు నిలుచున్నాడు.
పటేలు బాబు లాగి కొట్టిన ఒకే చెంపదెబ్బకు వీరబాబు నోట నేర అంగీకారం జారిపడింది.
పోలీసులు వచ్చారు. వీరబాబును వెంట తీసికెళ్ళారు.
వీరబాబును పోలీసులు కాల్చి చంపుతారని, ఆ వార్త రేపు పొద్దున టీవీల్లో చూస్తామని గాఢమైన నమ్మకంతో అందరూ ఇళ్ళకు మళ్ళారు.
తెల్లారి టీవీల్లో ఆ వార్తే లేదు. రామాలయ నిర్మాణం గురించి, పౌరసవరణ బిల్లు గురించి గట్టిగా మాట్లాడుతున్న దృశ్యాలే మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి.
చావడిలో కరెంటు స్తంభానికి ఆనాడు కట్టిన పోలీసుపటం అలాగే వుంది. పాలాభిషేకం తాలూకు మరకలపై ఈగలు వాలుతున్నాయి. మళ్ళీ పాలాభిషేకం అవసరం వస్తుందని ఎవరో తడిగుడ్డతో ఆ ప్లెక్సీని తుడిచి శుభ్రం చేశారు. అయినా టీవీలో, పేపర్లో వీరబాబు చావు వార్త రాలేదు.
ప్రాణమాగక కొందరు పటేల్ బాపు ఇంటికెళ్ళారు.
'రేపొద్దున కోర్టుకు తీసుకుపోతున్నారు' అన్నాడాయన.
'కోర్టుకెందుకు? తుపాకీతో కాల్చి చంపేయాలి కద!' అందరి నోట ఇదే మాట.
'ఏమో నాకేం తెల్సు!' అనుకుంటూ పటేల్బాపు లోపలికి వెళ్ళాడు.
అరె... ఇదెక్కడి అన్యాయం. అందరి బిడ్డలు ఒక్కటి కాదా... పోలీసులు చంపుతారనే ఒక్క దెబ్బ వేయకుండా అప్పగించినం. కోర్టుకు పోయి పోలీసులనే అడుగుదాం...' అనుకుంటూ వెనుదిరిగారు.
పొద్దుటే ఊరు నుంచి వచ్చిన సుమారు ముప్పయి మంది కోర్టు ఆవరణలో వీరబాబును తీసుకొచ్చే వ్యాను కోసం ఎదురు చూస్తున్నారు.
సమయం పది దాటింది.
నల్లకోట్లు సర్దుకుంటూ వకీళ్ళు వస్తున్నారు. ఆ రోజు కేసులున్నవారు వారి వెనకాల పడి ఆపి మంతనాలాడుతున్నారు. అక్కడక్కడా పోలీసులు... వారి పక్కనే దిగాలుగా నిలబడ్డ నిందితులు... సాక్షులు... చుట్టాలు పక్కాలు... కోర్టు ఆవరణ ఇప్పుడే మొదలైన వార సంతలా మారిపోయింది.
ఇంతలో పోలీసు వ్యాను హారన్ వినబడగానే ఊరు నుంచి వచ్చిన వారి దృష్టి అటుగా మళ్ళింది.
గోడ పక్కన వ్యానును ఆపి అందులోంచి వీరబాబును దింపారు పోలీసులు.
ఊరు వారంతా పోలీసులను చుట్టుముట్టి 'వీరబాబును ఇంకా చంపలేదెందుకు!' అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
'కోర్టులో నేరం రుజువైతే శిక్ష పడుతుంది' అన్నాడు తాపీగా ఆ పోలీసుల్లో పెద్దాయన.
'మా పోరగాండ్లను నలుగురిని కాల్చి చంపినారు కదా!'
'అది వేరు... ఇది వేరు'
'ఎట్లా వేరు?'
'ఎక్కువ మాట్లాడకుండా పక్కకు జరగండి! కోర్టులో మమ్మల్ని పిలుస్తున్నారు'
'మేం వీరబాబును వదిలిపెట్టం. చంపి అదే బావిలో పూడ్చి పెడ్దాం' ఓ గొంతులో ఆవేశం మాటల్లోకి మారింది.
'వీరబాబు చావు మేం చూసే కదులుతాం' వేడిలో వేడిగా మరో మాట.
'ఏరు... ఏం మాట్లాడుతున్నారు? మా పనికి అడ్డమొస్తే మీ అందరిమీద కేసు పెట్టి లోపలేస్తాం' అని ఓ ఖాకీ హూంకరింపు.
లాఠీ మాటలకు, చూపులకు వేడి గొంతులు తోక ముడిచాయి.
'మా ఊరి పిల్లగాండ్లను ఎట్లా కాల్చి చంపినారో ఈయన్ని కూడా చంపాలి కదా!' ముందుకొచ్చిన పోశక్క గొంతులోంచి వేదనాభరిత అనుమానం బయటికొచ్చింది.
'ఏ... జరగవమ్మా' ఓ లాఠీ నెట్టివేత.
'అంత వేగిరంగ నలుగుర్ని చంపినప్పుడు ఒక్కడ్ని చంపడానికి ఇబ్బందేమి?' పోశక్క నోట మరో వేడికోలు ప్రశ్న.
'తల్లీ... నీకెలా చెప్పాలి. కాల్చేది మేమే అయినా కాల్పించేవారు వేరే వుంటారు. అర్థం చేసుకో' అంటూ పోలీసొకరు తప్పుకోమన్నట్లు చేతులెత్తి దండం పెట్టాడు.
'వాళ్ళెవరు... మేమెళ్ళి అడుగుతాం...' ఆమె గొంతులో ఓ ఆశ.
పోలీసులు గట్టిగా నవ్వారు. అందులోంచి ఒకాయన ముందుకొచ్చి 'వాళ్ళెవరంటే అంగబలం.. అర్ధబలం.. టీవీలు, పత్రికలు, సభలు, సంఘాలు, ధర్నాలు, కొవ్వొత్తుల నిరసనలు... ఓ చాలా వుంటాయి. ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అప్పుడు తూటా దానికదే బయటికొస్తుంది. ఇదంతా మీ వల్ల అవుతుందా... చేతనయితే చేసుకోండి' అన్నాడు గీతోపదేశంలా.
విన్నవారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటుండగా పోలీసులు వీరబాబును తీసుకుని కోర్టు హాలువైపు వెళ్ళారు.
మన ప్రయత్నం మనం చేద్దామనుకుంటూ అందరూ ఊరిబాట పట్టారు.
స్తంభానికి కట్టిన పోలీసాయన బొమ్మ స్థానంలో సులోచన పటం కట్టారు. కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. న్యాయం కావాలంటూ ఊరేగింపు తీశారు. టీవీ, పత్రికల్లో దీని ఊసే రాలేదు.
ఎండాకాలం పోయి బడులు తెరుచుకున్నాయి.
వర్షాల రాకతో సాగుపనులు మొదలయ్యాయి.
వీరబాబుకు కోర్టు బెయిలు మంజూరు చేసిందని, పట్టణంలోనే బంధువుల ఇంట్లో వుంటున్నాడనే వార్త ఊరిదాకా వచ్చింది.
రోజూ బిడ్డ ఫొటో దగ్గర దీపం వెలిగించే పోశక్క పటాన్ని ఇంట్లోకి తెచ్చుకుంది. సులోచన స్కూలు పుస్తకాలు పెట్టుకునే గూటి గొళ్ళానికి పటాన్ని తగిలించింది.
- బి.నర్సన్
రచయిత సెల్ : 9440128169