Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వనపర్తి రూరల్
కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తూ, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను సవరిస్తూ కార్మికుల పొట్ట కొడుతోందని సీఐటీయూ వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు విమర్శించారు. కార్మిక చట్టాల సవరణలో కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా వనపర్తి పట్టణంలోని 15 కేంద్రాలలో కార్మికులు ప్లకార్డులు చేతబట్టుకుని తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విడగొట్టి పెట్టుబడిదా రులకు అనుకూలంగా చట్టాలు మారుస్తోందని అన్నారు. ఇప్పటికే వేజ్ కోడ్ను పార్లమెంటులో ఆమోదించారని, మిగతా 3 కోడ్లు కూడా అమలులోకి వస్తే కార్మికులు కట్టుబానిసలుగా మారుతారని విమర్శించారు. ఇటీవల కాలంలో ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్లోని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు 3 ఏండ్ల వరకు కార్మిక చట్టాలు అమలు చేయబోమని ప్రకటించారని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో 12 గంటల పనివిధానంపై కార్మికులు తిరగబడడంతో హైకోర్టులో 8 గంటల పనిదినాలనే కొనసాగించాలని తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. దీంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ వెనక్కి తగ్గారని, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మిక చట్టాల సవరణలకు అనుకూలంగా ఉందని తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీలో సంఘాలను రద్దు చేశారని, షెడ్యూల్ పరిశ్రమలో గత 10 ఏండ్లుగా వేతన సవరణ చేయలేదని అన్నారు. కావున కార్మికులు ఐక్యంగా పోరాడి కార్మిక చట్టాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి గోపాలకష్ణ, అంగన్వాడీ జిల్లా అధ్యక్షులు బి.కవిత, జిల్లా కార్యదర్శి జి.పద్మ, ఆశా వర్కర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సునీత, మున్సిపల్ వర్కర్స్ జిల్లా కార్యదర్శి యాదగిరి, నాయకులు జి.కురుమయ్య, కె.మణ్యం, సురేందర్, నరేష్, హమాలి నాయకులు,తోపుడు బండ్ల కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.
గద్వాల్ టౌన్: ప్రజలంతా కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం సందెట్లో సడేమియాలా కార్మిక చట్టాలను రద్దు చేయడం తగదని , వెంటనే ఆ ఆలోచనను విరమించుకోవాలని సీఐటీయూ గద్వాల జిల్లా అధ్యక్షుడు ఏ. వెంకటస్వామి డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం సీఐటీయూ కార్యాలయం వద్ద ప్లకార్డులు పట్టుకుని కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను తుంగలో తొక్కి పెట్టుబడిదారులను రక్షించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాలను 12 గంటలకు పెంచాలని తీసుకున్న నిర్ణయాన్ని నిరాకరించారని హెయిర్ అండ్ ఫైర్ కార్మికులను తొలగించడం అన్యాయమన్నారు. ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి దేవదాసు, ఫైవ్ జిల్లా కార్యదర్శి నరసింహ, సీఐటీయూ నాయకులు గంగన్న, శివ, పరశురాముడు, యాదగిరి, రవి తదితరులు పాల్గొన్నారు
మక్తల్ : పని గంటలను 12 గంటలకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ నారాయణపేట తహసీల్దారు కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో భౌతిక దూరం పాటిస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బలరాం మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం వేతన కోడ్ సవరణ బిల్లును ఆమోదించిందని, 8 గంటల పని గంటలను 12 గంటలకు పెంచి కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. ఈనెల 22న 11 జాతీయ కార్మిక సంఘాలతో పాటు బీజేపీ అనుబంధ సంఘం బీఎంఎస్ కూడా ప్రభుత్వ తీరుపై సమ్మె చేపట్టనున్నాయని తెలిపారు. అనంతరం పేట తహసీల్దార్ తిరుపతయ్యకు వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు కే. కాశప్ప , మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా నాయకులు బలప్ప, మున్సిపల్ యూనియన్ జిల్లా నాయకులు రవి సాయిలు తదితరులు పాల్గొన్నారు
జడ్చర్ల :కార్మికుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పోలే జగన్ విమర్శించారు. సోమవారం జడ్చర్ల మండల కేంద్రంలో సీఐటీయూ
ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాలను 12 గంటలకు పెంచాలనే ప్రభుత్వ ఆలోచన దుర్మార్గమైనదని, ఇది కార్మికుల హక్కులను హరించడమేనని అన్నారు. ఈ చర్యలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డు నిధులను దారి మళ్ళించి నిర్మాణ రంగ కార్మికుల పొట్టగొట్టొదని తెలిపారు. వెల్ఫేర్ బోర్డులో పేరు నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి రూ. 5,000 అకౌంట్లో వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివోఏ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమేష్, వసియా బేగం, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు శంకర్, నరసింహులు, నాగరాజు, సావిత్రి, ఆశ వర్కర్స్ యూనియన్ షమీం, సీఐటీయూ నాయకులు ఆంజనేయులుపాల్గొన్నారు.
అలంపూర్ : 8 నుంచి 12 గంటల పని దినాల పెంపు నిర్ణయాని వెంటనే వెనక్కి తీసుకోవాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏమేలమ్మ, సీఐటీయూ మండల కార్యదర్శి బీ. నరసింహ డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా నివారణలో విధులు నిర్వహిస్తున్న కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరి స్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కేటా యించిన రూ. 20 వేల కోట్ల ప్యాకేజీలో కార్మికులకు ఎలాంటి ప్రయోజనం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు పుష్పవతి, లక్ష్మీకాంతమ్మ, మాధవి, లక్ష్మి, వీఆర్ఏలు రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
మదనాపురం : కార్మికుల పనిగంటల పెంపు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహ రించుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి. నిక్సన్ డిమాండ్ చేశారు. సోమవారం మండల పరిధిలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మదనాపురం, దుప్పల్లి, కోనూరు గ్రామాల కార్మికులు పాల్గొన్నారు
మహబూబ్నగర్ కలెక్టరేట్ : కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేయడం సరికాదనితెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు . ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి చంద్రకాంత్, ఆ సంఘం నాయకులు నరసింహులు బాలరాజ్, విశ్వనాథం, బాలయ్య, ఆంజనేయులు, చెన్నయ్య, వెంకటమ్మ, భీమా నర్సమ్మ పాల్గొన్నారు