Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరు టౌన్ : కేంద్ర ప్రభుత్వం ద్వారా పద్మశ్రీ అవార్డు అందుకున్న మండల కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు చింతకింది మల్లేశంకు శుక్రవారం రాత్రి సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని గీతం యూనివర్సీటీలో జరిగిన పదవ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించు కుని యూనిర్సిటి వైస్ చాన్సిలర్ ప్రొఫెసర్ కే.రామకృష్ణారావు మల్లేశంకు గౌరవ డాక్టరేట్ డిగ్రీని ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. స్నాతకోత్సవంలో పాల్గొన్న వివిధ విభాగాలకు చెందిన అద్యాపకులు, వివిద రంగాలకు ప్రముఖులు మల్లేశంను అభినందించడంలో పాటు శుభాకాంక్షలు తెలిపారు.
బీబీనగర్ : మండలపరిధిలోని రావిపహడ్, మాదారం గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు శనివారం శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అల్పాహార కార్యక్రమాన్ని ఎంపీపీ ఎరుకలి సుధాకర్ గౌడ్ ప్రారంభించారు. అల్పాహార కార్యక్రమానికి ఇరు గ్రామాల నుండి దాతలు ముందుకు వచ్చి రూ.75వేల ఆర్థికసాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి, ఎంపీటీసీ జిట్టా రజిత, సర్పంచ్లు ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.
భువనగిరి రూరల్ : మండలంలోని అనాజిపురం గ్రామంలో ఎంపీ నిధులతో వాటర్ ఫిల్టర్ను ఏర్పాటు చేయగా శనివారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రారంభించారు. అనంతరం దుర్గామాత హోటల్, కూల్ పాయింట్ను ప్రారంభించారు. గ్రామంలో మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటుకు రూ.10 లక్షలు, ఎల్ఈడీ లైట్స్కు రూ.2 లక్షలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సీపీఐ(ఎం) నాయకురాలు ఏదునూరి ప్రేమలత మల్లేశం, ఎంపీటీసీల ఫోరం జిల్లా కన్వీనర్ కల్పనశ్రీనివాస్ గౌడ్, పీసీసీ మాజీ కార్యదర్శి తంగెళ్ళపల్లి రవికుమార్, బర్రె జహంగీర్, ఉపసర్పంచ్ వెంకటేశ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ : చౌటుప్పల్ పట్టణంలో ఆర్టీసీ, జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె శనివారం 43వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా పట్టణంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేశ్, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి : శానిటేషన్ పనులనుపై నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు మురికి కాలువలు, రోడ్లు శుభ్రం చేయాలని మున్సిపల్ కమిషనర్ బీ.వంశీకృష్ణ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. శనివారం పట్టణంలోని 8, 9, 10 వార్డులలో పర్యటించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు వార్డులో మురికి కాలువలు, సీసీ రోడ్ల పనులు చేయాల్సి ఉన్నా కాంట్రాక్టర్లు చేయడంలేదని ఫిర్యాదు చేశారు. విష జ్వరాలు, డెంగ్యు, మలేరియా వ్యాధులు రాకుండా దోమల నివారణ పనులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
మోటకొండూర్ : ఈ నెల 23, 24 తేదీలలో చౌటుప్పల్ మండల కేంద్రంలో జరిగే సీఐటీయూ జిల్లా రెండవ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం మండల కార్యదర్శి కొల్లూరి ఆంజనేయులు అన్నారు. శనివారం మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో భవన నిర్మాణ, గ్రామపంచాయతీ, ఆటో వర్కర్స్, మధ్యాహ్న భోజన, స్కూల్ స్లీపర్ తదితర కార్మికులతో మహాసభకు సంబంధించిన కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోశయ్య, కొమ్మగాని దశరథ, ఆడెపు స్వామి., తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేట : స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 52వ గ్రంథాలయ వారోత్సవాలు శనివారం గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బెల్లి యాదయ్య మాట్లాడుతూ గత యాభై రెండు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి జాతీయ ఈ గ్రంథాలయ వారోత్సవాలు ముఖ్యంగా యువకులలో, విద్యార్థులలో పుస్తక పఠనం పెంపొందించే దిశగా ప్రయత్నం కొనసాగుతుందన్నారు. అనంతరం గ్రంథాలయ శాఖ అధికారి డా. రవికుమార్ చెగొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ అధ్యాపకులు శ్రీకాంత్, మధుసూదన్, పాల్గొన్నారు.
భువనగిరి రూరల్ : మండలంలోని నమాత్పల్లి గ్రామకంఠం భూమిని అక్రమంగా అమ్మినవారిపై, కొన్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ గ్రామ వార్డు సభ్యులు శనివారం డీపీఓకు వినతి పత్రం అందజేశారు. ఎర్రంబెల్లి గ్రామం వెళ్లే దారిలో సుమారు 200 గజాల గ్రామకంఠ స్థలాన్ని నందనం గ్రామానికి చెందిన రావి రవిందర్రెడ్డి, భాస్కర్రెడ్డి, సురేందర్రెడ్డిలు నమాత్పల్లి గ్రామానికి చెందిన ఎల్లంల రామయ్యకు అమ్మినట్టు ఆరోపించారు. కాగా భూమి అమ్మిన వ్యక్తి పేరు మీద గ్రామ పంచాయతీ రివిజన్లో గత 20 సంవత్సరాల నుండి నమోదు చేయలేదు, కబ్జాలో కూడా లేదన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఉపసర్పంచ్ రాములు, వార్డు సభ్యులు ఉన్నారు.
భువనగిరి : ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎనిమిది మంది న్యాయవాధి వృత్తిలో మూడు సంవత్సరాల శిక్షణ కోసం ఎస్సీ న్యాయవాధ పట్టబద్రులైన వారిని ఎంపిక చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ద్ధి అధికారి జే.సజన్కుమార్ తెలిపారు.
వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించని ఎస్సీ విద్యార్థులు ఈ శిక్షణకు అర్హులన్నారు. ఈ నెల 20వ తేదీ లోపు అభ్యర్థులు కార్యాలయంలో తమ బయోడేటాతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.