Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుట్రకేసు నిందితుల్లో బీజేపీ సీనియర్లు ఎల్కె అద్వానీ, జోషీ, ఉమాభారతి, కళ్యాణ్సింగ్
- 2020 ఏప్రిల్కల్లా తీర్పు ఇవ్వాలంటూ ప్రత్యేక కోర్టును ఆదేశించిన సుప్రీంకోర్టు
లక్నో: దశాబ్దాలుగా రెండు మతాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైన బాబ్రీ మసీదును 1992, డిసెంబర్ 6న హిందూత్వ సంస్థలకు చెందిన కరసేవకులు కూల్చివేశారు. ఇటీవలే ఆ వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతుందంటూ సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. అయితే, బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు నుంచి తీర్పు ఇంకా వెల్లడి కాలేదు. కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేతలు ఎల్కె అద్వానీ, మురళీ మనోహర్జోషి, ఉమా భారతి, యూపీ మాజీసీఎం కల్యాణ్సింగ్, మాజీ ఎంపీ వినరు కటియార్ నిందితులుగా ఉన్నారు. అయోధ్యలోని స్థల వివాదంపై తీర్పు ఇచ్చిన సందర్భంగా మాజీ చీఫ్జస్టిస్ రంజన్గొగోరు నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కరసేవకులు మసీదును కూల్చి వేయడం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంలో ముస్లిం వర్గాలకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన తర్వాత దేశంలో జరిగిన మత ఘర్షణల్లో దాదాపు 2000మంది అమాయకులు బలయ్యారు.
ఈ కేసులో ఇప్పటివరకూ ఏం జరిగింది..?
బాబ్రీ మసీదు కూల్చివేతపై 1992 డిసెంబర్ 6న 197 బై 92 నెంబర్తో స్థానిక రామజన్మభూమి పోలీస్ స్టేషన్లో మొదటి ఎఫ్ఐఆర్ నమోదైంది. గుర్తు తెలియని కరసేవకులు మసీదును కూల్చి వేసినట్టు అందులో పేర్కొన్నారు. ఆ తర్వాత 10 నిమిషాలకు మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. అందులో వీహెచ్పీ నేతలు విష్ణు దాల్మియా, సాథ్వి రితంబర రెచ్చగొట్టే ఉపన్యాసాలిచ్చినట్టు అభియోగాలున్నాయి. ఆ తర్వాత కొన్ని రోజుల్లో మరో 47 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. జర్నలిస్టులుసహా పలువురిపై దాడులకు సంబంధించినవి కూడా వాటిలో ఉన్నాయి. ఆ తర్వాత వీటన్నిటినీ ఒకే ఛార్జిషీట్లోకి సీబీఐ మార్చింది. అనుబంధంగా బీజేపీ, వీహెచ్పీ నేతలపై మరో ఛార్జిషీట్ను రూపొందించింది. మసీదు కూల్చివేత వెనుక భారీ నేరపూరిత కుట్ర ఉన్నట్టు అభియోగాలు మోపింది.
కాగా, అద్వానీసహా బీజేపీ సీనియర్ నేతలపై నమోదైన కుట్ర అభియోగాలను 2001లో సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టి వేసింది. ప్రత్యేక కోర్టు తీర్పును 2010లో అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. ఆ తర్వాత లక్నో ప్రత్యేక కోర్టు ఈ కేసును రెండుగా విభజించింది. 21మంది నిందితులపై విచారణను రారుబరేలీలోని కోర్టుకు బదిలీ చేసింది. మిగతా 27మంది నిందితులపై లక్నో కోర్టు విచారణకు స్వీకరించింది. అద్వానీసహా బీజేపీ, సంఫ్ుపరివార్ నేతల రెచ్చగొట్టే ఉపన్యాసాలపై రారుబరేలీ కోర్టులో, లక్షలాది గుర్తు తెలియని కరసేవకులు మసీదును కూల్చివేసిన కేసును లక్నో కోర్టులో విచారణ చేపట్టాలన్నది ప్రణాళిక. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2011లో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2017, ఏప్రిల్ 19న రోజువారీ విచారణ జరపాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను రద్దు చేసింది. అద్వానీసహా సీనియర్ నేతలపై నేరపూరిత కుట్ర కేసులో విచారణ జరపాల్సిందేనని స్పష్టం చేసింది. రారుబరేలీ కేసును లక్నోలోని ప్రత్యేక కోర్టుకు తిరిగి బదిలీ చేసింది. 2020 ఏప్రిల్ వరకల్లా ఈ కేసులో తీర్పు వెల్లడించాలని ప్రత్యేక కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. దాంతో, అదే ఏడాది మే నెలలో ప్రత్యేక కోర్టు బీజేపీ నేతలపై విచారణ చేపట్టింది. ఈ కేసులో ఇప్పటి వరకు 300మంది సాక్ష్యులను ప్రత్యేక కోర్టులు ప్రశ్నించాయి. వీరిలో 50మంది మరణించారు. సాక్ష్యుల్లో పలు మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు కూడా ఉన్నారు.
జర్నలిస్టుల సాక్ష్యాలే కీలకం
బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణలో జర్నలిస్టుల సాక్ష్యాలు కీలకం కానున్నాయి. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసినవారిలో బీబీసీ వరల్డ్ సర్వీస్ విలేకరి సర్ విలియమ్ మార్క్ టుల్లీ ఒకరు. శిలాన్యాస్ పేరుతో హిందూత్వ సంస్థలకు చెందిన లక్షలాది కరసేవకులు అయోధ్యకు చేరుకున్న రోజున, అక్కడ ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియజేయడానికి టుల్లీ అక్కడికి చేరుకున్నారు. జైశ్రీరాం అంటూ ఆవేశపూరిత నినాదాలతో కాషాయరంగు బ్యాడ్జీలు ధరించిన కరసేవకులు మసీదువైపు తరలి వెళ్లడాన్ని ఆయన చూశారు. జరుగుతున్న ఘటనల్ని ఎప్పటికపుడు ఆయన లండన్లోని తమ ఆఫీస్కు తెలియజేశారు. మూడు వరుసల రక్షణ వలయంగా ఉన్న పోలీసులు గుంపులుగా మసీదువైపు దూసుకుపోతున్న కరసేవకుల్ని నిలువరించకుండా నిశ్చేష్టులై ఉండటాన్ని టుల్లీ గమనించారు. చివరికి మసీదు కూల్చివేత ఘటన సీన్ టు సీన్ ఎలా జరిగిందో ప్రత్యక్షంగా వీక్షించారు.
మసీదు కూల్చివేత జరిగిన 26 ఏండ్ల తర్వాత టుల్లీని సీబీఐ సంప్రదించింది. లక్నోలోని ప్రత్యేక కోర్టులో సాక్ష్యం ఇవ్వాలని కోరింది. కూల్చివేత వెనుక కుట్రకోణం ఏమైనా ఉన్నదా..? అన్న అంశంపై కోర్టు ఆయన్ని ప్రశ్నించింది. జిల్లా జడ్జి ఎస్కె యాదవ్ ముందు ఆనాడు తాను చూసిన సంఘటనల క్రమాన్ని ఆయన వివరించారు. టుల్లీ సాక్ష్యాన్ని నిందితుల తరఫు డిఫెన్స్ న్యాయవాది సవాల్ చేశారు. సంఘటన ప్రాంతంలో తాను లేనని వాదించేందుకు న్యాయవాది ప్రయత్నించారని టుల్లీ తెలిపారు. తాను ఏ హౌటల్లో బస చేసిందీ రుజువు చూపే బిల్లు ఉన్నదా..? ఆ హౌటల్ ఫోన్ నెంబర్ ఉన్నదా..? అని ప్రశ్నించారని టుల్లీ తెలిపారు. 26 ఏండ్ల క్రితంనాటి ఆధారాలు కావాలంటూ అడిగిన ఈ తుంటరి ప్రశ్నలకు ఎవరైనా ఎలా సమాధానం చెప్పగలరని జడ్జికి వివరించానని టుల్లీ తెలిపారు.
ఈ కేసులో పియొనీర్ ఇంగ్లీష్ దినపత్రిక ఫోటోగ్రాఫర్ ప్రవీణ్జైన్ కూడా ఓ ప్రత్యక్ష సాక్షి. తాను తీసిన ఫోటోల ఆధారంగా మసీదు కూల్చివేత వెనుక నేరపూరిత కుట్ర ఉన్నట్టు అర్థమవుతుందని జైన్ తెలిపారు. కూల్చివేత సమయంలో ముంబై నుంచి వెలువడే ఆన్లుకర్కు రిపోర్టర్గా పని చేసిన రేణూ మిట్టల్ కూడా ఓ ప్రత్యక్ష సాక్షి. ఆమె రెండు ప్రత్యేక కోర్టుల్లో పలుమార్లు సాక్ష్యం చెప్పినట్టు తెలిపారు. మసీదు కూల్చివేతలో ఎల్కె అద్వానీ పాత్రపై ఆమె సాక్ష్యం ఇచ్చారు. కరసేవకులు మసీదును కూల్చివేస్తుంటే అక్కడే ఉన్న బీజేపీ నేతలెవరూ అడ్డుకోలేదని ఆమె తెలిపారు. ఆ సమయంలో ది వీక్ మేగజైన్కు రిపోర్టర్గా ఉన్న దేబాశిష్ ముఖర్జీ కూడా ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి. సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణలో జర్నలిస్టుల సాక్ష్యాలు కీలకం కానున్నాయి. ఈ కేసులో దోషులుగా తేలిన నిందితులకు రెండు నుంచి ఐదేండ్ల వరకూ శిక్షలు పడనున్నాయి.