Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిల్లుకు వ్యతిరేకంగా 48 గంటల బంద్
- తొలిరోజు తెరుచుకోని విద్యా, వాణిజ్య సంస్థలు
- సీఎంకు వ్యతిరేకంగా నిరసనకారుల ర్యాలీలు
గువహతి : మోడీ సర్కారు తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రం అసోంలో ఆందోళనలు తీవ్రమయ్యాయి. బిల్లును వ్యతిరేకిస్తూ 'ఆల్ మోరన్ స్టూడెంట్స్ యూనియన్'(ఏఎంఎస్యూ) పిలుపునిచ్చిన 48 గంటల బంద్ ప్రభావం తొలిరోజు(సోమవారం) రాష్ట్రంలో కనిపించింది. విద్యాసంస్థలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు తెరుచుకోలేదు. కేంద్ర, రాష్ట్ర సర్కారు తీరుకు వ్యతిరేకంగా ఆందోళనకారులు ఎక్కడికక్కడ నిరసనలు తెలిపారు. ర్యాలీలు, దీక్షలు చేపట్టారు. ప్రధానంగా లఖింపూర్, ధేమాజీ, టిన్సుకియా, దిబ్రూగఢ్, శివసాగర్, జోర్హట్, ముజులీ, మోరీగావ్, బొంగారుగావ్, ఉదల్గురి, కొక్రాజ్హర్, బక్సా జిల్లాల్లో ఉదయం ఐదు గంటల నుంచి బంద్ ప్రారంభమైంది. బంద్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రయివేటు కార్యాలయాలు తెరుచకోలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది హజరు పలుచగా నమోదైంది. పలు చోట్ల నిరసనకారులు టైర్లను దహనం చేశారు. జాతీయ రహదారులను దిగ్బంధించారు. నిరసనకారుల ఆందోళనతో సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను పోలీసు బందోబస్తుతో నడిపించినట్టు అధికారులు తెలిపారు.
దిబ్రూగఢ్, గువహతిలలో పోలీసు సిబ్బంది, ఆందోళన సమూహాల మధ్య తోపులాటలతో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. ఆందోళనకారుల వాహనాలను పోలీసులు ఆపేందుకు ప్రయత్నించడంతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులు.. ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. కజరంగ జాతీయ పార్క్కు వచ్చి దేశ, విదేశీ పర్యాటకులు రవాణా సౌకర్యాలు లేక బంద్ ప్రభావాన్ని చూశారు. మరోపక్క, పౌరసత్వ బిల్లును అడ్డుకోవడంలో విఫలం చెందిన అసోం సీఎం సర్బాంనంద సోనోవాల్కు వ్యతిరేకంగా పలు చోట్ల ఆందోళనకారులు 'అంత్యక్రియలు' జరిపారు. బీజేపీ ఏకపక్ష వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లు స్థానిక ప్రజల ఉనికి, భాషను దెబ్బతీస్తుందని వారు ఆందోళన వెలిబుచ్చారు. అలాగే వామపక్ష-ప్రజాస్వామ్య సంస్థలు కూడా మంగళవారం 11 గంటల బంద్కు పిలుపునిచ్చాయి. పౌరసత్వ సవరణ బిల్లును కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్షా.. సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
అక్రమ వలసదారులకు అసోం చెత్తబుట్ట కాదు
బిల్లుకు వ్యతిరేకంగా 'ఆసు' నిరసనలు
పౌరసత్వ సవరణ బిల్లు.. అసోంలోని బీజేపీ సర్కారుకు పెద్ద తలనొప్పిగా మారింది. లోక్సభలో కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థిసంఘాలు, పౌర సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు నిరసనలు చేస్తున్నాయి. ఈ బిల్లు తమ అస్థిత్వాన్ని దెబ్బతీస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా పౌరసత్వ బిల్లు విషయంలో రాష్ట్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, ఆందోళనలు జరిగాయి. మంత్రుల దిష్టిబొమ్మలను ఆందోళనకారులు దహనం చేశారు. బిల్లును నిరసిస్తూ నేటి ఉదయం ఐదు గంటల నుంచి 11 గంటల బంద్కు నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్(ఎన్ఈఎస్ఓ) పిలుపునిచ్చింది. కాగా, పౌరసత్వ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్(ఆసు) నిరసన ప్రదర్శనలు కొనసాగించింది. అక్రమంగా వలసవచ్చిన వారికి అసోం చెత్తబుట్ల కాదని, పార్లమెంటులో సంఖ్యాబలాన్ని చూసుకొని ఈ బిల్లును కేంద్రం తీసుకొచ్చిందని ఆసు ముఖ్య సలహాదారు సముజ్జల్ భట్టాచార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోం ఒప్పందం-1985కు ఈ బిల్లు పూర్తిగా వ్యతిరేకమనీ ఆరోపిస్తూ రాష్ట్రంలోని రెండు ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్లు నిరసనల్లో పాల్గొన్నాయి.
బిల్లు ప్రమాదకరం : సీపీఐ(ఎం)
సభలో బిల్లుపై జరిగిన చర్చలో సీపీఐ(ఎం) తరఫున ఎస్ వెంకటేషన్ మాట్లాడుతూ మోడీ సర్కార్ మతం ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వాలని తీసుకొచ్చిన ఈ బిల్లు చాలా ప్రమాదకరమని విమర్శించారు. రాజ్యాంగ మూల సూత్రాలను విస్మరించారని, జాతి వ్యతిరేక బిల్లు అని పేర్కొన్నారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ సూత్రాలకు విఘాతం కలిగించే బిల్లు తేవడం దారుణమన్నారు. రాజ్యాంగంలో కుల, మత, ప్రాంత, భాష ప్రాతిపదికగా సమానత్వం పేర్కొందని, దాన్ని విస్మరించారని మండి పడ్డారు. చర్చ ముగిసిన తరువాత నటరాజన్ మూడు సవరణలు సూచించారు. బిల్లులోని రెండో క్లాజ్లో పేర్కొ న్న సరిహద్దు దేశాలైన ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి దేశంలోకి వచ్చిన హిందూ, సిక్కు, బుద్ధిస్టు, జైన్, పార్శీ, క్రిస్టియన్స్ వర్గాలకు అనేదాన్ని డిలీట్ చేయాలని, క్లాజ్ 3లో సెక్షన్ 6బి, సబ్ సెక్షన్ 4లో పేర్కొన్న 34 నుంచి 37 వరకు ఉన్న అస్సాం, ఈశాన్య రాష్ట్రాలకు అప్లై చేయకూడదని, క్లాజ్ 6లో పేర్కొన్న మతాల పేరుతో పౌరసత్వాన్ని ఆపాలని సవరణలు ప్రవేశపెట్టారు.
పౌరసత్వ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలి
- గళం విప్పిన శాస్త్రవేత్తలు
మోడీ సర్కారు తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశంలోని శాస్త్రవేత్తలు, పరిశోధకులు సైతం తమ గళాన్ని విప్పారు. ఇలాంటి బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలంటూ దాదాపుగా వెయ్యి మంది సైంటిస్టులు, పరిశోధకులు పిలుపునిచ్చారు. పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే బిల్లుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఒక ప్రకటనను విడుదల చేశారు. 2019 జనవరిలో ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లును అనుసరించి.. ప్రస్తుత రూపంలో ఉన్న బిల్లును తాము ఒప్పుకోబోమన్నారు. మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించే ఈ బిల్లు తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తుందని తాము భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇది రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణానికి భిన్నమని శాస్త్రవేత్తలు, పరిశోధకులు వివరించారు. ఈ బిల్లులో ముస్లింలను మినహాయించడం తమను భయాందోళనలకు గురిచేస్తున్నదనీ, ఇది దేశంలోని 'భిన్నత్వాన్ని' దెబ్బ తీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణాలతోనే బిల్లును వెంటనే వెనిక్కి తీసుకోవాలని తాము పిలుపునిచ్చినట్టు వారు వివరించారు. రాజ్యాంగానికి ద్రోహం తలపెట్టొద్దు : పౌర హక్కుల నేతలు
న్యూఢిల్లీ : రాజ్యాంగానికి ద్రోహం తలపెట్టే పౌరసత్వ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని పౌర సమాజానికి చెందిన దాదాపు 625 మంది ప్రముఖు లు పిలుపునిచ్చారు. ఈ బిల్లును ఖండిస్తున్నట్టు తెలిపా రు. ఇది దేశంలోని ప్రజల మధ్య విభజన, వివక్షలకు దారి తీస్తుందనీ, ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. '' స్వాతం త్య్రం వచ్చినప్పటి నుంచి భారత పౌరసత్వం రాజ్యాంగం లో ధృఢంగా పాతుకుపోయింది. లింగం, కులం, మతం, తరగతి, సంఘం, భాషలతో సంబంధం లేకుండా సమానత్వం ప్రాథమికాలను రాజ్యాంగం నొక్కి చెప్తుంది. పౌరసత్వ(సవరణ) బిల్లు భారతదేశ సమగ్ర, మిశ్రమ దృష్టిని ముక్కలు చేస్తుంది. 1955 పౌరసత్వ చట్టానికి ప్రవేశపెట్టిన సవరణలలో.. కొత్త బిల్లు రాజ్యాంగంలోని ఈ ప్రాథమిక సూత్రాలలో ప్రతి ఒక్కటీ ఉల్లంఘిస్తుంది. ఇది భారత రిపబ్లిక్ స్వరూపాన్నే ప్రాథమికంగా మార్చే బిల్లు. దేశవ్యాప్తంగా ఎన్నార్సీ అమలుతో పాటు పౌరసత్వ బిల్లును పరిశీలించాలి'' అని వారు చెప్పారు. ''మయన్మార్ నుంచి రోహింగ్యాలు, శ్రీలంక నుంచి తమిళులు, పాకిస్తాన్ నుంచి అహ్మదీయులు వంటి శరణార్థులను ఎందుకు వదిలివేయాలి? కేవలం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లోని ముస్లింయేతరులపైనే ఎందుకు దృష్టి పెట్టాలి? అంతర్జాతీయం చట్టానికి అనుగుణంగా భారత్కూ శరణార్థి విధానం అవసరమని ఈ బిల్లు మనకు చూపిస్తుంది'' అని వివరించారు. ఈ బిల్లు రాజ్యాంగంలో పొందుపర్చిన లౌకిక సూత్రాలను ఉల్లంఘిస్తుందన్నారు. రాజ్యాంగం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని చెప్పారు. సాంస్కృతిక, విద్యా వర్గాల నుంచి ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు.