Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ గురించి ఎంపీలు, ఎమెల్ఏల సమక్షంలో ఈ నెల 18న బహిరంగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ప్రకటించడం 30ఏండ్లుగా సాగుతున్న అలుపెరుగని కార్మికశక్తి విజయం. కేసీఆర్ ప్రకటన హైదరాబాదులో జరగబోవు జీహెచ్ఎంసీ ఎన్నికల కోణంలో చేయబడినదే అయి ఉండవచ్చు, అయినప్పటికీ కార్మిక, కర్షకులు ఎన్నో ఏండ్లుగా నినదిస్తున్న ప్రభుత్వ రంగాల పరిరక్షణ నినాదం ఆయన ఎత్తుకోవడం ఆహ్వానించదగినదే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే కేసీఆర్ ధర్నాచౌక్ను రద్దు చేయడం, ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు సమ్మె చేసిన సందర్భాలలో విపరీతమైన విమర్శలు చేయడం, సంఘాల నాయకులను నిందించడం జరిగింది. బలంగా ఉన్న సంఘాలను విచ్ఛిన్నం చేసి టీఆర్ఎస్కు అనుబంధంగా కార్మిక సంఘాలను నెలకొల్పడం, అందులో కార్మికోద్యమంతో సంబంధంలేని రాజకీయ నాయకులే కార్మిక సంఘాలకు కూడా నాయకులుగా చలామణి అవడం వంటివన్నీ సంఘాల విచ్చిన్నతిలో భాగమే. అన్నిటిని మించి తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు 59రోజుల సమ్మె చేస్తే దానిని అణచివేసి, సంఘాలను రద్దు చేసి కన్సిలియేటరీ మీటింగుల ద్వారా సమస్యలు పరిష్కరిస్తామంటూ తమ ఏకపక్ష ధోరణిని ప్రదర్శించారు. అయితే సమ్మె విరమణ తర్వాత ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తానని, ఉద్యోగులకు ఎలాంటి నష్టం కలగకుండా చూసుకుంటానని ప్రకటించక తప్పలేదు.
''కలిసివస్తే సహచరత్వం, కాలరాస్తే పోరాటం'' మాత్రమే తెలిసిన కార్మిక వర్గం ఇప్పుడు పోరుబాటలో ఉన్నది. ప్రభుత్వ రంగాల పరిరక్షణపై కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతానని కేసీఆర్ ప్రకటించిన సందర్భంలో అది కచ్చితంగా కార్మికవర్గానికి బలాన్నే ఇస్తుంది. మాట మారిస్తే కేసీఆర్కే తలవంపులు తెస్తుంది. భారత రాజకీయ చరిత్రలో వామపక్ష పార్టీలు తప్ప మిగతా ఏ పార్టీలు తమకు తాము (లౌకిక పార్టీలుగా ప్రకటించుకున్నవి కూడా) ప్రభుత్వరంగ ఆవశ్యకతను, వాటి అవసరాన్ని ఇంతగా నొక్కి చెప్పలేదు. కేసీఆర్ ప్రకటన కేవలం ప్రభుత్వ రంగాల పరిరక్షణ కోరుకునే వాళ్ళకు మాత్రమే కాదు, ప్రజలకు కూడా ఎంతో ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే ప్రయివేటు రంగాలను నమ్మి మోసపోకుండా ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి నేత ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా ప్రభుత్వ రంగాలనే ఎక్కువగా ఆశ్రయించి ప్రజలు లాభం పొందే అవకాశం ఉంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పైన కేసీఆర్ ప్రసంగిస్తూ.. 40కోట్ల పాలసీదారులకు సేవలందిస్తున్నదనీ, ఎప్పుడూ నష్టాలు చవిచూడలేదనీ, అట్లాంటి సంస్థను ప్రయివేటు పెట్టుబడిదారులకు అప్పజెప్పరాదనీ సూటిగా కేంద్రాన్ని తప్పుబట్టారు. ఇలాంటి అంశాలన్నీ మీడియా ద్వారా ప్రజలకు చేరినప్పుడు ప్రజలు కచ్చితంగా ప్రయివేటు ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్లకుండా ప్రభుత్వరంగ సంస్థలను ఆశ్రయించే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది.
సందర్భం జీహెచ్ఎంసీ ఎన్నికలే అయినా, ఎన్నాళ్లుగానో అభ్యుదయవాదులంతా కోరుకుంటున్న రెండు ప్రధాన అంశాలను కేసీఆర్ స్పశించారు. ఒకటి మతతత్వ విధానాలపై జాగ్రత్తగా ఉండాలని, వాటిని తాము వ్యతిరేకిస్తామని సూటిగా ప్రకటించారు. రెండు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించకుండా కాపాడుకుంటామని చెప్పారు. భారతదేశపు నిజమైన జాతీయవాద ఐక్యతను కాపాడటానికి ఇవే ప్రధాన అంశాలు. అధికార పీఠం కోసం ఆడుతున్న ఆటలో బీజేపీ జాతీయవాదానికి అర్థాన్నే మార్చేసింది. బీజేపీకి లేదా నరేంద్రమోడీకి సపోర్ట్ చేయడమే జాతీయవాదంగా ముందుకు తెచ్చింది. కానీ నిజమైన జాతీయవాదం అంటే ప్రభుత్వ రంగాల ద్వారా లాభాపేక్ష లేకుండా, సమ్మిళిత, స్థిరమైన అభివృద్ధికి పాటుపడాలి. బహుళ సంస్కృతుల భాగస్వామ్యంతో ఎదిగిన భారత్ నిర్మాణానికి బీటలు వారకుండా ఉండాలంటే మతసామరస్యాన్ని మనసా వాచా కర్మణా పాటించాలి. ఈ రెండు అంశాలలో బీజేపీ తిరోగమన దారిని ఎంచుకున్నది. అధికారం కోసం మతపరమైన భావోద్వేగాలను రేపడం, అధికారం దక్కిన తర్వాత అందుకు సహకరించిన పెట్టుబడి దారులకు అనుకూలంగా ఉండేందుకు ప్రభుత్వ రంగాలను వారికి అప్పజెప్పే కార్యక్రమాలను చేపట్టడం తమ విధానంగా మలుచుకున్నది. అందుచేత ఇప్పుడు ఈ రెండు అంశాలను తీవ్రంగా ఎవరు వ్యతిరేకించినా ఆహ్వానించవల్సిందే. ఎన్నికల తర్వాత బీజేపీ యేతర పార్టీలన్నిటినీ కలిపి ప్రభుత్వరంగ పరిరక్షణకు నడుం బిగిస్తానని కేసీఆర్ ప్రకటించడంలో చిత్తశుద్ధి ఏపాటిదో ఎన్నికల తర్వాతనే బయట పడుతుంది. ఎన్నికల తర్వాత ఓడ మల్లయ్య కాదు బోడి మల్లయ్య అనే సామెతను కేసీఆర్ నిజం చేస్తే ప్రజల ముందు నవ్వుల పాలు అవుతారు. తన విశ్వసనీయతను కోల్పోతారు. అయితే కేసీఆర్ చేసిన ఈ ప్రకటన ద్వారా బీజేపీ కాంగ్రెస్ పార్టీల ఆలోచనా విధానాల్లో కొంతైనా కుదుపు రావడం ఖాయం. కార్మికవర్గ పోరాటానికి అనుకూలంగా వెలువడిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు మరింత పదునుగా పనిచేయాలి. రేపు నవంబరు 26న జరగబోవు సమ్మెలో పాల్గొనకుండా ఉండే సంఘాలను ఏకాకిని చేసి ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలి. సమ్మెలో పాల్గొనని వారంతా మత విద్వేషాలను కోరుకునేవారు గానూ, పూర్తిగా ప్రభుత్వ రంగాలను తెగనమ్మటాన్ని కోరుకునేవారు గానూ చరిత్రలో నిలిచిపోతారన్న సత్యాన్ని వారికి తెలియజేయాలి. ప్రభుత్వ రంగ సంస్థలపై జరుగుతున్న దాడిని నిలువరించడానికి ఖచ్చితంగా అవకాశం ఉన్నది. ఇప్పుడు బీపీసీఎల్, ఎల్ఐసీ సంస్థల్లో వాటాల ఉపసంహరణ ప్రక్రియ మరింత వేగవంతమైంది. రాబోయే శీతాకాల సమావేశాలలో ఆ పని పూర్తి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. నిజంగా ప్రభుత్వ రంగ పరిరక్షణకు రాజకీయ పార్టీలతో సహా ఒక పెద్ద కూటమీ ఏర్పడితే లాభమే కానీ బూర్జువా రాజకీయ పార్టీలెప్పుడూ నమ్మజాలనివి. అందుచేత కార్మికులు తమ స్వశక్తి ద్వారా చేపట్టే పదునైన పోరాటాలే ఊగిసలాడే వారిని కూడా ఈ మార్గంలోకి వచ్చేలా చేయగలవు.
- జి. తిరుపతయ్య
సెల్: 9951300016