Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని ఈసంవత్సరం గుర్తించే విధంగా భిన్నమైన రీతులలో నిర్వహించారు. ఆయన చిత్రపటాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, రాష్ట్రపతి భవన్లో ఆవిష్కరించారు. ఆయన జన్మదినాన్ని పరాక్రమ దివస్ (బ్రేవరీ డే)గా నిర్వహించాలని ప్రకటించారు. హౌరా కలకటా మెయిల్ పేరును నేతాజీ ఎక్స్ప్రెస్గా మార్చాలని రైల్వే మంత్రి ప్రకటించారు. మమతా బెనర్జీ దీనికి భిన్నంగా, ఆయన జన్మదినాన్ని దేశ్ నాయక్ దివస్గా నిర్వహిస్తామని ప్రకటించింది. నోటి మాటల ప్రచారంతో, సోషల్ మీడియా ద్వారా బీజేపీ, వారి పరివారం, బోస్ హిందుత్వను సమర్దించాడని, ఆయనను కాంగ్రెస్ గౌరవించ లేదని అబద్ధాలను వ్యాప్తిజేస్తున్నారు.
జనవరి 23న, కోల్కటాలో బోస్ జన్మదినాన్ని పురస్కరించుకొని తలపెట్టిన ఒక బహిరంగ సభలో, మమతా బెనర్జీ మాట్లాడడానికి ఉపక్రమించినప్పుడు బీజేపీలోని కొంత మంది మద్దతు దారులు 'జైశ్రీరామ్' అంటూ నినాదాలు చేయడంతో, తనను అవమానించారని భావిస్తూ మాట్లాడకుండానే సభను విడిచి వెళ్ళింది. జైహింద్ లాంటి నినాదాలే బోస్కు ఇష్టమైనవి.. ప్రీతి పాత్ర మైనవి.
ఈ సంఘటనలన్నీ రాబోయే పశ్చిమబెంగాల్ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్నాయి. బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించడానికి చేసే వివిధ రకాల ప్రయత్నాల్లో భాగంగానే ఈ సంఘటనలు జరుగుతున్నాయి. జాతీయోద్యమ కాలంలో, పేరుగాంచిన నాయకులను వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా ఈ మధ్యకాలంలో సుభాష్ చంద్రబోస్ను ముందు వరుసలోకి తీసుకుని వచ్చారు.
ఆయన ముఖ్యమైన జాతీయ నాయకుడే కాక, పశ్చిమబెంగాల్లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తి. ఇంతవరకు బీజేపీ నేతాజీని గూర్చి ఇప్పుడు మాట్లాడినవిధంగా ఏనాడు మాట్లాడలేదు. వాస్తవం ఏమంటే నేతాజీ భావజాలం మొత్తం బీజేపీ అనుసరిస్తున్న భావజాలానికి పూర్తిగా విరుద్ధమైనది. వాస్తవాన్ని మరుగు పరుస్తూ నేతాజీ భావజాలం ప్రస్తుత భారత పాలకవర్గాల భావజాలానికి అనుకూలమైనదని చూపించడానికి గట్టిప్రయత్నమే జరుగుతున్నది. నేతాజీ సోషలిజం, ప్రజాస్వామ్యం, మత సామరస్యం కోసం నిలబడ్డాడు. కానీ ప్రస్తుత అధికార పార్టీ హిందూ జాతి కోసం కలలు కంటూ, విభజన రాజకీయాలను అమలు చేస్తూ తన చర్యల ద్వారా ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నది.
కాంగ్రెస్ పార్టీతో ఆయనకు ఉన్న విభేదాలు, బేధాభిప్రాయాలు స్వాతంత్య్రం సాధించటానికి అనుసరించవలసిన పద్ధతులకు సంబంధించినవిగానే ఉండేవి. ఆయన రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షులుగా పనిచేశారు. అభిప్రాయభేదాలు ప్రధానంగా రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఏర్పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ నాయకత్వంలో దేశ వ్యాప్త ఉద్యమంగా క్విట్ ఇండియా ఉద్యమం కోసం ప్రణాళికలు రచించారు. బోస్ ఈ కాలంలోనే బ్రిటన్కు శత్రువులైన జర్మనీ జపాన్తో కలిసి ఒప్పందం కుదుర్చుకొని బ్రిటన్ వారిని వెళ్లగొట్టాలని కోరుకున్నాడు. అధిక శాతం కాంగ్రెస్ కేంద్ర కమిటీ సభ్యులు గాంధీజీ నిర్ణయంతో ఏకీభవించారు. పటేల్, నెహ్రూ లాంటి నాయకులు కూడా బోస్ ప్రతిపాదించిన వ్యూహాన్ని పూర్తిగా వ్యతిరేకించారు.
అప్పటికి అదిఎత్తుగడలకు సంబంధించిన తేడానే. కాంగ్రెస్ పార్టీ, బోస్ ఉభయులూ కూడా స్వాతంత్య్ర సముపార్జన కోసమే ఉన్నారు. ఇద్దరి లక్ష్యం భారతదేశానికి స్వాతంత్య్ర సముపార్జనే. ఇదే సమయంలో హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ బ్రిటిష్ ప్రభుత్వం యొక్క యుద్ధ ప్రయత్నాలకు మద్దతునిచ్చాయి. హిందూ మహాసభకు చెందిన సావర్కర్ బ్రిటిష్ సైన్యాన్ని బలోపేతం చేయడంలో ముందు భాగాన ఉండడమే కాక భారతీయులను బ్రిటిష్ సైన్యంలోకి చేర్చడంలో వారికి సహకరించాడు. బోసు దీనికి భిన్నంగా సింగపూర్లో బ్రిటిషు సైన్యాన్ని ఎదుర్కొనే లక్ష్యంతో ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించినప్పటికీ, ఆయన భారత జాతీయ కాంగ్రెస్ ఆరాధకునిగానే కొనసాగాడు. గాంధీ నెహ్రూల విషయంలో స్పష్టంగా చూసినట్టయితే గాంధీని 'జాతిపిత'గా సంభోదించాడు. ఐయన్ఎను ఏర్పాటు చేసే సమయంలో గాంధీ ఆశీస్సులను కోరాడు, పొందాడు. అదేవిధంగా రెండు ఐఏన్ఎ బ్రిగేడ్స్కు గాంధీ నెహ్రూ పేర్లు పెట్టాడు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల, సోషలిజం అనే భావన పట్ల హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ ప్రారంభం నుంచీ పూర్తి వ్యతిరేకతో ఉన్నాయి. బోసు నికార్సయిన సామ్యవాది. తాను కాంగ్రెసుతో ఉన్నప్పుడు నెహ్రూ, సోషలిస్టులతో కలిసి జాతీయోద్యమంలో సోషలిస్టు భావాలను పొందుపరిచేందకు కృషి చేశాడు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం ప్లానింగ్ కమిషన్ ఉండాలని దృఢంగా వాదించేవాడు. యాధృచ్చికంగా, స్వాతంత్య్రం తరువాత ఏర్పరచబడ్డ ప్లానింగ్ కమిషన్ను బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం రద్దుచేసి నిటి అయోగ్తో పునర్ నిర్మాణంచేశారు. తాను కాంగ్రెసును వీడిన తర్వాత సోషలిస్టు భావాలతో కూడిన ఫార్వర్డ్ బ్లాక్ను స్థాపించారు. పశ్చిమ బెంగాల్ను దశాబ్దాలుగా పరిపాలించిన వామపక్ష సంకీర్ణ ప్రభుత్వంలో ఫార్వర్డ్ బ్లాక్ భాగస్వామిగా కొనసాగింది.
కాంగెస్ కూడా ఐయన్ఎను సానుకూల దృక్పథంతోనే చూసేది. రెండవ ప్రపంచ యుద్ధ ముగింపు తరువాత సంబంధిత సిపాయిలు, అధికారులను కోర్టులలో విచారించారు. ఇతరులతో పాటుగా భూలాభారు దేశారు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకుడైన జవహర్లాల్ నెహ్రూ కూడా ఐయన్ఎ కేసు కోసం వాదించారు. ఆసక్తికర విషయమేమంటే ధీరులైన, సాహసవంతులైన సిపాయిల కేసుల కోసం నికరంగా పోరాడేందుకు నెహ్రూ లాయర్ గౌనును ధరించాడు.
అందరూ గమనించాల్సిన విషయం ఏమంటే, హిందూ మహాసభకు చెందిన శ్యాంప్రసాద్ ముఖర్జీ ముస్లింలీగ్ భాగస్వామిగా ఉన్న బెంగాల్ ప్రభుత్వంలో పని చేశాడు. బ్రిటిష్ ప్రభుత్వం క్విట్ ఇండియా ఉద్యమాన్ని అణచివేసే సమయంలో, క్విట్ ఇండియా ఉద్యమాన్ని గూర్చి బెంగాల్లో ఆందోళన పడాల్సిన అవసరం లేదని వారితో తాను సవ్యంగానే డీల్ చేస్తానని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బ్రిటిష్ ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. దీనితో పాటుగా హిందూ మహాసభకు చెందిన సావర్కర్ బ్రిటిష్ సైన్యం బలోపేతం కావాలని కోరుకున్నాడు. ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకుడైన గోల్వాల్కర్ తమ విభాగాలకు తమ రోజువారీ కార్యక్రమాలకు కట్టుబడి ఉండాలని బ్రిటిష్ వారికి కోపం తెప్పించే ఎలాంటి పనులు చేయవద్దని సర్క్యులర్ జారీ చేశాడు.
హిందూ మహాసభ, ఆర్యస్యస్ లాంటి సంస్థలయొక్క ప్రధాన ఎజెండా హిందూ రాజ్యస్థాపనగానే ఉంది. ముస్లిం లీగ్, హిందూ మహాసభ లాంటి మతపరమైన రాజకీయాలను సుభాష్చంద్రబోస్ పూర్తిగా వ్యతిరేకించాడు. అతను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే మత సంస్థల యొక్క ద్వంద్వ సభ్యత్వాన్ని నిరోధించాడు. అటువంటి వారు ఎక్కువ కాలం కాంగ్రెస్ కమిటీలలో ఉండలేక పోయారు. బెర్లిన్ నుంచి ఇచ్చిన రేడియో సందేశంలో బ్రిటిష్ వారికి అనుకూలంగా ఆరెస్సెస్ నిర్మాణం చేపట్టడాన్ని విమర్శించాడు. ఆయన ఉద్దేశ్యంలో మతపరమైన సంస్థల యొక్క రాజకీయాలు రైతాంగం, శ్రమ జీవుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంటాయని భావించాడు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ బెంగాల్ హిందూ మహాసభలో చేరడాన్ని ఆయన గట్టిగా వ్యతిరేకించారు.
హిందూ ముస్లిం ఐక్యత, జాతీయతల స్వభావాలకు సంబంధించిన విషయంలో గానీ బోస్ యొక్క ఆలోచనలను గురించి గానీ అంతగా ప్రస్తావించలేదు. బోస్ రచనలను పరిశీలించినట్లయితే ''మహమ్మదీయుల రాకతో ఒక నూతనభావాల కలయిక క్రమం ప్రారంభమయింది. వారు హిందువుల యొక్క మతాన్ని అంగీకరించకపోయినప్పటికీ, భారతదేశాన్ని తమ ఇంటిగానే భావించారు. సాధారణ ప్రజల సామాజిక జీవితంలో భాగస్వాములయ్యారు. వారి కష్టసుఖాల్లో కూడా భాగం పంచుకున్నారు. పరస్పర సహకారం ద్వారా నూతన మైన కళలు, సంస్కృతులు ఏర్పడ్డాయి.'' దీనితో పాటుగా ''భారతీయ మొహమ్మదీయులు'' భారత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూ వచ్చారు. మైనారిటీ హక్కుల సంరక్షణ కోసం నూతన భావనలను ఆవిష్కరించారు.'' వ్యక్తులకు గాని, సమూహాలకు గాని మతపరమైన, సాంస్కృతికపరమైన స్వేచ్ఛ కావాలని కోరుకున్నాడు. (ఫ్రీ ఇండియా అండ్ హర్ ప్రోబ్లమ్స్ పుస్తకం నుంచి)
మొదట వచ్చిన వారి విషయానికొస్తే ఆర్ఎస్ఎస్ భావజాలం వాదన ప్రకారం ఆర్యులు మొదటి నుంచీ భారతదేశంలో నివసించే వారని, వారు ఇక్కడ నుండే పశ్చిమ ఆసియా, యూరోప్ ప్రాంతాలకు వలస వెళ్లారని చెప్తారు. దీనికి భిన్నంగా బోస్ అభిప్రాయంలో ''ఈ మధ్యకాలంలో జరిగిన పురావస్తుశాఖ తవ్వకాలు భారతదేశం 3000బీసీ క్రితమే అత్యున్నతమైన నాగరికతను సంతరించుకుందని, ఎలాంటి అనుమానం లేకుండా నిరూపితమైందని, ఆర్యులు భారతదేశాన్ని ఆక్రమించుకొనకముందే ఈ నాగరికత ఉన్నదని ఆయన చెప్పారు.'' హరప్పా మొహంజదారో విషయంలో ఆయన అభిప్రాయాలు పూర్తిగా హేతుబద్ధమైనవి. ప్రతివాదనలు శాస్త్రీయ ఆధారాలతో ఉన్నాయి. భారతీయ సంస్కృతి హిందూ ఆర్యన్ పునాదిగా కలదనే ఊహలకు భిన్నంగా ఆయన అభిప్రాయపడ్డారు. బోస్ ముందు చూపు కలవాడే కాక, భారతదేశం ''పురాతన స్వర్ణయుగమనే'' మతోన్మాదుల వాదనలతో ఏకీభవించలేదు.
హిందూ జాతీయవాదులు తరచుగా జాతికి గౌరవం తెచ్చిన జాతీయ ప్రముఖులైన వివేకానందుడు, సర్దార్ పటేల్ లాంటివారిని తమభావలకు అనుగుణంగా ఉన్నారని చెప్పుకుంటూ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. గాంధీ, నెహ్రూలతో భిన్నాభిప్రాయాలు ఉన్న జాతీయ ప్రముఖులపై బీజేపీ దృష్టి పెడుతున్నది. పశ్చిమబెంగాల్లో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో, హిందూ జాతీయవాదుల భావజాలానికి వ్యతిరేకత ఉన్న ఒక గొప్ప జాతీయోద్యమ నాయకుడిని తమ భావజాలానికి దగ్గరగా ఉన్నాడని ప్రచారం చేస్తున్నారు. హిందూ ముస్లింల ఐక్యతా భావనకు కట్టుబడి ఉండే ఆయన ఒక నిజమైన సోషలిస్టు. ఆయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడినప్పుడు, హిందూ జాతీయవాదులు బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చారు. ఆయన గాంధీని జాతిపితగా పిలిస్తే, హిందూ జాతీయవాదులలో ఒక వ్యక్తి గాంధీజీని హత్యచేశాడు.
- రామ్ పునియాని
అనువాదం:మల్లెంపాటి వీరభద్రరావు,
సెల్:9490300111