Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫ్రెంచ్ విప్లవంవంటి సంప్రదాయ బూర్జువా విప్లవంలో జరిగినట్టుగా ఆలస్యంగా పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చిన దేశాలలో భూస్వామ్య ఆస్తిపై దాడికి బదులుగా బూర్జువా వర్గం భూస్వామ్య ప్రయోజనాలతో రాజీపడుతుందనే అంతరృష్టిపై 20వ శతాబ్ద ఆరంభ సంవత్సరాలలో బోల్షివిక్కుల కార్యక్రమం ఆధారపడింది. అటువంటి నూతన పరిస్థితిలో భూస్వామ్యంపై ఎటువంటి దాడి జరిగినా అది బూర్జువా ఆస్తిపై దాడిగా పరిణమిస్తుందనే భయంతో బోల్షివిక్కులు అలా చేశారు. కాబట్టి రైతాంగాన్ని భూస్వామ్య బంధనాల నుంచి విముక్తి చేసే బాధ్యత గతంలోవలే బూర్జువా వర్గం మీద కాకుండా రైతాంగంతో మైత్రితో ప్రజాస్వామిక విప్లవాన్ని ముందుకు తీసుకుపోయే కార్మికవర్గంపై పడుతుంది. అయితే అలా తన బాధ్యతను నెరవేర్చిన తరువాత కార్మికవర్గం అక్కడే ఆగిపోకుండా సోషలిజం స్థాపనకు ముందుకు సాగుతుంది. అయితే ఈ క్రమంలో రైతాంగంతో తనకున్న వర్గ మైత్రీ బంధంలో మార్పు సంభవిస్తుంది.
ఇటువంటి మహత్తర అంతరృష్టిని లెనిన్ తన 'ప్రజాస్వామిక విప్లవంలో సోషల్ డెమోక్రసీకి చెందిన రెండు ఎత్తుగడలు' (ుషశీ ుaష్ఱషర శీట ూశీషఱaశ్రీ ణవఎశీషతీaషy ఱఅ ్ష్ట్రవ ణవఎశీషతీa్ఱష =వఙశీశ్రీబ్ఱశీఅ) గ్రంథంలో వ్యక్తం చేశాడు. కార్మికుల, రైతుల విప్లవకర ప్రజాస్వామిక నియంతృత్వాన్ని సాధించేందుకు రూపొందించిన బోల్షివిక్ ఎజెండాకి ఇది పునాది. మన వర్తమాన జనతా ప్రజాస్వామిక నియంతృత్వ భావనకు పురోభావి సూచికగా ఈ సూత్రీకరణ ఉంది. జారిస్టు రష్యాలో కార్మికవర్గం ఉదారవాద బూర్జువా వర్గానికి ప్రాతినిధ్యం వహించే కేడెట్ పార్టీవంటి పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీలోని మార్టినోవ్, ఇతరులు సూచించిన దానికి బదులుగా కార్మికుల-రైతుల మైత్రి కోసం సోషల్ డెమోక్రాట్లు పాటుపడాలనేది లెనిన్ ఆలోచన. అటువంటి మైత్రితో ప్రజాస్వామిక విప్లవం పరిధి పరిమితం కాకుండా విస్తృతమవుతుంది.
మూడవ ప్రపంచ దేశాలలో మార్క్సిజం-లెనినిజంను ఆచరణలో పెట్టినప్పుడు కార్మికుల-కర్షకుల మైత్రి కేంద్రకంగా ఉంటుంది. చారిత్రక ఎజెండాలోకి సోషలిజం వచ్చిన స్థితిలో, బూర్జువా ఆస్తికి ప్రమాదం పొంచివున్న చారిత్రక పరిస్థితులలో బూర్జువావర్గం గతంలో నెరవేర్చిన కర్తవ్యాన్ని ముందుకు తీసుకుపోలేని పిరికిపందగా మారినప్పుడు కార్మిక-కర్షక మైత్రి అవసరం. మన దేశంసహా మూడవ ప్రపంచ దేశాలలోని బూర్జువావర్గానికి భూస్వామ్యంతో రాజీపడే ధోరణి ఉంటుందనే విషయం వాస్తవ అనుభవంలో పదేపదే రుజువు అవుతున్నందున ఈ భావనకు విలువ అలానే వుండగా నయావుదారవాదంలో ఒక అదనపు కారకం దృశ్యంలో చేరింది. కార్మికుల-కర్షకుల ఆర్థిక స్థితిగతులు ప్రస్తుతం ప్రత్యక్షంగా పరస్పరం కలగలిసి ఉన్నాయనే వాస్తవంతో దీనికి సంబంధం ఉంది. అంటే కార్మికుల-కర్షకుల ఆర్థిక స్థితిగతులు ఏకకాలంలో దిగజారటం జరుగుతున్నది. ప్రజాస్వామిక విప్లవం సందర్బంగా కార్మిక-కర్షక మైత్రి కార్మికవర్గ రాజకీయ కర్తవ్యాన్ని సాధించేందుకు కావలసిన సాధనంగానే కాకుండా యావత్ కష్టజీవుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చటానికి అవసరమైన సాధనంగా మారింది.
కార్మికుల, కర్షకుల ఆర్థిక స్థితిగతుల మధ్య సంబంధం ఏర్పడటానికి కారణం ఇలా ఉంది. పెట్టుబడికి చెందిన ఆదిమ మూలధన సంచయ ప్రక్రియను గ్రామీణ ప్రాంతంలో పెద్ద ఎత్తున నయావుదారవాదం ప్రవేశపెట్టింది. దీనివల్ల సంప్రదాయ చిన్న ఉత్పత్తిమీద ముఖ్యంగా రైతాంగ వ్యవసాయం మీద బహుళజాతి కంపెనీల, కార్పొరేట్-ఫైనాన్షియల్ పెట్టుబడిదారీ వర్గ జులుం ఎక్కువ కావటంతో రైతాంగంలో తీవ్ర నైరాస్యం ఏర్పడింది. గత రెండు దశాబ్దాల కాలంలో మూడు లక్షలమంది రైతుల ఆత్మహత్యలకు కారణమైన ఈ దుస్థితివల్ల రైతులు పనుల కోసం తమ భూములను వదలి పట్టణాలకు, నగరాలకు వలసగా వెళుతున్నారు. 'ఇన్ఫ్రాస్ట్రక్చర్' ప్రాజెక్టుల ముసుగులో రకరకాల రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకోసం బడా బూర్జువా వర్గం రైతుల భూములను 'నామమాత్రపు ధర'కే కొనుగోలు చేస్తుండటం వల్ల రైతులు తమ భూములను వదలి వెళ్లవలసిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
ఈ విషయాన్ని భారతదేశంలో జనాభా గణన సమాచారం స్పష్టం చేస్తున్నది. 1981-1991మధ్యకాలంలో వ్యవసాయ దారుల (ప్రధానంగా కార్మికులు) సంఖ్య 9.2కోట్ల నుంచి 11కోట్లకు పెరిగింది. అయితే 2001లో జరిగిన జనాభా గణనలో ఈ సంఖ్య 10.3కోట్లకు, తాజాగా 2011 జనాభా గణనలో 9.58కోట్లకు పడిపోయింది. ఇంకా చెప్పాలంటే ఈ పతనం నయావుదారవాద విధానాలను అనుసరించిన కాలంలో జరిగింది. 1991-2011 మధ్యకాలంలో వ్యవసాయ రంగం నుంచి నిష్క్రమించిన వారి సంఖ్య 1.5కోట్లు. ఈ సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.
అయితే స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ పట్టణాలలోను, నగరాలలోను సృష్టిస్తున్న ఉద్యోగాలు నికృష్టంగా ఉంటున్నాయి. గ్రామాల నుంచి వలస వచ్చినవారిని అటుంచి కనీసం పట్టణ కార్మికుల సహజ వృద్ధిరేటు స్థాయిలో కూడా ఉద్యోగ సృష్టి జరగటం లేదు. జాతీయ శాంపుల్ సర్వే పెద్ద ఎత్తున నిర్వహించిన 2004-05, 2009-10 మధ్యకాలంలో స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటు చాలా ఎక్కువగావున్నప్పటికీ ఉద్యోగిత వార్షిక వృద్ధి రేటు కేవలం 0.8శాతంగా మాత్రమే నమోదయింది. ఈ వృద్ధిరేటు పట్టణ కార్మికుల సహజ వృద్ధి రేటు కంటే కూడా బాగా తక్కువ. పట్టణ కార్మికుల సహజ వృద్ధిరేటు కనీసం 1.5శాతంకంటే తక్కువగా ఉండదు. కాబట్టి రైతాంగ వలసలవల్ల పట్టణాలలో, నగరాలలో నిరుద్యోగ సైన్యం పరిమాణం మాత్రమే పెరుగుతున్నది. అయితే ఈ వాస్తవం నిరుద్యోగ సాపేక్ష పెరుగుదలలో కనపడకుండా పార్ట్టైమ్ ఉద్యోగితలోను, క్యాజువల్ ఉద్యోగితలోను, అప్పుడప్పుడు లభించే ఉద్యోగితలోను, చిన్న వ్యాపారం రూపంలోవుండే ప్రచ్ఛన్న నిరుద్యోగంలోను వ్యక్తమవుతుంది. వేరేమాటల్లో చెప్పాలంటే వ్యక్తులు వాస్తవంలో ఎక్కువ కాలం నిరుద్యోగులుగా ఉండటంగా కాకుండా ఒక్కొక్క వ్యక్తీ సగటున తన జీవితంలో అత్యధిక కాలం నిరుద్యోగిగా ఉండిపోతున్న పరిస్థితి. అయితే అది ఏ రూపంలో ఉన్నప్పటికీ దానితో శ్రామిక రిజర్వ్ సైన్యం పరిమాణం పెరుగుతున్నది. తత్ఫలితంగా యావత్ పట్టణ కార్మికుల సగటు జీవన పరిస్థితులు క్షీణిస్తాయి. శ్రామిక రిజర్వ్ సైన్యం పరిమాణం పెరగుతుండగా, పనిగంటల లభ్యత సగటున తగ్గిపోయి ఆదాయాలు కుంచించుకుపోతాయి. ఈ పరిస్థితి వేతనాల రేటును పెరగనివ్వదు. ఈ కారణంచేత పట్టణ కార్మికుల సగటు జీవన పరిస్థితులు క్షీణిస్తాయి.
శ్రామిక రిజర్వ్ సైన్యం పరిమాణం సాపేక్షంగా పెరగటంవల్ల కార్మిక సంఘాలు బలహీనపడతాయి. ఈ సాపేక్ష పెరుగుదల బహిరంగ నిరుద్యోగిత రూపం తీసుకున్నప్పటికీ ఇదే జరుగుతుంది. అయితే తాత్కాలిక ఉద్యోగుల నిష్పత్తి ఎక్కువగా వుండే క్యాజువలీకరణ రూపం తీసుకున్నప్పుడు ఇది మరింత స్పష్టత సంతరించుకుంటుంది. గతంలో సంఘటితమైన, కార్మిక సంఘాలలో పాలుపంచుకున్న కార్మికవర్గ విభాగాలు కూడా దీని ప్రభావం నుంచి తప్పించుకోజాలవు. ఎందుకంటే గతంలో బలమైన కార్మిక సంఘాలున్న రంగాలలో కూడా పనిని ఔట్సోర్స్ చేయటం, శ్రామికుల క్యాజువలీకరణవంటి చర్యల ప్రభావం వీటిపై ఉంటుంది.
కాబట్టి నయావుదారవాద పాలనలో రైతాంగంలో ఏర్పడిన నిస్పృహ ప్రభావం పట్టణ కార్మికుల జీవన స్థితిగతుల మీద పడుతుంది. సమ్మెకు దిగేవారి సామర్థ్యం కుంటుపడుతుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి నిసృహతో వలసరావటమొక్కటేకాదు నయావుదారవాద విధానాలవల్ల అనేక విధాలుగా కార్మికుల జీవన పరిస్థితులు, సంఘటితం కాగలిగే సామర్థ్యం (ఉదాహరణకు ప్రభుత్వరంగాన్ని ప్రయివేటీకరించటం) సన్నగిల్లుతుంది. అయితే రైతాంగ నిస్పృహ, దానితోపాటుగా వ్యవసాయ కార్మికుల పరిస్థితి ఈ ధోరణిని తీవ్రతరం చేస్తుంది. ఈ కారణంచేత నయావుదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించటానికి చేస్తున్న పోరాటంలో కార్మిక-కర్షక మైత్రి ప్రాథమిక ఆయుధంగా మారింది. కార్పొరేట్-ఫైనాన్షియల్ వర్గ మద్దతుతో మతతత్వ నిరంకుశాధికార ధోరణి వ్యాప్తిచేసే వర్తమాన చారిత్రక సంధికాలానికి పునాదిగా నయావుదార వాదం ఉన్నది. ఈ చారిత్రక సంధికాలాన్ని, దీనితోపాటుగా అంతిమంగా మతతత్వ-నిరంకుశాధికార శక్తులను ఓడించటానికి కార్మిక-కర్షక మైత్రి ప్రధాన ఆయుధమవుతుంది.
అయితే కార్మికుల, రైతుల, వ్యవసాయ కార్మికుల మైత్రి ఏర్పడటానికి కావలసిన వస్తుగత సాధ్యతను నయావుదార వాదం బలోపేతం చేస్తున్నప్పటికీ అటువంటి మైత్రిని వాస్తవీకరించే కర్తవ్యాన్ని చేపట్టవలసి ఉంటుంది. వేరేమాటల్లో చెప్పాలంటే అటువంటి మైత్రి మార్క్స్ కార్మిక వర్గాన్ని గురించి చెప్పినట్టుగా తనలో తానుగా నుంచి తన కొరకు తానుగా పరివర్తన చెందాలి. అది వస్తుగత సాధ్యత నుంచి క్రియాశీలంగా జోక్యం చేసుకునే ముక్తియారీ (ఏజన్సీ)గా మారాలి. తనలో తానుగా వున్న ఈ మైత్రి తన కొరకు తానుగా పరివర్తన చెందే సంక్లిష్ట ప్రక్రియ మొదలైంది. కొన్ని నెలల క్రింతం మహారాష్ట్రలో జరిగిన కిసాన్ యాత్ర తరువాత సెప్టెంబరు 5న జరగనున్న మజ్దూర్-కిసాన్ ప్రదర్శన ఇటువంటి పరివర్తన ప్రక్రియలో ఒక మైలురాయి కానుంది. ఇప్పటిదాకా కార్మికుల, రైతుల, వ్యవసాయ కార్మికుల ప్రదర్శనలు వేరువేరుగా జరిగాయి. సెప్టెంబరు 5వ తేదీన ప్రదర్శన ఈ మూడు వర్గాల మొట్ట మొదటి సంయుక్త ప్రదర్శన. ఈ ప్రదర్శన తక్షణ డిమాండ్ ఆర్థిక ఉపశమనం కోసం అయినప్పటికీ నయావుదారవాదం పైన, అది వ్యాపింపజేసే మతతత్వ నిరంకుశాధికారితపైన పోరాడగలిగే దీని చారిత్రక సాధ్యత అపారం. మతతత్వ- నిరంకుశాధికారం తన కోరలను చాస్తున్నప్పుడు, దేశవ్యాప్తంగా పౌరహక్కుల నాయకులను లేనిపోని నేరారోపణలపై నిర్బంధిస్తున్నప్పుడు, మరిన్ని నిర్బంధాలు ఉంటాయనే సిగ్గులేని ప్రకటనలు జారీ అవుతున్నప్పుడు దీని ప్రాధాన్యత మరింతగా పెరుగుతుంది.
- ప్రభాత్ పట్నాయక్
అనువాదం: నెల్లూరు నరసింహారావు
సెల్: 8886396999