Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బూర్జువా ఆర్థిక క్రమం (ఎకనామిక్ ఆర్డర్) పనితీరును 'ప్రధాన స్రవంతి' అర్థశాస్త్రం అర్థం చేసుకుంటున్నట్టుగా కనపడటం లేదు. విత్త విధానానికి సంబంధించిన విషయాలలో ఎక్కడా లేనంతగా ఇది మరింత స్పష్టంగా కనపడుతుంది. విత్త లోటువల్ల ప్రయివేటు రుణం తగ్గుతుందని, అది ప్రయివేటు పెట్టుబడులను కుదింపజేస్తుందని బూర్జువా అర్థశాస్త్రం ఇప్పటికీ భావిస్తోంది. ఏ కాలంలోనైనా ఆర్థిక వ్యవస్థలో ఒక స్థిరమైన పొదుపు మొత్తం ఉంటుందనీ, దాని నుంచి ప్రభుత్వం తీసుకునే (విత్త లోటు అవసరానికి) మొత్తం ఎక్కువగా ఉంటే దానికి అనుగుణంగా ప్రయివేటు రంగానికి అందుబాటులో ఉండే మొత్తం పరిమాణం కుదింపబడి ప్రయివేటు రంగంలో పెట్టుబడి తగ్గటానికి దారీతీస్తుందని అది పూర్వాలోచన (ప్రిసప్పోజ్) చేస్తుంది.
ఈ వాదనలో లోపం ఏమంటే ఒక స్థిరమైన పొదుపు మొత్తం అనేది ఉండదు. స్థూల జాతీయోత్పత్తి మొత్తంలో పెరుగుదల ఉంటే పొదుపు పెరుగుతుంది. ఎందుకంటే విత్త లోటు ద్వారా అప్పుచేసి ప్రభుత్వం తన వ్యయాన్ని పెంచితే సమిష్టి డిమాండ్ పెరుగుతుంది. అంటే విత్తలోటుతో ఉత్పత్తి, ఉద్యోగిత(పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో యుద్ధ సమయంలో తప్ప డిమాండ్ కొరత ఉంటుంది), పొదుపు మొత్తం కూడా పెరుగుతాయి. అర్థం కావటం కోసం విదేశీ లావాదేవీలు లేని ఒక ఆర్థిక వ్యవస్థ ఉందనుకుందాం. ప్రయివేటు చేతుల్లో ఉన్న పెట్టుబడిని మించి పొదుపు మొత్తం పెరిగి అది విత్తలోటుకు సమానమవుతుంది. వేరే మాటల్లో చెప్పాలంటే విత్తలోటు తనకు కావలసిన వనరులను స్థిరమైన పొదుపు మొత్తం నుంచి తీసుకోవటానికి బదులుగా తనకు సమానమైన మొత్తానికి సమానంగా పొదుపు మొత్తాన్ని విస్తృతపరచి 'తనకు కావలసిన ఫైనాన్సెస్ను తనే సమకూర్చుకుంటుంది.'
ప్రభుత్వ వ్యయానికి కావలసిన నిధులను సమకూర్చుకోవటానికి పెట్టుబడిదారులపై పన్ను విధించే విషయంలో కూడా అటువంటి పనికిమాలిన వాదననే 'ప్రధాన స్రవంతి' అర్థశాస్త్రం పునఃశ్చరణ చేస్తుంది. ఒకవేళ ప్రభుత్వం రూ.100 వ్యయం చేయటానికి కావలసిన వనరులను సమకూర్చుకోవటానికి పెట్టుబడిదారుల లాభాల మీద రూ.100 పన్ను విధిస్తే పెట్టుబడిదారుల లాభాలలో రూ.100 కోత పడుతుందని 'ప్రధాన స్రవంతి' అర్థశాస్త్రం వాదిస్తుంది. వేరేవిధంగా చెప్పాలంటే ఈప్రక్రియను 'ప్రధాన స్రవంతి' అర్థశాస్త్రం ఈ విధంగా అర్థం చేసుకుంటుంది.. ప్రభుత్వం తన వ్యయం కోసం రూ.100 లాభాలనుంచి తీసుకోవటంవల్ల ఆమేరకు పన్ను అనంతర లాభం తగ్గుతుంది.
అయితే ఇది పూర్తిగా తప్పు. ఒకవేళ మనం తేలిగ్గా అర్థం కావటం కోసం విదేశీ లావాదేవీలు లేని ఆర్థిక వ్యవస్థలో ఉన్నామనే ఊహనను కొనసాగిస్తే, కార్మికులు తాము సంపాదించినదంతా ఖర్చు చేస్తారనుకుంటే పైన పేర్కొన్న ప్రక్రియ కారణంగా 'ప్రధాన స్రవంతి' అర్థశాస్త్రం తగ్గుతాయని చెబుతున్న పన్ను అనంతర లాభాలు అంతకుముందుతో పోల్చినప్పుడు ఏమాత్రం తగ్గవు.
దీనికి కారణం చాలా సామాన్యమైంది. ప్రభుత్వం చేసిన రూ.100 వ్యయంతో సమిష్టి డిమాండ్ పెరుగుతుంది. దానితోపాటు ఉత్పత్తి, ఉద్యోగిత పెరుగుతాయి. అయితే విషయం ఇక్కడితో ముగిసిపోదు. ఇలా ఉత్పత్తి పెరిగినప్పుడు వేతనాలు పెరుగుతాయి. ఏఏ రంగాలలోనైతే ఉత్పత్తి పెరుగుతుందో ఆయా రంగాలలో లాభాలు పెరుగుతాయి. ఈ స్థితి వినిమయ వస్తువుల డిమాండ్ పెంచుతుంది. అది తిరిగి ఉత్పత్తిని, ఉద్యోగితను మరింతగా పెంచుతుంది. ఇలా వరుసగా ఉత్పత్తి పెరుతుండటంతో మొత్తంమీద పన్ను ముందరి లాభాలు కూడా పెరుగుతాయి. పన్ను ముందరి లాభాలు అంతకుముందు రూ.100 పన్ను విధించక ముందున్న లాభాల స్థాయికి చేరేదాకా ఇలా ఉత్పత్తి, ఉద్యోగితలు పెరుగుతూనే ఉంటాయి. అంటే అంతకు ముందుతో పోలిస్తే పన్ను అనంతర లాభాలలో ఏమాత్రం మార్పు ఉండదు.
ఒక పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఆదాయానికి సంబంధించి వేతనాలు, లాభాలు అనే రెండే విభాగాలు ఉంటాయి. వీటిలో వేతనాలు వినిమయం అవుతాయి. ఈ స్థితిలో ఇలా జరుగుతుంది.. పన్ను అనంతర లాభం=పెట్టుబడిదారుల వినిమయం + పెట్టుబడిదారుల పెట్టుబడి + విత్తలోటు-విదేశీ మారకపు చెల్లింపుల శేషంలో కరెంటు ఖాతాలో ఏర్పడిన లోటు. (అ)
ఒకవేళ మనదేశంలో లాగా స్వయం ఉపాధి ద్వారా వచ్చిన ఆధాయంవంటి విభాగాలుంటే ఈ సూత్రాన్ని సవరించాలి. అయితే ఇందుకు సంబంధించిన సాధారణ నిర్ధారణలకు ఉన్న విలువ మారదు. జీరో కరెంటు బ్యాలన్స్గా వున్న, విదేశాలతో సంబంధాలులేని ఆర్థిక వ్యవస్థను ఊహించటం వల్ల చివరి విషయాన్ని మనం పట్టించుకోలేదు. ఏ కాలంలోనైనా పెట్టుబడిదారుల వినిమయం, పెట్టుబడికి చెందిన మొత్తాలు అంతకుముందు తీసుకున్న నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఒకవేళ ప్రభుత్వం విత్తలోటు లేని సమతౌల్య బడ్జెట్ను గనుక కలిగివుంటే అప్పుడు ప్రభుత్వం ఎంత వ్యయం చేసినా తేడా ఉండదు. ఎందుకంటే పన్నులకు అనుగుణంగానే ప్రభుత్వ వ్యయం ఉంటుంది గనుక. దీనితో పన్ను అనంతర లాభాలలో తేడా ఉండదు. ఎవరి మీద పన్ను విధించారనేదానితో సంబంధం లేకుండా అవి మారవు. ఒకవేళ కార్మికుల మీద పన్ను విధిస్తే పన్ను అనంతర లాభాలలో తేడా రాదు. దానితో సమిష్టి డిమాండ్గానీ, ఉత్పత్తిగానీ పెరగవు. ఎందుకంటే కార్మికులు కోల్పోయిన మొత్తాన్ని ప్రభుత్వం వ్యయం చేస్తుంది గనుక. ఒకవేళ పెట్టుబడిదారుల మీద పన్ను విధించినప్పుడు కూడా పన్ను అనంతర లాభాలు మారవు. కానీ దానితో సమిష్టి డిమాండ్, ఉత్పత్తి నికరంగా పెరుగుతాయి.
లాభాలమీద పన్ను విధించటం ద్వారా అదనపు ప్రభుత్వ వ్యయానికి వనరులను సమకూర్చుకున్నప్పటికీ పన్ను అనంతర లాభాలలో ఎటువంటి మార్పు లేనప్పుడు, పన్ను అనంతర లాభాలే పెట్టుబడి పెట్టాలనే విషయాన్ని నిర్ణయించేటప్పుడు కూడా పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టే నిర్ణయాలలో ఎటువంటి మార్పూ ఉండదు. ఒకవేళ పెట్టుబడి పెట్టటంపై వారి నిర్ణయాలను పన్ను అనంతర లాభాలు కాక ఆర్థిక వ్యవస్థలోగల సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే ఊహించినదానికంటే పెట్టుబడిదారుల పెట్టుబడి పెరుగుతుంది. ఎందుకంటే లాభాలపై పన్ను విధించటంద్వారా సమకూరిన వనరులతో ప్రభుత్వం అదనంగా వ్యయం చేస్తే సమిష్టి డిమాండ్తో పాటు ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఈ స్థితి ఆర్థిక వ్యవస్థ లోకి అదనపు పెట్టుబడులు రావటానికి దారి తీస్తుంది.
ఆ విధంగా ఒకవేళ ప్రభుత్వ వ్యయం లాభాలపై విధించిన పన్నుతో కాకుండా సంపదపై పన్ను వేయటం ద్వారా సమకూరితే పన్ను అనంతర లాభాలలో పైన (అ)లో పేర్కొన్నట్టుగా ఎటువంటి మార్పు ఉండదు (విత్తలోటులో మార్పులేనందున, పన్ను ఆదాయాన్ని అనుసరించి ప్రభుత్వ వ్యయం ఉండటంవల్ల). సంపద ఏ రూపంలో వున్నా పన్ను వేయటం జరుగుతుంది. అంటే సంపద డబ్బు రూపంలో ఉంటే పన్ను ఎలా వుంటుందో అలానే పెట్టుబడి షేర్ల రూపంలో గడించే లాభాల రేటుపై కూడా పన్ను ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు తమ సంపదను డబ్బు రూపంలో కాకుండా షేర్ల రూపంలోనే ఉంచుకోవటానికి మొగ్గు చూపుతారనేది సుస్పష్టం. మిగతా విషయాలలో తేడా లేకుంటే అలా జరగటానికి ముందుకంటే పెట్టుబడి పెరగటానికి దారితీస్తుంది. కాబట్టి సంపదపై పన్ను కానీ, లాభాలపై పన్ను కానీ ప్రభుత్వ వ్యయానికి వాడితే పెట్టుబడిదారులు కేవలం ఆర్థిక కారణాలవల్ల అభ్యంతరం తెలిపే అవకాశం ఉంది.
చాలా దశాబ్దాల క్రితమే ఈ ప్రాథమిక ప్రతిపాదనలను పోలెండ్కు చెందిన ప్రముఖ అర్థశాస్త్రవేత్త మైకల్ కాలెస్కీ సవివరంగా విశదీకరించారు. వీటిని ఇంకా 'ప్రధాన స్రవంతి' అర్థశాస్త్రం అర్థం చేసుకున్నట్టు కనపడటం లేదు. పెట్టుబడిదారులపై పన్ను వేస్తే ప్రయివేటు పెట్టుబడులు నిరుత్సాహానికి గురవుతాయనే అభిప్రాయంలో ఇది ప్రతిబింబిస్తోంది. నిజానికి బ్రిటిష్ ద్రవ్య పెట్టుబడిదారీ వర్గానికి ప్రాతినిధ్యం వహించే లండన్ నుంచి వెలువడే ద ఫైనాన్షియల్ టైమ్స్ పార్లమెంట్ ఎన్నికలలో పోటీచేస్తున్న జర్మీ కోర్బిన్ నాయకత్వంలోని బ్రిటిష్ లేబర్ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టోపై వ్యాఖ్యానిస్తూ ఈ అభిప్రాయాన్ని ఇటీవల ప్రకటించింది. 'వ్యాపారాల మీద చేసే దాడి సంపద సృష్టిపై దాడిగా పరిణమిస్తుంది' అని ద ఫైనాన్షియల్ టైమ్స్ అభిప్రాయపడింది.
1930వ దశకంలో జాన్ మేనార్డ్ కీన్స్ 'డిమాండ్ మేనేజ్మెంట్'లో ప్రభుత్వం జోక్యం చేసుకోవటాన్ని సమర్థించినప్పుడు ద్రవ్య పెట్టుబడిదారీ వర్గం ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. సోషలిజం నుంచి ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న పెట్టుబడిదారీ వ్యవస్థను రక్షించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో కీన్స్ చేసిన ప్రతిపాదనలను ద్రవ్య పెట్టుబడి వ్యతిరేకించింది. అయితే అజ్ఞానం వల్లనే ద్రవ్య పెట్టుబడి తన ప్రతిపాదనలను వ్యతిరేకిస్తోందని, విషయం అర్థమైన తరువాత ఈ వ్యతిరేకత సమసి పోతుం దని కీన్స్ భావించాడు. అయితే ఈ వ్యతిరేకతకు కారణం విషయంపట్ల అవగాహన లేకపోవటాన్ని మించి ఏదో ఉంది.
మైకల్ కాలెస్కీ మళ్ళీ గురి తప్పలేదు. పెట్టుబడిదారులు ప్రభుత్వ జోక్యాన్ని వ్యతిరేకించటానికి సమర్థనీయమైన ఆర్థిక విషయాలు కారణం కాదని, అది వారి 'వర్గ సహజాతం' అని ఆయన 1943లో రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం చేస్తున్నట్టుగా పెట్టుబడిదారులకు రాయితీలిచ్చి వారిని మరిన్ని పెట్టుబడులు పెట్టేలా చేయకుండా ప్రభుత్వ వ్యయంతో సమిష్టి డిమాండ్ను ప్రేరేపించటానికి, తద్వారా ఉద్యోగితను సృష్టించటానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవటం వల్ల పెట్టుబడిదారీ వ్యవస్థకు ఉండే సామాజిక ఆమోదం దెబ్బతింటుందని తమ 'వర్గ సహజాతం' పెట్టుబడిదారులకు చెబుతుంది. బలమైన ఆర్థిక హేతువు ఆధారంగా కాకుండా ఈ వర్గ సహజాతం పెట్టుబడిదారు లను జర్మీ కోర్బిన్ ప్రతిపాదిత కార్యక్రమాలను వ్యతిరేకించేలా చేస్తోంది. కోర్బిన్ కాబోయే బ్రిటిష్ ప్రధాని అయితే ఒకవేళ ప్రయివేటు పెట్టుబడులు అడుగంటిపోతే దానికి కారణం అర్థశాస్త్రం కాబోదు. ఈ 'వర్గ సహజాతం' వల్లనే 'పెట్టుబడి సమ్మె' రూపంలో వ్యతిరేకత రాగలదు.
బ్రిటన్ ఓపెన్ అర్థిక వ్యవస్థ అయినందున కోర్బిన్ ప్రణాళిక ప్రభావం బ్రిటిష్ విదేశీ మారకపు చెల్లింపుల శేషంపై పడుతుందనేది నిజమే. కానీ ద ఫైనాన్షియల్ టైమ్స్ వాదన విదేశీ మారకపు చెల్లింపుల శేషం గురించి కాకుండా 'సంపద సృష్టి' కి ఏర్పడే ప్రమాదాల గురించి ఉంది. ఇలా జరిగితే అందుకు కారణం పెట్టుబడిదారుల ఉద్దేశపూర్వక వ్యతిరేకతతప్ప ఆర్థిక ఎజెండా కాజాలదు.
పెట్టుబడిదారులు ఉద్దేశపూర్వకంగా అలా వ్యతిరేకించటం జరిగినప్పుడు పెట్టుబడులను పెంచటానికి కోర్బిన్ ప్రభుత్వ రంగంపై ఆధారపడాలి. 'సంక్షేమ పెట్టుబడిదారీ వ్యవస్థ'ను నిర్మించటానికి మాత్రమే పరిమితమైన అతని ప్రణాళిక పెట్టుబడిదారుల వ్యతిరేకతతో బలవంతంగానైనా దాని పరిధిని దాటవలసి ఉంటుంది.
అనువాదం: నెల్లూరు నరసింహారావు
- ప్రభాత్ పట్నాయక్
సెల్: 8886396999