Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధర్మోరక్షతి రక్షతః సత్యమేవ జయతే వంటి మాటలు చెప్పుకోవడమే గాని, మనవాళ్లకు వాటిని నిలుపుకోవడం తెలియడం లేదు. సరే, దేవుడి సంగతి పక్కన పెట్టి దేశంలోని స్త్రీల సంగతి చూడండి. ఒకవైపు స్త్రీని శక్తి స్వరూపిణిగా గొప్పలు చెప్పుకోవడం, మరోవైపు వయసుతో సంబంధం లేకుండా, వావివరసలతో సంబంధం లేకుండా లైంగికదాడులు చేయడం, హత్యలు చేయడం ఇక్కడ పరిపాటి అయ్యింది.
అభివృద్ధి చెందిన దేశాల్లో స్త్రీలను దేవతలుగా చూడరు. సాటి మనుషులుగా చూస్తారు. భారతీయ సమాజం ఆ విషయం గ్రహించాల్సి ఉంది. చదువులేని, పరిపక్వతలేని లారీ డ్రైవర్లు, క్లీనర్లుగా పనిచేసే నలుగురు యువకులు తాగిన మైకంలో ఒక లేడీ వెటర్నరీ డాక్టర్ని చుట్టుముట్టి బలవంతంగా ఆమె గొంతులో మద్యం పోసి, లైంగికదాడీ అనంతరం హత్యచేసి శవాన్ని 20కి.మీ. దూరం తరలించి, తగులబెట్టిన దుర్మార్గాన్ని చూశాం. జంతువుల్లో కూడా కనబడని హీనమైన ప్రవర్తన మనుషుల్లో కనబడటం హేయమైంది. మనుషుల్లా మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి. పోలీసులు, కోర్టులు, చట్టాలు శిక్షలు ఏవీ అక్కరలేదు. 'స్టేషనులో ఉన్న దోషుల్ని మాకు అప్పగించండి. మేం చూసుకుంటాం' అని వేలాది మంది షాద్నగర్ పోలీస్టేషన్ని చుట్టుముట్టిన విషయం మనకు తెలుసు. లోగడ డా||వై.ఎస్.రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాజీపేట ప్రాంతంలో ఒకడు అమ్మాయి మీద యాసిడ్ పోస్తే, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పోలీసులు వెంటనే వాణ్ణి ఎన్కౌంటర్ చేసేశారు. ఇప్పుడు అలా ఎందుకు చేయడం లేదని సామాన్యజనం ఆక్రోశించారు. వాళ్ళు చేసిన అతి కిరాతకమైన పనికి వారిని ఎలా చంపినా ఫరవాలేదని నిందితుల తల్లులే ప్రకటించారు. ఒక దుర్ఘటనకు స్పందించి, సామాన్యులంతా భావోద్వేగాలకు గురికావడం మనం చూస్తున్నాం. సినిమా నటీనటులు కూడా కెమెరాల ముందు తమ కన్నీళ్ళు ప్రదర్శించారు. అయితే గ్రహించాల్సిందేమంటే సమాజంలో మనుషులు ఇంకా బతికే ఉన్నారు. అది సరిపోదు. తమలోని వివేకాన్ని నిద్రలేపాలి. అలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయన్న విషయం సామాజిక, సాంస్కృతిక, రాజకీయ కోణంలోంచి కలిసికట్టుగా విస్తృత పరిధిలో విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. ఆలోచనా ధోరణిని, తర్వాత సమాజాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అరబ్ దేశాలలో వలె దోషుల్ని రాళ్ళతో కొట్టి చంపడాలు, బహిరంగంగా ఉరితీయడాలు మనదేశంలో లేవు. దోషుల్ని ఏండ్ల తరబడి జైళ్ళలో పెట్టి పోషించడం మన ప్రభుత్వాల సంప్రదాయం. ఢిల్లీలో జరిగిన నిర్భయ అఘాయిత్యానికి బాధ్యులైన వారిని ఏండ్లు గడిచినా ఇంకా శిక్షించలేదు. ఇప్పుడు దిశ కేసులో దోషుల్ని వెంటనే కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. పార్లమెంటు ఉభయ సభల్లో ఆవేదన వ్యక్తమైంది. నిజమే, ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయగూడదు. వెంటనే కఠినంగా శిక్షించాలి. అలాంటి తప్పులకు భయంకరమైన శిక్షలుంటాయన్నది సమాజంలో స్థిరపడాలి. అయినా, మీడియాకు అందకుండా జరుగుతున్న సంఘటనలు ఇంకా ఎన్నో ఉంటున్నాయి. ఒక్కోసారి సమాచారం అందినా మీడియా పట్టించుకోకపోవడమూ ఉంది. ప్రభుత్వ విధానాల్లో వివక్ష ఉన్నట్టే, దానిమీద ఆధారపడ్డ మీడియా కూడా వివక్ష చూపుతూ ఉంటుంది.
హైదరాబాద్లో జరిగిన దిశ కేసు పరిశీలిస్తే, నిందితులు చదువులేని యువకులు. సరైన విద్య, ఉద్యోగం అందించడం ప్రభుత్వ బాధ్యత. అక్కడ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. వారు తాగి ఉన్నారు. బలవంతంగా మద్యం అమ్మాయి గొంతులో పోశారు. అంటే మద్యం అమ్మకాలతో తప్ప ప్రభుత్వాలు నడవని పరిస్థితికి వచ్చాయన్నమాట. ఆ తప్పు ఎవరిది? మానవ హక్కులు, స్వేచ్ఛ, వైజ్ఞానిక స్పృహలాంటివన్నీ జనంలో కలిగించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలదే కదా? ఇవన్నీ మన రాజ్యాంగంలో ఉన్నవే. మనం కోరుతున్న గొంతెమ్మ కోర్కెలు కావు. అందువల్ల సమాజంలో జరుగుతున్న అన్ని దుర్ఘటనలకు సూత్రప్రాయంగా ప్రభుత్వాలదే బాధ్యత అవుతుంది. ప్రజల్ని మోసగించి, మభ్యపెట్టి, విభజించి పెత్తనం సాగించడం ఎప్పటికీ పరిష్కారం కాదు. నైతిక విలువలు లేని నాయకులకు రాజ్యాన్ని అప్పగించడం సామాన్యుల తప్పిదం కాదా? అంటే తప్పకుండా తప్పిదమే. అందుకే సంక్లిష్టమైపోతున్న సమాజ స్వరూపాన్ని బేరీజు వేసుకోగల వివేకం జనానికి రావాలి. ఉదాహరణకు లైంగికదాడి కేసుల్లో దోషులుగా ఉన్న తొమ్మిది మందికి బీజేపీ టికెట్లిచ్చి పార్లమెంట్కు గెలిపించుకుంది. అలాగే లైంగికదాడికి పాల్పడిన ఎంపీలు అధికార పార్టీలోనూ ఒకరిద్దరు ఉండనే ఉన్నారు. సర్వోన్నత చట్టసభలోనే పరిస్థితి అలా ఉంటే, ఇక కింది స్థాయిలో విలువలు ఎలా ఉంటాయి? అలాంటి వారు నీతి బాహ్యమైన చట్టాలు తప్ప నీతి మంతమైన చట్టాలు ఎలా తేగలరూ? జనం తమకు ఇష్టపూర్వకంగా ఓట్లేశారా? డబ్బు తీసుకుని వేశారు కదా? మరి అదంతా సంపాదించుకోవాలి కదా? - అని అధికారం చేజిక్కించుకున్న నాయకుడు అనుకుంటాడు. పైన అధికారంలో ఉన్నవాడికే నైతిక విలువల్లేవు. మనకేమిటి? అని సామాన్యుడనుకుంటాడు. ముఖ్యంగా చదువు, సంస్కారం, వివేకం, సరైన నేపథ్యం, పెంపకం లేనివాడు తప్పక అనుకుంటాడు. అందువల్ల జరుగుతున్న క్రూర ఘటనలకు ఆక్రోశించడం తప్పదు - కానీ, వ్యవస్థను మార్చుకోవడానికి మనమేం చేద్దాం? అని ఎవరికి వారు నిజాయితీగా ఆలోచించాలి. నీతి మంతమైన సమాజ నిర్మాణానికి అందరం పూనుకోవాలి. ఒక అమ్మాయి ప్రమాదపు అంచున విలవిల్లాడుతూ ఉన్నప్పుడు విషయం తమ పరిధిలోకి వస్తుందా రాదా అని పోలీసులు కాలయాపన చేయడం వల్లే కదా ఈ రోజు దిశ దుర్ఘటన జరిగింది. దేశవ్యాప్తంగా ఈ కేసు చర్చనీయాంశమైందీ? విషయాన్ని కొంచెం విస్తృత పరిధిలో అవలోకించాలి.
మనకు అన్నింటికీ అన్ని చట్టాలున్నాయి. అయితే వాటిని అమలు చేయడం ఉండదు. చేసినా అందులో చాలా జాప్యం జరుగుతూ ఉంటుంది. ఇలా కాకుండా, సమాజంలో నేర ప్రవృత్తి లేని మనుషులు ఉండాలని మానవవాదులు కోరుకుంటారు. కానీ, అది మన భారతీయ సమాజంలో ఎందుకు సాధ్యం కావడం లేదూ? అంటే సామాన్యులంతా ఉన్నత స్థాయిలో ఉన్నవారిని, అధికారంలో ఉన్నవారిని ఆదర్శప్రాయంగా తీసుకుంటున్నారు. నీతి, నిజాయితీ, నిబద్ధత లాంటి వన్నీ వదిలేసిన వారే నాయకులై అధికారంలో కొస్తున్నారు. జనాన్ని మతం పేరుతో కులం పేరుతో వేల మందిని ఊచకోత కోయిస్తున్న వారిని ఎన్నిసార్లు ఉరితీయాలీ? తప్పు తప్పే. చిన్నదయినా పెద్దదయినా. అందరూ శిక్షార్హులేనని మనమంటున్నాం. కానీ, జరుగుతున్న దేమిటీ? చిన్న తప్పు చేసినవాడు దొరికిపోయి దోషిగా నిలబడుతున్నాడు. పెద్ద తప్పు పెద్ద ఎత్తున చేసినవాడు విదేశాలకు పారిపోతున్నాడు. లేదా మహా నాయకుడై మన నెత్తిమీద కూర్చుంటున్నాడు. కొన్ని విషయాల్లో హింస ప్రత్యక్షంగా కనిపిస్తుంది. మరికొన్ని విషయాలలో కనిపించదు. ఒకడు తాగొచ్చి భార్యను కొడితే అక్కడ గృహహింస అందరికీ కనిపిస్తుంది. మరొకడు పెండ్లి చేసుకుని భార్య బాధ్యత తీసుకోకుండా ఆమెనూ ఆమె జీవితాన్నీ గాలికి వదిలేస్తాడు - అక్కడ ఏ గృహహింసా కనబడదు. కానీ ఆ హింస ఎన్నిరెట్లు పెద్దదో సవ్యంగా ఆలోచించే వారికి మాత్రమే అర్థమవుతుంది. దేశంలోని బ్యాంకులు దోచుకుపోయిన వారే కాదు. స్వాములు, సన్నాసులు కూడా విదేశాలకు పారిపోతున్నారు. లైంగికదాడులు, హత్యలు, భూఆక్రమణలు చేస్తూ మత గురువులుగా చలామణీ అవుతున్న వారిని ప్రభుత్వం ఏం చేస్తోంది. అలాంటి వారినందరినీ ఉరితీయాల్సిన పనిలేదా? స్వామి నిత్యానంద ఈ ప్రభుత్వం కండ్లు గప్పి, దొంగతనంగా పారిపోయి ఈక్వెడార్ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని చేరుకుని అది తన రాజ్యంగా ప్రకటించుకున్నాడు కదా? అలా నేరాలు పెద్ద స్థాయిలో జరుగుతున్నప్పుడు మన ప్రభుత్వాలు నిరోధించలేక పోతున్నాయన్నది నిజం!
జగద్గురువులు, భగవత్ స్వరూపులు, ధర్మ స్వరూపలు, విశ్వ వరూపులు, సత్య స్వరూపలు, కాల స్వరూపలు, ఓంకార స్వరూపులు, యోగ పురుషులు, యుగ పురుషులు - అని తమకు తాము బిరుదులు తగిలించుకున్న వారంతా ఈ దేశంలో ఏం చేస్తున్నారు? ఆధ్యాత్మికతని, భక్తిని ప్రబోధిస్తున్నామంటారు. మరి వీరు పెద్ద ఎత్తున లైంగికదాడులు, హత్యలు ఎందుకు చేస్తున్నారు? వందల సంఖ్యలో ఆడపిల్లల శవాల్ని మెడికల్ కాలేజీలకు ఎలా సరఫరా చేస్తున్నారు? ఇలాంటి వారిని బహిరంగంగా ఉరితీయండని జనం ఎందుకు నిరసన ప్రదర్శనలు చేపట్టలేదూ? ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులుగా ఉండి లైంగికదాడులు హత్యలు చేస్తుంటే వారిని తక్షణం ఆ పదవుల్లోంచి తొలగించి, కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ ఎందుకు రావడం లేదూ? వ్యవస్థలోని అవకతవకల్ని సరిచేసుకోవాలంటే విద్యార్థులు, యువతీ యువకులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సి ఉంది. ఒక రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా ఒక జడ్జి తీర్పు చెపితే ఆ జడ్జి ప్రాణాలతో ఉండడు. జడ్జిని చంపించిన వాడు మాత్రం మంత్రయిపోతాడు. అతన్ని చూసిన సామాన్య జనం అక్రమ మార్గంలోనే సుఖం ఉందనే నిర్ణయానికి వస్తారు. ఒకవైపు తమకు తాము ఏర్పరుచుకున్న మీడియా బలంతో మరోవైపు కార్పొరేట్ మిత్రుల బలంతో జనాన్ని హింసించినవాడే మళ్ళీమళ్ళీ నాయకుడవుతున్నాడు. ఇలాంటి నాయకులకు మతగురువులకూ ఉన్న సంబంధాల్ని తెగ్గొట్టగలిగే ఉద్యమాల్ని నిర్మించాలి. తప్పదు. యువత మేల్కోవాలి. లేకపోతే భవిష్యత్తంతా అంధకారమే!
మనుషులంతా ఒక్కటే. అందరం మిశ్రమ సంతతి లోంచి వచ్చిన వారమే. అందరం సమానులమే నన్న భావన చిన్న వయసు నుంచే పిల్లల్లో కలిగించాలి. ఈ దేశంలో జరుగుతున్న పెద్ద పొరపాటు అదే. వర్గం, వర్ణం, కులం, మతం వంటి భేదాలే కాదు. లింగ భేదాల్ని కూడా అధిగమించాల్సి ఉంది. అందరికీ సమాన హక్కులు, సమాన స్వేచ్ఛ, సమాన బాధ్యతలు కల్పించబడ్డప్పుడు దేశంలో మార్పు వస్తుంది. అభివృద్ధి సాధించడమంటే ఎత్తయిన భవనాలు నిర్మించడం కాదు. హృదయాల్ని విశాలం చేసుకోవడం. విషయాన్ని మరింత విస్తృత పరిధిలో ఆలోచించగలగడం. ముఖ్యంగా దేశంలో సామాన్యుల అవగాహనాస్థాయి పెంచడం. అంతకన్నా ముందు అధికారులు, అధికారంలో ఉన్న నాయకులు తమ ఆలోచనా స్థాయిని పెంచుకోవడం. అలసత్వాన్ని వీడి, మానవీయ విలువలకూ హేతుబద్ధతకూ ప్రాముఖ్యమివ్వడం.
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.