Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్భయల నిండు బతుకులు సీరియల్గా శిథిలమవుతుంటే...
ఆక్రందనలు వినిపించవు - పోలీసుల పహారాలు కనిపించవు
'అమ్మ'ను కాపాడుకునే భరోసా కనిపించదు.
ఇదేనా ప్రపంచీకరణ!
మానవ మృగాల పైశాచికత్వానికి తెలంగాణ ఉదాహరణ
తల్లిదండుల్ర కన్నీళ్ళు ఆగని సుడి - అగ్గితో కడిగినా ఆరని తడి
అమ్మా! అవనీ.. నా ఒళ్లంతా కోరలతో పుట్టించమని,
లేదా పుట్టుకతోనే ఆయుధాలు ఇమ్మని వేడుకుంటున్నా..
ఇలా ఎన్నేళ్ళు? కండ్లు మూసుకున్నా, తెరచినా భీభత్స దృశ్యాలే.. చెవులు మూసుకున్నా వినిపించేది ఆక్రందనలూ, ఆర్తనాదాలే. పీడనలు, వేదనలు కలిసి ఈ కాల చరిత్రను రక్తాక్షరాలతో రాస్తుంటే, ఇదొక అత్యంత విషాదకర అధ్యాయం. దీనికి అంతులేదా? అంతం కాదా? అరికట్టలేమా? చాప కిందకి చేరిన నీరులా ఈ సమాజంలోని అన్ని రంగాల్లోకి 'మాఫియా కల్చర్' చొరబడుతున్నది. దిశ దురంతంపై సిగ్గుపడదాం! విశ్వనగరంలో భద్రతెక్కడ అని ప్రశ్నిస్తున్న నెత్తుటి మరక. మానవత్వపు ఊట సాంతం ఎండిపోతే సాటి మనిషే యముడవు తుంటే ఎవరిని నమ్మాలి? భాగ్యనగరం భయంతో వణుకుతోంది. ఇలా ఎన్నాళ్ళు?
ఒక నిర్భయ అభయ, మానస, దిశ మొన్ననే.. వరంగల్ జిల్లా హన్మకొండలో తల్లి పొత్తిళ్ళల్లో నుంచి తొమ్మిది నెలల పసిగుడ్డును సైతం అఘాయిత్యానికి తెగబడి హతమార్చిన దురంతం సభ్య ప్రపంచాన్ని నిశ్చేష్ట పరిచింది. హైదరాబాద్ నగరాన ఏడాది వ్యవధిలోనే పసివాళ్ళపై అమానుష దాడులు సంఖ్య వెయ్యికి పైబడింది. యాదాద్రి భువనగిరి జిల్లా హజీపూర్లో వరుస దురంతాలు వెలుగు చూసి ఆర్నెల్లు కాలేదు, ఆ వార్తా కథనాల సిరా తడి ఆరకముందే హైదరాబాద్ నగర శివారులో రంగారెడ్డి జిల్లా తొండుపల్లి టోల్ప్లాజాకు సమీపంలో పశువైద్యురాలు దిశను సామూహిక అత్యాచారం, హతమార్చిన తీరు సమాజం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నెత్తురు మరిగించింది. గుండెలవిసేలా చేసింది.
ఈ వరుస హత్యలు మన వ్యవస్థల పని తీరునూ, సమాజం పాటిస్తున్న విలువలనూ, ప్రశ్నార్థకం చేస్తున్నాయి. 2012లో నిర్భయ ఉదంతం అనంతరం అత్యంత కఠినమైన చట్టం వచ్చింది. పోక్సో చట్టంలో ఉరిశిక్ష సహా కఠిన శిక్షలు విధించడానికి వీలు కల్పించే సవరణ కూడా చేశారు. పురుషత్వాన్ని నిర్వీర్యపరిచే కెమికల్ చికిత్సల గురించి ఆలోచన జరిగింది. ఈ ఉద్రిక్తతను తట్టుకోవడానికి ప్రభుత్వం వర్మ కమిటీని వేసింది. ఆ కమిటీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడే వ్యక్తి అర్హత నిర్ణయించటంలో ఉగ్రవాదం, అంటరానితనం, మతతత్వం, సతి కట్నం, వంటి నేరాలతో పాటు లైంగిక నేరాన్ని కూడా చేర్చాలని చెప్పింది. వీటితో పాటు తెలంగాణాలో ఆడపిల్లల రక్షణ కోసం 'షీ టీమ్'లు ఏర్పాటు చేశారు. ఆపదసమయంలో ఫోన్ చేయడం కోసం ప్రత్యేక ఫోన్ నంబర్లు ఉన్నాయి. రాత్రి వేళల్లో పోలీసు పెట్రోలింగ్ కనబడుతూనే ఉంది. అయినా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ప్రశ్నిస్తే గుర్తు తెలియని వాహనాలతో గుద్ది చంపుతున్నారు. ఇలాంటి నాయకులే... ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కండ్లల్లో నీళ్ళు పెట్టుకొని ఫోటో పోజులిచ్చేవారు నేరాలను అదుపు చేయడంలో తామెంత నిస్సహాయులుగా ఉన్నారో సూచిస్తున్నది. ప్రపంచంలో 400కోట్లు పోర్న్ వెబ్సైట్స్ చక్కర్లు కొడుతున్నాయి. చైనా, ఉత్తర కొరియా, ఫ్రాన్స్, జపాన్ తదితర దేశాలు ఈ సైట్స్ను నిషేధించాయి. కానీ సంస్కృతి, సాంప్రదాయం అని చెప్పే ఈ దేశంలో పోర్న్ వెబ్సైట్ ఎందుకు నిషేధించడం లేదు. పోర్న్ సైట్లు కూడా ఇందుకు ఒక కారణం. అందుకే అడుగడుగున అత్యాచార రాక్షసాకారం కొమ్ములు కోరలతో విస్తరిస్తుంటే..? పాలకులారా! పోలీసులారా! బాధ్యత గురించిన మాటేమిటి? ఆడపిల్లలు తప్పిపోతే ఆచూకీ తెలుపండని ఫిర్యాదు చేసే తల్లిదండ్రులకు పోలీస్ స్టేషన్లలో ఎదురవుతున్న మాట. ''మీ అమ్మాయి లేచిపోయిందేమో అన్న ప్రశ్నే'' ఎదురైంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళాలంటేనే భయం, వణుకూ పుడుతోంది.
''పోలీసులు సకాలంలో స్పందించి వుంటే... మా బిడ్డ మాకు దక్కేది'' అని రోదిస్తున్న కుటుంబ సభ్యుల్ని ఓదార్చగలిగేది ఎవరు? పోలీస్ వ్యవస్థను ఇలాంటి బలహీనతలు కూడా పట్టి పీడిస్తున్నాయి. ఉన్నత స్థాయిలో జోక్యం చేసుకుంటే తప్ప, ఉన్నతాధికారవర్గ ఉరకలెత్తిస్తే తప్ప సామాన్యులకు న్యాయం జరగట్లేదు.
స్త్రీలపై అత్యాచారాలకు స్త్రీలను భోగ వస్తువులుగా చూపించే సినిమా, టీవీ వంటి సాధనాలు, సాలెగూడు లాంటి ఇంటర్నెట్లో చిక్కి అంతర్జాల అసభ్య అశ్లీల చిత్రాలు ఆదాయంగా మలుచుకునే ప్రభుత్వం, విరివిగా మధ్యం అమ్మకాలు అసలు కారణాలు. వీటిని నియంత్రించకుండా, నిరోధించాలని అనుకోని ప్రభుత్వ విధానమే లైంగికదాడి నేరాన్ని పెంచిపోషించింది. ప్రపంచ వస్తువు సంస్కృతి వ్యామోహాలకు, స్వంత లాభం కోల్పోతున్న విద్యా ఉద్యోగ అవకాశాల వల్ల నిరుద్యోగులు, చిరుద్యోగులవుతూ స్వసుఖాల మరీచికల వెంబడి పరుగులు తీస్తూ నిరాశా, నిస్పృహలకు లోనవుతూ మరిచిపోవడానికి మద్యం తాగుతూ మత్తులో అడ్డుదారులు తొక్కుతున్న యువతరం తయారుకావడానికి పునాది ఈనాటి రాజకీయార్థిక విధానాల్లోనే ఉంది. సామాజిక హింసను చూసీచూడనట్టు వదిలెయ్యటం, హింసకు తక్షణ సాధనాలైన మనుషుల మీదికే కసిని కోపాన్ని మళ్ళించి మూలాల గురించి ఆలోచించకుండా చేయడం పాలకవర్గాల తక్షణ ప్రయోజనాలను ఈడేరుస్తోంది. కానీ ప్రజలకు శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వలేదు. అత్యాచార సంఘటనలు పునరావృతం కాకుండా వుండాలంటే శిక్ష ఒక్కటే మార్గం కాదు. దృక్పథం మారాలి. స్త్రీల పట్ల సామాజిక దృక్పథం నూతనంగా రూపొందాలి. స్త్రీని అంగడి సరుకుగా కాదు స్త్రీ ఒక మానవ వ్యక్తిగా సమానమైన వ్యక్తిగా గుర్తించి గౌరవించగల ఉత్తమ సంస్కారాలను అభివృద్ధిపరిచే ప్రయత్నం ఎవరు చేయాలి? ప్రభుత్వాలు కాదా?
లైంగికదాడుల పెరుగుదల రేటుకు సామ్రాజ్యవాద సంస్కృతి, మహిళల అక్రమ రవాణా పెరిగిందంటే... మహిళలను అమ్మకపు సరుకుగా, వారి శరీరాలను వ్యాపారంగా మార్చి, సొమ్ము చేసుకుంటున్న బేహారులున్నంత కాలం లైంగికదాడులు ఆగుతాయా? అధికారిక గణాంకాల ప్రకారమే రోజుకు 180మంది బాలబాలికలు అదృశ్యమైపోతున్న దేశంలో లైంగిక దాడుల ఉధృతి భీతిల్లచేస్తోంది. మద్యం దుకాణాలు, రాత్రి క్లబ్బులు, పబ్బుల యాజమాన్య వర్గం పాలకవర్గమేనన్నది అందరికీ తెలుసు. వీటన్నింటికీ వెన్నుదన్నుగా ఉన్న రాజ్యాన్ని నిలేయాలి. అత్యాచార నేరస్థులను శిక్షిద్దాం. కానీ... నేరం జరిగే అవకాశాలు పరిస్థితులను వదిలెయ్యటమా? నేరం జరిగే వరకు ప్రేక్షకుల వలే ఉండి నేరం జరిగాక నేరస్తుడినే శిక్షించటం వలన నేరాల సంఖ్య తగ్గించదు.
ముఖ్యంగా అత్యాచార ఘటనలపై బాధితురాలినే బాధ్యురాలిగా పరిగణిస్తూ.. బాధించే సంస్కృతి రమీజాబీ అత్యాచార సందర్భం నుంచి నిరసించబడుతూనే ఉంది. నాలుగు దశాబ్దాలు గడిచినా స్త్రీని చూసే చూపు మారలేదంటే మన అభివృద్ధి అంతా బలుపే కానీ... బలం కానే కాదు. మొదట బాధితులు చెప్పేది నమ్మండి.. పోలీసులు వేగవంతంగా విచారణ చేపట్టాలి. నేరస్థులకు కఠిన శిక్షలు ఉండాలి. లైంగికదాడుల నేరాలకు మరణశిక్ష సమాధానం కాదు. లైంగికదాడులను అలవాటుగా మారుస్తున్న అధికార దౌర్జన్యాల ఆర్థిక లాభాపేక్షల దుష్ట సంస్కృతిపై యుద్ధం ప్రకటించాలి. కన్నీట తడిసిన ప్రశ్నల్ని కత్తుల్లా సంధిస్తూ నిలదీయాలి.
- భూపతి వెంకటేశ్వర్లు
సెల్: 9490098343