Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశంలో జాతీయ స్థూల ఉత్పత్తి రేటు తగ్గిన ప్పటికీ, దేశంలో మాంద్యం లేదంటూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ శీతకాలం సమావేశాలలో ప్రకటించారు. మరోవైపున ప్రధాని మోడీ దేశంలో మాంద్యం కొనసాగడం వల్ల జాతీయ స్థూల ఉత్పత్తి తగ్గుతున్నదని ప్రకటించారు. పరస్పర విరుద్ద ప్రకటనలతో ప్రధాని, ఆర్థిక మంత్రి భారత ప్రజానీకాన్నే కాక ఆర్థిక మేధావులను కూడా గందరగోళ పరుస్తున్నారు. 2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను 5ట్రిలియన్ డాలర్లకు పెంచుతామని ప్రకటించారు. 2019-20లో 2.8 ట్రిలియన్ డాలర్లు మాత్రమే ఉంది. 2025 నాటికి మరో 3.2ట్రిలియన్ డాలర్లకు పెరగాలి. కానీ 2018-19లో 7.1శాతంగా ఉన్న స్థూల ఉత్పత్తి రేటు ప్రస్తుతం రెండవ క్వార్టర్లో 4.5శాతానికి తగ్గినట్టు ఆర్థిక గణాంకాలు చెపుతున్నాయి. ప్రస్తుత స్థూల ఉత్పత్తి రేటు ప్రకారం మరో తొమ్మిదేండ్లకు అంటే 2033-34 నాటికి 5.18 ట్రిలీయన్లకు చేరే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు చెపుతున్నారు. పై గణాంకాలను చూసినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యం వల్ల ఉత్పత్తి రేటు తగ్గినట్టు స్పష్టమవు తున్నది. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం ఈ మాంద్యం ఇప్పట్లో తగ్గదని తెలుస్తున్నది (ఆధారం : యంఓఎస్పిఐ). అదే సందర్భంలో వియత్నాం 7.46శాతం, చైనా 6.70శాతం, ఈజిప్టు 5.2శాతం, స్థూల ఉత్పత్తి కలిగి ఉన్నట్టు ప్రపంచ బ్యాంకు నివేదిక తెలుపుతున్నది. ఈ మాంద్యంలో వ్యవసాయరంగాన్ని అభివృద్ధిలోకి తెస్తామని, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని ఎన్నికల హామీగా ప్రకటించారు. కానీ వ్యవసాయరంగం స్థూల ఉత్పత్తి ప్రస్తుతం 2.1శాతంగా ఉంది. లక్ష్యం 4శాతం పెట్టుకున్న ప్పటికీ ఏనాడూ ఆ లక్ష్యాన్ని చేరలేదు. 2001 నాటికి 58.3శాతం వ్యవసాయరంగంపై ఆధారపడిన జనాభా ప్రస్తుతం 52.7శాతంగా ఉన్నారు. 2050 నాటికి వీరి సంఖ్య 25.7శాతానికి తగ్గుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ప్రధానంగా బియ్యం, గోధుమ, మొక్కజన్న, ముతక ధాన్యాలు, పప్పులు ప్రధాన ఆహార పంటలు కాగా, నూనె గింజలు, చెరుకు, పత్తి, జ్యూట్, మెస్త్త, ఆలుగడ్డలు ప్రధాన వ్యాపార పంటలుగా ఉన్నాయి. పసుపు మిరప, ఉల్లి, పంటలలో ప్రపంచంలోనే 1,2స్థానాలలో ఉన్న దేశీయ ఉత్పత్తులు క్రమేణా తగ్గిపోతున్నాయి. ఉల్లి ధరలు పెరగడాన్ని గమనించాలి.
2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రధాని ప్రకటించిన పథకాలలో ఉత్పాదకత పెంచడం, గిట్టుబాటు ధర కల్పించడం, మంచి ఉపకరణాలను అందుబాటులో పెట్టడం, ఇరిగేషన్ సౌకర్యం కల్పించడం, విత్తన బదలాయింపు, తగినంత ఎరువు వాడకం, నూతన టెక్నాలజీ వినియోగం చేపట్టాలని ప్రణాళికలో చెప్పారు. అంతేకాక వ్యవసాయానికి తోడు అదనపు ఆదాయం పెంచడానికి హార్టికల్చర్, డైరీ, పౌల్ట్రీ, పందులు, చేపలు, చిన్న జంతువులు, అడవులు పెంచడం ద్వారా అదాయాన్ని పెంచాలని చెప్పారు. మద్య దళారీలను తొలగించి ముందే నిర్ణయించిన కనీస మద్దతు ధరను మార్కెట్లో అమలు జరపడంతోపాటు, నిర్ణయించిన ధరకన్నా తక్కువ వచ్చి నప్పడు ఆ లోటు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. కానీ పై అంశాలేవీ వాస్తవంలో అమలుకు నోచుకోవడం లేదు. ఉన్న వ్యవసాయమే పెట్టుబడి పెరిగి భారం అవుతుండగా, పెట్టిన పెట్టుబడి మార్కెట్లో రాక ఏటా 12600మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు నివేదికలు చెపు తున్నాయి.
దేశంలో 2018-19లో 43 కోట్ల ఎకరాలు సాగులో ఉండగా 30 కోట్ల ఎకరాలలో ఆహార ధాన్యాలు (7 కోట్ల ఎకరాలలో పప్పు ధాన్యాలు కలిపి), 6.5కోట్ల ఎకరాలలో నూనెగింజలు, 1.25కోట్ల ఎకరాలలో చెరుకు, 3కోట్ల ఎకరాలలో పత్తి తదితర పంటలు వేస్తున్నారు. పై పంటల సాగుభూమి క్రమంగా తగ్గుతున్నది. ఉత్పాదకత కూడా గత ఐదేండ్లలో పెరగలేదు. ప్రభుత్వం రైతుల ఆదాయం పెంచడానికి అనేక పథకాలను ప్రకటించింది. కిసాన్ సమ్మాన్ కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.6000 చొప్పున దేశంలోని 14.65కోట్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడానికి రూ.75000కోట్లు, ఫసల్బీమాకు ప్రీమియం కింద రూ.14 వేల కోట్లు, వడ్డీ మాఫీకి 18 వేల కోట్లు, కృషి సించారుయోజనకు 3,500కోట్లు, మార్కెట్ జోక్యం పథకం కింద 3వేల కోట్లు, రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ యోజన కింద 3500 కోట్లు, మొత్తం 1,29,585 కోట్లు 2019-20 బడ్జెట్లో కేటాయింపు చేశారు. మొత్తం బడ్జెట్లో ఇది 4.6శాతంగా ఉంది. కానీ కిసాన్ సమ్మాన్ 75వేల కోట్లు మినహాయిస్తే వ్యవసాయ బడ్జెట్ కేటాయింపు 54,585 కోట్లు మాత్రమే. అనగా మొత్తం బడ్జెట్లో 1.96శాతం మాత్రమే కేటాయించారు. దేశీయ స్థూల ఉత్పత్తికి 15శాతం ఆదాయాన్ని కాంట్రిబ్యూట్ చేస్తున్న వ్యవసాయ రంగం 1.96శాతం బడ్జెట్ కేటాయింపుతో అభివృద్ధి చెందుతుందా? వ్యవసాయరంగ స్థూల ఉత్పత్తి 2.1 శాతంగానే ఉన్నట్టు గణాంకాలు చెపుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తి దినదినం దిగజారుతూ దిగుమతులపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. 2018-19లో 20లక్షల బేళ్ళు, 35లక్షల టన్నుల పంచదార, 1.15కోట్ల టన్నుల వంట నూనెలు, ముతక ధాన్యాలు దిగుమతి చేసుకునే దుస్థితికి వ్యవసాయరంగం చేరుకుంది. సాగుభూమి 43కోట్ల ఎకరాలలో 9కోట్ల ఎకరాలు బీళ్ళుగా మారాయి. 2018-19లో 229 దేశాల నుంచి 35.95 లక్షల కోట్ల దిగుమతులు చేసుకోగా అదే ఏడాది మన ఎగుమతులు 23.07లక్షల కోట్లు మాత్రమే. ఏటా 12లక్షల కోట్లు దిగుమతుల లోటుకు మూల్యం చెల్లిస్తున్నాం. చివరకు పాకిస్థాన్ నుంచి పండ్లు, సిమెంట్, సుగంధ ద్రవ్యాలు, ఉన్ని, రబ్బరు ఉత్పత్తులు, ఆల్కహాల్, ఆట వస్తువులు, సముద్రపు ఉత్పత్తులు, ప్లాస్టిక్, ముడి పత్తి దిగుమతి చేసుకుంటున్నాం. పాలు, పాల ఉత్పత్తులు కూడా అమెరికా, న్యూజిలాండ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. వ్యవసాయ రంగంలోను, పారిశ్రామిక రంగంలోను దేశీయ అవసరాల మేరకు ఉత్పత్తి చేయలేకపోయినా ఆర్థిక మంత్రి మాత్రం దేశంలో మాంద్యం లేదని ప్రకటించడం విడ్డూరంగా ఉంది.
ప్రపంచంలోని అన్ని దేశాలు తమ వ్యవసాయ రంగాలకు పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తున్నాయి. కానీ పత్తి ఎగుమతి రాయితీలు నిషేధించాలని 2017 జనవరి 1న భారతదేశం తరఫున ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ సంతకం చేశారు. 135 కోట్ల జనాభా కలిగిన భారతదేశం ఆహారధాన్యాల దిగుమతులపై ఆధారపడే దుస్థితికి నెట్టబడింది. 1996లో స్వయంపోషకత్వంగా ఉన్న దేశం నేడు దిగుమతులపై ఆధారపడుతున్నది. ఆహారధాన్యాల ఉత్పత్తి 2018-19లో 28.1కోట్ల టన్నులు కాగా హెక్టారుకు ఉత్పాదకత 2,292కిలోలు మించలేదు. పప్పు ధాన్యాల ఉత్పాదకత హెక్టారుకు 849కిలోలు, నూనెగింజల ఉత్పాదకత 1,234కిలోలు, గింజ తీసిన పత్తి హెక్టారుకు 414కిలోలు మాత్రమే దిగుబడులు సాధిస్తున్నాము. చైనా, అమెరికా లాంటి దేశాలలో హెక్టారుకు ఆహార ధాన్యాలు 6-8టన్నుల ఉత్పాదకత ఉంది. ఇంతవరకు వ్యవసాయ రంగానికి దేశీయంగా లేదా రాష్ట్రాలలో భూ వినియోగంపై ప్రణాళికలు లేవు. రైతులు తమ కోర్కెల మేరకు పంటలు వేస్తున్నారు. ప్రధానంగా ఎగుమతి ఆధారిత పంటలవైపు రైతులు మొగ్గుచూపుతున్నారు. అనేక వైపరీత్యాలకు ఓర్చి పండించిన ఎగుమతి ఆధారిత పంటలకు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు లేకపోవడంతో రైతులు దివాళా తీస్తున్నారు. ఇప్పటికీ 52శాతం ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. క్రమంగా వీరు వ్యవసాయరంగాన్ని వదిలేసి ఇతర రంగాలకు తరలిపోతున్నారు. 2022 నాటికి వ్యవసాయ రంగంలో 18అంశాలను అమలుజరపడం ద్వారా 2018 ఫిబ్రవరి 3న రైతుల ఆదాయం రేటు పెంపు చేస్తానని ప్రధాని ప్రకటించారు. ఆ అంశాలలో మధ్యదళారీల తొలగింపు, ప్రకృతి వైపరీత్యాల పరిహారం చెల్లింపు, అన్ని పంటలకు బీమా సౌకర్యం, రైతు బీమాతో పాటు పెన్షన్ సౌకర్యం, కౌలు రైతులకు చట్టాలు, తక్కువ నీటితో పంటలు పండించడంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇస్తానని ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి ఆరేండ్లు కావస్తున్నా ప్రభుత్వం ప్రకటించిన హామీలలో ఏ ఒక్కటీ అమలు జరగలేదు. చివరకు ''రైతుల ఉత్పత్తిదారుల సంఘాలు'' ఏర్పాటు చేసి పెద్ద కమతాలుగా మార్చి ఆ కమతాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించి యాంత్రీకరణ ద్వారా అధికోత్పత్తి సాధిస్తామని ప్రణాళికలు వేస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ రంగంలోకి 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి, బహుళజాతి సంస్థలకు స్వేచ్ఛా వ్యాపారం కల్పించడానికి దిగుమతి సుంకాలను రద్దు చేయడం జరిగింది. స్వేచ్ఛా వ్యాపారం కింద 16 ఆసియా దేశాలతో జరిగిన ఒప్పందంలో 4 కమిటీలు వేశారు. 1) మేధో సంపత్తి హక్కుల పరిశీలన 2) పోటీతత్వం 3) ఆర్థిక సాంకేతిక సహకార సంబంధాలు 4) సమస్యల పరిష్కార కమిటీ. కానీ 2019 నవంబర్ 4న బ్యాంకాక్లో జరిగిన రీజనల్ కాంప్రెహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఒప్పందంపై ప్రధాని సంతకం చేయకుండా బహిష్కరించారు. ఇది అందరూ ఆహ్వానించదగినదే. కానీ ఈ సంతకం చేయకపోవడం వెనుక బీజేపీ పార్టీకి చెందిన స్వదేశీ జాగరణ మంచ్ ఒత్తిడివుంది. అంతకుముందే అన్ని వర్గాల ప్రజలల నుంచి దిగుమతులను నిషేధించాలని లేదా వాటిపై సుంకాలను పెంచాలని దేశవ్యాపిత ఆందోళనలు జరిగాయి. కానీ ఏనాటికైనా తిరిగి ఒప్పందంపై వీలునుబట్టి కేంద్రం సంతకాలు చేసే అవకాశం లేకపోలేదు.
వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలకు ప్రణాళికలు రూపొందించి దేశీయ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తిని సాగించాలి. వీలయినంతవరకు వ్యవసాయరంగానికి సంబంధించిన ఉత్పత్తులను దిగుమతి చేసుకోకుండా చూడాలి. వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కనీసం 8శాతం నిధులు కేటాయించాలి. మారుతున్న వాతావరణ పరిస్థితు లను బట్టి మన విత్తనాలలో మార్పు తెచ్చే విధంగా పరిశోధనలు నిర్వహించాలి. వ్యవసాయ రంగానికి రాయితీల కల్పనలో వెనకాడరాదు. విత్తనం మొదలు మార్కెట్ వరకు గల అంశాలలో ప్రభుత్వ జోక్యం తప్పనిసరిగా ఉండాలి. పరిశ్రమలకు సంబంధించి కార్పొరేట్లకు స్వేచ్ఛ కల్పించే విధానానికి బదులు కార్మికులు ఉత్పత్తి పెంచే విధంగా చట్టాలలో మార్పు తేవాలి. కార్మిక సంక్షేమానికి పెద్ద పీట వేయాలి. మండల, తాలూకా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రణాళికలు రూపొందించి ప్రణాళికాబద్ధంగా ఉత్పత్తి సాధించడంతో పాటు ఉత్పాదకతను కూడా పెంచాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తిని సాధించే దిశగా ప్రణాళకలు రూపకల్పన చేయాలి. భూమి సాగుతో సంబం ధం ఉన్నవారందరికీ చట్టపరంగా హక్కులు కల్పించాలి. పై చర్యలు చేపట్టడం ద్వారా ప్రస్తుత మాంద్యం నుంచి వ్యవసాయ, పారిశ్రామికరంగాలను బయట పడ వేయాలి. అంతేకానీ ప్రపంచవ్యాపితంగా కొనసాగుతున్న మాంద్యం భారతదేశంలో లేదని ఆర్థికమంత్రి చెప్పడం వల్ల ప్రస్తుత మాంద్యం పరిస్థితులు దూరం కావు. ఆర్థికవేత్తలు, మేధా వులు, నిపుణుల సలహాలను తీసుకుని ఉత్పాదక రంగంలో మార్పులు తెచ్చి ఉత్పత్తిని పెంచాలి.
- సారంపల్లి మల్లారెడ్డి
సెల్: 9490098666