Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఉల్లి గడ్డలు పట్టుకు వదలనన్నది చూడే నా మనసు
నా ఆశలనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
నా కూరకు కావాలి కాస్తా ఉల్లిపాయా గుమగుమలు
నిను కొందమని మది తలచుకుంటే చిందేనే సెగలు
నా ఆశలు గాలికి ఉయ్యాలలూగుతుంటే ధరపెరిగి
నువ్వు అందకుండా ఎగురుతుంటే
నిట్టూర్పుల విలవిలలు
సామజవరగమనా ఉల్లిలేక ముద్దదిగునా
ఉల్లి మీద మనసుకున్న అదుపు చెప్ప తగునా!'
అని బాత్రూంల కెల్లి పాటపాడుకుంట బయటకొచ్చిండు మొద్దోడు. బట్టలు తొడుక్కుంట ఆరాం చైర్లగూసుండు. గప్పుడే మొద్దోని పెల్లాం బంగారం చారు ఇచ్చి తిరిగి వంటింట్లకు బోయింది. చారుదాక్కుంటా పేపర్ సద్వబట్టిండు. పేపర్ల అన్నీ ఉల్లిగడ్డలు ధర పెరిగిన వార్తలే కనిపించినరు. బంగారం వంటింట్లెకెల్లి ఒక్కసారే పెద్దగా అర్సుకుంట వరండాలకు ఉరికొచ్చింది. మస్తు పరేషాన్ అయితుంది. పెయ్యంతా సల్లబడింది. సెమటలు పడుతున్నరు.. సెక్కెరొచ్చినట్టు కళ్లు తిరిగి బయటకొచ్చి కుర్చీల కూలబడింది. మొద్దోడు గీన మస్తు పరేషాన్ అయిండు. 'గిప్పటిదాంకా బానే ఉంది గిప్పుడేమైంది' అని బుగులు బడిండు. జరన్ని నీల్లు దెచ్చి మొఖాన గొట్టిండు. గప్పుడు సోయిలోకొచ్చింది. 'ఏమైందే గట్ల పరేషాన్ అయినవ్' అని అడిగిండు. 'మొత్తం మీరే చేశారు. మొత్తం మీరేచేశారండీ'. 'ఏమైందే చెప్పవే' అన్నడు కంగారుగా. 'రాత్రి వంటింటి కిటీకీ మూయమని చెబితే విన్నారా! గిప్పుడు జూడు ఉన్న ఒక్క ఉల్లిగడ్డనూ ఎలకెత్తుకు బోయింది. గిప్పుడు కూరెట్టా చేసేది. అసలే నీకూ, సంటోడికి ఉల్లివాసన లేనిదే ముద్దదిగదే' అంది బంగారం. 'నువ్వేం పరేషాన్ గాకే గిట్టాంటిది ఏదో అయితదనే మొన్న తెచ్చిన ఉల్లిగడ్డల్లో ఒక చిన్నగడ్డను దీసి మిక్సీలో రసం దీసి ఖాళీ స్ప్రేబాటిల్లో నింపిన. కూర మొత్తం ఉడికినాక ఫైనల్ టచ్గా జస్ట్ రెండు సార్లు కూరపైన స్ప్రే చేరుచాలు. ఇక ఆ వాసనతోనే లాగించేయొచ్చు. సంటోడు గీన గుర్తుపట్టడు' అన్నడు మొద్దోడు. 'మీరు గట్టనే చెబుతారు. పొరపాట్న జరంత ఎక్కువ బడితే మీరు నన్ను సావగొట్టరూ' అంది బంగారం. 'ఏం కాదులేవే' అన్నడు మొద్దోడు. 'మొన్న గట్టనే పక్కింటి పిన్నిగారిని వాళ్లాయన ఇరగబాదిండు' అంది బంగారం. 'ఎందుకంట?' అన్నడు మొద్దోడు. 'ఆయన గీన నీలాగే ఉల్లిగడ్డలు అయిపోతయని ఒక గడ్డకు సూదితో దారం గుచ్చి ఇచ్చిండంట' అన్నది బంగారం. 'దారం గుచ్చి ఇచ్చుడెందుకే' అన్నడు మొద్దోడు. 'కూర కుతకుత ఉడికేప్పుడు ఆ ఆవిరికి దారంతో కట్టిన ఉల్లిగడ్డను కూర మీద రెండు నిమిషాలు అలా అలా తిప్పితే ఆ ఆవిరికి కూర ఉల్లిగడ్డ వాసనతో మాంచి రుచి గుంటదని చెప్పిండంట. ఆమె అలా కోడిగుడ్ల పులుసు మీద దారం కట్టిన ఉల్లిగడ్డ తిప్పుతుంటే ఉల్లిగడ్డకున్న దారం పుటుక్కున తెగి పులుసుల పడిందంట. దానికి వాళ్లాయన పిన్నిగార్ని మస్తు కొట్టి బాధ్యతలేని నువ్వు నాకొద్దు విడాకులివ్వాలని కోర్టుకు బోయిండు' అంది బంగారం. 'సర్లే నేను బ్యాంకుబోయి లాకర్ల పెట్టిన ఆ చిన్న ఉల్లిగడ్డను తీసుకొస్తా' అని బజారుకు బోయిండు.
మొద్దోడు గట్ట బస్టాండు తాన్కి బోయేటప్పటికి అక్కడ మస్తు మంది జమైండ్రు. దోస్తు బుచ్చిగాడు గీన ఆ మందిల ఉన్నడు. 'ఏమైందిరా' అని బుచ్చిగాడ్ని పిలిచి అడిగిండు. గిప్పుడే 'ఉల్లిస్నాచింగ్' జరిగింది. గా రియలెస్టేట్ వీర్రాజు బిడ్డ ఉల్లిహారం ఏస్కొని కాలేజీకి బోయేటందుకు బస్టాప్లకొచ్చి నిలబడ్డది. గప్పుడే బైక్పై వచ్చిన పోరలు దాన్ని తెంపుకపోయిండ్రు. ఆ పిల్ల ఒక్కటే ఏడుపు. ఒద్దనంగా వాల్ల నాయిన 'గిప్పుడు బంగారం కంటే ఉల్లిగడ్డలు ఉంటేనే ప్రెస్టేజ్గుంటది' అని చెప్పి మెళ్లోవేసిండంట. ఆల్ల నాయన ఏమంటడో అని ఒకటే ఏడుపు' అని చెప్పిండు. అక్కడి నుంచి బ్యాంకుకు బోయిండు మొద్దోడు. బ్యాంకు ముందు మస్తు మంది జమైండ్రు. పోలీసులు గీన మస్తుమంది అచ్చిండ్రు. ఏం జరిగిందో అని మందిల కెల్లి తోసుకుంటా ముందుకు బోయిండు మొద్దోడు. పక్కనోడ్ని అడిగిండు ఏమైందని. 'బ్యాంకులో రాత్రి దోపిడీ జరిగిందంట. ఎవరో లాకర్ల ఉల్లిగడ్డలు దాచిపెట్టిండ్రంట. మొత్తం లాకర్లు పగలగొట్టి బంగారం, డబ్బు వదిలేసి ఉల్లిగడ్డలను ఎత్తకబోయిండ్రంట. ఉల్లిగడ్డలు లాకర్ల దాసిపెట్టినోల్లకోసం పోలీసులు, ఇన్కంటాక్స్ వాళ్లు ఎంక్వైరీ చేస్తుండ్రు' అని చెప్పిండు. ఇక అంతే అక్కడ నుంచి చిన్నగా జారుకుండు మొద్దోడు. ఎట్టైనా ఇంటికి ఉల్లిపాయలు తీస్కబోవాలని అనుకుండు మొద్దోడు. అలా పైటాల్లయింది. బస్టాండ్ సెంటర్ల బిర్యానీ హోటల్ కనిపించింది. వంద రూపాయలకే బిర్యానీ అని బోర్డు ఉంది. పొయి బిర్యానీ ఆర్డర్ జేసిండు. ఆడు బిర్యానీతో పాటు ఉల్లిగడ్డ ముక్కలు పెట్టిండు. బిర్యానీ తిని ఎవరూ చూడకుండా ఉల్లిగడ్డ ముక్కలు జేబుల ఏస్కొని విజయగర్వంతో ఇంటి కొచ్చిండు. బంగారం మొద్దోనికి హారతిపట్టి ఇంట్లెకు తీస్కబోయింది. గప్పుడే టీవీల వార్తలు షురూ అయినరు. 'ఉల్లిగడ్డలను ఎలా పొదుపుగా వాడుకోవాల్లో మొగోళ్లు చేసిన ప్రయోగాలకు గీ దఫా మన దేశానికి నోబుల్ ఫ్రైజ్ వచ్చింది' అని చదువుతుంది.
పార్లమెంట్లో ఓ గదిల మోడీ, అమిత్షా, నిర్మలా సీతారామన్, ఇంకా కొందరు మంత్రులు, ఎంపీలు గూసొని ఉల్లిగడ్డల గురించి బాగ సోంచాయిస్తుండ్రు. ఈ కంపు గడ్డలతోనే పెబుత్వాలు గీన కూలినరు. కాబట్టి వీటిపైన ఏదైనా జేయాల అన్నడు మోడీ. వెంటనే నిర్మలా సీతారామన్ 'నేను అసలు ఉల్లితినే కుటుంబం నుంచి రాలే కాబట్టి వాటిని నిషేధిద్దాం' అన్నది. ఆమెకు మద్దతుగా కాషాయపార్టీ యువనేత ఆజంఖాన్ గీన 'గివి తింటే నోరంతా కంపు కొడతది నిషేధించడమే మేలు' అన్నడు. 'నిజమే మన పెభుత్వం గీన కూలిపోకుండా ఉండాలంటే గీ ఉల్లిగడ్డలను మన దేశంల నిషేధిద్ధాం' అన్నడు అమిత్షా. వెంటనే రాజ్యాంగంల ఉల్లినిషేధ షెడ్యూల్ను చేర్చి దానిల 'ఉల్లి తింటే ఉతికారేస్తాం' అనే 420 ఆర్టికల్ను చేరుద్దాం' అని అందరూ తీర్మానించిండ్రు.
- పుప్పాల మట్టయ్య
సెల్ :9490099332