Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ చట్టసవరణ బిల్లును యుద్ధ ప్రాతిపదికన పార్లమెంట్లో ఆమోదింపచేసుకుంది. అంతకు మించిన వేగంతో రాష్ట్రపతి సంతకం చేసి రాజముద్ర వేసేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం చట్టం రూపొందించాలన్నా నిర్దిష్ట విధి విధానాలున్నాయి. తక్షణమే సదరు చట్టాన్ని ఆమోదించకపోతే దేశంలో జరిగే నష్టం ఏమైనా ఉందా అన్న ప్రశ్న ఏ చట్ట ప్రక్రియకైనా తొలి మెట్టు. ఒక వేళ అటువంటి నష్టం ఉందని భావించినా ముసాయిదా బిల్లును రూపొందించి సంబంధిత శాఖల అభిప్రాయాలు తీసుకోవటం, కేంద్ర మంత్రిమండలిలో ఏకాభిప్రాయాన్ని సాధించటం, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల గురించి అధ్యయనం చేయటం, రాజ్యాంగ విలువలకు ప్రతిపాదిత చట్టం ద్వారా రాజముద్ర పొందే విలువలకు మధ్య పొసగనితనం ఏమైనా ఉందా అని జాతీయ న్యాయ కమిషన్ ద్వారా అధ్యయనం చేయించటం, ఓ అంచనాకు రావటం తదనుగుణంగా ప్రతిపాదిత ముసాయిదా బిల్లులో సవరణలు చేయటం.... హేతుబద్ధమైన చట్ట రూపకల్పన ప్రక్రియ. నయా ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చాక ఈ ప్రక్రియను క్రమంగా నీరుగార్చటం పాలకవర్గ ప్రయోజనంగా మారింది. బీజేపీ అధికారానికి వచ్చిన గత ఆరేండ్లల్లో ఇటువంటి క్రమాన్ని అనుసరించటం, ఒకరికి జవాబుదారీగా వ్యవహరించటమన్నదే ఒంటికి పడని వ్యవహారంగా మారింది. ఈ కోణంలో చూసినప్పుడు మాత్రమే పౌరసత్వ చట్టసవరణ బిల్లు ఆమోదించిన తీరును మనం అర్థం చేసుకోగలం.
ఏ చట్టాన్ని ప్రతిపాదించేటప్పుడైనా ఆశించిన లక్ష్యాలు, అనుకోని పర్యవసానాలు రెండూ ఉంటాయి. ఆశించిన లక్ష్యాల ఆధారంగా చట్టాన్ని రూపొందించటానికి పెద్దగా శ్రమపడనక్కర్లేదు. ప్రభుత్వం చుట్టూ ఉన్న టెక్నోక్రాట్లు సరిపోతారు. అనుకోని పర్యవసానాలు ఎలా ఉంటాయి అన్నది ఊహించి తగిన విరుగుడు ఏర్పాటు చేయటమే రాజకీయ దార్శనికత. రాజధర్మం. ఈ రెండూ బీజేపీకి లేవు అన్నది రానురాను మరింత స్పష్టమవుతోంది. రాజ్యసభలో పౌరసత్వ చట్టసవరణ బిల్లు చర్చ జరుగుతుండగానే ఈశాన్యభారతం నిప్పుల కుంపటిగా మారసాగింది. అస్సాం రాజధాని గౌహతిలో పాలన స్థంభించింది. ఈశాన్య రాష్ట్రాల్లో కాశ్మీర్ తరహాలోనే ఇంటర్నెట్ను స్థంభింపచేసింది ప్రభుత్వం. తమ భవిష్యత్తు పట్ల ఆందోళనకు గురైన ఈశాన్యభారత యువత వీధుల్లోకి వచ్చింది. ప్రభుత్వం నుండి సమాధానం కోసం ఎదురు చూసింది. ఆవేశానికి లోనైంది. అయినా అభినవ నీరోలు మాత్రం తాము ఒలకబోస్తోంది విషమన్న విషయం ప్రజలకు తెలిసిపోతుందేమోనన్న ఆందోళనతో ఎక్కడలేని హడావుడితో చట్టాన్ని ఆమోదించుకునే పనిలో పడ్డారు.
ఇంతకు చట్టం ఆమోదించాల్సిన అవసరం గురించి అమాత్యులు ఏమన్నారు? లోక్సభలో దాదాపు గంటన్నర పాటు మాట్లాడిన అమిత్షా ఉపన్యాసం విన్నాక, జరుగుతున్న పరిణామాలు గమనించాక ఇంత ఘోరమైన చట్టాన్ని మందబలంతో ఆమోదిచుకున్న నేపథ్యంలో కొన్ని ముఖ్య కోణాలు పాఠకుల దృష్టికి తేవడం అవసరం.
మొదటి అంశం, జరిగిన ఘోరతప్పిదాన్ని సరిచేసుకునే ప్రయత్నం ఈ చట్టసవరణ పునాదిగా ఉంది. గత నాలుగు దశాబ్దాలుగా ఈశాన్యభారతంలో ముస్లిం చొరబాటుదారులు లక్షలాదిగా తరలి వస్తున్నారన్న ప్రచారం సాగింది. 1971లో జరిగిన బంగ్లాదేశ్ విమోచన యుద్ధం దీనికి కారణమని చెప్పారు. చెప్పించారు. పాఠాలుగా చేర్చారు. చొరబాట్లు అరికట్టేందుకు సరిహద్దుల్లో ముళ్ల కంచె నిర్మించటానికి వేల కోట్లు ఖర్చు కూడా అయ్యాయి. ఈ చొరబాటుదారుల విషయంలోనే 1980 దశకంలో అస్సాం అగ్నిగుండంగా మారింది. ఎట్టకేలకు చట్టవిరుద్ధంగా పని చేస్తున్న యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ప్రతినిధులతో నాటి ప్రధాని రాజీవ్గాంధీ ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం 1971 ముందు ఈశాన్యభారతదేశంలో ప్రత్యేకించి అస్సాంలో ప్రవేశించిన వారంతా చట్టబద్ధమైన పౌరులే. 1971 తర్వాత వచ్చిన వారంతా చొరబాటు దారులుగా గుర్తించి తిరిగి వారి మాతృదేశానికి పంపాలన్నది ఈ ఒప్పందం సారాంశం. ఆ మేరకు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దఫ దఫాలుగా జరిగిన ప్రయత్నాలు చివరకు జాతీయ పౌరుల జాబితా రూపం తీసుకున్నాయి. అస్సాంలోనే 19లక్షల మంది ఈ పౌర జాబితాలో స్థానం సంపాదించలేకపోయారు. అంటే ప్రభుత్వం విధించిన నియమాల ప్రకారం తమ పౌరసత్వాన్ని నిరూపించుకోలేకపోయారు. వీరందరినీ నిర్భంధ శిబిరాల్లో కుక్కారు. తీరా తేలిందేమంటే 19లక్షల్లో 14లక్షల వరకు హిందువులున్నారని. దీంతో గత నాలుగు దశాబ్దాలుగా ఆరెస్సెస్ సంఫ్ు పరివారం సాగిస్తున్న ముస్లిం వ్యతిరేక ప్రచారం అసత్యమని తేలింది. అస్సాం కేంద్రంగా ఈశాన్యభారతంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉండటానికి పునాదులు బలోపేతం చేసుకోవాలన్న బీజేపీ వ్యూహానికి గండిపడింది. ఈ 14లక్షల మందిని తిరిగి భారతీయులుగా గుర్తించాలంటే ఏదో ఒక తాయెత్తు కావాలి. గజం మిధ్య పలాయనం మిధ్య అనుకుంటే సరిపోదు. కాబట్టే ఈ చట్ట సవరణ. అందుకే బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ల నుంచి భారతదేశంలోకి చొరబడిన వారిలో ముస్లింలు తప్ప మిగిలిన వాళ్లంతా మనవాళ్లే అన్న సవరణ అవసరం అయ్యింది. ఈ క్రమాన్ని పరిశీలిస్తే దాదాపు 20ఏండ్ల పాటు హాలివుడ్లో హవా కొనసాగించిన టెక్నో హర్రర్ సినిమాలు గుర్తుకొస్తున్నాయి. ఈ సినిమాల్లో ప్రపంచాన్ని కబళించే ఓ ఉత్పాతాన్ని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలో సైనికులో కనిపెడతారు. ఆ ఉత్పాతాన్ని అదుపులోకి తేవటానికి, అంతమొందించటానికి ప్రపంచంలో ఏ శక్తీ పని చేయలేదు. చివరకు అమెరికాయే శరణ్యమవుతుంది. ప్రపంచానికి వచ్చిన ముప్పును అమెరికా తొలిగిస్తుంది. ఇంకా తేలిగ్గా చెప్పుకోవాలంటే నారదుడే పుల్లలు పెట్టి నారదుడే పరిష్కారం చూపినట్టు. అస్సాంలో బీజేపీ రాజేసిన కుంపటిని చల్లార్చుకోవటానికి దేశమంతా కుంపట్లు రాజేయటమే మార్గమని బీజేపీ భావించిన ఫలితమే తాజా చట్టం.
ఇక రెండో అంశం.. ఇది బీజేపీ, సంఫ్ు పరివారపు దీర్ఘకాల ప్రచార వ్యూహానికి సంబంధించింది. బిల్లును ప్రతిపాదించేటప్పుడు, చర్చకు సమాధానమిచ్చేటప్పుడు అమిత్షా పదే పదే రెండు విషయాలు ప్రస్తావించారు. ఇరుగుపొరుగు దేశాల్లో ఇస్లాం అధికారిక మతంగా ఉందన్న విషయం అందులో ఒకటి. అయితే దీనివల్ల భారతీయులకు వచ్చిన ముప్పేమీ లేదు. ఈ దేశాల్లో మతపరంగా అల్పసంఖ్యాకులైన వారు నిరంతరం ఊచకోతకు గురవుతున్నారన్నది అమిత్షా చెప్పిన మరో విషయం. అందువల్ల సాటి మనుషులు ఊచకోతకు గురవుతున్నప్పుడు వారిని ఆదుకోవటం కోసం ఈ చట్టం అవసరం అన్న వాదన ముందుకు తెచ్చారు. తద్వారా బీజేపీ పంచ్బాగ్ రాజకీయాల్లో మరో కొత్తపంచ్లకు తెరతీసింది. ఈ చర్చ విన్నవారికి, చట్టాన్ని చదివిన వారికే కాక రాబోయే తరాలకు కూడా ఆయా పొరుగు దేశాల్లో నిరంతరం హిందువులు ఊచకోతకు గురవుతున్నారన్న అపోహ కల్గించేందుకు కావల్సిన భూమికను ఈ చట్టం ద్వారా సిద్ధం చేసుకుంది బీజేపీ. రామమందిరం వివాదం శాశ్వతంగా పరిష్కారం అయ్యాక హిందు ముస్లింల మధ్య ఘర్షణ ద్వారా ఓటుబ్యాంకు రాజకీయాలకు తావులేదని ఊపిరి తీల్చుకుందా మనుకుంటే కుదరదనీ, ఇరుగుపొరుగున పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్లు ఉన్నంత కాలం దేశంలో మతోన్మాద రాజకీయాల కొలిమి రాజేస్తూ ఉండటానికి కావల్సిన బొగ్గుల బస్తాను ఈ చట్టం ద్వారా బీజేపీ సిద్ధం చేసుకుంది.
ఇక మూడో అంశం. ఆయా దేశాల్లో జరిగిందనీ, జరుగుతోందనే హిందువుల ఊచకోత అన్నది భ్రమ. నిజంగా అటువంటిది జరిగితే ఎవ్వరూ అంగీకరించరు. ఒక మనిషిపై మత విశ్వాసం పేరుతో దాడి చేసి హతమార్చటం అన్నది ప్రపంచాన్ని 21వ శతాబ్దం నుంచి అంధయుగాలకు తీసుకెళ్తుంది. కానీ ప్రభుత్వం చేస్తున్న ఈ వాదనలో వాస్తవం ఏంత? గత మూడేండ్లుగా రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా అప్పటి హౌం మంత్రి, అప్పటి విదేశాంగ మంత్రి ఇచ్చిన సమాధానాలు పార్లమెంట్ వెబ్సైట్లలో ఉన్నాయి. 2014 తర్వాత బారతీయ పౌరసత్వం కావాలని కోరుతూ వచ్చిన దరఖాస్తుల్లో పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ పౌరుల నుంచి వచ్చిన దరఖాస్తులు కేవలం 4844. కానీ అమిత్షా తన ఉపన్యాసంలో కోట్లాదిమంది ముస్లిమేతర శరణార్థులు తమ తమ విశ్వాసాల కారణంగా ప్రాణాలరచేత పట్టుకుని భారత్లో ప్రవేశించారని, వారికి పౌరసత్వం ఇవ్వటం కనీస ధర్మమని నమ్మబలికారు. రాజ్యసభ, లోకక్సభలో ఏ ఒక్కరూ ప్రభుత్వం వద్ద ఉన్న లెక్కల గురించి అడిగిన పాపాన పోలేదు. ఇలా పెండింగ్లో ఉన్న దరఖాస్తుదారుల్లో ఏమతాన్ని పాటించేవారెందరో కేంద్ర ప్రభుత్వం వద్ద ఇంత వరకు లెక్కలేదు. పైగా మరో ప్రశ్నకు సమాధానంగా నాటి కేంద్ర హౌం మంత్రి రాజ్నాధ్ సింగ్ విదేశాల్లో మతపరమైన దాడులకు గురైన వారి వివరాలు భారత ప్రభుత్వం సేకరించదు అని స్పష్టంగా చెప్పారు. మరి అమిత్షా దృష్టికి వచ్చిన కోట్లాది మంది ఎవరు అన్నది శతకోటి డాలర్ల ప్రశ్న.
ఇప్పుడు తలెత్తే ప్రశ్న ఈశాన్యభారతం ఎందుకు అగ్నిపర్వతమవుతోందన్న ప్రశ్న. పైన చెప్పుకున్నట్టు అస్సాం ఒప్పందం ప్రకారం 1971 తర్వాత ఏ కారణంతో ఈ దేశంలో ప్రత్యేకించి ఈశాన్యభారతంలో ప్రవేశించిన వారినైనా చొరబాటుదారులుగా పరిగణించాలి. ఆ తర్వాత వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వకూడదు. కానీ తాజా చట్టంలో 2014 వరకు వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వటానికి అంగీకరిస్తూ ఓ క్లాజును చేర్చారు. అంటే అస్సాం ఒప్పందం సందర్భంగా అస్సాం ప్రజలకు, ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కింది. పౌరసత్వానికి అర్హతగా ఉన్న తుది గడువు 2014 వరకు అంటే దాదాపు నలభై ఏండ్లు పెంచింది. అంటే ఈ నభైఏండ్లల్లో వచ్చిన వారందరినీ పౌరులుగా గుర్తిస్తామని చెప్పటమే. 1971 బంగ్లా విముక్తి యుద్ధానికి అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో పెల్లుబికిన ఆగ్రహానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. ఈ యుద్ధానంతరం వచ్చిన శరణార్థులే ఉద్యమ నిర్వాహకుల లక్ష్యంగా మారారు. వేలాదిమంది హతులయ్యారు. ఎట్టకేలకు ఈశాన్య రాష్ట్రాలను హింసాత్మక వలయం నుంచి బయటికి తెచ్చి ప్రజాతంత్ర స్రవంతిలో నడిపించటానికి దేశానికి దాదాపు నాలుగు దశాబ్దాలు పట్టింది. అయినా ఈ చారిత్రక నేపథ్యం గురించి వీసమెత్తు అవగాహన లేని బీజేపీ నేడు ఈ రాష్ట్రాలను తిరిగి నిప్పుల కుంపట్లోకి నెడుతోంది.
ముగింపులో ఓ ముఖ్యాంశాన్ని ప్రస్తావించాలి. దేశం ఆర్థికంగా అధోగతి పాలవుతోంది. నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మహిళ ప్రాణ, మాన భద్రతకు దిక్కులేదు. ఈ పరిస్థితుల్లో వాస్తవిక సమస్యల గురించి ప్రజలు ఆలోచించకుండా చేయటానికి, ఆందోళన పథంలో అడుగు పెట్టకుండా ఉండటానికి ఇటువంటి సమస్యలు కాని వాటిని సమస్యలుగా సృష్టించి కంసుడు శకటాసురుడిని బాలకృష్ణుడి మీదకు వదిలి నట్టు ప్రజలపై వదిలి భయభ్రాంతులను చేయటం కేంద్ర పాలకుల వ్యూహం. నవభారతాన్ని సాధించుకోవాలంటే దేశాన్ని ముందు ఈ మతోన్మాదశక్తుల నుంచి బంధ విముక్తిచేయాలి.
- కొండూరి వీరయ్య
సెల్: 9871794037