Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండువేలయిరవై - యిరవైఒకటి బడ్జెట్లో దళిత, గిరిజనులకు కేటాయింపులు తగ్గించారు. వీరికి రెండు పద్దుల కింద కేటాయింపులు చేస్తారు. 1. సబ్ప్లాన్ (ప్రభుత్వ 101 శాఖల కేటాయింపుల నుంచి) 2. అంబరిల్లా పథకం కింద కేంద్ర పథకాలు, విద్య, ప్రత్యేక కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తారు. 2015-16 నుంచి పరిశీలిస్తే క్రమంగా ఈ నిధుల కేటాయింపు తగ్గడమే కాక వ్యయం కూడా తగ్గుతున్నది. జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ఈ వర్గాలకు బడ్జెట్ పెంచడమే కాక దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారిని ఎగువకు తీసుకురావ డానికి బడ్జెట్ కేటాయించాలి. బీజేపీ ప్రభుత్వం వచ్చిన ప్పటినుంచి కేంద్రబడ్జెట్ కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి.
(రు.కోట్లలో)
సంవత్సరం కేటాయింపు వ్యయం
2015-16 17,77,477 17,90,783
2016-17 19,78,060 19,75,194
2017-18 21,46,735 21,41,974
2018-19 24,42,213 23,15,112
2019-20 27,86,349 26,98,552
2020-21 30,42,230 -
జనాభా ప్రాతిపదికన 16.6శాతం దళితులకు, 8.6శాతం గిరిజనులకు ఈ బడ్జెట్లలో కేటాయింపులు చేయాలి. మొత్తం జనాభా 139కోట్లలో (08.02.2020 నాటికి) 21.14కోట్లు దళితులు, 10.43కోట్లు గిరిజనులు ఉన్నారు. దళితులలో 31 రాష్ట్రాల నుంచి 1241 ఉపకులాలను చేర్చగా, గిరిజనులలో 30 రాష్ట్రాల నుంచి 705 ఉపకులాలను చేర్చారు. వీరి జనాభా ప్రాతిపదికన పరిశీలించినపుడు, విద్య, ఆరోగ్యం, తాగునీరు, గృహవసతి, రహదారులలో అత్యంత తక్కువ అభివృద్ధి జరిగింది. కొన్ని ప్రాంతాలు ఈరోజుకీ అభివృద్ధికి నోచుకోలేదు. గత ఐదేండ్లుగా కేటాయింపులు దిగువ విధంగా ఉన్నాయి.
దళితులు గిరిజనులు (రు.కోట్లలో)
సం. సబ్ప్లాన్ అంబరిల్లా సబ్ప్లాన్ అంబరిల్లా
2015-16 30,603 3,251 21,216 2,934
2016-17 34,333 4,883 21,810 3,319
2017-18 49,492 5,061 31,913 3,573
2018-19 54,342 7,574 36,889 3,781
2019-20 72,936 5,568 49,268 4,194
2020-21 83,256 6,248 53,652 4,190
2019-20 రివైజ్ట్ ఎస్టిమేషన్ బడ్జెట్ కాగా, 2020-21 బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు. సబ్ప్లాన్ నిధుల కింద కేటాయించిన మొత్తాన్ని 101శాఖల్లో ఖర్చుచేసిన వాటిని దళితుల పేర వ్యయం రాస్తున్నారు. వాస్తవానికి సబ్ప్లాన్ నిధులు, అంబరిల్లా నిధులను ఒకచోట చేర్చి నోడల్ ఆఫీసర్ను నియమించి జిల్లాలవారీగా కేటాయింపులు చేసి వ్యయం చేయాలి. ఇంతవరకు జరిగిన ఖర్చులో దళిత, గిరిజనుల అభివృద్ధికి సబ్ప్లాన్ నిధులు ఉపయోగపడలేదు. అంబరిల్లా నిధులు కూడా భారతదేశవ్యాపితంగా ఉన్న దళిత, గిరిజనులకు ఏమాత్రం సరిపోవు. కానీ విద్యా రంగంలో, ఆరోగ్య రంగంలో అత్యంత అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వం చెపుతున్నది.
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2015-16 ప్రకారం, దళితులలో 45.9శాతం మందికి ఆరోగ్యవసతి లేదని కమిషన్ తేల్చింది. ఈ కమిషన్ రిపోర్టు ప్రకారం దళితులలో దారిద్య్రరేఖకు దిగువన 50.8శాతం, గిరిజనులలో 70.7శాతం ఉన్నట్లు నివేదిక చెపుతున్నది. 166గ్రామాలలో, 22రాష్ట్రాలలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నాయకత్వంలో ఈ సర్వే జరిగింది. రంగరాజన్ రిపోర్టు ప్రకారం మొత్తం జనాభాలో 36.30కోట్ల మంది, సురేష్ టెండూల్కర్ రిపోర్టు ప్రకారం 26.90కోట్ల మంది ఉన్నట్లు నివేదిక చెప్పింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారిని గుర్తించడానికి ఆదాయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతంలో రోజుకి రూ.32, పట్టణ ప్రాంతాలలో రూ.47 తలసరి ఆదాయానికి మించి ఉన్నవారిని దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నట్టుగా గుర్తించారు. 1993-94లో దళితులలో పేదవారు 62.4శాతం కాగా, 2011-12లో 31.5శాతానికి తగ్గినట్లు ప్రణాళికా బోర్డు ప్రకటించింది. గిరిజనులలో 65.9శాతం నుంచి 45.3శాతానికి తగ్గినట్టు చెప్పారు. మొత్తంగా చూసినపుడు 50.1శాతం నుంచి 25.7శాతానికి గ్రామీణ ప్రాంతంలో తగ్గగా, పట్టణ ప్రాంతాలలో 31.8శాతం నుంచి 13.7శాతానికి దారిద్య్రం తగ్గినట్టు ప్రణాళికా బోర్డు నివేదిక చెప్పింది. నేటికీ భారతదేశంలో దారిద్య్రరేఖను అధికారికంగా గుర్తించలేదు. ప్రణాళికా బోర్డు, రంగరాజన్, సురేష్ టెండూల్కర్, వాద్వా కమిషన్లు పరస్పర వ్యతిరేకంగా దారిద్య్రరేఖను నిర్ణయిస్తూ నివేదికలు ఇచ్చాయి. వాస్తవానికి దళితులలో 80శాతం, గిరిజనులలో 85శాతం దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. ఈమధ్య సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం నెలకు రూ.21 వేలు ఉండాలని కేంద్రానికి సూచించింది. ఆ లెక్కన రోజుకు రూ.700 తలసరి ఆదాయం ఉండాలి. కానీ తలసరి ఆదాయం గ్రామాలలో రూ.32, పట్టణాలలో రూ.47గా అధికారికంగా ప్రకటించారు.
నాగరికత అభివృద్ధి కావడానికి సాగునీరు, తాగునీరు, విద్య, ఉపాధి అత్యంత కీలకం. ఈ మూడు వనరులు ఉన్న ప్రాంతంలో అనివార్యంగా నాగరికత అభివృద్ధి అవుతుంది. సింధూ నాగరికత, గంగ నాగరికత గురించి అనేక వివరాలు మనముందున్నాయి. కానీ ఈరోజుకీ దళిత, గిరిజన పల్లెలలో రక్షిత తాగునీటి వనరులు లేవు. 4,5 కి.మీ. వెళ్లి తాగునీరు సేకరించాలి. మార్చి-జూన్ మాసాలలో తాగునీటి ఇబ్బంది ఇంతా అంతా కాదు. ఫ్లోరైడ్ నీరు తాగి అనారోగ్యానికి గురవుతున్నారు. గృహవసతి లేనివారు 30శాతం మంది ఉన్నారు. ఒకే గుడిసెలో 2,3కుటుంబాలు ఉండడంవల్ల మానసిక వ్యాధులు, నరాలకు సంబంధించిన జబ్బులతో బాధపడుతున్నారు. ఇందిరా గృహనిర్మాణ పథకం, డబుల్బెడ్రూం పథకాలు దళిత, గిరిజన గృహ సమస్యను పరిష్కరించలేక పోతున్నాయి. ఉపాధి విషయాన్ని పరిశీలిస్తే, నిర్ణయించిన ఉద్యోగాలలో నింపకుండా ఖాళీలు పెట్టారు. వేల సంఖ్యలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను నింపడానికి తగిన అర్హత కలిగినవారు లేరని, ఇతర వర్గాల నుంచి తెచ్చి వారికి ఉపాధి కల్పిస్తున్నారు. విద్యా విషయం పరిశీలిస్తే, గిరిజన, దళిత మహిళల్లో 30శాతం మించదు. 14ఏండ్లలోపు వయసు కలిగిన బాలబాలికలకు నిర్బంధ ఉచిత విద్య గరపాల్సిన చట్టాన్ని అమలుచేయడంలేదు. ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని, అందరికీ విద్య కల్పిస్తామని ప్రచారాలు మాత్రం ప్రతిఏటా సాగుతున్నాయి. 70ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా దళిత, గిరిజనుల జీవితాల్లో అభివృద్ధి జరగలేదు. వీరేకాక, ఓబీసీ, బీసీ తదితర వర్గాల ప్రజలు కూడా దారిద్య్రంలోనే కొనసాగుతున్నారు. కనీస అవసరాలైన ఆహారం, ఎల్పీజీ గ్యాస్, కిరోసిన్ కేటాయింపులు కూడా క్రమంగా తగ్గిస్తున్నారు.
వాస్తవానికి 2019-20లో ఆహార సబ్సిడీ క్రింద 1,84,220 కోట్లు కేటాయించారు. రివైజ్డ్ బడ్జెట్లో 78 వేల కోట్లు తగ్గించారు. 2006లో వామపక్షాల ఉద్యమాల ప్రభావంతో పార్లమెంటులో ఉపాధిహామీ చట్టం తీసుకురావడం జరిగింది. ఉపాధిహామీ పథకం 2019-20లో 71,001 కోట్లు కాగా 2020-21లో 61,500 కోట్లకు తగ్గించారు. ఆనాడు రోజుకి రూ.80 కూలితో సంవత్సరానికి 100రోజుల పనిదినాల కల్పనతో 2006-07 బడ్జెట్లో 40వేల కోట్లు కేటాయించారు. ప్రస్తుతం కూలి రూ.160 పెరిగింది. ఈ కూలిని రోజుకి రూ.600లకు పెంచాలని ఆందోళన చేస్తున్నారు. పనిదినాలు 100 రోజుల నుంచి 200 పెంచాలి. ఈ పెంపుదలను గమనంలోకి తీసుకున్నపుడు 1.20లక్షల కోట్లు కేటాయించాలి. ఈ కేటాయింపు వల్ల ప్రజలలో కొనుగోలు శక్తి పెరుగుతుంది. మోడీ ప్రభుత్వం నిధుల కేటాయింపు తగ్గించడమే కాక ఇందులో 45శాతం యాంత్రీకరణ పనులకు కేటాయించారు. కూలి పనిదినాలు తగ్గాయి. కొనుగోలు శక్తి తగ్గడంతో దేశంలో ప్రస్తుతం ఉన్న మాంద్యం పెరుగుతున్నదే తప్ప తగ్గడంలేదు. విద్యారంగానికి కూడా కేంద్రం 2019-20లో 94,853 కోట్లు కేటాయించగా, 2020-21లో 99,291 కోట్లు మాత్రమే కేటాయించారు. ప్రస్తుతం విద్యా రంగాన్ని విదేశీ సంస్థలకు అప్పచెపుతామని ఆర్థికమంత్రి ప్రసంగంలో చెప్పారు. ఇప్పటికే ప్రయివేటీకరణ ద్వారా చదువు కొనలేకపోతున్న వారికి విదేశీ సంస్థలు వస్తే ఇప్పుడున్న అక్షరాస్యత కూడా తగ్గిపోతుంది. దళిత, గిరిజనులు, బిసిలకు ఉపయోగపడేవిధంగా ఏర్పాటుచేసిన కార్పొరేషన్లు కూడా ఎత్తివేస్తున్నారు. లాభాలు సంపాదించే ఇన్సూరెన్స్, రైల్వేలు, గనులు ప్రయివేటీకరించబోతున్నారు. వీటివల్ల ఉపాధి మరింతగా దెబ్బతింటుంది.
ప్రస్తుతం కేటాయించిన సబ్ప్లాన్ నిధుల్ని రెట్టింపు చేయాలి. అంబరిల్లా నిధులు, సబ్ప్లాన్ నిధులను కలిపి నోడల్ ఆఫీసర్ను నియమించి అతని ద్వారా గృహాలు, తాగునీరు, విద్య, ఆరోగ్యం, రహదారులు దళిత, గిరిజన పల్లెల్లో నిర్మించాలి. వారి కొనుగోలుశక్తి పెంచే విధంగా ఉపాధిహామీ పథకం నిధుల్ని రెట్టింపు చేయాలి. ప్రయివేటురంగంలో రిజర్వేషన్లు తీసుకురావాలి. ఆ విధంగా ఈ బడ్జెట్ను పునఃపరిశీలించి వీరికి కేటాయింపులు పెంచాలి.
- కె. భాస్కర్
సెల్: 9491118822