Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుమారు నలభై ఏళ్ళ క్రితం తెలుగు సినిమా రంగం కొంత కాలం కామ్రేడ్లకు రెడ్ శాల్యూట్ అంది. పెద్ద బ్యానర్లు కూడా ఆలివ్ గ్రీన్ దుస్తుల్లో తుపాకీ పట్టుకొని అడవుల్లో తిరిగే హీరో చిత్రాలకు జై కొట్టాయి. తెలుగు నేలను చుట్టుముట్టిన రెడ్ యైటీస్ సీజన్లో వచ్చిన ఉద్యమ చిత్రాలు దమ్మున్నవి హిట్ అయి నిర్మాతకు కాసులు కురిపించాయి. ఆ బ్రాండ్తో వచ్చిన సినిమాలేవైనా మినిమమ్ గ్యారెంటీగా జనాదరణ పొందాయి. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో 1979 లో వచ్చిన మాభూమి తెలుగు సినిమాకు ఓ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది. ఆ బాటను నమ్మిన మాదాల రంగారావు 1980లో 'యువతరం కదిలింది' నిర్మించి, నటించి 'రెడ్ స్టార్' ముద్రతో ఓ సంచలనానికి శ్రీకారం చుట్టారు.
ఏడాదికో సినిమాతో సాగిన మాదాల విజయయాత్ర మరిన్ని బ్యానర్లను ఎర్ర తోవ పట్టించింది. ఆ రోజుల్లో కొత్తగా సినీరంగంలో అడుగుపెట్టినవాళ్లకు కూడా లోబడ్జెట్ చిత్ర నిర్మాణాలకు ఈ జానర్ కలిసి వచ్చేది. ఇలా వచ్చిన సినిమాల్లో 'విముక్తికోసం' ఒకటి. దీని యూనిట్ అంతా మూడు పదులు దాటని కుర్రాళ్లే. ఈ సినిమా 27 డిసెంబర్ 1983 రోజున విడుదలైంది. ఇప్పటికి 37ఏళ్ళు పూర్తి చేసుకున్న విముక్తికోసం శ్రీకాకుళ సాయుధ పోరాటాన్ని రికార్డు చేసిన తొలి సినిమాగా తన రికార్డును పదిలపరచుకుంది.
సహజత్వం కోసం కథ పుట్టిన నేలపైనే విముక్తికోసం చిత్రీకరణ జరుపడం మరో విశేషం. షఉటింగ్ అంతా విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతంలో జరిగింది. 1970 దశకంలో సాగిన నేల విముక్తి పోరులో పాల్గొన్నవారు తమ పాత్రల్లో నటించడం కూడా అరుదైన విషయమే. శ్రీకాకుళం లో పుట్టిన ఉద్యమజ్వాల కరీంనగర్కు పాకితే దానికి రివర్సుగా కరీంనగర్ యువకులు శ్రీకాకుళ పోరుపై సినిమా నిర్మించడం ఓ అనూహ్య పరిణామం.
భూషణం మాస్టారు రాసిన తీర్పు కథ 'విముక్తికోసం' కు మూలం. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఆయనను తెలియనివారు ఆ రోజుల్లో అరుదు. ఉత్తర తెలంగాణ రైతుకూలీ పోరాట నేపథ్యంలో అల్లం రాజయ్య కథలల్లినట్లే ఆ వైపు భూషణం అలాంటి ఎన్నో కథలు రాశారు. గ్రామ భుగత (భూస్వామి)కు నమ్మకంగా ఉన్న కంబారి (పాలేరు) ఊర్లో ఏర్పడ్డ రైతు కూలి సంఘం ప్రభావంతో మారి తిరుగబడడం స్థూలంగా చిత్రకథ. కథతో పాటు సినిమాకు మాటలు కూడా భూషణం మాస్టారే రాసారు. ఆయన వాడిన ఉత్తరాంధ్ర స్థానిక పదాలు, యాస సినిమా సహజత్వానికి తోడ్పడ్డాయి.
ఈ సినిమా పాటల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విముక్తి కోసం 37 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భాన వచ్చిన ఈ ప్రస్తావన వంగపండు ప్రసాదరావుకు శ్రద్ధాంజలిగా కూడా అనుకోవాలి. ఈ ఆగస్టు 4న అసువులు బాసిన వంగపండు విముక్తి కోసంకు మొత్తం పాటల్ని అందించారు. ఆయన రాసిన ఆరు పాటలు హిట్టయి సినిమా ప్రజాదరణకు తోడ్పడ్డాయి. 'రావాణా చందనాలో ఎన్నెలా రాజా నీకొందానాలో ఎన్నెలా' పాట ఆ యేటి హిట్ సాంగ్స్లో ఒకటి. బి.గోపాలం సంగీతం ఆ పాటల్ని శ్రవణప్రియం చేసింది. ఆయన కూడా 2004లో మనకు దూరమయ్యారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఎం.వి.రఘు ఫొటోగ్రఫీ మరో ఆకర్షణ. మగమహారాజు, స్వాతిముత్యం, సిరివెన్నెల మొదలగు సినిమాలను ఎంవి.రఘు తన కెమెరా పనితనంతో అద్భుత చిత్రరాజాలుగా మలిచారు.
సాయిచంద్, పద్మ, చలపతిరావు, కాకరాల, నాగమణి, గరగ ప్రధాన తారాగణం కాగా విశాఖ రంగస్థల నటీనటులు సహాయ నటగణంగా తోడునిలిచారు. ప్రజాచిత్ర బ్యానర్పై నిర్మితమైన విముక్తికోసం నిర్మాత నారదాసు లక్ష్మణ్రావు. సహ నిర్మాతలుగా కె.సత్యనారాయణ, మన్మథరెడ్డి, సురేందర్ వ్యవహరించారు. దర్శకుడు ఎం.ఉదరు కుమార్. ఈయన తాతయ్య ప్రేమలీలలు, కొత్తనీరు, ధర్మవడ్డీ, మరో కురుక్షేత్రం, విప్లవశంఖం, రంగులకల మరిన్ని సినిమాలకు పనిచేశారు. దర్శకుడిగా ఆయనకు ఇది తొలి సినిమా అయినా దర్శకత్వ శాఖలో పనిచేసిన ఆయన సుదీర్ఘ అనుభవం, అన్ని శాఖలపై ఆయనకున్న పట్టు చిత్ర నిర్మాణానికి ఎంతో పనికొచ్చింది. మహాకవి శ్రీశ్రీకి సమీప శిష్యుడు ఉదరు కుమార్. విముక్తికోసం రషెస్ చూసాక టైటిల్ సాంగ్ రాసిస్తానన్న శ్రీశ్రీ 1983 జూన్ 15 న మరణించడంతో ఆ పాటని కోల్పోయినా ఉదరు కుమార్ గురుదక్షిణగా తన తొలిసినిమాను శ్రీశ్రీకి అంకితమిచ్చారు. కొత్త నిర్మాతలకు చిత్ర పంపిణీదారులు దొరకడం చాల కష్టం. ఆ సంవత్సరమే ఫిలిం డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి వచ్చిన మయూరి సంస్థ తొలి చిత్రంగా విముక్తికోసంను విడుదల చేసింది. సినిమాను చూసిన మయూరి అధినేత రామోజీరావు పంపిణీదారుగా ముందుకొచ్చారని ఉదరుకుమార్ అన్నారు.
1983లో విడుదలైన చిత్రాల్లో విముక్తికోసం ఉత్తమ చిత్రంగా నిలబడింది. ఉత్తమ తెలుగు చలనచిత్రాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే అవార్డుల్లో విముక్తికోసం సరోజిని నాయుడు బహుమతిని అందుకొంది. ప్రభుత్వం ఆ సంవత్సరమే ప్రవేశపెట్టిన జాతీయ సమైక్యత నంది అవార్డుకు తగిన తొలి చిత్రంగా విముక్తికోసం ఎంపికైంది. ఆ తర్వాత దర్శకుడు ఉదరుకుమార్ దూరదర్శన్ కోసం లఘుచిత్రాలను నిర్మించారు. ఈయన డా. బాబాసాహెబ్ అంబేద్కర్ బాల్యంపై రూపొందించిన బాల అంబేద్కర్ అనే బాలల చిత్రం 1992 లో ఉత్తమ టీవీ బాలల చిత్రంగా బంగారు నంది అవార్డు గెలుచుకొంది.1993లో సారా దుష్ప్రభావాలపై నిర్మించిన సారాంశం బెస్ట్ డాక్యుమెంటరీగా నంది పురస్కారాన్ని అందుకొంది ఉదరుకుమార్ ప్రతిభకు గుర్తింపుగా 2004 ఆయనకు రాష్ట్ర నంది అవార్డుల ఎంపిక కమిటీ జ్యురీలో చోటు లభించింది. 2004 నుండి 2007 దాకా ఫిలిం సెన్సార్ బోర్డు అడ్వైజరీ పానెల్ మెంబరుగా ఉన్నారు.
ఇప్పటికీ పలు సందర్భాల్లో విముక్తికోసం ప్రస్తావన, ప్రదర్శన కనబడుతుంది. ప్రధాన తెలుగు టీవీ చానళ్ళు, దూరదర్శన్ ఈ చిత్రాన్ని ప్రసారం చేశాయి. దేశంలో ఉన్న ఫిలిం సొసైటీలు తమ సభ్యుల కోసం ప్రదర్శనను ఏర్పాటు చేశాయి. సినిమా విడుదలై 33 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్బంగా తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కతిక శాఖ తరఫున 24 డిసెంబర్ 2016 నాడు రవీంద్రభారతి మినీ హాల్లో చిత్రప్రదర్శన జరిగింది. ఆసక్తిపరుల కోసం యూట్యూబ్లో విముక్తికోసం అందుబాటులో ఉంది.
- బి.నర్సన్, 9440128169