Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-టీ20 ప్రపంచకప్ రద్దు ఇక లాంఛనమే
-అక్టోబర్-నవంబర్లో ఐపీఎల్కు రంగం సిద్ధం
-వ్యూహాత్మక అడుగులు వేస్తోన్న బీసీసీఐ
కరోనా వైరస్ మహమ్మారి ముప్పుతో క్రికెటర్లు సుమారు రెండు నెలలకు పైగా లాక్డౌన్లో ఉంటున్నారు. పరిమిత వసతుల సౌలభ్యంతోనే ఫిట్నెస్ను కాపాడుకునేందుకు శ్రమపడుతున్నారు. క్రికెట్ సీజన్ పున ప్రారంభం అయినా, అందుకు సన్నద్ధం అయ్యేందుకు క్రికెటర్లకు కనీసం 20-30 రోజుల సమయం కచ్చితంగా అవసరం. ఇది నిర్వివాదాంశం.
క్రికెట్ సీజన్ ఎక్కడ్నుంచి ఆరంభం కావాలనే చర్చ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్. దీనిపై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందరి అభిప్రాయాలు ఐపీఎల్ దిశగా సాగేందుకు భారత క్రికెట్ బోర్డు వేసిన ఎత్తుగడ పక్కాగా ఫలిస్తోంది!. ఇప్పటికే ఎంతోమంది విదేశీ క్రికెటర్లు ఐపీఎల్తోనే సీజన్ను మొదలుపెట్టాలని అంటున్నారు. భారత చీఫ్ కోచ్ రవిశాస్త్రి సహజంగానే బీసీసీఐ పెద్దల మనోగతాన్ని ప్రతిఫలించేలా బలమైన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
అన్ని బంధాలకు కేంద్రం ఆర్థిక మూలాలే అనే మౌళిక సూత్రాన్ని బీసీసీఐ తెలివిగా ఉపయోగించుకుంది. ఆర్థిక సంక్షోభ సమయంలో ఆర్థికంగా గట్టెక్కించే బహుళ ప్రయోజనకారి ఐపీఎల్ అత్యంత ముఖ్యమని భిన్న గొంతుల ద్వారా వినిపిస్తోంది. బీసీసీఐ ప్రణాళికతో టీ20 వరల్డ్కప్ రద్దు కానుండగా, అదే సమయంలో ఐపీఎల్2020 పట్టాలెక్కనుంది!.
నవతెలంగాణ క్రీడా విభాగం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కాసులు కురిపించే కల్ప తరువు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). 2008 నుంచీ ఐపీఎల్ దిగ్విజయ యాత్ర కొనసాగుతోంది. అంచనాలను మించి రాణిస్తోంది. ఐపీఎల్ లీగ్ బ్రాండ్ విలువ, ఐపీఎల్ ప్రాంఛైజీల బ్రాండ్ విలువ కండ్లుచెదిరే రీతిలో దూసుకెళ్తోంది. బీసీసీఐకి రూ. 4 వేల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టే, భారత ఆర్థిక వ్యవస్థకు రూ. 70 వేల కోట్ల లావాదేవీలు సమకూర్చే ఐపీఎల్కు ఈ ఏడాది బ్రేక్ పడింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మార్చి 29న ఆరంభం కావాల్సిన ఐపీఎల్ 2020 తొలుత ఏప్రిల్ 15కు వాయిదా పడింది. భారత్లో రెండో దశ లాక్డౌన్తో ఐపీఎల్ను నిరవధిక వాయిదా వేశారు. తాజాగా నాల్గో దశ లాక్డౌన్లో స్టేడియాలు, క్రీడా సముదాయాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. స్టేడియాల్లోకి, క్రీడా సముదాయాల్లోకి ప్రేక్షకుల ప్రవేశంపై మాత్రం నిషేధం కొనసాగించింది. తాజా సడలింపులతో ఐపీఎల్ 2020 సీజన్ను పట్టాలెక్కించే ప్రణాళికకు కదలిక వచ్చింది.
టీ20 వరల్డ్కప్పై క్రికెట్ బోర్డుల ఆశలు : ఈ ఏడాది అక్టోబర్లో ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్కప్ జరగాల్సి ఉంది. మహిళల టీ20 వరల్డ్కప్కు ఘనంగా ఆతిథ్యం ఇచ్చిన ఆస్ట్రేలియా.. అక్టోబర్లో పొట్టి ప్రపంచకప్కు ఘనమైన ప్రణాళిక సిద్ధం చేసుకుంది. కరోనా వైరస్ విపత్తు కారణంగా ఆ ప్రణాళిక కాస్త అటకెక్కింది!. ఆస్ట్రేలియాలో త్వరలోనే దేశవాళీ క్రికెట్ సీజన్ ఆరంభం కానుండగా.. అక్టోబర్లో టీ20 వరల్డ్కప్ నిర్వహణపై మాత్రం నీలినీడలు కమ్ముకున్నాయి. ఇటీవల జరిగిన ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ టెలి కాన్ఫరెన్స్లో టీ20 వరల్డ్కప్పై ఐసీసీ ఆశలు నిలిపింది. నెలవారీ నివేదికలు తెలియజేస్తామని సభ్య దేశాలకు తెలిపింది. క్రికెట్ ఆస్ట్రేలియాతో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. వరల్డ్కప్కు మరో నాలుగు నెలల గడువు ఉంది. అప్పటిలోగా పరిస్థితుల్లో ఎంతోకొంత మార్పు వస్తుందనే విశ్వాసం అందరిలోనూ వ్యక్తమవుతోంది. పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ సహా వెస్టిండీస్ వంటి క్రికెట్ బోర్డులు ఇప్పుడు ఆర్థికంగా చితికిపోయాయి. టీ20 వరల్డ్కప్ నిర్వహణతో ఐసీసీ ఆదాయంలో సభ్య దేశాలకు సముచిత వాటా దక్కుతుంది. వరల్డ్కప్ ఆదాయ వాటాతో ఆర్థిక కష్టాల నుంచి ఉపశమనం పొందవచ్చని క్రికెట్ బోర్డులు భావిస్తున్నాయి. దీంతో టీ20 వరల్డ్కప్ నిర్వహణపైనే పట్టుబడుతున్నాయి.
బీసీసీఐ ట్రంప్కార్డ్ ప్రయోగం : ఇక్కడే బీసీసీఐ తన ట్రంప్కార్డ్ను ప్రయోగించింది. ఏ దేశంలో భారత జట్టు పర్యటించినా, ఆ సిరీస్ నుంచి వచ్చే డబ్బు చాలా ఎక్కువ. ఐసీసీ ఆదాయం వాటాకు కనీసం ఐదు రెట్లు ఉంటుంది!. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రికెట్ బోర్డులకు బీసీసీఐ ఇప్పుడు ద్వైపాక్షిక దౌత్యం నెరపుతోంది. ఆయా దేశాల్లో పర్యటిస్తామని హామి ఇస్తోంది. భారత్తో సిరీస్ చాలా బోర్డులకు సంజీవని!. టీ20 వరల్డ్కప్ ఈ ఏడాది కాకుంటే వచ్చే ఏడాది జరుగుతోంది. ఆదాయ వాటా ఎప్పుడైనా ఖాతాలో పడుతుంది. కానీ బీసీసీఐ ఆఫర్ ఎప్పుడో కానీ రాదు. దీంతో క్రికెట్ బోర్డులు బీసీసీఐ ప్రణాళిక వైపు మొగ్గుచూపుతున్నాయి. సాంకేతికం గానూ ఎదురుకానున్న కొన్ని సమస్యలను బీసీసీఐ ముందుకు తీసుకొస్తుంది. కరోనా సమయంలో 15 దేశాల జట్లు వివిధ నగరాల్లో పర్యటిస్తూ ఓ వరల్డ్ టోర్నీ ఆడటం శ్రేయష్కరం కాదని కొంతమంది వాదిస్తున్నారు. అందుకు బదులుగా ఒకటి రెండు నగరాల్లో జరిగే ఐపీఎల్ ఉత్తమ మార్గమని సెలవిస్తున్నారు. ఐపీఎల్ ఆదాయంతో బీసీసీఐ ఆర్థికంగా ఎప్పట్లాగే తిరుగులేని స్థితిలో నిలువనుంది. వరల్డ్కప్ షెడ్యూల్ సమయం అక్టోబర్-నవంబర్లో ఐపీఎల్ నిర్వహణకు మద్దతుగా నిలిచిన బోర్డులకు తన ద్వైపాక్షిక సిరీస్లను ఆఫర్ చేస్తోంది. ఐపీఎల్లో ఆడనున్న క్రికెటర్లకు జాతీయ జట్టు తరఫున ఏడాది పొడవునా దక్కని సొమ్ము ఒక్క ఆరు వారాల్లో (ఇప్పుడు నాలుగు వారాలకు కుదించే వీలుంది) సంపాదించుకోనున్నారు. అటు ఆటగాళ్లు, ఇటు క్రికెట్ బోర్డులు లాభపడే విధంగా బీసీసీఐ పక్కా ప్లాన్ డిజైన్ చేసింది.
సడలింపులతో చిగురించిన ఆశలు : నాల్గో దశ లాక్డౌన్లో కేంద్ర ప్రభుత్వం క్రీడా సముదాయాలు, స్టేడియాలకు అనుమతి ఇచ్చింది. అభిమానులను అనుమతి లేకుండా ప్రొఫెషనల్ టోర్నీలకు పరోక్షంగా అనుమతి ఇచ్చింది. బీసీసీఐకి మరో కొన్ని కీలక అనుమతులు అవసరం. విదేశీ క్రికెటర్లు ఇక్కడికి వచ్చేందుకు వీలుగా అంతర్జాతీయ ప్రయాణాలు పున ప్రారంభం అందులో కీలకం. వివిధ రాష్ట్రాల్లో ఉన్న బీసీసీఐ కాంట్రాక్టు క్రికెటర్లను ఓ చోటకు చేర్చేందుకు వీలుగా దేశవాళీ విమాన ప్రయాణాలకు అనుమతి అవసరం. రాష్ట్రాల మధ్య స్వేచ్ఛా రాకపోకలను బీసీసీఐ ఆశిస్తోంది. ఈ ప్రక్రియను మరో 45 రోజుల్లో కోరుకుంటోంది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్లో ఐపీఎల్2020 నిర్వహణకు మార్గం సుగమం కానుందని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి. ఆగస్టులో దేశవాళీ, సెప్టెంబర్లో అంతర్జాతీయ విమాన సర్వీస్లకు పచ్చజెండా ఊపినా బీసీసీఐకి షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ నిర్వహించేందుకు వీలుంది. ఈ లోగా జరగాల్సిన ద్వైపాక్షిక (శ్రీలంకతో) సిరీస్లకు భారత్ ప్రయాణ ఆంక్షలను సాకుగా చూపి తప్పించుకునే అవకాశం కనిపిస్తోంది.
కరోనా వైరస్ను కట్టడిచేసేందుకు ప్రభుత్వం చేస్తున్న పోరాటం నీరుగారే ఎటువంటి పని బీసీసీఐ చేయబోదు. నాల్గో దశ లాక్డౌన్ సడలింపులతో ఐపీఎల్ నిర్వహణకు ఓ మార్గం ఏర్పడింది. వివిధ రాష్ట్రాల్లో లాక్డౌన్ సడలింపుల ప్రకారం క్రికెటర్లకు నైపుణ్య ఆధారిత శిక్షణ కార్యక్రమం రూపొందిస్తాం. విదేశీ ఆటగాళ్లు వచ్చేందుకు వీలుగా అంతర్జాతీయ ప్రయాణాలు ప్రారంభం కావాలి. ప్రభుత్వ మార్గదర్శకాలను బీసీసీఐ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది'
- అరుణ్ ధుమాల్, బీసీసీఐ కోశాధికారి