Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డూడూ బసవన్నలపైనా కరోనా దెబ్బ
- గంగిరెద్దులోళ్ల బతుకులు ఆగం
- పూటగడవక ఇబ్బందులు..సొంతిళ్లు లేక తిప్పలు
- కళాకారుల గుర్తింపులోనూ వివక్షే
రథం ముగ్గులు... రేగుపండ్లు, పిండికొమ్మలతో గొబ్బెమ్మలు పెట్టినా సంక్రాంతికి నిండుశోభ తెచ్చిపెట్టేది గంగిరెద్దులాటే. 'అయ్యగారికి దండంపెట్టు...అమ్మగారికి దండం పెట్టు...ఇంటిల్లిపాదిని దీవించు' అనే గంగిరెద్దులోళ్ల సందడి అంతా ఇంతా కాదు. పీక ఊదుతూ..డోలి కొడుతూ ఉంటే డూ..డూ..బసవన్నల సయ్యాటలు...గంగిరెద్దులోళ్ల విన్యాసాలను చూస్తుంటే ఆహా! అనిపించక మానదు. వాటి విన్యాసాలను కండ్లప్పగించి చూడాల్సిందే. పేరుపేరునా తలుస్తుంటే ఔరా! అనాల్సిందే. నిక్కచ్చిగా చెప్పాలంటే సంక్రాంతి పండుగకు నిండు శోభ తెచ్చేది పతంగుల ఆట, గంగిరెద్దులోళ్ల ఆటాపాటే. కానీ, ఈ సారి ఆ 'కళ' తప్పింది. గంగిరెద్దుల హడావిడే కనిపించట్లేదు. గంగిరెద్దులోళ్లపైనా కరోనా ప్రభావం పడింది. పండుగ పూట పస్తులుండాల్సిన దుస్థితి వారిండ్లలో నెలకొంది. సంక్రాంతి పండగ నేపథ్యంలో గంగిరెద్దులోళ్ల జీవన స్థితిగతులపై నవతెలంగాణ ప్రత్యేక కథనం..
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో 40 నుంచి 50 వేల దాకా గంగిరెద్దులవాళ్లు ఉన్నారు. కానీ, తమ వాళ్లు రాష్ట్ర వ్యాప్తంగా 70 వేల దాకా ఉంటారని గంగి రెద్దుల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. ప్రధానంగా నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి, కరీంనగర్, వరం గల్, సిద్ధిపేట, హైదరాబాద్లో ఎక్కువగా ఉన్నారు. అయితే వీరు సంఘటితంగా ఎక్కడా లేరు. జిల్లాకో వెయ్యి, రెండు వేల కుటుంబాలు అదీ గ్రామాల్లో విసిరేసినట్టుగా ఉన్నాయి. దసరా, సంక్రాంతి పండగల సందర్భాలలో ఊర్లను వాటా లుగా పంచుకుని ఇంటింటికీ వెళ్తూ తమ గంగిరెద్దులను ఆడించి ప్రజలు ఇచ్చినంత తీసుకుని దీవనార్థాలు ఇస్తారు. ప్రతి ఇంటి యజమాని, వారి పూర్వీకుల పేర్లను గుర్తుకు పెట్టుకుని మరీ వారి పేర్లను తల్చుకుంటూ, కీర్తిస్తూ గంగిరెద్దులను ఆడించటం వీరి అద్భుత జ్ఞాపకశక్తికి నిదర్శనం. గ్రామంలో ఎవరైనా చనిపోతే తెలుసుకుని మరీ దినాల రోజు ఐదుగురు నుంచి పది మంది వరకు ఆటోను కిరాయికి మాట్లాడుకుని వారి ఇండ్ల ముందు వాలుతారు. దశ దినకర్మకు గంగిరెద్దులతో తమ కళను ప్రదర్శిస్తారు. చనిపోయిన వ్యక్తి కుటుంబం ఇచ్చే ఎంతో కొంత డబ్బును తీసుకుని ఇంత అన్నం తిని వెళ్లిపోతారు. ఇలా పని దొరికేది కొన్ని రోజులే. పండగ దినాలు, చావులు పోనూ మిగతా పనిదినాల్లో కూలినాలి దొరికితేనే కడుపు నిండేది. రానురాను కళకు ఆదరణ తగ్గటంతో ఇల్లు గడవక ఆడవాళ్లు గంపల వ్యాపారం(హరేక్ మాల్ సామానును తీసుకుని ఊర్లల్లో అమ్మటం) చేస్తున్నారు.
కళపై కరోనా దెబ్బ
కరోనా వచ్చాక వీరి బతుకులు దుర్భరంగా మారాయి. సమాజంలో ఎవ్వరూ దగ్గరకు రానివ్వని పరిస్థితి నెలకొంది. ఇండ్లను తిరిగి రావడం వల్ల కరోనా వస్తుందని చాలా కాలనీల్లోకి గంగిరెద్దుల వాళ్లను రానివ్వట్లేదు. కల్వకుర్తి దగ్గర ఓ ఊర్లో వాళ్లు మా ఊరి చివర ఉండొద్దంటూ తరిమిగొట్టారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆంక్షలతో చావులకు కొంత మందే రావాలనే నిబంధన పెట్టారు. దీంతో గంగిరెద్దుల వాళ్లను అక్కడకు అస్సలు రానివ్వట్లేదు. దీంతో వారు తమ ఉపాధిని కోల్పోయారు. కరోనా దెబ్బతో ఈ సంక్రాంతికి గంగిరెద్దుల హడావిడి అంతగా లేదు.
చదువుకున్నోళ్లు అంతంతే..రాజకీయ చైతన్యమూ తక్కువే
గంగిరెద్దుల సామాజిక తరగతిలో సర్కారు కొలువులున్నవారిని భూతద్ధంలో వెతికి చూడాల్సిన దుస్థితి. మొత్తంగా చూస్తే ఇద్దరు టీచర్లు, ఓ కానిస్టేబుల్, ఓ కండక్టర్, ఓ డ్రైవర్ మాత్రమే ఉన్న పరిస్థితి. ఇటీవల అనారోగ్యంతో కానిస్టేబుల్ కూడా చనిపోయాడు. పదోతరగతి దాటి చదివినోళ్ల సంఖ్య రెండువేల లోపే. డిగ్రీ దాటినోళ్లుఐదొందలలోపే. గంగిరెద్దులను ఆడించుకుంటూ ఒక్కకాడ ఉండకుండా ఊర్లు తిరుగుతుండటంతో ఆ సామాజిక తరగతిలో చదువుకున్న సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో ఆర్థికంగానూ, సామాజికంగా, రాజకీయంగానూ తీవ్ర వెనుకబాటులో ఉంది. రాష్ట్రంలో ఒక్క సర్పంచ్గానీ, ఎమ్పీటీసీగానీ లేకపోవడం గమనార్హం. మొత్తం మీద తెలంగాణలో గంగిరెద్దుల సామాజిక తరగతికి చెందిన ఆరుగురు వార్డుమెంబర్లు ఉన్నారు. రాజకీయంగా అత్యున్నత స్థాయిలో ఉన్నవాళ్లు వాళ్లే అంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
సొంతగూడూ కరువే..పథకాలు అందితే ఒట్టు!
పక్షులు పొద్దస్తమానం ఎక్కడెక్కడో తిరిగి సొంతగూటికి చేరుతాయి. వాటికైనా సొంత గూడుంది. కానీ, పొట్టతిప్పల కోసం కళాప్రదర్శనలు ఇచ్చి అలసిసొలసిన గంగిరెద్దులోల్లకు నిలువు నీడా లేదు. వారికంటూ ఓ సొంత గూడు లేదు. తరాలుగా ఇదే పరిస్థితి. రేషన్కార్డులు కూడా లేవు. దీంతో పథకాలకు దూరం అవుతున్నారు. సొంతిళ్లను కట్టిస్తామని గతంలో మంత్రి ఈటల రాజేందర్ హామీనిచ్చినా పట్టాలెక్కలేదు.ఆ సామాజిక తరగతిలోని మహిళలకు ఒక్కో గంపకు లక్ష రూపాయల చొప్పున సబ్సిడీ రుణాలు అందజేస్తామని హామీ నేటికీ నెరవేరలేదు.
సాహోపేత కళ.. పట్టుతప్పితే అంతే
ఒక్కో గంగిరెద్దుకు లక్ష, లక్షన్నర పెట్టి కొనాలి. ఆ తర్వాత ఆ ఎద్దుకు ఆట నేర్పాలి. ఆ తర్వాత వాటిని ఆడించడమూ నిజంగా ఓ కళే. పట్టుతప్పితే ప్రాణాలు కోల్పోవాల్సిందే. దండం పెట్టుడు. పొగుడుతూ తల ఊపించడం వరకు ఓకే. కబడ్డీ ఆటను ప్రాణాలను అడ్డుపెట్టి మరీ ఆడించాల్సిందే. ఒక్కోసారి గంగిరెద్దు ఎక్కువ ఆవేశానికి లోనైతే ఆపడం ఎవరితరమూ కాదు. మేడ్చల్ జిల్లాలో ఇలాగే ఓ గంగిరెద్దులాయన చనిపోయాడు. నాలుగైదేండ్లలో పదిమంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక మండలి గంగిరెద్దుల కళాకారులను గుర్తించడంలో వెనుకబడింది.
సొంతిళ్లు కట్టివ్వాలి.. చదువులు చెప్పించాలి
సొంతిళ్లే లేనప్పుడు ఆత్మగౌరవ భవనాలెందుకు? ప్రతి కళాకారునికీ సొంత ఇల్లు కట్టి ఇవ్వాలి. గంగిరెద్దుల కళను, కళాకారులను సర్కారు గుర్తించాలి. సంక్రాంతి పండుగ రోజు శిల్పారామంలో ఓ పదిమంది గంగిరెద్దులోళ్లను తీసుకెళ్లి ఆటలాడించడం వల్ల మా బతుకులు మారవు. చదువు దరిచేరకపోవటంతో వెనుకబాటు తనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఎంట్రెన్స్ పరీక్షల్లేకుండా మా పిల్లలకు గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు ఇవ్వాలి. కుల ధ్రువీకరణ పత్రాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దీన్ని సర్కారు పరిష్కరించాలి.
- రామస్వామి, గంగిరెద్దుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు