Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలను చైతన్యపరిచేందుకే కార్మిక-కర్షక పోరుయాత్ర:
- సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
- కార్పొరేట్లకు ప్రజాధనం :ఎస్ వీరయ్య
- స్వాతంత్య్రం తర్వాత సుదీర్ఘ పోరాటం రైతులదే.. : నంద్యాల
- మోడీ విధానాలపై గొంతెత్తాలి : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ-ప్రతినిధులు/విలేకరులు
కార్మిక కోడ్లు, నూతన వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులను, కర్షకులను ముంచేలా విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలు, కార్పొరేట్లకు అనుకూలంగా తెచ్చిన ఈ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో 'కార్మిక-కర్షక పోరు' జీపు జాతాలు నడుస్తున్నాయి. బుధవారం నాలుగు ఉమ్మడి జిల్లాల్లో మొదలవ్వగా, గురువారం మరో ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఈ జాతాలు ప్రారంభమయ్యాయి.
సిద్దిపేట పట్టణం ముస్తాబాద్ చౌరస్తా వద్ద సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య అధ్యక్షతన పోరుయాత్ర (జీపుజాతాను)ను చుక్క రాములు ప్రారంభించారు. కార్మికులందరూ పోరాడి సాధించుకున్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం సమంజసం కాదన్నారు. లేబర్ కోర్టులను రద్దు పరిచి అధికారం లేని బోర్డులను ఏర్పాటు చేస్తున్నదన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో యాభై ఐదు రోజులుగా తీవ్రమైన చలిలోనూ రైతులు పోరాడుతున్నారని చెప్పారు. అయినా కేంద్రం మొండిగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జాతా చిన్నకోడూరు, బెజ్జంకి, నంగునూరుల మీదుగా దూల్మిట్టకు చేరింది. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మోడీకి కార్పొరేట్ల ప్రయోజనాలే ముఖ్యం : ఎస్.వీరయ్య
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల లాభాలే లక్ష్యంగా కార్మిక, కర్షక, ప్రజానీకం ప్రయోజనాలను దెబ్బతీస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య విమర్శించారు. సీఐటీయూ రంగారెడ్డి ఉమ్మడి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో పెద్ద అంబర్పేటలో జీపు జాతాను ప్రారంభించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కాడిగల్ల భాస్కర్ అధ్యక్షతన ఇందిరా గార్డెన్లో జరిగిన సభలో వీరయ్య మాట్లాడారు. ఆరున్నరేండ్లలో మోడీ ప్రభుత్వం పేదలకు చేసింది ఏమీ లేకపోగా కార్పొరేట్లకు మాత్రం ప్రజాధనాన్ని అప్పనంగా దోచిపెట్టారని చెప్పారు. ఎన్నో ఏండ్లుగా పోరాడి సాధించుకున్న కార్మిక, కర్షక చట్టాలను ఒక్క కలం పోటుతో ధ్వంసం చేసే చర్యలకు పూనుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతా ఆటోనగర్, తుర్కయంజాల్, బడంగ్పేట్, ఆదిభట్ల కేంద్రాల్లో సాగింది. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లికార్జున్, రాష్ట్ర నాయకులు కూరపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మన్ కీ బాత్ కాదు.. దేశ్కీ బాత్ విను : నంద్యాల నర్సింహారెడ్డి
ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయి దేశ ప్రజలు తీవ్ర సంక్షోభంలో ఉంటే.. ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా మన్కీ బాత్ చెబుతున్న ప్రధాని మోడీ.. దేశ్కీ బాత్ వినాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంద్యాల నర్సింహారెడ్డి అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాల దుష్ఫలితాలను గుర్తించి 56 రోజులుగా ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటం స్వాతంత్రోద్యమం తరువాత సుదీర్ఘమైందన్నారు. కార్మిక- కర్షక పోరుయాత్రను కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సభలో నంద్యాల మాట్లాడుతూ.. దేశమంతా కేంద్రం ఒకే పన్ను విధానమంటూ.. రాష్ట్రాలను నిండా ముంచిందన్నారు. భద్రాచలంలో పేపర్మిల్లుల వ్యాపారులు.. రైతులు సుబాబుల్ సాగుపై ఒప్పందం చేసుకుని తీరా పంట చేతికొచ్చాక మాట ప్రకారం ధర ఇవ్వలేమంటూ ముంచిన విషయాన్ని వివరించారు.
మోడీ విధానాలపై గొంతెత్తాలి : ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రతి ఒక్కరూ గొంతెత్తి పోరాడాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు.కార్మిక, కర్షక పోరుయాత్రను నల్లగొండ జిల్లా దేవరకొండలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సభలో నర్సిరెడ్డి మాట్లాడుతూ.. కార్మికులకు ప్రయోజనం చేకూర్చే 44 చట్టాలను మార్పు చేసి నాలుగు కోడ్లుగా విభజించడం వల్ల కార్మికుల హక్కులు హరించబడతాయని తెలిపారు. విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని, పాత చట్టాలనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ మాట్లాడుతూ.. కరోనా కాలంలో కార్మికులు ఉపాధి కోల్పోతుంటే దేశంలో కార్పొరేట్ శక్తుల ఆదాయం పెరిగిందన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. కార్మిక, కర్షక, ప్రజల హక్కులను హరించి కార్పొరేట్ యజమానులు యథేచ్చగా దోచుకోవడానికి మోడీ అవకాశం కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు యాట సోమన్న, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని బోర్గాం.పి కమాన్ వద్ద జీపు జాతాను సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రాజారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా నూతన వ్యవసాయ చట్టాలను చేసిందన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.రమ తదితరులు పాల్గొన్నారు.
స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలి : పాలడుగు భాస్కర్
స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం పంటలకు గిట్టుబాటు ధరల చట్టం తేవాలని అనేక సంవత్సరాలుగా రైతాంగం పోరాడుతుంటూ.. కేంద్ర ప్రభుత్వం రైతులకు తీవ్రంగా నష్టం చేసే చట్టాలను తీసుకొచ్చిందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. కార్మిక కర్షక పోరుయాత్ర రెండో రోజు ఖమ్మం జిల్లా ముదిగొండ, చింతకాని, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో పర్యటించింది. మధిరలో హమాలీ, బిల్డింగ్స్, సివిల్ సప్లరు వర్కర్స్ యూనియన్లు ఘన స్వాగతం పలికాయి. నష్టదాయక వ్యవసాయ చట్టాలను, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వంగూరి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీపు యాత్ర మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు, నెల్లికుదురు, కేసముద్రం మండలాల్లో కొనసాగింది. రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నదాతలకు ప్రతిఒక్కరూ అండగా నిలవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటం రాజు అన్నారు. జీపు జాత మహబూబ్నగర్ జిల్లాలో రెండో రోజైన గురువారం దేవరకద్ర, భూత్పూరు, జడ్చర్ల, రాజాపూర్, బాలానగర్ మీదుగా కల్వకుర్తి చేరుకుంది. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఖమర్అలీ, గొర్రెల, మేకల కాపరుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు కిల్లె గోపాల్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ జిల్లా జాత సికింద్రాబాద్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో సాగింది. ఈ జాతాలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్, రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ పాల్గొన్నారు.