Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ విధానాల్లో తేడాలేదు : టీ మాస్ చర్చావేదికలో నేతలు
- ప్రత్యామ్నాయ అభివృద్ధి ఎజెండాతో బీఎల్ఎఫ్
- ప్రభుత్వరంగంలో విద్యావైద్యం బలోపేతం
- విశ్వవిద్యాలయాలు భావస్వేచ్ఛకు నిలయాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణలో బహుజనులకు రాజ్యాధికారం వస్తేనే ప్రజల బతకుల్లో మార్పు సాధ్యమవుతుందని టీమాస్, బీఎ ల్ఎఫ్ నాయకులు అన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ విధానాల్లో తేడా లేదని చెప్పారు. విధానాల్లో మార్పు రావాలని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ఆకా ంక్షించారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ప్రత్యా మ్నాయ అభివృద్ధివ నమూనాతో ప్రజల ముందుకొ స్తోందని వివరించారు. బీఎల్ఎఫ్ను ఆదరించాలని, అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బహుజనులకు అధికారం వస్తేనే విశ్వవిద్యాలయాలు బాగుపడతాయని, నిధుల కేటాయింపు పెరుగుతుందని అన్నారు. విశ్వవిద్యా లయాలు భావ ప్రకటనా స్వేచ్ఛకు నిలయాలుగా ఉండాలని ఆకాంక్షించారు. సమాజంలో జరిగే పరిణామాలపై ప్రజాస్వా మ్యబద్ధంగా చర్చ జరగాలని చెప్పారు. బీఎల్ఎఫ్ అధికారం లోకి వస్తే ప్రభుత్వరంగంలోనే విద్యావైద్యం బలోపేతం అవుతుం దన్నారు. ప్రయివేటులో ఉన్న విద్యావైద్యం క్రమంగా తగ్గుతుందని అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ సామాజిక ప్రజాసంఘాల ఐక్యవేదిక (టీమాస్) ఆధ్వర్యంలో 'బహుజన రాజ్యాధికారం- యూనివర్సిటీల పాత్ర' అనే అంశంపై చర్చావేదిక జరిగింది.
గద్దర్, విమలక్క తెలంగాణ ప్రతీకలు : కంచ ఐలయ్య
గద్దర్, విమలక్కలు తెలంగాణకు అసలైన ప్రతీ కలని టీమాస్ చైర్మెన్ కంచ ఐలయ్య షఫర్డ్ అన్నారు. తెలం గాణ ఉద్యమం నుంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు ఊరూ వాడా ఉద్యమాన్ని ఉధృతం చేశారని, త్యాగాలు చేసిన గద్దర్, విమలక్కలు తప్ప ఏ దొరలు, దొరసానులు తెలం గాణ ప్రతీకలు కాదని చెప్పారు. కేటీఆర్, కవిత తెలంగాణ కోసం జరిగిన సమరశీల ఉద్యమాల్లో పాల్గొనలేదని అన్నా రు. కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత వారికి తెలంగాణ ప్రతీకలుగా చూపెట్టడం దుర్మార్గమని విమర్శించారు. కేసీ ఆర్పై గద్దర్ను, కేటీఆర్పై విమలక్కను పోటీకి నిలుపు తామని ఉద్ఘాటించారు. టీమాస్ మ్యానిఫెస్టోను అమలు చేస్తామని ముందుకొచ్చిన బీఎల్ఎఫ్ అమలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బహుజన బువ్వ క్యాంటీన్ల ద్వారా ఆకలి లేని తెలంగాణ నిర్మాణమే లక్ష్యమన్నారు. రైతు బంధు స్థానంలో కూలీబంధు పథకం తెస్తామని అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.50 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. కేజీ నుంచి పీజీ దాకా ఇంగ్లీష్ విద్యను అందిస్తామన్నారు. బీఎల్ఎఫ్ను ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనార్టీలు, అగ్రకుల పేదలు ఆదరించాలని కోరారు.
దోపిడీ, పీడన నుంచి విముక్తి బీఎల్ఎఫ్ లక్ష్యం : తమ్మినేని
ఆర్థిక దోపిడీ, సామాజిక పీడన నుంచి విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని బీఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం చెప్పారు. బహుజన రాజ్యంతోనే ఇది సాధ్యమన్నారు. లాల్నీల్ కలిసి తెలంగాణలో కొత్తదారి చూపాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాకముందు విద్యార్థులు, యువకులు, రైతులు, కూలీలు, కార్మికుల పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడూ అలాగే ఉందన్నారు. రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని, నిరుద్యోగం పెరిగిందని చెప్పారు. టీఆర్ఎస్ పాలనలో వర్సిటీలు వివక్షకు గురవుతున్నాయని అన్నారు. బీఎల్ఎఫ్ పాలనలో వర్సిటీల స్వయంప్రతిపత్తిని కాపాడతామని, ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో పాలించే పద్ధతి మారాలని, అందుకే బీఎల్ఎఫ్ ఆవిర్భవించిందని అన్నారు. ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాతో బీఎల్ఎఫ్ ప్రజల ముందుకొచ్చిందని చెప్పారు. సామాజిక అణచివేత లేని తెలంగాణ కావాలన్నారు. రైతు ఆత్మహత్యలు ఆగాలన్నా, వ్యవసాయ సంక్షోభం నుంచి గట్టెక్కాలన్నా స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని చెప్పారు. మార్కెట్ దోపిడీని అరికట్టాలని, పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు. పంటకు, పరిశ్రమలకు అనుసంధానం చేస్తే ఉద్యోగాలొస్తాయని చెప్పారు. బీఎల్ఎఫ్ అభ్యర్థుల గెలుపులో ఓయూ విద్యార్థులు చారిత్రక పాత్ర పోషించాలని అన్నారు. ఈ ఎన్నికల్లో ఓయూ విద్యార్థికీ సీటు కేటాయిస్తున్నామని చెప్పారు.
కేసీఆర్ పీడ విరగడైంది : గద్దర్
కేసీఆర్ పీడ తొమ్మిది నెలల ముందే విరగడైందని టీమాస్ స్టీరింగ్ కమిటీ సభ్యులు గద్దర్ విమర్శించారు. 'నీ టర్మ్ అయిపోయింది దొర. ఫామ్హౌజ్లో పండుకో... పరమాత్మున్ని తలుచుకో... మై హోంను అమ్ముకో'అన్న గద్దర్ వ్యాఖ్యలకు భారీ స్పందన బచ్చింది. కేసీఆర్కు ఓ అవకాశమిచ్చామని, త్యాగాలు చేసిన వారికి ప్రాధాన్యత ఇచ్చి, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరిస్తే ఈ వ్యాఖ్యలు చేసేవాళ్లం కాదని చెప్పారు. త్యాగాల తెలంగాణకు రాజ్యాధికారం రావాలన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. టీమాస్ చెప్పే వారు అధికారంలోకి వస్తే మొదటి సంతకం అందరికీ ఉద్యోగాల కల్పన దస్త్రంపైనే ఉండాలన్నారు. తెలంగాణలో ఓట్ల విప్లవం రావాలని చెప్పారు. దొర అస్త్రాలను తిప్పికొట్టాలని అన్నారు. భవిష్యత్తు యువతదేనని చెప్పారు. ఉద్యోగాల స్వప్నం నెరవేరలేదని, ఎందుకివ్వలేదో కేసీఆర్ దిగిపోయే ముందు చెప్పలేదన్నారు.
కోరుకున్న తెలంగాణ కోసం పోరుబాట పట్టాలి : విమలక్క
కోరుకున్న తెలంగాణ ఇంకా రాలేదని టీమాస్ స్టీరింగ్ కమిటీ సభ్యులు విమలక్క అన్నారు. కోరుకున్న తెలంగాణ కోసం పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు. గట్టిగా నిలబడి పోరాడకపోతే కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు నిర్వహించే అవకాశం లేదన్నారు. భావప్రకటనా స్వేచ్ఛను రక్షించుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని చెప్పారు. అడుక్కునే దశ నుంచి పోరాడి గుంజుకునే స్థాయికి ఎదగాలని అన్నారు. ప్రొఫెసర్ వెంకటదాసు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీమాస్ కన్వీనర్ జాన్వెస్లీ, నాయకులు జి రాములు, ఆర్ శ్రీరాంనాయక్, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్బాబు, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ధర్మానాయక్, ఎంబీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి పి ఆశయ్య, బీఎల్ఎఫ్ నాయకులు శ్రీనివాస్ బహదూర్, గుజ్జా రమేష్, బి సాంబశివ, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎ విజరుకుమార్, విప్లవ్కుమార్, ఎస్ఎఫ్ఐ ఓయూ నాయకులు మూర్తి, ముసావీర్, ప్రేమ్, మల్లేష్, గోవింద్, రవి, శేఖర్, విజరు, సంధ్య, జ్యోతి, కళ్యాణి, నాగరాణి తదితరులు పాల్గొన్నారు.