Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాహితీవేత్తలపైనే ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత..
- అనేక భాషలు, సంస్కృతుల సమ్మేళనమే భారతదేశం :తెలంగాణ సాహితి అంతర్జాతీయ సదస్సులో ప్రముఖ హిందీ కవి మంగలేశ్ దబ్రాల్
- సాహిత్యానికీ, సమాజానికి అవినాభావ సంబంధం : శివారెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రస్తుత పాలకులు రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తున్నారని ప్రముఖ హిందీ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మంగలేశ్ దబ్రాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సంస్కృతిని, సాంప్రదాయాలను, ఆఖరుకు సాహిత్యాన్ని కూడా తమకు అనుకూలంగా వారు మలచుకోజూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దేశాన్ని, ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత సాహితీవేత్తలపైనే ఉందని చెప్పారు. ఇందుకోసం లోతైన అధ్యయనం, విస్తృత పరిశోధనలు సాగించాలని సూచించారు. తద్వారా ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించాలని కోరారు. తెలంగాణ సాహితీ ఆధ్వర్యాన 'శతాధిక సాహితీవేత్తల జీవితం- సాహిత్యం' అనే పేరిట మూడు రోజులపాటు కొనసాగే అంతర్జాతీయ సదస్సు శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమైంది. తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో దబ్రాల్ ముఖ్య వక్తగా ప్రసంగించారు. సరస్వతీ సమ్మాన్ అవార్డు గ్రహీత కె.శివారెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షులు సూర్య ధనుంజరు, ప్రముఖ కవులు నిఖిలేశ్వర్, మువ్వా శ్రీనివాసరావు, యాకూబ్, వాసిరెడ్డి నవీన్, ప్రజా వాగ్గేయకారుడు గొరటి వెంకన్న తదితరులు ప్రసంగించారు. దబ్రాల్ మాట్లాడుతూ... దేశంలో మతాలు, కులాలు, ప్రాంతాల పేరిట దాడులు జరుగుతుండటం శోచనీయమని అన్నారు. స్వాతంత్రోద్యమ చరిత్రను, ఆనాటి సాహిత్యంతోపాటు మహనీయుల జీవితాంశాలను సైతం పాలకులు వక్రీకరిస్తున్నారని తెలిపారు. భిన్న సంస్కృతులు, సంప్రదాయాల సమ్మేళనమే భారతదేశమని..ఇంతటి విశిష్టతగల మన దేశాన్ని ఏకశిలారూపకంగా (ఒకే భాష, ఒకే మతమనే పద్ధతుల్లో) మార్చేందుకు వారు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని హెచ్చరించారు. తాజాగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టమే ఇందుకు ఉదాహరణని గుర్తుచేశారు. తమ విధానాలను ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని..కాల్బుర్గీ, దబోల్కర్లాంటి మేధావులతోపాటు జర్నలిస్టు గౌరీలంకేశ్ హత్యలే ఇందుకు నిదర్శమని వివరించారు. ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ లాంటి వారిని సభలకు, సమావేశాలకు ఆహ్వానించకూడదంటూ ఆంక్షలు విధించటాన్నిబట్టి పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో ఊహించుకోవచ్చన్నారు. మతోన్మాదమనేది సంస్కృతి రూపంలో మనలను కబళించి వేస్తుందంటూ ప్రముఖ కవి ప్రేమ్చంద్ హెచ్చరించిన విషయాన్ని ఈ సందర్భంగా దబ్రాల్ గుర్తుచేశారు. ఇప్పుడు మనం వాస్తవంలో అలాంటి దుస్థితినే ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశాన్ని, ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యతను రాజకీయ పార్టీల మీదకూ, మీడియా మీదకు నెట్టేయకూడదని సూచించారు. అలాంటి మహత్తర కర్తవ్యాన్ని సాహితీవేత్తలు, కవులు, కళాకారులే తమ భుజ స్కంధాల మీదికి ఎత్తుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
శివారెడ్డి ప్రసంగిస్తూ... కవి పుట్టినప్పుడు అతడికి ఒక గృహ వాతావరణం, ఒక భాష, ఒక ప్రాంతం ఉంటాయి... కానీ అతడు సృష్టించే సాహిత్యానికి, స్పృశించే కవిత్వానికి మాత్రం ఎల్లలు ఉండబోవని చెప్పారు. ఎక్కడెక్కడో విసిరేసినట్టు ఉండే మనుషులను సంఘటితం చేయగల అంతర్లీన శక్తి, ఏకసూత్రం సాహిత్యానికి ఉందని తెలిపారు. సమాజ వికాసాన్ని, విమోచనాన్ని కోరుకున్న మార్క్సిజమనేది ఒక శాస్త్ర (సైన్సు)మని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆంగ్ల మాద్యమం వెంట పాలకులు, ప్రజలు పరుగులు తీస్తున్న ప్రస్తుత తరుణంలో దీనికంటే మిన్నగా సమాజ నిర్మాణానికి సంబంధించిన పాఠ్యాంశాలను పిల్లలకు బోధించాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు దేశాన్ని వెనక్కి తీసుకెళ్లేందుకు వీలుగా పాలకులు అన్ని ఆయుధాలనూ వాడుతున్నారు. ఈ క్రమంలో సాహిత్యానికి, సమాజ శ్రేయస్సుకు ఉన్న అవినాభావ సంబంధాన్ని అర్థం చేసుకుని రచనలను కొనసాగించాలని శివారెడ్డి సూచించారు.
ప్రజాస్వామ్యంపై గౌరవం లేనప్పుడే ఎన్కౌంటర్లు: సిధారెడ్డి
నందిని సిధారెడ్డి ప్రసంగిస్తూ... రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం ఆంగ్ల మాద్యమం వెంట పరుగుతీస్తున్నాయని చెప్పారు. ఏపీ ప్రభుత్వం మరింతగా ఆంగ్లభాషను రుద్దుతున్నదన్నారు. తద్వారా తెలుగు పట్ల వివక్షను పాటిస్తూ ఇంగ్లీషును ప్రోత్సహిస్తున్న వైనాన్ని ఆయన తప్పుబట్టారు. అంతర్జాతీయ స్థాయి ఉద్యోగ పోటీల్లో తట్టుకోవాలంటే ఆంగ్లంలో నిష్ణాతులు కావాలంటూ పాలకులు చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. కానీ ఆ భాష మీద పట్టు సాధించిన వారందరికీ ఉద్యోగాలు వస్తున్నాయా..? అని ప్రశ్నించారు. కంప్యూటర్ను ఆపరేట్ చేయాలంటే ఇంగ్లీషు భాషతో పరిచయం ఉంటే చాలు.. అంతేతప్ప ఆ మాద్యమాన్నే కచ్చితంగా చదవాలంటూ నిబంధన విధించటం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆంగ్ల మాద్యమాన్ని తప్పనిసరి చేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయించటాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది తెలుగు భాషను బలి తీసుకోవటమేనని చెప్పారు. ఇలాంటి ప్రమాదాలు మున్ముందు మరిన్ని పొంచి ఉన్నాయని హెచ్చరించారు. వీటి వల్ల తమకంటూ సొంత అభిప్రాయాల్లేని తరం భవిష్యత్తులో రూపుదిద్దుకోబోతున్నదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ సమస్యలు, సంఘటలపై ప్రజల్లో కోపం ఉంటున్నది.. కానీ అది నిరసనలుగా మారటం లేదన్న విషయాన్ని మనం గుర్తెరగాలని అన్నారు. ఇదే మన ముందున్న అతి పెద్ద సవాల్ అని హెచ్చరించారు. ఇటీవల దిశ ఘటన జరిగింది.. దానిపై ప్రజల్లో నుంచి వచ్చిన ఆగ్రహం ఫలితంగా ఎన్కౌంటర్ జరిగిందని గుర్తుచేశారు. అయితే రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద, ప్రజల మీద, వారి హక్కుల మీద పాలకులకు గౌరవం లేనప్పుడే ఇలాంటి ఎన్కౌంటర్లు జరుగుతాయని విమర్శించారు. ఇది ఒకరకంగా మన మంచికేనని చెప్పారు. పాలకులు, ప్రభుత్వాల చర్యలే మన్ముందు ప్రమాద ఘంటికలు మోగిస్తాయనీ, ఫలితంగా వాస్తవాల వైపు ప్రజలు ఆలోచిస్తారని సిధారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సదస్సులో 'తెలుగెత్తి జైకొట్టు...' అనే పుస్తకాన్ని శివారెడ్డి ఆవిష్కరించారు. వివిధ యూనివర్సిటీల నుంచి మొత్తం 135 మంది పరిశోధక విద్యార్థులు తమ పత్రాలను ఈ సందర్భంగా తెలంగాణ సాహితికి అందజేశారు. విశాలాంధ్ర పూర్వ సంపాదకులు సి.రాఘవాచారి, నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు, అత్యాచారానికి గురైన దిశ, టేకు లక్ష్మి, మానస తదితరుల మరణంపట్ల సదస్సు తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించింది. కార్యక్రమంలో తెలంగాణ సాహితి గౌరవాధ్యక్షులు మోతుకూరి నరహరి, రాష్ట్ర అధ్యక్షులు వల్లభాపురం జనార్థన, ఉపాధ్యక్షులు స్ఫూర్తి, భూపతి వెంకటేశ్వర్లు, నాయకులు నస్రీన్ఖాన్, సలీమా, జి.నరేశ్, అనంతోజు మోహనకృష్ణ పాల్గొన్నారు